Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చాలని తపిస్తున్న ఆర్దిక సంస్కరణ వాదులు దానిని తమ అధీనంలోనికి తెచ్చుకోవడానికి వేయని ఎత్తులు లేవు. చెయ్యని కుట్రలు లేవు. దేశాలను బెదిరించి, వాటి పాలకులను లొంగదీసుకుని, ఆయా దేశాల సంపదలను తరలించుకు పోవడానికి వాళ్లు రచిస్తున్న పథకాలూ, అమలుపరుస్తున్న విధానాలూ మనకు పరిచితమే! భారత పాలకులు కూడా వాళ్ళ అడుగులలో అడుగు వేస్తూ ప్రజా జీవితాలను ఎలా అల్లకల్లోలం ఏం చేస్తున్నారో మనకు తెలుస్తూనే ఉంది!
శాసన, కార్యనిర్వాహక,న్యాయ వ్యవస్థలు ఇప్పటికే పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. నిజం వైపు నిలబడుతుందని ఇన్నాళ్లూ జనం భావిస్తూ(భ్రమిస్తూ) వచ్చిన (ఫోర్త్ ఎస్టేట్) నాలుగో స్తంభం కూడా పెట్టుబడిదారులకు పెంపుడు జంతువులా మారిపోయిన విషయం ఇటీవలి కాలంలో ప్రజలకు బాగా అనుభవం లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఉన్న అన్ని దారులూ మూసుకుపోయి తమను ఆదుకునే వారెవరూ కానరాని స్థితిలో ప్రజలకు మిగిలి ఉన్న మార్గమేమిటి ? ఆ సందర్భంలో ఆ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియజెప్పే కథే 'ఐదోస్తంభం'. విశ్రాంత అధ్యాపకులు మెట్టు మురళీధర్ రాసిన ఐదో స్తంభం కథాసంపుటి లోని మొదటి కథ ఇది !
అభివద్ధి ముసుగులో జరుగుతున్న అవినీతినీ, జీవన విధ్వంసాన్నీ, వీటి బారినపడి విలవిలలాడే బడుగు ప్రజల బాధలను వివరిస్తుందీ కథ. ఊరికైనా, కాలనీ కయినా రోడ్డు వస్తున్నదంటే సంతోషపడతారెవరైనా - కానీ రోడ్డు కంటే ముందు బుల్డోజర్ లు వస్తున్నాయని పైగా అవి తమ ఇళ్లను కూల్చడానికే వస్తున్నాయని తెలిస్తే బాధిత ప్రజల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? రోడ్డు అభివద్ధికి బదులు విధ్వంసానికి రాజ మార్గమై పేదలకు నిలువ నీడ లేకుండా చేయచూడడం, ఆ తర్వాత జరిగే ఇతర పరిణామాలు ఈ కథలో చూస్తాము.
ఎక్కడో నగరానికి దూరంగా వెళ్లనున్నట్లు సాక్షాత్తు ప్రభుత్వమే నిర్ణయించిన రింగ్ రోడ్డు హఠాత్తుగా జనావాసాల మధ్య కు వస్తున్నట్లు సమాచారం వస్తుంది. వస్తూ వస్తూ అది అనేక మలుపులు తిరిగి చివరికి పేదల పీకలకు చుట్టుకునే పరిస్థితి ఎదురవుతుంది. ఇదే పాయింట్ చుట్టూ కథంతా తిరుగుతూ ఉంటుంది. మొదట ప్రజలు దీనిని పుకారేమో అనుకుంటారు. అయినా వాళ్ళు అశ్రద్ధ చేయకుండా అంతా కలిసి అంతోయింతో వ్యవహార జ్ఞానం ఉన్న నారాయణ అనే వ్యక్తిని ఈ విషయంలో ముందు పెడతారు. నారాయణ నిజానికి పూర్వాశ్రమంలో రైతు.తన ఊరి భూస్వామి కుట్రకూ, స్వార్థానికీ బలై , విధి లేని పరిస్థితులలో తన పొలాన్ని అదే భూస్వామికి అమ్మివేసి,బతుకు తెరువు కోసం భార్య, ఇద్దరు పిల్లలతో, వట్టి చేతులతో నగరానికి వస్తాడు.పిల్లలిద్దరినీ చదివించుకుంటూ భార్యాభర్తలు ఇద్దరూ రెక్కలు ముక్కలు చేసుకొని ఈ కాలనీలో కొంత స్థలం కొనుక్కుని చిన్న ఇళ్లు కట్టుకుంటారు.కొడుకు ఇంటర్ ఫెయిల్ అయి ఆటో నడుపుతుంటాడు కూతురు ప్రస్తుతం పదవ తరగతి చదువుతుంటుంది. కాలనీ ప్రజలకు ప్రతీకగా రచయిత ఈ కుటుంబాన్ని ఎంచుకున్నారు.తమ కాలనీ మీదుగా రోడ్డు వెళ్లే వ్యవహారం నిజమో కాదో అనే సందేహ నివత్తి కోసం నారాయణ ఆధ్వర్యంలో కొద్ది మంది కాలనీ వాసుల బందం ఒకటి వెళ్లి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ అధికారులను కలుస్తారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రింగు రోడ్డు వీళ్ల కాలనీకి చాలా దూరం నుండి వెళుతుందని ఆ అధికారులు తేల్చి చెప్పుతారు. దీనితో కాలనీ వాసులు కొంచెం కుదుట పడతారు. అయినా అక్కడితో తప్తి చెందకుండా కమిషనర్ను కలుస్తారు. అతను తన వంతు సహాయం తప్పకుండా చేస్తానంటాడు. అలాగే స్థానిక ఎమ్మెల్యేను కూడా కలుస్తారు. అతడు సీఎం తో మాట్లాడి రోడ్డును కాలనీ నుండి పోకుండా చూస్తాను అని నమ్మకంగా చెబుతాడు. అక్కడి నుండి నేరుగా వెళ్లి పత్రికలవాళ్లను కలుస్తారు. వాళ్లు 'చూస్తాం - వార్త వే(రా)స్తాం' అంటారు. ఇంతమంది దగ్గర ఇన్ని హామీలు తీసుకున్న తరువాత కూడా- ఈ హామీలన్నీ గాలికి పోయి చివరికి రింగు రోడ్డు ఈ పేదల కాలనీ గుండానే వెళ్లడం ఖాయమని తెలుస్తుంది. ఆఖరి ఆశగా వీళ్లంతా కలిసి కూల్చివేతను ఆపడానికి స్టే కోసం ఒక లాయర్ ను సంప్రదిస్తారు. అతడు భారీ మొత్తం డబ్బులు కనుక ఇచ్చినట్లయితే స్టే ఇప్పిస్తాను అంటాడు. కాలనీ వాసులు అంతా కలిసి లాయర్ అడిగినంత డబ్బులు పోగేసి అతని చేతిలో పోస్తారు. అయితే డబ్బులు తీసుకుని కూడా ఆయన కాంట్రాక్టర్ కు అమ్ముడుపోయి చివరికి చేతులెత్తేస్తాడు. దీనితో సమస్య పరిష్కార బాధ్యత ను నెత్తికెత్తుకున్న నారాయణ పరిస్థితి దయనీయంగా మారుతుంది. అందరినీ కూడగట్టుకొని అతను చేయగలిగిన మేర అన్ని ప్రయత్నాలూ చేస్తాడు. అతని ప్రయత్న లోపం ఏమీ ఉండదు. కానీ ఫలితం మాత్రం కాలనీ వాసులకు అనుకూలంగా ఉండదు. ఎందుకంటే రింగ్ రోడ్డు కాంట్రాక్టర్ చాలా శక్తివంతుడు. అతడు ఎవరో కాదు, నారాయణ సొంత ఊళ్లో ఇతని భూములను బలవంతంగా లాక్కున్న భూ స్వామియే. అంటే అప్పుడు ఊళ్లో నారాయణ కుటుంబాన్ని దోచుకున్నదీ మళ్లీ ఇప్పుడు ఇక్కడ కాలనీ మొత్తాన్ని కబళించాలని చూస్తున్నది ఒకే వ్యక్తి .అతడే ఇతడు.అతడు ఎంత బలవంతుడుగా మారతాడు అంటే మాస్టర్ ప్లానును మార్చడానికి మాస్టర్ ప్లాన్ వేసి, దానిని పూర్తిగా తారుమారు చేయగలిగినంత! అప్పటికీ ఇప్పటికీ దోపిడీ చేసే వ్యక్తులు మారలే. దోపిడీ రూపం మారింది. కానీ దాని తీవ్రత ఇంకా పెరిగింది. ఇతను సమాజంలోని ముఖ్యమైన, అంటే శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలను దాదాపుగా ప్రభావితం చేయడమే కాకుండా ఈ విషయం పత్రికలలో రాకుండా కూడా జాగ్రత్త పడతాడు. పైగా తన భూముల నుండి పోవాల్సిన రింగ్ రోడ్డు రూటు మార్పించి ఈ పేదల కాలనీ ద్వారా వెళ్లేటట్లు మొత్తానికి చక్రం తిప్పుతాడు.దానిని కూల్చడానికి రంగం సిధ్ధం చేస్తాడు.
అప్పుడు అక్కడి ప్రజలు ఏమి చేస్తారన్నది ఆసక్తికరమైన అంశం! ప్రజాస్వామ్యానికి మూలమైన ఈ నాలుగు స్తంభాలూ ప్రజల సమస్యలను పరిష్కరించకుండా చేతులెత్తేస్తే, బాధిత ప్రజలు అనివార్యంగా ఐదోస్తంభాన్ని ఆశ్రయి స్తారని రచయిత ఈ కథలో చెబుతాడు. మనకు ఇప్పటివరకు నాలుగు స్తంభాల గురించి మాత్రమే తెలుసు కానీ ఈ ఐదోస్తంభం గురించి తెలియదు. ప్రజల ప్రతిస్పందనకు ఒక కొత్త పదాన్ని సష్టించి దానికి ఐదోస్తంభం అని పేరు పెట్టడం పాఠకులకు నిజంగానే ఆసక్తిని కలిగిస్తుంది. ఈ కథలో వస్తువు తెలిసినదే. ఇప్పటివరకు తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటిదే. అయినప్పటికీ ఈ కథ నడిపిన తీరు కొత్తది.ఐదోస్తంభం అనే పదం కొత్తది. ఈ పదం తెలుగు సాహిత్యంలో కొత్త పదంగా భవిష్యత్ లో నమోదు కానుంది. అందుకే ఈ కథ కొత్తదనాన్ని సంతరించుకున్నది. రచయిత మెట్టు మురళీధర్ కు ఒక ప్రత్యేకతను తీసుకు వచ్చింది. అందుకు ఆయన అభినందనీయులు.
- గుండెబోయిన శ్రీనివాస్,
9985194697