Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అసమానతల అసలు సారాన్ని గ్రహించడం అంత సులువు కాదు. సామాన్యుని వెతలను కథనం చేయడం సామాన్యమైన విషయం కాదు. పై రెండింటికి ఉన్న సాపత్యాన్నీ, అందుమూలంగా సంభవించే విపరిణామాలను విపులంగా తెలియ జేయాలంటే రచయితకు ఎంతో సహనం కావాలి. సామాజిక అవగాహన కావాలి.లోతైన పరిశీలన కావాలి. తొంభయ్యవ దశకంలో భారతీయ సమాజం లో వచ్చిన మార్పులు, ఇక్కడి రచయితలను ఒక్క కుదుపు కుదిపాయి. వారికి కొత్త సవాళ్లు విసిరాయి. అదిగో ఆ సవాళ్లను స్వీకరించి రచయితలుగా కలం పట్టిన వాళ్లలో లో డాక్టర్ బి.వి.ఎన్ స్వామి ఒకరు.
ఆయన తన చుట్టూ ఉన్న సమాజాన్నీ, ఆ సమాజంలోని వ్యక్తులనూ, వారి వారి జీవితాలలోని అంతఃసంఘర్షణను తనదైన బాణీలో చిత్రిస్తూ వచ్చాడు. అందువల్లే ఆయన కథలు, అందులోని పాత్రలు, వాటి చిత్రణ, సన్నివేశాల కల్పన చాలా సహజంగా ఉంటుంది. ఇతని కథలు చదువుతుంటే ఆయన తన అనుభవంలోని జీవితాన్నే చిత్రించారని తన పరిశీలనాపరిధికి అందిన జీవితాన్నే చిత్రించారని నిర్ధారణకు వస్తాము.
రెండు దశాబ్దాల రచనానుభవం, రెండు కథా సంపుటాలు (నెలపొడుపు- రాత్రి పగలు ఒక మెలకువ) ఆరు పదులకు పైగా కథలు మనకు ఈ విషయాన్నే స్పష్టం చేస్తాయి. తెలుగునాట ప్రపంచీ కరణ ప్రభావానికి మొదట గురి అయ్యింది వ్యవ సాయం, చేతి వత్తులే. ఇక యంత్రీకరణ అన్నది అభివద్ధికి బాటలు వేస్తే వేయవచ్చు కానీ అది ఈ వత్తుల మీద ఆధారపడి బతికే బీదా బిక్కి ప్రజలను తొక్కుకుంటూ వెళ్తూ ఆ బాటలు వేయడం జరిగింద నేది కాదన లేని సత్యం. ఆ బాధల బాటల పల్లవి మనకు 'వలస' 'దేవులాట' 'నిష్క్రమణ'లాంటి చాలా కథలలో స్వామి మనకు స్పష్టంగా చూపించాడు.
ప్రపంచీకరణ అన్ని రంగాల్లోకి చొచ్చుకు రావడం ప్రారంభమయ్యాక సంప్రదాయక వత్తులు చిన్నా భిన్నమై, కరువు పంజా ఎత్తింది. 'దేవులాట'లో నారాయణ- 'ఇనుప తెరల మధ్య'లో యెల్లవ్వ 'వలస' కథలో గుండయ్యలవి వలసలే. కానీ అవి స్థానిక వలసలు.
వలసలు ఎక్కడి నుండి ఎక్కడికి జరిగినా, వలస వెళ్ళింది ఏ వర్గానికి చెందిన వారైనా దాని ముగింపు ఒకే లాగా, విషాదకరంగా ఉండడం ఇక్కడ సాధారణాంశం. ప్రపంచీ కరణ వలస వెళ్లిన వాళ్లను బతకతనీయ లేదు, ఇక్కడ మిగిలి ఉన్న వాళ్ళనూ బతకనీయ లేదు. నారాయణ వలసకు నాగండ్ల పని మందగించడం కారణమైతే, గుండయ్య, యెల్లవ్వల వలసలకు బతుకుదెరువు కారణమయింది. ఇలా ఎవరి కారణాలు వాళ్లకు ఉన్నప్పటికీ వీటి వెనుక ఏక సూత్రత ఒకటి ఉంది అదే ప్రపంచీకరణ పంజా.
ఈ కథలలో వేటిలో కూడా వీరి దుస్థితికి ప్రపంచీకరణ కారణం అని రచయిత వ్యాచ్యంగా చెప్పడు. ఇక చెప్పదలుచుకున్న దానిని తనదైన పద్ధతిలో చెప్పుకుంటూ పోయాడీయన. స్వామి కథలు రాసే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చెప్పడంలో కూడా ఉద్వేగం పాలు పెద్దగా ఉండదు. ఊగి పోవడం అంతకన్నా ఉండదు.ఆ చెప్పే విషయాన్ని కూడా చాలా మామూలుగా, నిర్మమ కారంగా చెప్పినట్లుగా చెబుతాడు. ఇతని కథ చదివాక పాఠకుడు ఏ మాత్రం ఆవేశపడడు. కొద్దిసేపు ఆగిపోయి ఆలోచించేటట్లుగా ఉంటుంది. ఈ పద్ధతే అతని శైలిగా దాదాపు స్థిరపడి పోయింది.
'దునియా అంతా కింద మీద నడుస్తాంది సారూ'అంటూ మొదలు పెడతాడు 'చదువు చెప్పిన రైతు' కథలో నర్సయ్య అనే రైతు. 'మీ బల్లె కూడా గిట్లనే ఉంటది' అని అంటాడు.అక్కడితో ఆగకుండా 'ఒక కాడ మొదలైంది అంటే అంతటా గట్లనే ఉంటది' అని అంటాడు అక్కడి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునితో.నరసయ్య కు చదువు రాదు చదువు రాని వ్యక్తి చదువుకున్న తనకి అర్థం కాని విషయాలను చాలా అలవోకగా చెప్పడం ఉపాధ్యాయుణ్ని ఆశ్చర్య పరుస్తుంది. ఇంతకీ ఇతను అన్న విషయం ఏమిటంటే 'ఎవరి కష్టానికి ఎవరు కారణం అన్న విషయం ఎవరికీ అర్థం అయితలేదు అన్నది నర్సయ్య అంతరంగం.మనిషి అవసరాలను బట్టి గాక మార్కెట్ అవసరాలను బట్టి జరిగే ధరల నిర్ణయం వల్ల తనలాంటి వాళ్లకు ఎలాంటి లాభమూ జరగడం లేదన్నది నరసయ్య అనుభవ సారం.
నిజానికి మనిషి అవసరాలు- మార్కెట్ అవసరాలు ఎప్పుడు కూడా ఒకటిగా లేవు. మార్కెట్ అవసరాలను బట్టి పంటలు పండించడం మొదలు పెట్టిన తరువాతనే ఈ గడ్డమీద సంక్షోభం మొదలయ్యిందనే అవగాహన స్వామి రాసిన 'అభ్యంతరం' లాంటి ఇతర కథలలో కనిపిస్తుంది.
ఇక విద్యారంగంపై ఆయన పరిశీలనలు చాలా లోతైనవి. ఆలోచనా త్మకమైనవి. దాని వైఫల్యాలకు కారణాలు 'పరిగడుపు' 'సంవేదన' 'చదువు చెప్పిన రైతు' 'తాపత్రయం' లాంటి కథలలో కనిపిస్తాయి. బాధ్యత లేని పాలకులు, నిజాయితీ లేని నిర్ణయాలు, సమస్య మూలాలలోకి వెళ్ళకుండా చేసే మొక్కుబడి ప్రకటనలు ఈ దేశ విద్యారంగాన్ని ఎలా కోలుకోకుండా చేస్తు న్నాయో మనం పైన ఉదహరించిన కథలో చూడ వచ్చు. వ్యవస్థీకత వైఫల్యాలు,వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆయన 'రెండు ఉత్తరాలు' అనే కథలు చూపించారు.
చరిత్రను సూచనప్రాయంగా స్పశిస్తూ చేనేత కార్మికుల వర్ధమాన జీవితాన్ని ఈయన 'కుంఠనం' అనే కథ ద్వారా చిత్రించాడు. విదేశీ వ్యాపారులతో ఈ దేశపు బక్కచిక్కిన చేనేత కార్మికుడు ఒంటరిగా పోరాడ గలుగుతాడా అన్నది ఒక పెద్ద ప్రశ్న.
'ఉన్నోనికి లేనోనికి మధ్య వ్యాపారం ఎటు దారితీస్తుందో తెల్వదా? ఆవులు ఆవులు కొట్లాడు కుంటే ల్యాగల కాళ్లు విరిగినట్లు అయింది మా బతుకు' అని ఈ కథలోని పాత్ర ద్వారా అనిపిస్తాడు. అక్కడితో ఆగకుండా, బట్ట కాల బెట్టడానికి ఒక్క గాంధీ కూడా లేకపాయె అంటూ నిట్టూరుస్తాడు. విదేశీ శక్తుల అడ్డగించుటలోనే తమ భవిష్యత్తు ఉంటుందని గాంధీ ప్రస్తావనతేవడం ద్వారా నేత కార్మికుడు భావించడం వర్ధమాన పాలకులు విదేశీ వ్యాపారుల ముందు సాగిలపడాన్ని,ఎలాంటి ఆరోపణలు లేకుండానే మన ముందు పెడతాడు స్వామి.
సమయోచితంగా కథల్లో ఉపయోగించే పాటలు పాఠకుడిని ఎంతో ఆకట్టుకుంటాయి. ఇందుకు 'కుంఠనం' కథలో చేనేత కార్మికులను ఉద్దేశించి పాడుకునే పాట ఒక మంచి ఉదాహరణ. 'వర్తమాన చిత్ర పటం' లాంటి అస్తిత్వ సమస్యల్ని తీసుకున్నా, 'చావు ప్యాకేజీ' లాంటి కొత్త వస్తువును తీసుకున్నా వాస్తవికతను అంటిపెట్టుకునే ఉండటం ఆయన కథల యొక్క ప్రత్యేకత. చితికి బతికిన జీవితాన్ని చిగురింప చేసుకున్న 'నెల పొడుపు' కథను చూసినా, మతతత్వాన్ని ఓడించి ప్రేమను బతికించుకున్న 'విష ప్రయోగం' కథను పరిశీలించినా మనకు పై విషయమే అర్థమవుతుంది.
అనుభవించి పలవరించ కుండా కథలు రాసింది లేదు అని స్వామి తన గురించి తాను చెప్పుకున్నారు. కునారిల్లు తున్న పల్లెల్లో కుములుతున్న బతుకులకు సాక్షి ఇతని కలం అని జయధీర్ తిరుమలరావు ఇందుకే అన్నారనిపిస్తుంది. ఎందుకంటే మొత్తానికి మొత్తంగా చూస్తే వెతలను కేంద్రంగా చేసుకొని రూపు దిద్దుకున్న కథలివి. అందుకే ఇవి పాఠకుడిని వెంటాడుతూ ఉంటాయి. వాటిని వదిలించుకోవడానికి పాఠకుడు చాలా కష్టపడాల్సి ఉంటుంది.
- గుండెబోయిన శ్రీనివాస్,
9985194697