Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవుని ఆచరణ, మేధస్సు శాస్త్ర విజ్ఞానానికి ప్రాణం పోశాయి. సైన్సు అభివృద్ధితో మానవుల జీవనోన్నతి దినదినాభివృద్ధి చెందుతూ వున్నది. నిత్య ఆచరణ, నిర్ధారణ, సత్య శోధనలే నేటి సమాజానికి కొండంత బలాన్ని అందిస్తున్నది. ఇందుకు కారణాలను శోధించడం, ప్రశ్నకు పురుడు పోయడం ప్రాధమిక ప్రేరకంగా నిలుస్తాయి. కానీ సమాజ పరిణామంలో ఆధిపత్య వర్గాలు ప్రజలలో మూఢ విశ్వాసాలతో, అజ్ఞానంలో కొనసాగితేనే వారి ప్రాబల్యం చెలామణి అవుతుందనే కారణంగా సైన్సుకు వ్యతిరేకంగా కొందరు పాలకులు పని చేశారు. ఇప్పుడు సైన్సు ఫలాలనూ వినియోగిస్తూ ప్రజలను మూఢత్వంలో ఉంచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మతమూఢత్వాలు, విద్వేషాలు సైన్సుకు ఆటంకంగా మారుతున్నాయి. తప్పక సైన్సు వీటన్నింటినీ జయిస్తుంది! సైన్సే నా మతమన్న సి.వి.రామన్ కల నిజమవుతుంది..
గత ఏడాది జూలై 30న అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) అంగారక గ్రహంపైకి సంబంధించిన 'పర్సివియరెన్స్' రోవర్ మొన్నటి గురువారం 18వ తేదీ తెల్లవారు ఝామున విజయవంతంగా దిగటం సైన్సు చరిత్రలో ఒక గొప్ప మైలు రాయి. పెర్సీగా పిలువబడే ఈ రోవర్ ఏడు నెలల పాటు 47.2 కిలోమీటర్లు నింగిలో పయనించి అనుకున్న చోట, శాస్త్రజ్ఞులు నిర్దేశించినట్లు దిగి తన పని తాను చేసుకుపోతున్నది. అంతేకాదు ఆ మొత్తం ప్రక్రియను 11 నిమిషాల వీడియో తీసి, అంగారకుడి ఉపరితలం మీది శబ్దాలను రికార్డు చేసి మరీ పంపించింది. శాస్త్ర పరిశోధనా రంగాల్లో మనిషి సాధించిన విజయానికిది నిలువెత్తు సాక్ష్యం. ఇది గ్రహాంతరాల శోధన, జీవ రహస్యాల ఛేదన మానవుని మేధో చైతన్యానికి ఎల్లలు లేవని నిరూపిస్తున్నది ఈ 21వ శతాబ్ది. ఇది నాణేనికి ఒక వైపు చిత్రం, మరో పక్క అంధ విశ్వాసాలతో, మూర్ఖత్వంతో జీవితాలను నాశనం చేసుకుంటున్న వైనం మన దేశంలో కనిపిస్తోంది.
సమాజంలో వేళ్లూనుకున్న మూఢ నమ్మకాలకు, పేదరికానికి చదువులేకపోవటం కారణమని అనుకుంటాం. అందుకే విద్యను ఒక ప్రాథమిక హక్కుగా కూడా గుర్తించారు. విద్య జ్ఞానానికీ, వికాసానికీ తొలి వాకిలి. కాని అదే సర్వరోగ నివారిణి కాజాలదు. ఇటీవల మూఢ నమ్మకానికి బలైన ఇద్దరు మదనపల్లె అక్కాచెల్లెళ్లు ఘటన మనకు అదే చెబుతున్నది. మూఢ నమ్మకాలు, జంతు బలులు ఎక్కడో మారుమూల పల్లెల్లో, ఆడవుల్లోనో ఆటవికుల్లోనో ఉంటాయని నాగరీకులు అనుకోవటం కద్దు. కాని విద్యాధికులైన తల్లిదండ్రులే కన్నబిడ్డల్ని కడతేర్చారు. అదీ అత్యంత దారుణంగా, కర్కశంగా. అందుకు బలైనవారు సైతం అందుకు ఎదురు చెప్పలేదు. పైగా పరమ పవిత్ర కార్యంగా భావించారు. ఇదెలా సాధ్యమైంది. కేవలం మూఢ నమ్మకం వల్లనే. మూఢ నమ్మకం అంటే పిల్లి ఎదురవటమో, తుమ్మటమో అని అనుకుంటారు కాని అది తలకెక్కితే ఏ విధంగా పరిణమిస్తుందో, ఏ విపరీత పరిణామాలకు దారి తీస్తుందో మదనపల్లె ఉదంతం చెబుతుంది. దీన్నుండి బయట పడటానికి విద్య ఒక్కటే చాలదు, ఆర్థికంగా బలపడితేనే సరిపోదు.
ఈ సత్యాన్ని మున్ముందుగా గుర్తించిన వాడు మన తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ. సమాజ అభివృద్ధికి సైన్సును ఒక సోపానంగా ఎంచుకుంది మన దేశం. కాని కేవలం సైన్సు, శాస్త్రవేత్తలు కూడా సరిపోరు. వేలాదిగా శాస్త్రవేత్తలు ప్రతి యేటా వస్తున్నా వారిలో వైజ్ఞానిక స్పృహ కొరవడటాన్ని గ్రహించాడు నెహ్రూ. అందుకే ఆయన ప్రతి పౌరుడిలో వైజ్ఞానిక దృక్పథం ఉండాలని చెప్పాడు. తదనుగుణంగా తరువాతి కాలంలో మన రాజ్యాంగం 51ఎ ఆర్టికల్లో 'సైంటిఫిక్ టెంపర్' లేదా వైజ్ఞానిక దృక్పథాన్ని, మానవీయ విలువల్నీ పెంపొందించాలనీ పొందుపరిచారు. స్వతంత్ర భారతం ఇటీవల వరకూ ఆ బాటనే పయనించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. అయినా ఫలితం ఆశాజనకంగా లేదు.
మన భవిష్యత్తుకు సైన్సు, సాంకేతిక పరిశోధనా రంగాల ఆవిష్కరణలు ఎంతో అవసరం. కాని మన దేశంలో ఇటీవల కాలంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నది సైన్సు. ముఖ్యంగా సైన్సు వ్యతిరేక విషయాలకు సైన్సు ముసుగు వేస్తున్నారు. దాన్నే అసలైన సైన్సుగా చలామణీ చేయజూస్తున్నారు. ప్రజలను తికమక జేసి వారింకా అంధ విశ్వాసాల ఊబిలో కూరుకునేలా చేస్తున్నారు. గత సం|| కాలంగా కరోనా మహమ్మారి దేశ వ్యాపితంగా విజృంభించినపుడు సైన్సు పేరుతో లెక్కకు మిక్కిలి చిట్కాలు షికారు చేశాయి. గత్యంతరం లేని స్థితిలో ప్రజు కూడా కొంత వరకు వాటిని పాటించటం చూశాము. కాని ఇందులో ఏ ఒక్కటీ పరీక్షకు నిలువలేదు. ఇందుకు సైన్సు ఒక్కటే సిసలైన పరిష్కారం చూపింది. రకరకాల టీకాలు అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. ప్రజలు టీకాలు తీసుకోవటాన్ని చూస్తూనే ఉన్నాము. నిజంగా చిట్కాలు పనిజేస్తే టీకాల అవసరమే ఉండదు కదా!
మేధో కేంద్రాలుగా ఉండవలసిన విశ్వవిద్యాలయాలు సైతం భూతవైద్యం మీద కోర్సులు నడిపే ప్రయత్నం చేయటం గర్హనీయం. అశాస్త్రీయ, అమానుష పద్ధతులకు వైద్యం పేరుతో సైన్సు స్థాయిని కల్పించే ఈ కోర్సులు సమాజాన్ని, యువతను తిరోగమనం వైపు నడిపించ జూస్తున్నాయి. ప్రాచీన, సనాతన పద్ధతుల్లో సైన్సు ఉండని నమ్మబలుకుతున్నారు. నాటి ప్రాచీన సమాజం వారికున్న అవగాహన మేరకు కొన్ని పద్ధతులన ఆచరించి ఉంటారు. నేడు 21వ శతాబ్దంలో వ్యాధుల పట్ల, వాటి కారణాల పట్ల స్పష్టమైన అవగాహన, నియంత్రణకు ఆచరణలో రుజువైన పద్ధతులు అందుబాటులో ఉన్నపుడు మళ్ళీ అంధకారంలో, మూఢ విశ్వాసాలకు పట్టం కట్టాలనుకోవటం ఏ ప్రయోజనం ఆశించి?
వ్యవసాయ దేశమైన భారతదేశంలో పశు సంపదకు ముఖ్యంగా ఆవుకు ప్రత్యేక స్థానం ఉందనటంలో సందేహం లేదు. ఆవును పూజించే సంప్రదాయం ఉంది కాబట్టి ఆవు మూత్రం, పేడలలో విశిష్ట లక్షణాలున్నాయని, ఆవు పాలలో బంగారం ఉందనే ప్రచారం విస్తృతంగా జరుగుతున్నది. వీరు ఆపాదించే ఆయా లక్షణాలు కేవలం ఆవుకే పరిమితమా? లేక ఏ పాలిచ్చే జంతువులోనైనా ఉంటాయా? సైన్సు, సైన్సు పద్ధతీ గుడ్డిగా దేన్నీ వ్యతిరేకించదు కాని రుజువులు కోరుతుంది. పరీక్షకు నిలబడినదే, రుజువైనదీ మాత్రమే సైన్సుగా అంగీకరించ బడుతుంది. ఆవు శ్వాసక్రియలో ఆక్సిజన్ను విడుదల చేస్తుందన్న విషయం కూడా సత్యదూరం. ఆ మాటకొస్తే ఏ జంతువుకూ ఆక్సీజన్ను విడుదల చేసే శక్తి లేదు. కేవలం మొక్కలు మాత్రమే ఆ పని చేయగలవు. సైన్సును పూర్వపరం చేసి, ఆలోచనను పక్కదారి పట్టించే పద్ధతుల పట్ల అప్రమత్తత అవసరం. రాజ్యాంగంలో పేర్కొన్నట్లు ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని నిరంతరం ప్రచారం చేయటం ఒక్కటే ఇందుకు విరుగుడు. ఇందుకు ఫిబ్రవరి 28, జాతీయ సైన్సు దినోత్సవం మంచి సందర్భం. భారతదేశంలో వైజ్ఞానిక ప్రగతికి స్ఫూర్తినందించిన నోబెల్ శాస్త్రవేత్త సి.వి.రామన్ తన విశిష్ట పరిశోధనా ఫలితం 'రామన్ ఎఫెక్టు'ను ప్రపంచానికి వెల్లడించిన రోజు ఇది. యువ వైజ్ఞానికులకు, బాల బాలికలకు సైన్సు పట్ల ఆసక్తిని, శాస్త్రీయ ఆలోచనలను రేకెత్తించేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు మార్గం చూపుతుంది సైన్సు. శాస్త్రీయ దృక్పథాన్ని పిల్లల్లో ప్రోది చేయాలి. హేతుబద్దంగా ఆలోచించాలని చెబితే సరిపోదు. మన ప్రవర్తన, ఆచరణలో అది కనబడాలి. అపుడే వారు సహేతుకంగా ఆలోచిస్తారు. మానవత్వం ఆవిరై, మూఢత్వం రెక్కలు విప్పుకు విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల్లో ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించాలి. దేన్నైనా ప్రశ్నించగలిగినపనుడే హేతుబద్దమైన ఆలోచనలకు పునాది పడుతుంది. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు అది కరోనా అయినా, కాలుష్యమైనా, మూఢ నమ్మకాలను త్యజించడమైనా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే సరైన మార్గం. తన కళ్ళ ముందు జరిగే దారుణాలు చూసి నాకెందుకులే అనుకునే అమానవీయ ధోరణి నుండి సమాజాన్ని మానవత్వం వైపు నడిపించాలనే శాస్త్రీయ దృక్పథం అవసరం. అదే పరిష్కారం కూడా.
సైన్సే నిత్యం సైన్సే సత్యం
కష్టనష్టాలను కలిగించి
ప్రాణాలెన్నో హరించి
ప్రపంచాన్ని అతలాకుతలం చేసి
సైన్స్ ప్రాముఖ్యతను
శాస్త్రీయ దక్పథాన్ని
అలవరచుకోవలసిన
అవసరతను పరిశుభ్రతను
పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి
ప్రకతిసమతుల్యతను పాటించమని
కళ్ళుతెరిపించింది కరోనా మహమ్మారి
అశాస్త్రీయ ఆలోచనలతో
అంధవిశ్వాసాలతో
మహిమలెన్నో వున్నాయన్న
పుణ్య క్షేత్రాలు దేవాలయాలు
మందిరాలూ మసీదులు
మూసివేసుకున్న వేళ
భగవంతునికి భక్తునికి
మధ్యవర్తులమని చెప్పుకునే
అయ్యవార్లు పూజారులు
బాబాలు స్వామీజీలు
తలుపులేసుకున్నవేళ
మానవజాతి సంరక్షణకు
మేమున్నామని అభయమిచ్చిన
వైద్యాలయాలు అక్కున చేర్చుకుని
శాస్త్రీయ నైపుణ్యంతో తమ
సేవలందించిన వైద్య బందం
సైన్సిచ్చిన గొప్పవరం
మనిషి మనుగడకు
మెరుగైన సమాజానికి
ఊతమిచ్చేది ఊపిరి పోసేది సైన్సే
ప్రళయాలు భూప్రకంపనలు
ఉత్పాతాలు ఉప్పెనలు
కరువులు కాటకాలు
ప్రమాదాలూ ప్రమోదాలు
వ్యాధులు బాధలు
ఏవైనా ఎప్పుడైనా ఎక్కడైనా
సవాళ్ళను స్వీకరించి
సమస్యలను అధిగమించి
దినదినాభివద్ధి చెందుతూ
జగతిని జాగత పరుస్తూ
మానవాళిని ముందుకు నడిపించు
సైన్సే నిత్యం... సైన్సే సత్యం
- పణితి రామనాథం
9989969331
- ప్రొ|| కట్టా సత్యప్రసాద్