Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవిత్వం, ఇదొక తీరని దాహం. విశ్వ వ్యాప్తం, మనోరంజకం, చైతన్య స్ఫూర్తి జనకం. నవ్వించడం, ఏడ్పించడం, ఉర్రూతలూగించడం, పట్టి కుదిపేయడం రసస్ఫోరకం. దేశానికో దేవుడు ఉంటాడు, అంటే ఏ దేవుడు ప్రపంచ దేశాలన్నిటికీ అంగీకారం కాలేకపోయాడు. కానీ ప్రపంచం అంతటా అంగీకరమైనది కవిత్వం. కాగా కొందరికి కవిత్వం ప్రవృత్తి. కొందరికి విలాసం, కొందరికి తీరిక సమయాల్లో టైంపాస్. కొందరికి కవిత్వమే జీవితం అంటే జీవితమంతా కవిత్వంతోనే, కవిత్వంలోనే జీవించడం, కవిత్వమే వృత్తిగా బ్రతకడం. అలాంటి కవుల్లో నేటి కాలపు మహాకవి శ్రీ గింజల నరసింహారెడ్డి. 'మహాకవి' అని నేను ఇస్తున్నది కాదు ఆంధ్ర విప్లవ కవితా పితామహుడు గుంటూరి శేషేంద్రశర్మ అన్నారు. నల్లగొండ జిల్లా, నకిరేకల్ గ్రామములో పుట్టిన గింజల నరిసింహారెడ్డి వచనం, గేయం, పద్యం మూడింటినీ సమపాళ్ళలో పండించగల సమర్ధుడైన కవి. ''పద్యం, గేయం, వచన కవిత ప్రకటిస్తాను సమానమని నేను'' అంటారు 'శక్తిధార' అనే ఇతని కావ్యంలో. నేను హైస్కూల్ చదువుకునే రోజుల్లో (నోముల గ్రామంలో) మాకు ఆంగ్లము, సోషల్ బోధించే వారు. ప్రతిరోజు పాఠం ముగిసిన తర్వాత ఒక కవిత వినిపించడం పరిపాటి. అలా నాలో 'కవిత్వం'పై మక్కువ కల్గించినది ఈ కవి మహనీయుడే.
గింజల నరసింహారెడ్డి ఇప్పటి వరకు ''ఊహాకృతి'', ''శక్తిధార'', ''శబ్ధధనువు'' శేషేంద్ర ధనువు. ''విశ్వగీతి -వివేకానంద స్మృతి'' వంటి కావ్యాలను వెలువరించారు. ఈ వ్యాసం ద్వారా ''శక్తిధార'', ''విశ్వగీతి''ని పాఠక లోకానికి అందించాలను కొంటున్నాను. పద్య, వచన, గేయ కవితల సమ్మేళనం శక్తిధార. ''విశ్వగీతి వివేకానంద స్మృతి'' మాత్రం పద్య కావ్యం. ''రాశిలో తక్కువ, వాసిలోఎక్కువ'' ఇతని రచనల విశిష్టత. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇంతటి పండితుడైన కవి లేడంటే అతిశయోక్తి కాదు. ఎంతోమంది విమర్శకులు తెలుగు పాఠకులు గింజల నరసింహారెడ్డి కవిత్వాన్ని అర్థం చేసుకునే స్థాయికి ఎదగాలన్నారు. పద్యభావం అర్ధం కాకపోయినా శైలీరమ్యతతో శ్రోతకు మహదానందం కల్గించటం ఇతని కవిత్వ ఘనత. శ్రీనాధుని అంతటి ప్రౌఢ కవి. మచ్చుకొక పద్యం చూడండి.
''వాద ప్రౌఢమహార్ధ నిర్ఘరి దృశావ్యాధూత ప్రత్య
ర్థివా / గ్వాదా వద్యత తమిస్రు, డూర్ధ్వ సుఖముల్
ప్రాపింప నీ క్షోణినే / స్వాధు జ్ఞాన సుధారసమ్ము
ధరణీ సర్వాన త్రాగింపగా / నోది వ్యాద్భుత
జన్మనందన మహాయోగి ప్రభుండితడై'' (విశ్వగీతి)
గింజల నరసింహారెడ్డి కవిత్వంలో కుల, మత సంస్కరణ, వామపక్ష భావజాలం, పీడిత జన పక్షపాతం, దోపిడీ నిర్మూలన కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. 'విశ్వగీతి' కావ్యం, సంఘసంస్కర్తగా ప్రఖ్యాతి గాంచిన వివేకానందున్ని గురించి రాసినది. సిద్ధార్ధుడు బుద్ధుడై ప్రపంచానికి దుఃఖ నివారణ చూపినట్టుగా నరేంద్రుడు వివేకానందుడై ఆర్తజన సేవ చేసాడని, మత సంస్కరణ చేసిన తీరు పద్యాల్లో హృద్యంగా చిత్రీకరించాడీకవి.
''ఒక సిద్ధార్ధుడు బుద్ధుడైన సుపథండుర్వీస్థలిన్ నేడిటుల్
అకలంకుడు స్ఫురించె ఆర్తజన సేవారంభ సంరంభుడై
ప్రకటించెన్ నవధర్మ చక్రమును దీప్త జ్ఞానరేఖాసుఖ
ప్రకరాత్యద్భుతరత్న రాజిత దిశాప్రౌఢమ్ముగా స్వామియై''
వివేకానందున్ని ఎన్నో విధాలుగా వర్ణించి తన్మయత్వము పొందుతాడు గింజల. మతగ్రంధాలన్నీ అసమగ్రములే తప్ప, వృధావాదములే తప్ప మరేమీ కాదు. సద్వర్తనమే అన్ని మతాల గ్రంధాల కంటే మహోన్నతమైనదని వివేకానందుని భావనంటాడు కవి. ఏ మసీదు, గుడి, చర్చీ వెళ్ళకపోయినా మానవ సేవ చేస్తూ, సద్వర్తన, పరహితము చేయడం పై వాటికి కంటే గొప్పదని క్రింది పద్యంలో వర్ణించాడు.
''వేదఖురాను బైబిలులివే అననేల? సమస్తె గ్రంధముల్
బోధనొనర్చు కొన్ని మతపున్ విషయాలు సమంజసమ్మెలే
ఏదొ విధాన కొంత- ఇక ఏవియుకావు సమగ్రముల్ -వృథా
వాదములౌ- సహానుభవ వర్తన గొన్మని స్వామి వాగ్ద్యుతుల్''
గింజల నరసింహారెడ్డి రచనల్లో చాలా బలమైన మార్క్సిస్ట్ వాద, విప్లవ ప్రబోధకమైనది ''శక్తిధార'' 1984లో ప్రచురించబడిన ఈ గ్రంథం తెలుగు సాహిత్యంలో ఎన్నదగిన రచన. ఇందులోని కవితలు మనిషిలోని జఢత్వాన్ని పారద్రో లతాయి. ఏదో తెలియని లోకానికి తీసుకెళ్తాయి. గ్రంధం ఆ సాంతం చదివిన పిదప హృదయంలో చైతన్యం రగుల్కొలిపి కార్యోన్ముఖుణ్ణి చేస్తాయి. చూడండి ''స్వాగతం'' కవితాశీర్షికలో ''కార్మోన్ముఖుణ్ణి చేసే / కంఠానికిదే స్వాగతం! / ధైర్య మార్గోన్ముఖుణ్ణి చేసే / మహితోక్తికిదే స్వాగతం / ... గీర్మధువుకిదే స్వాగతం / హృదయ కేదార షాధువుకు!'' అంటూ మనల్ని కార్యోన్ముఖుల్ని చేస్తాడు. దోపిడిపై తిరిగు బాటు నేర్పే కవితలు ఈ కావ్యంలో కోకొల్లలు. అచ్చమైన వర్గ దృక్పథాన్ని ప్రబోధించే కవిత ''కొత్తధార'' ఇందులో : హత్య చేసెను దోపిడి శ్రమ ఫలమ్ము / నవలలాగెను దోపిడి అన్ని తీర్ల / జన సహస్రాల్న విద్యలో తోసివేసి / కుటిలతా మహాస్త్రమ్మున కూల్చివేసి'' ఈ దోపిడిపై గెలుపు పొందటమే కదా విప్లవం! అలాంటి చోటునే కవి గాఢంగా కాంక్షిస్తు న్నాడు. మత, కుల, మూఢ విశ్వాస మౌఢ్యముల తొలిగే చోటుని ఆహ్వానిస్తాడు. ''అనాభాస'' కవితలో ''స్వేచ్ఛా మయూఖ శింనిజిలు మోసెడు చోట / పారతంత్య్ర తమస్సు భగమైచనుచోట / సకల ధాత్రి చరించుటను వాంఛ చేసేదను'' అంటారు. ప్రకృతి తిరుగుబాటు బోధిస్తుంది. విప్లవాన్ని నేర్పుతుంది. ప్రకృతిని తీక్షణంగా గమనిస్తే అనునిత్య చేతన, విప్లవ శంఖారావమే ప్రకృతి అని స్ఫురిస్తుంది. ఎండాకాలపు ఆధిపత్యాన్ని జయించటానికి వర్షాకాలం, దాని పెత్తనాన్ని గెలవడానికి చలికాలం. దానిపై తిరుగుబాటు చేస్తూ గ్రీష్మం చూడండి ఋతుచక్రం విప్లవ ఢంకా మ్రోగించటం ఈ సారాన్నంతా 'వికసనం' కవితలో ఇలా :-
''హిమాగమా కల్పిత తుహినసిక్తంగా / కదిలేకాలం
వాంఛిస్తున్నదేమిటి? / మధుమాసోదయం కోసం శ్రమిస్తూ
చెమటోడుస్తోంది నిత్యం.. వర్షర్తువుగా
మారటానికి కాలం / ఏకాగ్రతతో తపించటమే గ్రీష్మం''
శ్రీశ్రీని తలపించే కవిత ''ఆనందమనం'' దీనుల, పీడితుల ఆకలి మంటలతో ఆర్తనాదం చేసే అభాగ్యుల జీవన వేదనని ఇందులో వర్ణించాడు. ''దినమంతా పనిచేసి / అర్థాకలి / దోసిళ్లలో ఫలంగా విసరబడ్డవాళ్ళు / వనంలో వర్షంలో తమంలో / విడువక పనిచేసినా కృశించే వాళ్ళు / దిక్కు తెలియని వాళ్ళు / ఉక్కును విరువ గల్గినా విరిగే వాళ్ళు / వీళ్ళతో తాదాత్మ్యం చెంది / న్యాయానికి విక్రమించటం / ఆనంద సమయం. కవి ఈ కవితలో తన పీడిత జన పక్షపాతాన్ని చాటుకోవడంతో పాటు, వారితో మమేకమై పోరాడటమే అసలైన ఆనందం అంటూ పరవశించిపోతాడు.
వసంతం అంటే మనిషి ఆనందంగా ప్రకృతిని ఆస్వాదించటం. సంతోషానికి ప్రతీక వసంతం. కానీ కొందరి జీవితాల్లో ఇది శిశిరం అంటే వేదన. పచ్చదనం లేని ఆకురాలు కాలం. కష్టాలకు బాధలకు ప్రతీక. ప్రకృతికి ఈ తత్వాన్ని జోడించి ''అనృతఫలం'' కవితలో గింజల కవి మహాశయుడు అద్భుతంగా పదచిత్రాలలో వర్ణించిన తీరు ఆస్వాదించండి :-
''వసంతంలో పేదవాళ్ళ వదనాల్లో
శిశిరమే వ్యాపించినప్పుడు / వర్షర్తువులో దుఃఖ
తుల హృదయాల్లో / ఎండలే మండినప్పుడు /
అది ఋతుఫలం అనటానికి వీల్లేదు''
దళిత దృక్పధం-ఆచరణ :- గింజల నరసింహారెడ్డిని నేను మా వూరిలో గత 30 సం||ల క్రితం జరిగిన అంబేద్కర్ జయంతికి ఆహ్వానించాను. ఆ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన ఈ కవి తాను ''శూద్రుణ్ణి'' అంటూ ప్రకటించాడు. తన కవితల్లో ''దళిత దృక్పధం'' ప్రతిబింబిచటమే కాదు ఆచరణ లోనూ అంతే నిబద్ధత పాటించినవాడు.
''ఇలా ఊరే ఊట బావులనీళ్ళను / ఊళ్ళో కొందరికే పరిమితం చేసే వాళ్ళను / కూల్చాల్సిందంతే ... ఇంకా ఎంత కాల / మీ దుఃఖ వీధుల్లో అణగారి పోవటం? / వినిపిద్ధాం ఒక నవగీతం / ధర్మవీర జన సంగ్రామ గీతం / స్వేచ్ఛా విర్భూతి వాంఛా ప్రదం'' అంటూ తనలోని దళిత సహానుభూతిని కవిత్వీకరించాడు. 80వ దశకంలోనే ''సర్వోపరి'' కవితలో బి.ఆర్ అంబేద్కర్ గారి తత్వాన్ని చిత్రీకరించాడు. ''నేను, నా దేశం అన్నప్పుడు నా దేశమే ముఖ్యం, నా దేశం, నా ప్రజలు అన్నప్పుడు నా ప్రజలే ముఖ్యం'' అన్న బాబాసాహెబ్ సిద్ధాంతాన్ని తన కవితలో ''లోకముగ అగుట కొరకై దేశమే నాకు మొదట /... సమతా పథాన కదలే సాహసుల తలచుతాను'' అంటాడు ''ఇక చాలీ సీరియల్'' కవితలో. సమాజంలోని బీదల బాధలను, ప్రభుత్వాల వైఫల్యాలను, అచ్చంగా దళిత జీవన వేదనను వర్ణిస్తూ'' తన బిడ్డ ఆకలితో అరిస్తే తినిపించ అన్నం లేని తల్లి దీనత / తన పాప రోగంతో నలిగితే / చూపించ డాక్టర్లు దొరకని తల్లి దరిద్రత ఇవి రోజూ కనిపించే వాస్తవాలు / హృదయాన్ని కలత పెట్టే దృశ్యాలు'' అంటూ కంట తడి పెట్టిస్తాడు. రక్తం మరిగి పోరాటానికి దిగేందుకు సిద్ధం చేస్తాడీ కవితలో. 'శక్తిధార' కవితా సంకలనంలో గేయాలు, వచన కవితలు పద్యాలు ప్రతిభావంతంగా రచించబడ్డవి. కొన్ని కవితలు పాడుకోవటానికి అనువుగా ఉండి హృదయోల్లాసాన్ని తృప్తినిస్తాయి. మనస్సుకు హత్తుకుపోయి నిద్రపోనివ్వవు పదాల ప్రయోగం, వాక్య నిర్మాణం, శైలీ రమ్యత అర్ధం తెలిసినా, తెలియకపోయినా హృదయానికత్తుకుపోతాయి. ''గేహమొకనందనము'' కవితలో ఇల్లును గురించి గేయ రూపంలో సాగే కవిత ఎంత ఒరవడి, రమ్యత విచిత్ర అనుభూతిని కల్గిస్తుంది. గేహ మొక నందనము / స్నేహ వద్రక్షకము / ఊహ ద్రాక్షాలతలు / ప్రాకించు పరిసరము / ఉత్సాహమే ఇల్లు / ఉల్లాసమే ఇల్లు / సల్లాప మల్లికా / వల్లికావళిఇల్లు /ధ్యుతితోట / హృతకంట / కమ్మస్మితమౌబాట / యిల్లు హితముల వాడ// అంటూ ఎంత అందంగా చెప్పారు.
''నేను నటించెద'' కవితలో మనిషి ప్రవర్తనను బౌద్ధ జీవన విధానం ఉట్టిపడే విధంగా ఈ కవి చెప్తాడు : నేను నటించెద మనోజ్ఞ / నిర్మల వర్తనము రీతి.. / ఝలంఘలన్మృదు నిక్వణ / వలయ చలిత శబ్ధనృతిని. /'' ఇలాంటి ప్రౌఢ గేయాలూ తెలుగు సాహిత్యంలో అరుదుగానైనా ఉంటాయని నిరూపించిన కవి గింజల నరిసింహారెడ్డి.
దోపిడీ, అన్యాయం, అక్రమం, దుర్మార్గత, దౌర్జన్యం సమాజంలో ఏ రూపంలో వున్నా కవి గింజల నరసింహారెడ్డి కలానికి చిక్కాల్సిందే. నిర్మొహమాటంగా కవిత్వీకరించ బడాల్సిందే. కవిత్వమే జీవితంగా ఎంచిన ఈ కవికి పురాణ, వేద, ఉపనిషత్, ప్రబంధ కావ్యాలపై అద్భుతమైన పట్టు ఉంది. ధారణ చేయడంలో ఋషి, రచన చేయడంలో కవి, దౌర్జన్యాన్ని చీల్చి చెండాడంలో సింహం వంటివాడు. 82 సం||రాల ఈ వామపక్షవాద కవి నేటికి 'కావ్య రహస్యాలను, పద్యాలను జల్లుల్లా కురిపిస్తాడు. ఇతని జ్ఞాపకశక్తి అమోఘం. ఇతడు నాకు గురువుకావడం గర్వంగా ఉంటుంది. అవార్డులు, రివార్డులు, సన్మానాలు, కిరీటాలు పెద్దగా పట్టించుకోని గింజల వంటి కవులు తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చారు. తెలుగు పద్యాన్ని కొత్తపుంతలు తొక్కించారు. కొత్తప్రయోగాలు చేస్తూ కొత్త పద చిత్రాలు సృష్టిస్తూ నేటికీ తన రచనను వ్యాసాంగాన్ని కొనసాగిస్తున్నాడు.
''పద్యం గేయం వచన గేయం / ప్రకటిస్తాను సమానమని నేను / కవితాస్పర్శ కల్గినప్పుడు / కల్హారంగా భావిస్తాను'' అంటూ గర్వంగా ప్రకటించిన అరుదైన కవి గింజల. ధ్యేయాన్ని గేయంగా మార్చి మనఃపేయంగా ప్రవహింపజేసే గింజల నరసింహారెడ్డి వంటి కవులను విశ్వవిద్యాలయాలలో పరిశోధకులు పట్టించుకునే కాలం రావాలని కోరుకుందాం...
- డా|| కదిరే కృష్ణ