Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం తెలుగు కవిత్వంలో వెలువడుతున్న వివిధ ప్రక్రియలలో ''రుబాయీలు''. రుబాయీల ప్రక్రియ తెలుగు కవిత్వానికి సంబంధించకపోయినప్పటికీ, కవి తను చెప్పదలుచుకున్న విషయాన్ని ఆకర్షణీయంగా, చమత్కారపూరితంగా, చదువరులకు అర్థమయ్యేలా చెప్పడానికి బాగా ఉపయోగిస్తుంది. ఇందులో తను చెప్ప దలుచుకున్న విషయాన్ని నాలుగు పాదాలలో చెప్పడం విశేషం. ఈ ప్రక్రియను తెలుగు కవిత్వంలోకి ప్రవేశపెట్టిన వారు కీ||శే|| దాశరథి కృష్ణమాచార్యులు గారు. తరువాత ప్రముఖంగా చెప్పుకోదగిన వారు శ్రీ డా|| తిరుమల శ్రీనివాసాచార్య గారు. డా|| ఏనుగు నరసింహారెడ్డి గారు తాజాగా తెలంగాణా రుబాయీలను పాఠకులకందించి తాను తమ ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు.
నరసింహారెడ్డి గారు తెలంగాణ రుబాయీలతో అనేక విషయా లను స్పృశించారు. తెలంగాణా ఉద్యమ స్ఫూర్తితో, తెలంగాణలో ప్రఖ్యాతి చెందిన సంస్కృతీ సంప్రదాయాలను, పేరెన్నికగన్న, కవులనేకాక అనేకానేక ప్రత్యేకతలను భావి తరాల కందించి కృతకృత్యులయినారు.
దీనిలో 14 ఖండికలున్నాయి. దేని ప్రత్యేకత దానిదే. 'ముగ్గులోకి దిగిన పిదప ఆటను ఒదిలేయొద్దు, యుద్ధంలో దూకినాక విల్లును వదిలేయొద్దు, సమస్యలకు ముగింపు, పోరాటమే నేర్పనుంది, వేదికలను ఎక్కినాక పాత్రను వదిలేయొద్దు' ఈ మాటలు తెలంగాణా సాధించుకునే క్రమంలో పోరాట యోధులకు ఉద్యమకారులను ఉత్తేజపరిచి కార్య సాధనకు ఉపక్రమించేలా, మధ్యలో ఉద్యమాన్ని వదిలేయొద్దు అని ఉత్తేజ పరిచేలా వున్నాయి.
అలాగే నిన్నా మొన్నటి ఘర్షణ భౌతిక రూపం, నేడూ రేపటి అలజడి అంతర రూపం, కాలంతో పాటు పోరాటం రూపాలు మారు, భవితలో ఎటులుండునో ఆందోళన రూపం' అంటూ తెలంగాణా తొలి దశ మలి దశ పోరాటాలను దృశ్యమానం చేసి భవిష్యత్తులో వాటిని గుర్తుంచుకోవాలంటారు. ఘర్షణ అలజడిని రేపితే అలజడి పోరాటానికి సన్నద్ధం చేస్తుంది. పోరాటాలు విజయవంతం కావటానికి ఘర్షణ, అలజడిని గుర్తుపెట్టుకోవాలని ఉద్బోధించి ఉద్యమానికి ఊపిరిలూదారు.
పొరపాటున శత్రువును నమ్ముతామేమో, అవసానంలో చేతులెత్తుతామో అని సందేహించి తొడగొట్టడం తొలినాళ్ళ ముచ్చట కాకూడదంటూ హితవు పలికారు.
తెలంగాణా ఘనతను తనివితీరా వర్ణించారు రెడ్డిగారు. పాలుకురికి సామాన్యుల గేయవు రాసె. పొన్నగంటి అచ్చ తెలుగు కబ్బుము రాసె, ప్రయోగాల గడ్డ ఇది నాడూ, నేడూ, ఈ తెలుగూ అందమైన గజలూ రాసె, అంటూ తెలంగాణా కవిత్వ పరిణామాన్ని తెలియజేస్తూనే సి.నా.రె. గురించి పదాలను విరుచుట, వాక్యాలను పంచుటలో హన్మాజీపేట సి.నా.రె నేర్పాడంటారు. సిటీ వైటుకు, సిటీలో అడుగడుక్కు చరిత్ర ఉంది అని చెబుతూనే నేటి సిటీ దృశ్యాలను కళ్ళకు కట్టినట్లు వివరిస్తారు. ఈ కింది రుబాయీలూ వాస్తవాలను ముందుంచుతుంది.
ఒక్క వాహనమాగిపోయెను బిర్రబిగిసెను ట్రాఫికంతా
ఒక్కడొచ్చెను రాంగురూటున ఇరికిపోయెను ట్రాఫికంతా
ఎవ్వడో విసరేయురాయిలన్ని తలలను గాయపరుచునో
అర్థగంటే వాన కురిసెను, ఆగిపోయెను ట్రాఫికంతా
ఆఫ్రికాలో ఉన్న వాడికి కూడా ఈ నాలుగు వాక్యాలు చదివితే హైదరాబాదు కళ్ళకు కనిపిస్తుంది.
రుబాయీల ప్రత్యేక అంశం అయిన చమత్కారాన్ని ఈ కింది రుబాయీలలో పొందుపరిచారు.
పోస్టల్లో ఊరూరికి నెంబరుంటది, నగరంలో ఇంటింటికి నెంబరుంటది, రాబోయే రోజులలో ఊహ చేసుకో పేరు బదులు ప్రతి మనిషికి నెంబరుంటది.
కళ్ళు రెండు వాట్సాపుకు, మనసంతా ఫేసుబుక్కుకు, అనుసంధానమయితే మత్తులోన ఊగి తూగు అతి నవలోకం టెక్నాలజీ బతుకులకు అనుసంధానమవుతుందంటారు. సెల్ఫోన్ ఎంతటి ప్రభావం చూపిస్తుందో 'సంపారం నడుమ గోడలేపెను సెల్ఫోన్, స్నేహాలకు అడ్డు తెరలు వేసెను సెల్ఫోన్ ఒడుపుంటే పువ్వు లేకుంటే కత్తి కదా! ప్రేమ పొరను కామంతో ప్రేమ పొరను కామంతో నింపెను సెల్ఫోన్ అంటూ నేటి ప్రేమ, పరువు హత్యలకు అనేక దుష్ప్రభావాలకు సెల్ఫోన్ ఎలా కారణమవుతుందో సోదాహరణంగా వివరించారు.
నల్లగొండ మీద చుక్క వాన పడదు చిత్రం. పాలమూరులో కాలువ ప్రవహించదు చిత్రం, మా రాతి తెలంగాణా రూపు రేఖలను, ప్రాజెక్టు ఈ నేల పొడచూపుట చిత్రం అంటూ వాస్తవాలను బయటపెట్టారు.
ఓటేసిన ప్రతిసారీ ఓడుతుంది ప్రజలే. ప్రతి పార్టీ వలలోనా చిక్కుతుంది ప్రజలే. పోరాటం ప్రతి ఫలాలు ఏ వైపుకు పోతాయో అని నేటి ప్రజల దుస్థితికి కారణాలు చూపిస్తారు.
చట్టాలు సామాన్యులకు న్యాయం చేయటం లేదని చెప్పటానికి ఏ మాత్రం సందేహించలేదు ఈ రచయిత.
పది మొనలున్న కత్తిలాంటిది చట్టం. అమాయకుల పైనే దిగేది చట్టం, పెద్దలెట్లయినా తప్పించుకుంటరు. చిన్నోల్లను సతాయించేది చట్టం' అని నిర్భయంగా చెప్పారు.
కులాలు, మతాలు ప్రజల జీవితంలో ఎటువంటి ఫలితాన్నిస్తున్నాయో చక్కగా చెప్పారు 'మతమన్నది ప్రజల మధ్య వేసినట్టి అడ్డుగోడ, కులమన్నది సమాజాల్ని చీల్చినట్టి అడ్డుగోడ' అంటూ ఈ గోడల్ని పగలగొట్టాలి అని ఆకాంక్షించారు.
ఇలాగా ఎన్నో జీవిత వాస్తవాలను, ప్రజా జీవితాలను అవస్థలను చక్కగా కళ్ళకు కట్టినట్లు ఈ పుస్తకంలో వివరించారు రెడ్డి గారు. వారు చెప్పినట్టుగానే
రుబాయీలు రాయడమొక మజాకు కాదు
రదీపూను కాఫియాను అల్లుటకాదు
పట్టరాని చేప పిల్లలంటి ఊహలు
మాత్రల్లో పరుగు తీయ సడాకు కాదు,
కవిత్వాన్ని కాస్త నిదానంగా చెప్పండి,
గుండెలోతుల్నే ప్రధానంగా చెప్పండి.
ముక్కలన్ని ఏరినా అతుక్కోదు అద్దం
ప్రణయ సుతులు మరి మరి మేలిపొరన చెప్పండి అనే రుబాయీలను యదార్థం చేస్తూ తను చెప్పదలచిన భావాలను గుండె లోతుల్ని తట్టేలా ప్రభావశీలంగా చెప్పిన రచయిత అభినందనీయుడు.
(తెలంగాణ రుబాయీలు, రచయిత : ఏనుగు నరసింహారెడ్డి, పేజీలు : 300, వెల : 200/-, ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో...)
- తాటికొండాల నరసింహారావు, 9885787250