Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాములపర్తి వేంకట నరసింహారావు అనగానే మనతో చాలామందికి బహుభాషావేత్త, దేశ ప్రధాని ఐన తొలి తెలుగు వ్యక్తి, ఆర్థిక సంస్కరణల మనిషి, మౌన ముని... ఇటువంటి పలు అంశాల గుర్తుకోస్తాయి. పి.వి.నరసింహారావు అని తలచుకోగానే చాలా మంది సాహిత్య బవులకు 'గొల్లగామవ్వ' కథారచయిత, 'మంగయ్య గారి అదష్టం ' నవలికా కారుడు, 'ఇన్ సైడర్' స్వీయచరిత్ర రచయిత మొదలైన విషయాలు స్ఫురణకొస్తాయి. పి.వి అనగానే మనలో మరికొంత మందికి విశ్వనాథ వేయిపడగలను సహస్రఫణ్గా హిందీలోకష్ట్రÊఈ, జయప్రభ కవితలను ఇంగ్లీషులోకీ, మరాఠీ రచయిత ఆప్టే రాసిన 'అబలా జీవితం' నవలను తెలుగులోకి అనువదించిన ముచ్చట్లు యాదికొస్తాయి.
ఆప్టే పూర్తి పేరు హరినారాయణ్ ఆప్టే. స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లేక చదువు సంధ్యలు లేక సంప్రదాయ చట్రంలో నలిగిపోతున్న స్త్రీ జీవితాన్ని చూసి చలించిపోయి ఆప్టే ఈ నవలను రాశారు. నిజానికిది కథానాయకి అయిన యమునా బాయి అత్మకథ సాహిత్య అకాడమీ పక్షాన 'టాగూర్ పబ్లిషింగ్ హౌస్ (హైద్రాబాదు)' ఈ నవలను ప్రచురించింది. 1964లో వచ్చిన 'అబలా జీవితము' గొప్ప నవల.
పి.వి. గారు ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిన ఎనిమిదేండ్లకు ఈ నవలను అనువదించారు. ఆయనకు తెలుగు శిష్ట వ్యావహారికంతో పాటు తెలంగాణ భాష కూడా బాగా తెలుసు. అప్పట్లోనే పి.వి. తన తెలుగు అనువాదంలో వీలున్న ప్రతి సందర్భంలో తెలంగాణ పదాలు, పదబంధాలు, సామెతలు, జాతీయాలు, నుడికారాలు, వాక్య సరళి... వీలున్నంటిని ఉపయోగించిన పండిత ప్రకాండుడు. అప్పటి ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల యాసతో, భాషల్లో ఏ ఒక్కటీ ఎక్కువాకాదు, తక్కువా కాదు అనే ఎరుక కల్గిÄన బహుభాషావేత్త ఆయన. అయితే స్వస్థాన వేషభాషాదుల మీద అపారమైన ప్రేమ కల్గినవాడు కనుక అన్ని ప్రాంతాల తెలుగువాళ్లు చదివే అనువాదంలోనూ తెలంగాణ ముద్రను కావాలనే ప్రదరించాడు. ప్రపంచంలోని ప్రతి రచయితలోనూ ఈ ప్రాంతీయత కన్పించక తప్పదుమరి.
నానువాచకాలు : ''నేను వాడి 'లాగు' నాడా పట్టి వెనక్కి లాగాను'' అనేది నవలలో ఒక వాక్యం. ఇందులో 'లాగు' అనేది దాదాపు తెలంగాలో చలామణిలో వున్న పదం. ఇవాళ మనమంతా పంట్లాము, పైంటు, ప్యాంటు, ప్యాంటాలూన్ అంటున్నాం. నిజానికి లాగు తెలుగు పదం. తిమ్మయ తన రసికజన మనోభిరామంలో 'కావి లాగులు నీలి కాసెలు' అన్నాడు. అట్లాగే ''మొన్న 'అంగీ' ఉతికి పెట్టమంటే'' అని మరొక అసమాపక వాక్యం. ఇందులో 'చొక్కా' సరైన పదమే ఐతే 'అంగీ' సైతం చక్కటి మాటే! పైగా అది తన పరిసరాల్లో ప్రయుక్తమవుతున్నది. రఘునాథా భ్యుదయంలో 'తగిన అంగి ధరించి తలపాగ చుట్టి' అని వుంది. పి.వి. అనువదించిన నవలలో ''వాటి వేళ్ళమీద నా పంటి కాట్లయినా మాయలేదే'' అనే ఓ వాక్యంలో పంటికాట్లున్నాయి గానీ 'గాట్లు' లేదు. పదాదిని సరళం చేరి లేక సంధిగతంగా కానీ కాట్లు 'గాట్లు' అయింది ఈ ఆనాటి భాషలో. (కడప 'గడప' అయినట్లూ, కొరగడం 'గొరగడం' అయినట్లూ) అయితే 'కాట్లు' మూల రూపం కదా! ''మా కఱచీన కాట్లకున్ శిశువు కాయము తొలును నుగ్గదయ్యె'' అన్నాడు ఎర్రయ్య నృసింహ పురాణంలో. ''కూర్కు'' అని మరొక పదం అనువాదంలో. ఇప్పుడు మనమంతా కునికిపాట్లు, నిద్ర అంటున్నాం. పోతన భాగవతంలో ''కూరుకు రాదు రేయి నాకెన్నడు'' అని అన్నడు. ఆ ''కూరుకు'' తెలంగాణలో ''కూర్కు'' అయింది. ''కసిగందు''కు చేస్తున్న పెళ్ళిళ్ళ మాట- అనే వాక్యంలో ''కసిగందు''కు అర్థం ఈనాటి పసికందు. నిజానికిది 'పచ్చై కుళందై' అనే తమిళ మాట. పసిగందు లాగానే కసిగందు కూడా సరైనదే! అందుకే ముక్కు తిమ్మన ''కావు కావంచు ఏడ్పుల్ తలిర్పన్ కసుకందవై'' అని నుడివినాడు పారిజాతాపహరణంలో. ఇంకోచోట... ''అటూ ఇటూ బిత్తిరి చూపులు చూస్తూ'' అనే వాక్యం వుంది. ఈ తెలంగాణ ''బిత్తిరి చూపులు''.... ప్రమాణ భాషలో ''బిత్తర చూపులు''. తిమ్మయ రాసిన రాజశేఖర విలాసంలో ''బిత్తరి వాలు చూపులన్'' వున్నది. ఇవి మాత్రమే కాక ''పోరి, ఉప్పుడు పిండి, పట్ట గొలుసులు, గోలీలు, ఎల్లకాలం, మాసర, మంకు... ఇట్లా వందలాది తెలంగాణ మాటలు వాడినాడు. అచ్ఛా, దోస్తీ, హైరాన్, గప్చిప్, పత్తా, నామంబౌరు, ఏక్దమ్, ఖబర్దార్ వంటి ఉర్దూ పదాలకు లెక్కేలేదు.
నామవాచకాల్లోనే నాద మాధుర్యానికి కారణ భూతమైన ''సున్నా'' వున్న రూపాలను పి.వి. అనువాదంలో యథేచ్చగా వాడుకున్నారు. అవి తెలంగాణ వ్యవహారంలో వున్న ''ఇండ్లు, ఏండ్లు, కండ్లు, తిండ్లు, బండ్లు, కోడండ్లు, పెండ్లి'' మొదలైన పదాలు. ఇక ఈ నామ పదాల్లో అచ్చ తెనుగు పదాలు అనేకం. వయస్సుకు బదులు ''ఈడు'' అన్నాడు. సమస్యకు మారుగా ''చిక్కు'', సంవత్సరం కాకుండా ''ఏడు'' గర్వం అనకుండా ''నిక్కు'', ప్రజ్ఞలు (పెగ్గులు) అని చెప్పకుండా ''హెచ్చులు'' బారసాల (బాలసారె)కు ప్రత్యామ్నాయంగా ''పురుడు''.. ఇట్లా పలు తెలుగు పదాలను ప్రయోగించాడు. తెలంగాణలో ప్రత్యేకంగా వున్న ''చావుదల'' (చరమదశ), ''జాలిగుండె'' (దయా హృదయం) ''నిండు మనిషి'' (గర్భవతి).... ఇత్యాదులు ఎన్నెన్నో ఆయన అనువాదంలో సజీవంగా కన్పిస్తాయి. చాలా చిత్రంగా ''అర్థి'' (శవం), కాఠీ (శరీరం), భద్ర (బద్ది బద్నాం, అపనింద). క్రియాకర్మలు (కర్మకాండ), శీతస్వరం (చలి జ్వరం) మొదలైన ప్రత్యేక పదాల పోహళింపు వుంది.
క్రియలు : పి.వి. గారిది క్రియల్లోనూ క్రియాశీలకమైన తర్జుమా, ఆయన చేతల్లో చూపించిన అనువాదపు రాతలివి.
''ఇంత పెద్ద పెరిగింది గుర్రంలా'' అనే వాక్యంలో ''పెద్ద పెరిగింది'' తెలంగాణ క్రియ. ఇవాళ ఇంత ''పెద్దయ్యింది'' అంటాం. ''పెద్ద పెరిగింది'' అనేది ఒకప్పుడు తెలుగు నాడు అంతటా వుండి వుంటుంది. నైజాం పరిపాలనలో సరైన రవానా సౌకర్యాలు, విద్యావసతులు, ముద్రణాలయాలు, గ్రంథాలయాలు, పత్రికలు, ఆధునిక నాగరికతా ముద్రలు చాలినన్ని లేక తెలంగాణ భాష మార్పుకు తక్కువగా గురైంది. అట్లా తెలంగాన పల్లెల్లో ఇప్పటికీ మూలభాషారూపాలు నిలిచి వున్నై, తీసుకొని రమ్మనడం క్రియకు బదులుగా పి.వి. ''తెమ్మనడం'' అని వాడుతాడు. పడుకొనడాన్ని ''పండుకోనడం'' అంటాడు, ''గుర్చి గుచ్చి'' అడగడం అనేది ఆయన అనువాదంలో ''కుచ్చికుచ్చి''గా వుంటుంది. కారణం.. తెలంగాణలో అలాగే వుండటం పైగా ''కుచ్చి కుచ్చి'' అనేదే మూలరూపం కావటం. చిత్రంగా తెలంగాణ వాడుకలో వున్న ''గెలుకుడు'' ఉపయోగించాడు. పి.వి. నిజాకిది కెలకడం మూలరూపం కెలకడమే! అయినా వ్యవహారంలో ''గెలుకుడు'' వుంది కనుక అనువాదంలో అదే ''గిలికిండు''.
ఇంకా ''గుంజుకొని'' (లాక్కొని), ''అలముకొని'' (కౌగిలించుకొని), ''మసలుతూ'' (తిరుగుతూ), ''వంగినాక'' (తగ్గినాక), ''చిదురుకొని'' (చీదరించుకొని), ''సింగారించుకొని'' (అలంకరించుకొని), ''అప్పజెప్పి'' (అప్పటించి), ''ఎక్కడు'' ( బతకడు, మిగలడు), కొనవచ్చి (కన్పించి), మూడింది (సంభవించింది - నకారాత్మకంగా)... మొదలైనవి ఇతరమైన అనేక క్రియలు ఆయన అనునాదంలో వున్నాయి.
నుడికారాదులు : ప్రపంచంలోని ఏ భాషకైనా ఈ నుడికారాలు జీవగర్రలు. అసలు భాషల్లోని ప్రత్యేకతకు యివి మూలకందాలు. పి.వి. తన అనువాదంలో ''బట్ట కాల్చి మీద వేయడం'' అనే అంటారు మరి! ఓ చోట ''నా ఒంటికి ముళ్ళు వస్తాయి'' అని తెనుగు చేశాడు. ''ఒంటిపై తేళ్ళూ, జెర్లూ పాకినట్లు అనిపిస్తుంది'' అనే నుడికారానికి సమానం పై ''ఒంటికి ముళ్ళు రావడం'' ''నంగనాచి'' అనకుండా ''నాలిముచ్చు'' అంటాడు, ''పెదవి విరవడం'' అని రాయకుండా ''ముక్కు విరుచుడు'' అనే రచిస్తాడు. కారణం తెలంగాణ జనాలు ముక్కు నిరుస్తారు మరి! ఇంటిల్లిపాది కాకుండా ''ఇంటిల్లెడు రాజులు'' అని రాస్తాడు పి.వి. ఒక చోట ''తిప్పితిప్పి కొడితే మొత్తం వెయ్యి రూపాయలు'' అని తెగిస్తాడు. ఈ ''తిప్పి తిప్పి కొడితే'' ఏమిటి? అంటే ''అంతా కలిపితే, కూడితే, ఎంత మంది, చివరాఖరికి'' అని అర్థాలు. అనునాదంలో ''ఇంటి శోభ పోయింది'' అంటాడు పి.వి. శోభ అంటే వైభవం ప్రారంభం కళ, అందం అని అర్థాలు, తెలంగాణ పల్లెల్లో ఈ నాటికీ, 'శోభ' అనే మాట బహుళ ప్రచారంలో వుంది. ''కొంపలేం అంటుకొని పోయినై'' అనే నుడికారానికి బదులు ''ఏం మునిగింది'' అంటారు. తెలంగాణలో ఆ ''ఏం మునిగింది'' అనువాదంలో జొప్పించారు. ''కొంపలు అంటుకొని పోవడం'' ఎండకాలపు ప్రమాదం. ''మునిగిపోవడం'' వానకాలపు ఉపద్రవం.
ఇవే కాకుండా ''కూలి కూలి నవ్వడం'' (పడీ పడీ...) ''సెనగ చెట్టు పైకి నిచ్చెన వేసి ఎక్కించడం'' (మునగ చెట్టూ...), ''మీ ఇంటికి రావాలని నాకేం కాళ్ళ మీద గుంజ ఒలుకలేదు'' (మీ గడప తొక్కాలని....), ''ఎవ్వరి కాలి గోరు కూడా ఈ ఇంట్లో ప్రవేశించవద్దు'' (గడప తొక్కొద్దు), ''సంభాషణ విని ఉప్పుకారం తగిలించి రిపోర్టు చేసింది'' (చిలువలు పలువలుగా చెప్పడం), ''నాకు కందెన తగిలింది'' (నా చేతి చమురు వదిలింది)... ఇటువంటి అనేక నుడికారాలు అడుగడుగునా పి.వి. అనువాదంలో తటస్థిస్తాయి. కొన్ని నుడికారాలు తెలంగాణ ముద్రతోనే కాకుండా మరాఠీ ముద్రతోనూ కన్పిస్తాయి. ఉదాహరణకు ఓ సామెత : కుక్కతోకను పన్నెండేండ్లు గొట్టంలో పెట్టినా చక్కబడుతుందా? తెలుగులో ''కుక్క తోకకు రాయి కడితే చక్కనవుతుందా?'' అనీ, ''కుక్క తోక వంకర'' అనీ.. ఈ మోస్తరు సామెతలున్నాయి.
పి.వి.నరసింహారావు గొప్ప అనువాదకుడు. అనువాదాలు మూల భాష నుండి నేరుగా చేసినప్పుడూ, అనువాదకులు మాతృభాషలో సృజనాత్మక రచయితలు అయినప్పుడూ, అనువాదాలను ఇష్టపడి ఆ అనువాదాలు మూల భాషలోని సొగసు దాదాపుగా కోల్పోకుండా గొప్పగా రాణిస్తాయి. పి.వి. మంచి అనువాద రచయిత. ఉదాహరణకు ''ఆఫ్ ఆల్ స్యాడ్ వర్డ్సు ఆఫ్ టంగ్ అండ్ పెన్ ద స్యాడెస్టు ఆర్ దీజ్- ఇట్ మైట్ హ్యావ్ బీన్'' అనే ఆంగ్లానికి
''వగపు కలిగించు నుడులందు, వ్రాతలందు
''అయ్యో అట్టులై యందునే' యనెడి పలుకు
లమిత దు:ఖకరమ్ములౌ యరసి చూడ'' అని తెనిగించాడు.
అందుకే ఆయన గొప్ప అనువాదకుడు, తర్జుమా అయినా అందులో తెలంగాణ మాట తీరును చలామణీలో 1964 ప్రాంతాల్లోనే పెట్టిన మొనగాడు.
(డిసెంబర్ 23 పి.వి. వర్థంతి సందర్భంగా)
- డా|| నలిమెల భాస్కర్,
9704374081