Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చారిత్రాత్మక తెలంగాణ సాయుధ పోరాటంలో గ్రామీణ ప్రజానీకాన్ని సమీకరించడంలో ఆ కాలంలో వచ్చిన సాహిత్యం కీలక భూమిక పోషించింది. కవిత్వం, పాట, కథ, నవల, నాటకాలతో పాటు బుర్ర కథల, గొల్లసుద్దులు వంటి సాహిత్యం వెల్లువలా వచ్చింది. ఎందరో కళాకారులు ఎన్నో కళారూపాలను ఆయా సందర్భాలకు అనుగుణంగా సృష్టించి ప్రదర్శించారు. ఇవన్ని ప్రజలను కదిలించాయి. పోరాటం వైపు నడిపించాయి. ఏడు దశాబ్దాల క్రితం సృజించిన సాహిత్యం ప్రాసంగికత ఇప్పటికీ ఉందంటే అతిశయోక్తి కాదు. ఆ కాలంలో సాహితీ వేత్తలు సృష్టించిన సాహిత్యం వర్తమాన పరిస్థితులకు అద్దం పడుతోంది.
తెలంగాణసాయుధ పోరాటాన్ని చిత్రించే సాహిత్యంలో కవిత్వం ముఖ్యపాత్ర వహించింది. నిజాం నిరంకుశ పాలనలో ప్రజల హృదయ విదారకమైన బాధలను, దోపిడి పీడనను కవులు తమ కవిత్వంతో తూర్పార పట్టారు. నైజాం రాక్షస పాలనలో ఆ రాజ్యంలో జరిగే జాగీర్దార్ల, దేశ్ ముఖ్ల పటేల్, పట్వారీల దురాగతాలకు వ్యతిరేకంగా ప్రజల బతుకుల్లో స్వేచ్ఛా స్వాతంత్య్రలు వెల్లివిరియాలనే దృఢసంకల్పంతో ప్రజలను పోరాట పంథాలో నడిపించడంలో కవిత్వం తన వంతు పాత్ర పోషించింది. ఉద్యమంలో మమేకం అయిన కవులు కొందరైతే, పోరాటాన్ని చూస్తూ కలం కదిలించిన కవులెందరో... మరికొంత మందికి ఈ పోరాటంతో సంబంధమే లేకపోయినా ప్రజా పోరాటం గురించి తెలుసుకొని కవాతు చేసిన కలాలు ఉన్నాయి. తెలంగాణ ప్రజా పోరాటం ఇతివృత్తం ఆధారంగా దాశరథీ, కాళోజీ, గంగినేని, సోమసుందర్, ఆరుద్ర, రెంటాల, రమణారెడ్డి, కుందుర్తి కావ్యాలు రాశారు. ఆ కాలంలో కవులు స్పందించిన తీరు, వారు సృజించిన సాహిత్యం నేటి తరాలకు మార్గనిర్దేశం చేస్తుంది.
'నగ్న నృత్యమింకెన్నాళ్ళు? పోలీసు అండను దౌర్జన్యాలు/ పోషణ బొందే దెన్నాళ్ళు!' అంటూఆడవారిపై పోలీసుల అండతో దౌర్జన్యాలు కొనసాగిస్తూ దొంగలు అందరూ ఊళ్లు పంచుకొని దోరలుగా ఎన్నాళ్ళు చెలమణి అవుతారని తీవ్ర స్వరంతో ప్రశ్నించింది కాళోజీ కలం. సాయుధ పోరాటంలో స్వయంగా పాల్గొన్న కవిగా, జైలు జీవితం అనుభవించిన వ్యక్తిగా కవితాగ్రహాంతో 'కసి ఆరిపోకుండా బుసకొట్టుచుండాలె/ కాలంబురాగానే కాటేసి తీరాలె' అని నైజాం రాక్షస పాలనలో చితికి పోయిన బతుకులలో విప్లవ జ్వాల రగిలించారు.
'ఓ నిజాము పిశాచమా! కానరాడు/ నిన్ను బోలిన రాజు మాకెన్నడేని/ తీగెలను తెంపి అగ్నిలో దింపినావు/ నా తెలంగాణ కోటి రత్నాల వీణ' అంటూ గర్జించిన పద్యం దాశరథి.' తెలంగాణము రైతుదే, ముసలి నక్కకు రాచరికంబు దక్కునే' అంటూ రైతులు తమ రెక్కల కష్టం నమ్ముకుని కష్టించి పొలము పండించగా భూస్వాములు దొరలు వారి భూములను ఆక్రమించుకుంటున్నారని, తెలంగాణ రైతులదే ఆ ఆస్తి అని నిజాం ముసలి నక్కకు రాచరికం అవసరమా అని ప్రశ్నించిన దిక్కార స్వరం దాశరథి. ''కోటిన్నర'నోటి వెంట పాటలుగా మాటలుగా/ దిగిపొమ్మని ఇదే మాట అనేస్తాను' అని నిజాం నవాబును హెచ్చరించారు. 'దేశంలో సంస్థానాలన్నింటిలో/ హైదరాబాద్ పెద్దది/ భూస్వామ్య బాధల్ని ప్రజలు సహించిన చిట్టచివరి హద్దు అది' అని 1953లో కుందుర్తి తెలంగాణ కావ్యంలో స్పష్టం చేశారు. 'సంఘం సూర్యుడు చాచిన/ శత సహస్ర కిరణాల ధీర్ఘ బాహువులు /పోలీసు ఠాణాల్ని /దేశ్ముఖ్ల దివాణాన్ని వాటేసుకున్నై' అంటూ సంఘం ఇచ్చిన ధైర్యంతో ప్రజలు సాహసంగా పోరాటం చేశారు. 'ఈ ప్రజలు కూడా/ గుట్టుచప్పుడు కాకుండా/ కుతకుతమని ఉడుకుతారు/ పొగలు రేగి సెగలు చిమ్మి/ భగభగమని మండుతారు' అంటూ చంద్రలాల్ ఓఝా ప్రజా తిరుగుబాటును ఎవరూ ఆపలేరు అని కుండబద్దలు కొట్టారు. 'త్యాగాలకు వెనుదీశామా?/ భోగాలను ఆశించామా? /ప్రాణాలకు భయపడ్డామా?' అంటూ తేన్నేటి సూరి పోరాట కాలంలో వెనుదీయని ప్రజల గొప్పతనాన్ని కీర్తించారు. మఖ్దూం మొహియుద్దీన్ అయితే 'తెలంగాణ' పేరుతో ఓ ప్రసిధ్ధ గేయాన్నే రచించారు. 'అడవుల కొండల అనుంగు బిడ్డలు /పొలాల పొత్తిట పెరిగిన పాపలు /లేచిరి క్రోధోధ్ధత భీకరులై /సమరోద్థృతకాక్షేయ కరులై'... 'హలాకూల జారుల పరిపాలన / పర్రెలు వారి బదాబదలయ్యెను' అంటూ మఖ్దూం నిజాం పాలనను నిరశించాడు. ఆరుద్ర తెలంగాణ బాధితుల పక్షాన నిలబడి 'త్వమేవాహమ్' కావ్యం రచించాడు. ఆవంత్స సోమసుందర్ 'వజ్రాయుధం' తెలంగాణసాయుధ పోరాటాన్ని కావ్యంగారచించాడు. ఇందులో 'హిందూ ముస్లిం పీడిత శ్రమ జీవులేక మైరి' ఇక, 'ఖబర్దార్! ఖబర్దార్! నైజాం పాదుషాహే!' అంటూ నిజాంను హెచ్చరిస్తాడు. కవిత్వం కవులు సృష్టిస్తే శ్రమ జీవులైన ప్రజలు ఆశువుగా చెప్పిన మాటలే పల్లవులై పాటలుగా ధన్వించాయి. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎందరో ప్రజా కవులు నిజాం పాలనను నిరసిస్తూ పాటలల్లారు. 'నాజీ నైజాము రాజు నలగొండ జిల్లాలోన/ప్రజలను పట్టియునా నా హింసలకు గురిజేసె' నంటూ పట్టంశెట్టి ఉమామహేశ్వరరావు ఆలపించాడు. 'కరకు కత్తుల తోడ ఓ రాజా / ప్రజల కుత్తుకలు కోసోటి యమరాజా' అంటూ నిజాం రాజును ఉద్దేశించి ఓ అజ్ఞాతకవి హెచ్చరించాడు. 'నైజాము ప్రభుత భూత / నాయకత్వ రాక్షస తైవమున్ /దాని రూపు మాపకున్న / మనకు లేదు సౌఖ్యమున్' ముందడుగు వేయరా... మార్చ్ సాంగ్.' పిచ్చి నిజాము రాక్షసుని భీకర మారణ హౌమవాటి' యరమాకుల వెంకట రమణారెడ్డి. 'ఖాసీంరజ్వీ కాల్చినా...నాజీనైజాం నరికినా / ఎదురుదెబ్బ తీసేద్దాం... అదిరిబోవతరిమేద్దాం' ముక్కామల నాగభూషణం. 'నైజాం కీచకుడా! /నీ పీచమడంచ ప్రజలంతా /ఒక పిడికిట /ఒక గొంతుక/ ఒకమోతై ధ్వనించారు' సోమసుందర్' నైజాము సర్కారురా.. తెలుగోడ/ నరకాసురు నేమించెరా.. తెలుగోడా. సుద్దాల హనుమంతు. 'పల్లెటూరి పిల్లగాడా' పాటతో తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతస్థానం సంపాదించుకున్నారు. ప్రజలంటే శ్రమజీవులు వారి నుంచి ఆశువుగా వచ్చిన మాటలే పాటలయ్యాయి.' వెరు ఏరు వేయర దెబ్బ వెరు వెరు అంటూ ఆవేశంతో తన చేతి కర్రను నేలకు కొట్టి కర్తవ్య భోద చేసిన అవ్వ మాటలే పల్లవిగా సుద్దాల హన్మంతు పాటై ప్రజాశక్తిని కదిలించింది. ఇలాంటి పాటలు జన చైతన్యానికి దోహదం చేశాయి.' ఎవడు నైజము / ఎవరు దొరలంత' అంటూ తిరునగరి రామాంజనేయులు. 'తెలుగు తల్లి బిడ్డలం - తెలంగాణవీరులం /మాతృదేశమూర్తి కొరకు -పోరుసలుప కదిలినాం' అంటూకొండెపూడి లక్ష్మినారాయణ గీతం పల్లె పల్లెలో లాంగ్ మార్చ్ చేసింది. తొలి అమరుడు దొడ్డి కొమరయ్య మరణించినప్పుడు కె.ఎల్.నరసింహరావు జైలులో ఉండే 'అమరజీవి కొమరయ్య' పాట రాశారు. బండి యాదగిరి పాట జనం నాలుక మీద మాటగా మారింది. సాయుధ పోరాట కాలంలో వచ్చిన పత్రిపాట ఒక తూటాలా నేనుసైతం అంటూ పోరు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం, హైదరాబాద్పై పోలీసు చర్య నేపథ్యంలోఅనేక కథలు వచ్చాయి. తెలంగాణకు చెందిన ఆవుల పిచ్చయ్య, పర్చాదుర్గా ప్రసాదరావు, కాంచనపల్లి చిన వెంకటరామారావు, వట్టికోట ఆళ్వారు స్వామి, పొట్లపల్లి రామారావు తదితరులు ఉద్యమంలో భాగమై, మమేకమై కథలు రాశారు. ఉద్యమాన్ని ఉద్యోగ జీవితంలో భాగంగా దగ్గర నుంచి చూసి భాస్కరభట్ల కృష్ణారావు రాసిన 'ఇజ్జత్' కథ, దొడ్డికొమురయ్య అమరత్వం నేపథ్యంలో ఆవులపిచ్చయ్య రాసిన 'ఊరేగింపులు' కథ.ఈయన ఒకచేతిలో ఆయుధం మరో చేత్తో కలంపట్టిండు. ఆవుల పిచ్చయ్య కథలన్నీ అడివి బాపిరాజు సంపాదకత్వంలోని 'మీజాన్' పత్రికలో అచ్చయ్యాయి. ఆళ్వారు స్వామి జైలులోపల సంపుటే గాకుండా 'రాజకీయ బాధితులు',' గిర్దావరు','కాఫిర్లు' మొదలైన కథలు వచ్చాయి. ఆంధ్రాకు చెందిన గంగినేని వెంకటేశ్వరరావు ఇంటర్వ్యూల రూపంలో తాను సేకరించిన సమాచారాన్ని 'ఎర్రజెండాలు' పేరిట మూడు భాగాలుగా తీసుకువచ్చారు. అలాగే అరసం హైదరాబాద్ నుంచి 1945లోనే కథా సంపుటాలు వెలువరించింది. సాయుధపోరాట కథలు ప్రముఖంగా దొరల దౌర్జన్యాలని, రజాకార్ల దురాగతాలని, కమ్యూనిస్టుల పోరాట పటిమను, అధికారుల దాష్ట్టీకాన్ని చిత్రించాయి. తెలంగాణ కథకులు ముఖ్యంగా ఆళ్వారుస్వామి, పొట్లపల్లి రామారావులు జైలులోని ఖైదీలు కేంద్రంగా ఉద్యమాన్ని రికార్డు చేసిండ్రు. అడ్లూరి అయోధ్య రామకవి కాంగ్రెసు భావ జాలంతో రజాకార్ల దుర్మార్గాలని ఎండకట్టగా, పి.వి.నరసింహారావు 'గొల్ల రామవ్వ' కథ ఉద్యమంతో మమేకమైన బహుజనులను చిత్రించింది. తాళ్ళూరి రామానుజ స్వామి పీటల మీద పెండ్లి అనే కథల సంపుటిని కూడా వెలువరించాడు. ఇల్లిందల సరస్వతీదేవి, ఎల్లాప్రగడ సీతా కుమారిల కథలని సమగ్రంగా పరిశీలించినట్లయితే సాయుధ పోరాటంపై వాళ్ళు రాసిన కథలుదొరుకుతాయి. తెలుగు సాహిత్యం గర్వించదగిన నవలా సాహిత్యాన్ని తెలంగాణ రైతాంగ పోరాటం సృష్టించింది. వీటిలో పోరాటం కొనసాగుతుండగా బల్లిముంత శివరామకృష్ణ 1947లో రాసిన 'మృత్యుంజయులు', లక్ష్మీకాంత మోహన్ రాసిన 'సింహ గర్జన' (1950) వెలువడ్డాయి. పోరాట విరమణ తర్వాత వట్టికోట ఆళ్వారుస్వామి రాసిన 'ప్రజల మనిషి' (1955), 'గంగు' (1965) నవలలు వెలువడ్డాయి. 1940-45 మధ్య తెలంగాణ పోరాటాన్ని చిత్రించిన గంగు నవల ఆళ్వారు స్వామి అకాలమరణం(1961)తో అసంపూర్తిగా మిగిలి పోయింది. 1947 నాటి తెలంగాణ గురించి మహీధర రామ్మోహన్రావు రాసిన 'ఓనమాలు', 'మృత్యువు నీడల్లో' రాశారు. 1938కి పూర్వపు తెలంగాణ జన జీవితాలను చిత్రిస్తూ దాశరథి రంగాచార్య 'చిల్లరదేవుళ్లు' (1969) రాశారు. 1942-48 మధ్యకాలం నాటి పరిస్థితులతో 'మోదుగు పూలు' (1971), 1948-68 నాటి తెలంగాణ స్థితిగతులతో 'జనపథం' (1976) నవలలు రాశారు. ఆ కాలంలోనే గొల్లపూడి నారాయణరావు 'తెలుగుగడ్డ' నవల తెలంగాణ ప్రజల దయనీయ జీవితాలను కళ్లకు కట్టింది. సాయుధ పోరాట కాలంలో వచ్చిన సాహిత్యం ప్రాధాన్యత ఇప్పటికి చాలా ఉంది.
- అనంతోజు మోహన్కృష్ణ,
8897765417