Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వాలును' అనే ఉప శీర్షికతో దాదాపు పదిహేను వేల మంది కవులను ఒకే వేదిక పైకి తీసుకొచ్చి నిత్య కైతలతో కవి సంగమ 'ముఖ పుస్తకం' సాహిత్య పరిమళాలు వెదజల్లుతుంది.
ఈ కవిసంగమ ముఖపుస్తక భూ రూహానికి కవి యాకూబ్ గారు మూడుతరాల కవులను ఎంపికచేసి కవితా మాధ్యమాన్ని, మార్మికతను 'కవిసంగమ సిరీస్ 'ల పేరుతో ఉత్తమ కవనాన్ని ఎలా రాయాలో మార్గదర్శనం చేస్తూ వచన కవిత్వానికి జీవం పోస్తున్నారు. అలాగే ప్రతి రోజూ ఒక శీర్షికతో విశ్లేషణా ఎరువును అందిస్తూ వర్థమాన కవుల ఎదుగుదలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
అలా కవిసంగమం ముప్పై ఒకటవ సిరీస్ లో కవి సంగమ వక్షంపై వాలిన ఒక నానీల రంగుల పిట్ట 'తగుళ్ళ గోపాల్'. కలకొండ నుండి 'దండకడియం'గ కవన రంగం లో వికసిస్తున్న బంగారుకొండ. పాల మూరు ఎతల్ని, భాషను ముక్కున కరచుకొని కవితల గూడును నిర్మిస్తు న్నాడు. చిరునవ్వుతో నిరాడంబరంగా అంతే వినయంతో కవిమిత్రులకు తన నానీల 'తీరొక్క పువ్వు'ను అందరి చేతిలో పెట్టి ఓ మూలన కూర్చున్నాడు చాలా అమాయకంగా ఆ సిరీస్లో. పుస్తకం కూడా ఆయనలాగే నిరాడంబరంలగానే వుంది. అనేక భావోద్వేగాలను దాచుకున్న సామాన్యుని జీవిత పూదోటలాగా.
పుస్తకం తెరవగానే.. మట్టిగంప మోసి / ఇల్లు ఎల్లదీసిన అమ్మకు, / కట్టెలుమోసి / మా కడుపునింపిన నాన్నకు....అంటూ తనపేగు తెంచి, రక్తం పంచి, భాష నేర్పి, భావాలు పంచిన తన అమ్మకు, కట్టెలు మోసిన కడుపు నింపిన నాన్నకు అంకితవాక్యంతోనే సముచిత స్థానమిచ్చి తల్లిదండ్రుల ఋణం తీర్చుకున్నాడు.
ఒక నానీలో.. నాన్న / కాలం చేశాడు / చెయ్యి మీద పచ్చబొట్టు / కదులుతున్నది.....అంటాడు.
గుండెలను తడిచేసి, కన్నీటిని తెప్పించే ఆర్థ్రతా కవనం గోపాల్ ది. తండ్రి మరణ జ్ఞాపకాలు పచ్చబొట్టై కళ్ళ ముందే కదలాడుతుంటే ఎలా ఉంటుందో ఆర్థ్రంగా చెబుతాడు. చూడడానికి పాతిక ఏళ్ళవాడిలా ఉన్నా జీవితాన్ని కాసి వడపోసి తాగిన వాడిలా అనిపిస్తాడు గోపాల్. ఈ ప్రపంచంలో అన్ని తెంచుకున్నా రక్త సంబంధాన్ని తెంచుకోలేమనే పచ్చినిజాన్ని ఎంతో అనుభవశాలిలా చెప్పేస్తాడు.
మరొక నానిలో.. ఇంట్లో / దొంగలు పడ్డారు / నా పేదరికాన్ని / దోచుకుపోతే బాగుండు.. అంటూ మట్టి మోసే తన తల్లి, కట్టెలు కొట్టి తమను పోషించిన తల్లిదండ్రుల కష్టాలను ఎవరైనా దొంగలు పడి దోచుకు పోతే బాగుండని ఆశపడుతాడు. కవిత్వం జీవితం రెండు వేరు వేరు కాదనిపిస్తుంది గోపాల్ నానీలు చదువుతుంటే.
డ్రైవర్ల బతుకు వేదనల్ని నివేదిస్తూ.. / డ్రైవర్ గా / అతడు నిపుణుడే / ఎటొచ్చీ బతుకు బండిని / నడుపలేడు.... అంటాడు. గోపాల్ కవనంలో తన జీవితమే కాదు. తన పరిసర జీవితాల పట్ల సంపూర్ణ అవగాహన కల్గి ఉన్నాడు. డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని నడపడం ఎంత కష్టమో తన నానిల్లో చెబుతాడు.
స్నేహాన్ని విశ్లేషిస్తూ.. అవసరంతో / ఏర్పడిన పరిచయం / త్యాగంతో ముగిసింది / అదే స్నేహం.... అంటాడు. స్నేహమంటే త్యాగమే కదా! అంటూ స్నేహ ధర్మాన్ని,మాధుర్యాన్నివివరిస్తాడు. వివరించడమే కాదు తన అంధ కవి మిత్రుడు శ్రీనివాస్ ను పాలమూరునుండి తన చూపుతో నడిపిస్తూ కవిసంగమం ముప్పై రెండవ సిరీస్ కి తీసుకొచ్చాడు. తన కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూపిస్తున్నాడు. కవి చైతన్యవంతుడయితేనే సరిపోదు, సౌజన్యమూర్తై ఉండాలని గోపాల్ నిరూపించాడు.
ఒకచోట.. అప్పు కోసం / ఊరంతా తిరిగినా / నాలుగు నానీలు మాత్రం దొరికాయి....అంటాడు. ఊరు ఊరంతా తిరిగినా ఒక్క పైసా కూడా పుట్టని తన కుటుంబ పరిస్థితిని తల్చుకుంటూ నానీలకు తమ జీవితమే వస్తువయిందంటూ పాఠకుని డెందాన్ని కదిలిస్తాడు.
ఇంకొక చోట... కరెంట్ / పోయింది / కాస్త తీరిక దొరికింది / మాట్లాడుకోవడానికి. ఈ నానిలో ఆధునిక జీవన విధానం,కుటుంబ సంబంధాల్లోకి సాంకేతికత ఆవిష్కరణలు ఏ విధంగా చొరబడ్డాయో, వాటిని ఎంత వరకు పరిమితం చేయాలో అంత వరకు పరిమితం చేస్తేనే మానవ సంబంధాలు వికసిస్తాయని చెబుతాడు.
ఒక్కటేమిటి ? ఇందులో ఆది నుండి అంత్యం వరకు ప్రతీ నానీ ఒక ప్రసూనమే. ఒక్కొక్క నానీ కోహినూర్ వజ్రమే. పరిమళాలు వెదజల్లే పల్లె బతుకు పూదోటనే ఈ 'తీరొక్క పువ్వు'.
మనిషి కొంత కోతలకు గురైనప్పుడే అగ్రమో, అగాథమో చేరుతాడు. మనసు ఇంకొంత వెతలను భరించినప్పుడే పథమో,పతనమో తెలుసుకుంటాడు. ఎద బాధలను భరించినప్పుడే ఎదురీదడం నేర్చుకుంటాడు. కవి చిన్న వయసులోనే ఆటుపోటుల్ని చవిచూసి కదిలించే నిజమైన కవిత్వం రాస్తున్నాడు. కవిత్వాన్ని శ్వాసిస్తున్నాడు. కవిత్వంతో జీవిస్తున్నాడు. సాహిత్య కళామతల్లి గోపాల్ కవన సజనా తష్ణను తీర్చి అక్కున చేర్చుకోవాలని ఆశిద్దాం.
- అశోక్ అవారి,
9000576581