Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత కమ్యూనిస్టు ఉద్యమ శతవార్షికోత్సవ సంరంభం సమాప్తమవుతున్న వేళ దేశంలోనూ ప్రత్యేకించి తెలుగులోనూ ఆ భావజాలం సిద్ధాంత మార్గం ప్రసరించిన ప్రభావాన్ని స్మరించుకోవడం ఉత్తేజ కరమైన అనుభవం. వాస్తవానికి 1920లో కమ్యూనిస్టు పార్టీ స్థాపించినప్పటికీ అంతకు ముందే దాని కిరణాలు ఆలోచనా పరులను తాకాయి. 1842లోనే బెంగాలీ పత్రిక స్పెక్టేటర్ బ్రిటన్లో వచ్చిన చార్టిస్టు ఉద్యమాన్ని గురించి రాస్తూ కార్మికుల వేతనాలు హక్కులు వాటికై పోరాడవలసిన అవసరాన్ని చెప్పింది. హిందూ పేట్రియట్ పత్రిక సంపాదకుడు హరిష్ చంద్ర ముఖర్జీ 1958లో కార్మికోద్యమం గురించే గాక బ్రిటన్ ఫ్రాన్స్లలో వస్తున్న సోషలిస్టు భావాల గురించి రాశారు. ఇంగ్లాండులో కార్మికుల సమ్మెలు బెంగాలీ రైతులు చేపట్టే ధర్మఘాట్ ఉద్యమం ఒకే తరహాకు చెందినవని ఆయన రాశారు. పాలకవర్గాలు భోగ విలాసాలలతో తేలియాడుతుంటే శ్రామికులు దుర్భరంగా బతకవలసి రావడం అన్యాయమంటూ తమను అంతర్జాతీయ కార్మిక సంస్థకు అనుబంధంగా చేర్చుకో వలసిందిగా 1871లో కోల్కత్తా నుంచి మార్క్స్ ఎంగెల్సులకు ఒక లేఖ అందింది. ప్రఖ్యాత రచయిత బంకించంద్ర చటర్జీ 1879లో సామ్య అనే వ్యాసంలో మనుషులందరూ సమానంగా సుఖపడే పరిస్థితి వుండాలని ఉత్పత్తి సాధనాలు సంపదలు కొందరి చేతుల్లో వుండటం భావ్యం కాదని స్పష్టంగా రాశారు. 1881 మేలో బాలగంగాధర తిలక్ మార్క్స్ సిద్ధాంతం గురించి శ్రమజీవుల విముక్తి గురించి రాశారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ భావాలనే మరింత విశ్లేషణాత్మకంగా 1892లో రాశారు. 1893లో అరవింద ఘోష్ ప్రజాస్వామ్య సోషలిజం అంటూ రాశారు. రష్యాలో లేదా చైనాలో వచ్చే తిరుగుబాటు నుంచి కొత్త మార్పులు ఉదయిస్తాయని వివేకానందుడు 1896లో సవివరంగా విశ్లేషించారు. బ్రాహ్మణ క్షత్రియవైశ్య (పెట్టుబడి దారీ) పాలనలు చూశాము గనక ఇక శ్రామికులైన శూద్రుల రాజ్యం చూస్తామని ఆయన ప్రకటించారు. సోషలిజం ఇతర సిద్ధాంతాలు రాబోయే విప్లవానికి వైతాళిక పాత్ర నిర్వహిస్తాయని వివేకానందుడన్నారు. 1905లో రష్యాలో మొదటి విప్లవం విఫలమైన కాలంలోనే భారతదేశంలో వంగదేశంలో జాతీయోద్యమం మొదలవడం యాదృచ్ఛికం కాకపోవచ్చు. అయితే మాత్రం 1917అక్టోబర్ విప్లవ విజయం తర్వాత సామ్యవాద భావజాలం వేగంగానూ బలంగానూ వ్యాపించ సాగింది. పలు పత్రికలు ఆ విప్లవాన్ని స్వాగతించాయి. 1918లో కార్మిక సంఘాలు మొదలవడం బొంబాయిలో జౌళి కార్మికుల సమ్మె జరిగాయి. 1919 జనవరిలో లాలాలజపతి రారు తనకు అర్థమైనంతలో కోర్కెలు సాధించు కోవడానికి బొల్షివిజం ఒక్కటే మార్గంగా కనిపిస్తుందని రాశారు. 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ వూచకోత దేశంలో వాతావరణాన్ని ఒక్క సారిగా వేడెక్కించింది. టాగోర్ తన సర్ బిరుదుని వెనక్కు ఇచ్చేశారు. అదేఏడాది బెంగాలీ కవి నజ్రుల్ ఇస్లాం రాసిన బైథర్దాస్ కథలో ఒక పాత్ర సరిహద్దులు దాటి సోవియట్ లో ప్రవేశిస్తుంది. మరోవైపున ప్రేమ్ చంద్ సామ్యవాద భావాలకు సంఘీభావం ప్రక టిస్తూ స్నేహితునికి లేఖ రాశారు. సిద్ధాంత సాహిత్యం కూడా రహస్యంగా పంపిణీ అవుతున్నదని గ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని వేటాడటం మొదలెట్టింది. మళయాలంలో 1912లో స్వదేశాభిమాని రామకృష్ణన్ తొలిసారి మార్క్స్ జీవిత కథను వెలువరించారు. సోవియట్ విప్లవానికి కొంచెం ముందుగానే సహోదర అయ్యప్పన్ సహోదర సంఘం ఏర్పరిచి పంక్తి భోజనాలు ప్రవేశపెట్టారు. కామ్రేడ్ పదానికి సహక్కళు అన్న మాటను మొదటిసారి ప్రయోగించారు. కుమారన్ గురు 1918లో చైతన్య వంతమైన రచనలు మొదలెట్టారు ఇక రచయిత కేశవ నాయర్ కూడా ఆ సమయంలోనే ప్రగతి భావాలను విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చారు. ఇక తమిళంలోనైతే మహాకవి సుబ్రహ్మణ్య భారతి నవ రష్యా పేరిట బొల్సివిక్ విప్లవాన్ని స్వాగతిస్తూ 1918లోనే రాశారు. 1919లోనే ప్రఖ్యాత రచయిత రోమరోలా రూపొందించిన భావ స్వేచ్ఛా ప్రకటనపై మాగ్జిమ్ గోర్కి, బెట్రాండ్ రస్సెల్, హెన్రీ బార్బూస్, ఆఫ్టన్ సింక్లయిర్ వంటి వారితో పాటు భారతదేశం నుంచి టాగోర్, కుమారస్వామి సంతకాలు చేశారు.
20వ దశకంలోనే (1922) ఉన్నవ లక్ష్మీ నారాయణ రాసిన 'మాలపల్లె' నవల మార్క్సిస్టు భావాలను మొదటి సారిగా తెలుగులో వినిపించింది. మాలపల్లెలో తక్కెళ్ల జగ్గడు అనే తిరుగుబాటు పాత్ర మనుషులందరూ సమానులేనని, దోపిడీ వుండ కూడదని మాట్లాడుతుంది. పనివాళ్లందరు ఏకమైతిరా ప్రపంచమే మీది అంటూ తక్కెళ్ల జగ్గడు బొల్షీవిక్ విప్లవాన్ని గురించి పాడతాడు. ఉన్నవ గాంధేయవాది అయినా సామ్యవాద సిద్ధాంతాలను వివరించారు. ఇది సహించలేని బ్రిటిష్ ప్రభుత్వం మాలపల్లెను నిషేధించింది. నవలలో మార్పులు చేయవలసిందిగా ప్రభుత్వం కోరినపుడు ఉన్నవ అందుకు తలవంచలేదు. 'కమ్యూనిజాన్ని ప్రచారం చేయడం తప్పేమీ కాదని, పెట్టుబడికి వ్యతిరేకంగా శ్రామికుల ఐక్యతను ప్రోత్సహించడం దగాకాదని' సమాధానమిచ్చాడు. పత్రికలు, ప్రజా ప్రతినిధులు గట్టిగా ఖండించాకే ప్రభుత్వం ఆ నిషేధం తొలగించింది.
30వ దశకాన్ని 'ఆకలి దశకం'అన్నారు. పెట్టుబడిదారీ ప్రపంచం మహా సంక్షోభంలో కూరుకు పోయింది. నిరు ద్యోగం తాండవించింది. మరో వైపున సోవియట్ యూని యన్ ఈ బెడదలు లేకుండా ముందుకు నడవడం మేధావి వర్గాన్ని విశేషంగా ఆకర్షిం చింది. 1930 మార్చి 12న గాంధీజీ దండ యాత్ర ప్రారం భించారు. అటు జాతీయో ద్యమం ఇటు సామ్యవాద ఆదర్శం యువతరాన్ని అందులోనూ ఆలోచనా పరులైన రచయితలను విశేషంగా ఆకర్షించాయి. ఈ నేపథ్యంలోనే 1933లో అభినవాంధ్ర కవి పండిత సభ అవతరించి తర్వాత నవ్య సాహిత్య పరిషత్తుగా మారింది. ఆనాటి చెప్పుకోదగిన కవులు రచయితలు పండితులు అందరూ దాని సభ్యులయ్యారు. శ్రీశ్రీతో సహా వ్యవహారిక భాష, సమాజ అభ్యున్నతి దాని రెండు లక్ష్యాలు. పాత వ్యవస్థ మీద అనహ్యం కొత్తది కావాలనే తహతహ దాన్ని ఏర్పరచాయి. కొత్తతరం ప్రతినిధులతో పాటు సనాతన వాదులు కూడా దానిలో ప్రవేశించారు. కొంత కాలం అది సాహిత్యరంగంలో గొప్పగా ప్రకాశించింది.
అప్పుడే దక్షిణభారతంలో పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వాన కమ్యూనిస్టు పార్టీ రూపుదిద్దుకుం టున్నది. కార్మిక సంఘాలు శాఖలు ఏర్పడుతున్నాయి. శ్రీశ్రీ భావ కవిత్వ ప్రభావం నుంచి బయిటపడి జయభేరి వినిపిస్తున్నాడు. 1934 ఏప్రిల్ 12న ఖచ్చితంగా మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది అంటూ మహాప్రస్థానం వినిపించాడు. అది తెలుగు సాహిత్యంలోనూ సమాజంలోనూ నవ భావాల పురో గమనానికి సంకేతం. గురజాడ మందగించక ముందుకడుగెరు అన్నాడు శ్రీశ్రీ పదండి ముందుకు అని నడిపించాడు. కవిత్వ సామగ్రిని కూడా మార్చేశాడు శ్రీశ్రీ. సింధూరం రక్తచందనం.. ఎగరేసిన ఎర్రని జండా కావాలన్నాడు. 1934లోనే ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ మొదటి మహాసభ జరిగితే తుమ్మల వెంకట్రామయ్య ఎగరాలి ఎగరాలి మన ఎర్రజెండా పేరిట తొలి ఎర్రజండా పాట రాశారు. శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాన్ని కూడా ఎర్రబావుటా నిగనిగలు అంటూ ముగించారు. ఈ విధంగా 1930లలో ప్రగతిశీల సాహిత్యం వూపందుకుంది. అప్పటికే పడగవిప్పుతున్న ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రపంచ ఫాసిస్టు వ్యతిరేక మహాసభ పారిస్లో జరిగింది. ప్రపంచ రచయితల సంఘం ఏర్పడింది. దాని కొనసాగింపుగా బారత దేశంలో 1936లో తొలి అఖిలభారత అభ్యుదయ రచయితల సంఘం మహాసభ ప్రేమ్ చంద్ అధ్యక్షతన లక్నోలో జరిగింది. ప్రేమ్చంద్ ముల్క్రాజ్ ఆనంద్ సజ్జాద్ జహిర్ వంటివారు దేశ వ్యాపితంగా ఈ ఉద్యమానికి నాయకత్వం అందించారు. భావకవిత్వం వూహాప్రేయసీ రోదనలో వున్న దేవులపల్లి కృష్ణశాస్త్రి కూడా ఆకాశము నుదుట పొడుచు అరుణారుణ తార అని రాయడం ఈమార్పుకు సంకేతం.
ఈ కాలంలోనే ఆంధ్రప్రాంతంలో మొదలైన జమీందారీ వ్యతిరేక పోరాటం నిజాం సంస్థానానికి కూడా విస్తరించి రైతాంగ పోరాటానికి అంకురార్పణ జరిగింది. తెలుగు భాషా సాహిత్య చైతన్యంపై నిజాం ఆంక్షలను ధిక్కరించి కొమర్రాజు లక్ష్మణరావు, మాడపాటి హనుమంతరావు తదితరులు పునర్వికాసానికి పునాది వేశారు. కామ్రేడ్స్ అసోసియేషన్ రాజ్బహుదూర్ గౌడ్ వంటివారు స్వయంగా సాహిత్యంపై ఎంతో పట్టున్నవారు కావడం ఇందుకు తోడ్పడింది. ఉస్మానియాలో చదువుతున్న మగ్దుం మొహియుద్దీన్ బెర్నార్డ్ షా నాటకాన్ని ఉర్దూలోకి అనువదించి రవీంద్రనాథ్ టాగూర్ సమక్షంలో ప్రదర్శిస్తే ఆయన వేదికపైకి వచ్చి కౌగిలించుకున్నారట. మగ్గుం ఉర్దూలో ప్రగతిశీల విప్లవ భావ జాలాన్ని శక్తివంతంగా వెలువరించారు. రైతుకు దక్కని కంకులెందుకు కాల్చేయండి అని రాశారు. మిత్రులతో కలసి అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటు చేశారు. తర్వాతి కాలంలో దాశరథి కృష్ణమాచార్యులు వట్టికోట ఆళ్వారు స్వామి సుద్దాల హనుమంతు తదితరులు ఆ భావస్రవంతిని కొనసాగించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఫాసిస్టు వ్యతిరేకత, ప్రజాపోరాటాలు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట క్రమంలో ఇటు అభ్యుదయ రచయితల సంఘం అటు ప్రజానాట్యమండలి కలసి గొప్ప ప్రజాసంసృతిని సృష్టించాయంటే దీని వెనక కమ్యూనిస్టు ఉద్యమం, అక్టోబర్ విప్లవం ఇచ్చిన ఉత్తేజమే ప్రేరణగా నిలిచింది. ఇదే పరిణామం దేశవ్యాపితంగా వివిధ భాషలలో వచ్చింది. చెప్పుకోవలసిన పేర్లు, సంఘాలు, కవులు, రచయితలు, మేధావులు ఎందరో వున్నా భారత కమ్యూనిస్టు ఉద్యమ వందేళ్ల జేజేల సందర్భంలో ఇది ఒక రేఖామాత్ర స్పర్శ మాత్రమే. ఆ ఆదర్శ మూర్తులకూ అక్షరాంజలి.
- తెలకపల్లి రవి
9490099444