Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిత్రుడు, కవి, విద్యావేత్త, దళిత కార్యకర్త జి.వి.రత్నాకర్ కవిత్వ సంపుటి ''వర్ణమాల''. కవిత్వం చాలా మంది రాశారు కాని రత్నాకర్ కవితల్లో నిప్పులు చెరిగే వాక్యాల్లో దాగిన ఆవేదన ఒక గొప్ప విశ్వాసాన్ని నమ్మకాన్ని ఇస్తూ ఆలోచింపజేసేది. అందువల్ల ఈ కవిత్వానికి స్పష్టమైన ప్రత్యేకత ఉంది.
ప్రముఖ బాక్సింగ్ లెజండ్ మహమ్మద్అలీ గురించి చాలా మంది వినే ఉంటారు. నల్లవాడు. బాక్సరుగానే చాలా మందికి తెలుసు. కాని పదునైన పదాలు చాక చక్యంగా ఎలా వాడాలో కూడా బాగా తెలిసిన క్రీడా కారుడు. స్వయంగా కొన్ని కవితలు కూడా రాశాడని అంటారు. 1974లో బాక్సింగ్ మ్యాచ్కి ముందు ఆయన చెప్పిన మాటలు కవితావాక్యాలే. 'Float like a butterfly sting like a bee' అన్నాడు. సీతాకోకచిలుకలా తేలుతూ, తేనెటిగలా దాడి చేయాలి. రత్నాకర్ కవితలు చదివినప్పుడు ఇలాంటి ఫీలింగ్ కలిగింది. ప్రతి కవిత సీతాకోక చిలుకలా ఎగురు తోంది. అలాగే ప్రతి కవిత తేనెటీగలా దౌర్జన్యాలు, దారుణాల సమాజంపై దాడిచేస్తోంది. మహమ్మద్ అలీ ఇదే మ్యాచ్ సందర్భంగా చెప్పిన మరో మాట his hands can't hit what his eyes can't see. ఈ మాటల్లో గొప్ప వివేకముంది. గుడ్డిగా దాడులు చేయడం కాదు, ఖచ్చితమైన సమాచారం, అవగాహన తో చేయాలి. రత్నాకర్ ప్రతి కవితలో అలాంటి అవగాహన మనకు కనిపిస్తుంది.
మర్లపాటి కొండ కవితలో రత్నాకర్ రాసిన వాక్యాలు
''చికాగోలో చిందించిన నెత్తురికి
ఆమధ్య గుజరాత్లో పారిన రక్తానికి
తేడా తెలుసుకోవాలి''.. ఇలాంటి అవగాహనతో లోతైన భావం ప్రకటించిన వాక్యాలు ఇదే కవితలో చూడండి.
''మొన్న
ప్రాణం ఎక్కడైనా ఒకటే
అది అడవి కావచ్చు
హైటెక్ నగరం కావచ్చు
మొన్న
చెరువుగట్టుపై ఆత్మగౌరవంతో
అంబేద్కర్ బొమ్మ నిలబెట్టాలనుకుని
నెత్తుటి మడుగైన
యాకోబ్ బలిదానపు గరగపర్రు కావచ్చు'' అని ముగించడం ద్వారా, నెత్తుటి నెత్తుటికి మధ్య తేడాలు ఎలాంటివి ఉన్నాయో నిర్మొహమాటంగా చెపుతాడు.
రత్నాకర్ కవితల గురించి చెప్పేముందు మహమ్మద్ అలీ గురించి ఈ ప్రస్తావన ఎందుకంటే, 1970లో నిర్బంధ సైనికసేవలను నిరాకరించినప్పుడు అలీకి శిక్ష విధించారు. అప్పుడాయన చెప్పిన మాటలు ''»I am America. I am the part you wond't recognise. But get used to me. Black, confident, cocky, my name not yours. My religion, not yours; my goals, my own; get used to me''. భారతదేశంలో కూడా అణగారిన సముదాయాలు చెప్పవలసిన మాట ఇదే. మేమే భారతదేశం. మమ్మల్ని మీరు గుర్తించలేదు, కాని అలవాటు పడండి, మాతో కలిసి జీవించడం మీకు తప్పదని బల్లగుద్ది చెప్పడం. అదే ప్రతిఘటన కవిత్వం. అలాంటి కవితలే ఇందులో ఉన్నాయి.
ప్రతిఘటన కవిత్వమంటే పరుషమైన పదజాలం, బలమైన వ్యక్తీకరణ తప్పదు. కాని రత్నాకర్ కవితల్లో పరుషమైన వ్యక్తీకరణలు కూడా కవిత్వతత్వాన్ని వీడవు. కవిత్వమెప్పుడు రాజకీయాలకు దూరం కాదు. రాజకీయాలు లేని కవిత్వం కాలక్షేపం తప్ప మరేమీ కాదు. అణిచివేతలపై నల్లకవయిత్రి నయ్యిరా వాహిద్ నాలుగు చిన్న చిన్న వాక్యాల్లో తానేంటే ముఖం పగులగొట్టినట్టు చెబుతుంది.
''you
not wanting me
was
the beginning of me
wanting myself
thank you'' అంటూ వివక్షను విదిలించి కొట్టింది. తానెవరో తన ఉనికి ఏమిటో చాటి చెప్పడం, తన గురించిన చైతన్యాన్ని పెంచుకోవడం అనే బలమైనస్పహ అణిచివేతలు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా ఉంటుంది. దళిత మేనిఫెస్టోలో...
''నన్ను
నీ దేవుడి గుళ్ళోకి రావద్దన్నావు
సరే, ఎలాగయితేనేం
నేను నాస్తికుణ్ణవడమే బాగయింది'' అనే వాక్యాల్లో ఇలాంటి చైతన్యమే కనిపిస్తుంది. తన ఉనికిని, తన గుర్తింపును, తన నిరసనని గ్లోరిఫై చేయడమే కాదు, దాని ప్రాముఖ్యాన్ని చాటిచెప్పడం ఉంది.
ఈ సంపుటిలోని మొదటి కవితలోనే పదునైన విసురు కనిపించింది. ''ఆకసమంత ఆశయం'' కవితలో
''నవరాజ్యాంగాన్ని లిఖించాలంటే
నవచరితని సష్టించాలంటే
మా సుందర్రాజు సాచ్ఛిగా
బాబారు అవును కోయాల్సిందే
గంగాజలాన్ని మా మాల మాదిగ పల్లెల
పాదాల మీద గుమ్మరించాల్సిందే'' అంటాడు. ఆహారపుటలవాట్లపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఈ కవితను అర్థం చేసుకోవాలి. గొడ్డు మాంసంపై హింసా కాండల సంఘటనల తర్వాత, ఆవుతోలు వలిచినందుకు ఊనాలో దళితులపై దాడుల తర్వాత, ఈ కవిత ప్రాముఖ్యం మరింత పెరిగింది. మీ సంస్కతి వేరు, మా సంస్కతి వేరు, మీరు మాతో కలిసి ఉండడం తప్పదనే సందేశాన్ని చాలా బలంగా ఇచ్చిన కవిత. ఆవును కోయాల్సిందే, గంగాజలాన్ని మాలమాదిగ పల్లెల పాదాలపై గుమ్మరించాల్సిందే అనే వాక్యాల్లో నిరసన, ప్రతిఘటన మాత్రమే కాదు తిరుగుబాటు బలంగా ఉంది. మమ్మల్ని అణిచేస్తే మీ పవిత్రతలు దుమ్ముధూళిలో కలిసిపోతాయన్న హెచ్చరిక ఇందులో ఉంది. ఆత్మగౌరవ ప్రకటనలో ముఖ్యమైన కోణం, తమకు సంబంధించిన వాటిని ఉదాత్తమ్కెనవిగా చెప్పడం. తమ అనుభూతుల అస్తిత్వాన్ని ఎవరూ తక్కువగా చూడడానికి వీలులేదని నిరూపించడం. తమ అస్తిత్వాన్ని తాము గాఢంగా ప్రేమించడం. పైన చెప్పుకున్న కవితలన్నింటిలోను ఇది బలంగా కనిపిస్తుంది.
ప్రసిద్ధ మహారాష్ట్ర దళితోద్యమ రచయిత అర్జున్ డాంగ్లే యిలా అంటాడు ''Dalit literature is marked by revolt and negativism, since it is closely associated with the hopes for freedom of a group of people who, as untouchables, are victims of social, economic, and cultural inequality'' దళిత కవిత్వం చీకట్లో రాళ్ళు విసిరే కవిత్వం కాదు. శత్రువు ఎవరో ఖచ్చితంగా గుర్తించి బలమైన దాడి చేసే కవిత్వం. దళిత కవిత్వం వచ్చిన తర్వాత వ్యక్తీకరణల సరళి మారింది. కొత్త అభివ్యక్తి ముందుకు వచ్చింది. కవిత్వం కొన్ని సామాజిక సముదాయాల గుత్తసొత్తు కాదని చాటిచెప్పింది దళిత కవిత్వం. బాధలు లేని, ప్రణయ విరహ భావకవిత్వాల వెల్లువలో అయినా, విప్లవగీతాల సింహగర్జనల్లో అయినా కొన్ని సముదాయాల ప్రాబల్యమే కనబడడం వల్ల, కవిత్వమంటే వారిదే అనే వాతావరణం ఒక్కసారిగా పటాపంచలైంది.
కంధమాల్ గంధకం కవితలో ఈ విసురు, తిరస్కారం పాఠకుడిని నిలదీస్తుంది.
''పటోలి దురంతాల్ని ఖండించే
గుండె ధైర్యం మీకుందా
సోదరా
సిలవుల్ని ఆయుధాలుగా మలుద్దాం
చూపుడేల్ని ఎక్కుపెడదాం
గంగ సింధు బిందువులకి ఉరేద్దాం
లేకుంటే అంబేద్కర్ బొమ్మ సాచ్చిగా
మాల మాదిగ పల్లెల మొగదాల్లో
చర్చి సెంటర్లో పాతేద్దాం'' అంటూ ఆగ్రహావేశాలను ప్రకటించడమే కాదు, అణిచివేతలకు పరిష్కారం తిరుగుబాటే అని ప్రకటిస్తాడు.
కుంకుమ బొట్టు కవితలో
''ఈ దేశంలో ఉండాలంటే
ఆ ''గీతం'' పాడాల్సిందే
ఆ ''నామం'' జపించాల్సిందేనంటున్న
తెల్లబొద్దింకల్ని, కుంకుంబొట్టుల్ని
కొమరన్న కొలిమికాడి కర్రుతో
గీతలు, వాతలు పెట్టాల్సిందే'' అంటాడు. ఇది కుల వ్యవస్థపై తిరుగుబాటు చైతన్యం. దళితకవిత్వం ప్రధానంగా ఆత్మగౌరవానికి సంబంధించింది. తర తరాలుగా నీచమైన సంస్కతిగా అణగదొక్కబడిన సముదాయాలు ఆత్మవిశ్వాసాన్ని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తూ నీ సంస్కతి గొప్పేమిటని ప్రశ్నించడం ప్రధానధోరణిగా చాలా మంది రాశారు. రత్నాకర్ ''కవిత్వం'' శీర్షికతో రాసిన కవితలో
''జైభీమ్
అని నినదించడం అంటే
సకల శాస్త్రాల దేవుళ్ళ దెయ్యాల
పుక్కిట పురాణాల్ని
తూర్పారపట్టడమే'' అని రాస్తాడు. సతీష్చందర్ ''అక్షరశయ్య'' కవితలో ''నాలుగు పదాలు కలవకూడదన్నదే నిన్నటి వ్యాకరణం
నాలుకనంటిన ఏ అయిదో పదమూ గ్రాంధికం కాలేదు
క్రియల్ని కిందికి తొక్కిన మనువే మహాకవయ్యాడు
భాషా అప్రవీణులారా! ఉలిక్కిపడకండి
మీరు కుదిర్చిన ఛందోబద్ధ కాపురాల్ని కాలదన్ని
పదాలు లేచిపోతున్నాయి
వర్ణక్రమాలు లేని వాడలకు వలసపోతున్నాయి'' అని రాసిన కవిత ఈ సందర్భంగా ఖచ్చితంగా గుర్తొస్తుంది. కవిత్వాన్ని కొత్త మలుపులు తిప్పారు దళిత కవులు. కవిత్వ భాషలో శ్రామిక సౌందర్యాన్ని తీసుకొచ్చింది దళిత కవిత్వమే.
ఆకలి కవితలో ఈ కవితాత్మక సౌందర్యం, మానవీయ కోణాన్ని మనముందుంచింది.
''ఆ ఆకసంలో, నేలంతా పొడుగునా
సంతకాలు చేస్తున్నారు
కూటికోసం కూలి కోసం
కడుపునిండా తిండి కోసం
నేల ఎండినంత దూరం
అరుపులై ఆకాసాలౌతున్నారు''
నేలపై నడుస్తున్న కూలీల వరుసను ఆకలి సంతకంగా వర్ణించడం గొప్ప కన్సీట్ ప్రయోగం. సాంప్రదాయిక పోలికలు, అలంకారాలను అధిగమించిన కవిత్వమిది.
హక్కు కవిత ప్రారంభంలోనే దళితవాదం పునాదుల్ని ప్రస్తావించాడు.
''దయ్యాలు వేదాలు
వల్లించడం నాటి మాట
దళిత బ్రాహ్మణిజం
నీతులు వల్లెవేయడం
నేటిమాట''. ఈ పదాలు రాజకీయ ప్రకంపనాలు సష్టించే పదాలు.
జీవనదశ్యం కవితలో నేటి రాజకీయాల అష్టవక్ర నడకల వికతరూపాన్ని చూపించాడు.
''కాషాయానికి కళ్ళు నెత్తికెక్కినప్పుడల్లా
గర్భగుడిలోకి పారేయబడ్డ
ఆవు కళేబరం అవుతుంది
పాతబస్తీ కొట్లాటవుతుంది'' అంటూ మతతత్వం, కులతత్వం ఎలా రాజకీయాలను శాసిస్తున్నాయో నిరసనస్వరంతో ప్రకటించాడు.
అపరాధం కవితలో
''తలెత్తి బతకాలనే
ఆ ఆలోచనే అపరాధమయింది
చేలోకి నీళ్ళు కావాలన్న కోరికే
నోట్లోకి మూత్రమై ప్రవహించింది'' ... అంటూ దళిత జీవితాల దుర్భర దశ్యాన్ని ఆవిష్కరిస్తాడు.
''నేను అస్పశ్యుణ్ణి
నా ఒళ్ళంతా మట్టి వాసన
నా బ్రతుకు నిండా వెట్టివేదన
.....
నాలుగువేదాలలోంచి
నాలుగు పాదాల లోంచి
నన్ను తొలగించారు
కట్టలోంచి జారిన కట్టెలా
ఒక్కణ్ణే ఎక్కడో ఎండిపోయాను'' ఎప్పుడో బొజ్జా తారకం రాసిన నది పుట్టిన గొంతుక కవితలోని ఈ మాటలు దళిత బతుకుల దుర్భర పరిస్థితులను చాటి చెప్పాయి. అప్పుడెప్పుడో కుసుమ ధర్మన్నా రాసిన మాటలు
''మాలవాడని యవమానంబు గావించి
పంచముండని పరువు పారద్రోలి
ఆదిమాంధ్రుడవని సోదిచెప్పిరి గాదె
ఆలకింపుమయ్య హరిజనుండ!'' ఇప్పటికి కూడా వర్తిస్తున్నాయి. నేటికి కూడా దళిత బతుకుల్లో వెలుగురాలేదు. కాని ఇప్పుడు దళిత చైతన్యం పెరుగుతోంది. జి.వి.రత్నాకర్ అంబేద్కర్ సాక్షిగా కవితలో రాసినట్లు
''జాతి జనం / జై భీమ్ .. అంటున్నారు
పిడికిళ్ళవుతున్నారు / పద పదమంటూ / దళిత స్వాధికార / ర్యాలీలవుతున్నారు'' ఇలాంటి ఆలోచనా త్మకమైన ఎన్నో కవితలున్న కవిత్వసంపుటి నలుపెక్కిన ఆకాశం ఈ వర్ణమాల. జయహౌ కవిత్వం!
డా.బోయి భీమన్న సాహితీ పురస్కారం అందుకుంటున్న సందర్భంగా..
- కవి యాకూబ్
9849156588