Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు రాష్ట్రాలలో కవిత్వం చదివేవారు, ఆల్ ఇండియా రేడియో అభిమానులు అందరికీ సుపరిచితమైన పేరు ఐనంపూడి శ్రీలక్ష్మి గారు. విశేషమైన విషయ పరిజ్ఞానం, అశేషమైన పరిశీలనా శక్తి, సునిశితమైన విషయ విశ్లేషణ క్షమత, మిదుమిక్కిలి గుండె నిండా తడి, సమాజంలో ముఖ్యముగా స్త్రీలు, బాలికలపైన జరుగుతున్న అత్యాచారాలపైన ఆక్రోశించి ఆవేదనను కవితాగ్ని గా మార్చి పోరాడే ధీరగుణం, అందరినీ కలుపుకుపోయి ఏకతాటిపై నడిపించే నాయకత్వ లక్షణం.. ఇలా ఎన్నో చెబుతూ పొతే... ఆవిడ ఒక philanthropist. ఆవిడ ఒక psychologist ఆవిడ ఒక humanist.
సమాజహితంలో కలం యొక్క పాత్ర అంతా ఇంతా కాదు, అని నేను కూడా గట్టిగా నమ్ముతాను. ఎన్నో ఉద్యమాలకు, మరెన్నో విజయాలకు కలం కారణమైంది. కత్తికన్నా పదునుగా పనిచేసింది, ఆలోచనల్లో స్పష్టతను, మనిషిలో మార్పును తెచ్చేది కవిత్వం, ఇది నిజం. సాహిత్యం సమాజానికి ప్రతిబింబం.
సమసమాజపు హితం తన మతంగా మార్చుకున్న శ్రీలక్ష్మి గారి అంతర్మధనం, దర్వాజా మీద చందమామగా ఆవిష్కతమైంది. ఈ కవితాసంపుటిని తన శ్రీవారికి, మనవళ్లకు అంకితమిచ్చారు.
''ఏ కవిత్వమైనా, ఎవరు వ్రాసినా సరే ఇష్టపడి చదువుతాను. నా రచనలు అందరూ అదే ఇష్టంతో చదవాలని కోరుకుంటాను'' అంటారు శ్రీలక్ష్మి .
ఇది అక్షరాలా నిజమై నన్ను ఈ చందమామా తాకాడు. ప్రతి అక్షరం ఆలాపన అయ్యేలా ఆలోచించేలా చేసాడు. అభ్యుదయ కవులకు గీతావాక్యం లాంటివి ఈ మాటలు.
ఇంకా అంటారు ''రాసిన అక్షరం కన్నా బలంగా రాయబోయే అక్షరం ఉండాలని ఆశిస్తాను'' అని!!
గాజులు తొడిగే చేతులు కత్తులు తిప్పగలవు, పూల పరిమళాలకు మురిసి కురుల ముడిసే ముదిత కొడవలెత్తి కోత కోయగలదు. ఇదే భావం వెలువరిస్తూ
''ఇపుడు పూలన్నీ
మార్చ్ ఫాస్ట్ చేస్తున్న సైనికుల్లా
ఒకదాని పక్కనే ఒకటి వరుసగా పేర్చుకుని
ఒక మహాప్రాకార నిర్మాణానికి ఇటుకలుగా మారతాయి
తెలంగాణాలోని ప్రతి ఇంటా
ఓ పూల పిరమిడ్ని సష్టిస్తాయి ఏళ్ళనాటి స్వప్నానికి సరికొత్త జీవం పోస్తాయి...
పూలు లలితం - నిర్మలం
కానీ పూవులన్నీ కలిసి
కత్తుల వంతెనగా మారిన దశ్యం ఇది
పువ్వులన్నీ నిలిచి
ఉద్యమ గొంతుకగా నినదించిన క్షణం''
అంటూ... ''గల్లీ గల్లీలో వెల్లువెత్తిన పూరేకుల ఆయుధం ''ఇప్పుడు బతుకమ్మ ప్రపంచంపై పొడిచే సరికొత్త సూరీడు'' అంటూ.. సుకుమార సున్నితత్వమే కాదు బతుకమ్మ ఉద్యమ కారిణి అని ప్రూవ్ చేశారు. ఇదీ వీరి కవితా శిల్పంలోని ప్రత్యేక తీరు.ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్గా తన వత్తి యెడల తనకున్న అవాజ్యమైన ప్రేమను, అంకితభావాన్ని ఇలా ప్రెసెంట్ చేశారు ''స్వరచాలనం''లో.
''గాలి నుంచి గుండెల్లోకి
ఆకాశవాణిగా కురిసే స్వరధారను నేను గొంతులో విశ్వాన్నంతటని ముడ్చుకుని
ఎదలోతుల్లోంచి ఉబికొచ్చే స్పందనలతో మైకు ముందు మాటల విత్తనాలను చల్లుతుంటాను
మనోతంత్రుల్ని మీటి మాట కచేరీలుగా మార్చి
ఉగ్గుపాల ఉంగా ఉంగాల్ని వాక్యాలుగా కూర్చి
స్వరామతాన్ని నిస్త్రంత్రుల వేదికగా పేర్చి
మబ్బు తీగల్ని మీటిన సూర్యుడిని అవుతాను ప్రతీరోజు ఉషాగీతాన్నై ఉదయిస్తాను
ప్రతీ హదయాన్ని మాటలతో స్పర్శిస్తూ ప్రాతఃకాల పరివర్తనకు ఆదినర్తనమవుతాను'' ఎంత అందమైన ప్రతీకల సౌందర్యం చదువరులకు దశ్యం చూస్తున్నట్టు ఆ మాంత్రిక స్వరాన్ని వింటున్నట్టే ఉంది.
చివరగా... ''సహమానవా -
ఎన్ని ఎత్తులు ఎదిగినా - ఎన్ని రూపులు మారినా ఎన్ని ఋతువులు కరిగినా ఎన్ని జన్మలెత్తినా
స్వరమే నా చిరునామా
స్వరమే నా ఆఖరి వీలునామా !''
అంటూ.. తన సిగేచర్ చేసేసారు!
ఇక ''నెమలి కన్నులో'' ఆమె ఒంపుకున్న బాల్యం చాలా మందికి మరిచిపోయిన తమ బాల్యస్మతులను యాదికి తెస్తది. అంతేకాదు నెమిలీక పెరుగుతుందన్న బాల్యపు అమాయకత్వాన్ని ప్రౌఢగా మారాక దానికి ఇచ్చిన ముగింపు ఒక శంగారనైషధం అయిపోయింది.''
దర్వాజా మీద చందమామలోని మొత్తం ముప్పై ఆరు కవితలు, ముప్పై ఆరు విశిష్టమైన భిన్న అంశముల సమాహారములు.
స్త్రీమూర్తి ప్రసవ వేదన గురించి, అమ్మతనం గురించి ఎన్నో కవితలు వచ్చాయి ఇప్పటికే.. అందులో శ్రీ లక్ష్మి ''బర్త్ రేప్'' కలికి తురాయి అనాలి. అమ్మను ఆవిష్కరించిన తీరు, అమ్మగా మారే పడతి ప్రసవ వేదన ఎంతలా కదిలిస్తుందంటే.. ఈవిడ ఏడిపించేసారు.
చెరుకు గడ రూపాంతరం చెందే విధానాన్ని వీరు వర్ణించిన తీరు, వాడిన ప్రతీకలు చాలా మస్తుగుంటయి. ''ఆడబిడ్డ గోస'' బాంచన్ కాల్మొక్త అనే దొరతనం పైన ఎదురుదాడి, నవచైతన్య శంఖారావం.
అందమైన మగువల క్యాట్ వాకులేమో గానీ కనుమరుగై పోతున్న పిట్టెలు.. అదే పిచ్చుకల బర్డ్ వాక్ ని భలేగా చూపారు తమ ''గూడు చెదిరిన పిట్టె''లో..!
''పిచ్చుకను దూరం చేసుకోవటమంటే
ప్రేమను దూరం చేసుకున్నట్లేకదా
వేకువపై చీకటి తెర దించినట్లేకదా
మేమెలా మర్చిపోతాం మా ఊరిపిచ్చుకని !
మేమెలా మర్చిపోతాం మా ఊరినెచ్చెలిని !!''..
ఇక ఈ సమీక్ష రాయడానికి నన్ను కారణభూతురాలిని చేసిన కవిత... శీర్షిక ఏంటబ్బా అనుకుని ఆసాంతం చదివించి, కంటతడి పెట్టించిన కవిత.. జోగినీ వ్యవస్థపైన కవయిత్రి సంధించిన పాశుపతాస్త్రం ''తెగిన ఆకాశం''
''గజ్జెలు కట్టిన కాళ్ళు మావైనప్పుడు కాయం మాదికాకుండా పోదుగా దొరా
మాతో ఆడేందుకు చందమామే నేల మీదకు వంగుతుంది.
నాలుగు నుడుగులు పాడేందుకు
ఊరికాల్వ జనపదంలోకి జారుతుంది
పల్లెకు పావడా కట్టింది మేమే సిగ్గుకు తొలిరైక తొడిగింది మేమే''
''కంటికి ఆనితే చాలు
దేవుడి భార్యను సైతం ఊరు సాక్షిగా దోచుకుంటారు.''
''సాంప్రదాయపు తడిగుడ్డతో
మా గొంతుల్ని కోస్తున్నా గడకొయ్య పడున్నాం'' అని నిక్కచ్చిగా నిర్భయంగా నిజం చెప్పారు. అలిశెట్టి ప్రభాకర్ ''వేశ్యకవిత'' కవితా వాక్యాలు గుర్తుకొస్తాయి.
George orwell రాసిన ironic poem
»»When I was young and had no sense
In far-off Mandalay
I lost my heart to a Burmese girl
As lovely as the day.'' కూడా ఆమెలోని మనసు పడే వేదనను ప్రెసెంట్ చేస్తది. అట్లని ఏమి ఊరుకోదు శ్రీలక్ష్మమ్మ.. ఆమె గుండె నిండా దయనే బుర్రనిండా సమస్యలకు సమాధానమే.. అందుకే చెబుతుంది ఆ తల్లి ఆ అభాగినులను భాగ్యవంతులై స్వతంత్రులై జీవించమనీ..
''సమాజాన్ని సానపెట్టే ఆకురాళ్ళమై కాల్చే గ్రీష్మం కనుమరుగయ్యే క్షణం కోసం కన్నీళ్ళతో కాదు కన్నెర్రతో ఎదురుచూస్తున్నాం
చేవ చచ్చికాదు చైతన్యంతో నిల్చున్నాం''..అంటూ ముగిస్తారు.
ఒక కవికి భావుకత ఉంటే సరిపోదు, స్పందించే హదయంతో బాటు పొందికగా ఆ భావాన్ని అక్షరీకరించి పాఠకుల కనుల వాకిటిలోంచి హదయమందిరం లో చేరి మేధస్సు పీఠం పైన పీటవేసుకుని, స్థిరంగా ఉండిపోవాలి. చదువరుల అసలొచనల్లో మార్పు తేగలగాలి, దీనికి కవికి ఏంతో విషయ పరిజ్ఞానం అవసరం, ప్రపంచం గురించి కూడా తెలుసుండాలి. శ్రీలక్ష్మి కవితా వస్తువులను పరిశీలిస్తే.. ఆ విషయం స్పష్టం అవుతుంది.
ప్రపంచపటంలో ఆవిడ తన కన్ను పెడతది, అందులోని విషయాలు తన పెన్నులో కూర్చి, పాఠకుల హదయపు కాగితం మీద చిత్రిస్తది.
''నో మోర్ ఐడిల్'', ''అనాది గీతం'' లో పదాల కూర్పుతో బై లింగ్వల్ విన్యాసంతో జుగల్బందీ చేయించారు.
మచ్చుకు... ''ఒక్క గండు కోయిల కుట్రబాజీ లాబీయింగ్ కీ బక్క కోయిలల 'బీయింగ్' కీ మధ్య
ప్రత్యక్ష యుద్ధ భీభత్సంలా వుంది ఎప్పుడూ చరిత్ర ఒక్కటే చెప్పింది ప్రతీ పోరాటంలో
కొన్ని త్యాగాలు, ఇంకొన్ని ఆలస్యాలు జరిగినా చివరికి ప్రజల ఆకాంక్షే నిజమవుతుందని బక్క కోయిలలే గెలుస్తాయని.''
పౌర్ణమి జ్ఞాపకం, సంభాషణలల్లో ఏంతో వెతుక్కోవొచ్చు, ఎందరో తమను తాము, తడుముకోవచ్చు. ఎన్నో ఫ్రస్ట్రేషన్స్ కి సమాధానం దొరకబట్టుకోవోచ్చు. 'ఏమో.. గుర్రమెగరావచ్చు'
రాధా గోపాళం సినిమాలో ''జడ పదార్థ మీ జడ...'' అని పాట రాసిన సినీ కవిగారు మన శ్రీలక్ష్మమ్మ రాసిన జడల జాడలు చదువాల్సిందే.. అన్నంత గొప్పగా రాశారు.
ఫేస్బుక్ పరిచయాలు, కాల్ సెంటరే కష్టాలు, తనను మలచిన ఊరు గురించీ ఇలా ఎన్నో.. ఎన్నెన్నో అంశాలు వీరి కథా వస్తువులు. అన్నీ ఐనంపూడిగారి కలంలో దూరి సార్థకమయ్యాయి. నాణాలకు నోట్లకు పోలిక ఇస్తూ చివరాఖరున నాణాలను దేవాలయాలకు, నోట్లను వేశ్యావాటికలకు పంపించేశారు. వీరి కవిత్వంలో మరో గొప్పతనం వీరెంచుకుంటున్న శీర్షికలు.
ఎన్నో అద్భుతమైన రచనలు, సంపాదకత్వాలు, అక్షరయాన్ ద్వారా 500 మందికి పైగా దేశ విదేశాలలోని విమెన్ రైటర్స్కి వేదికనిచ్చి అనవరతమైన సాహితీ సేవ చేస్తూ అందరినీ ఏకతాటిపైన నడిపిస్తున్నారు, అంతేకాదు ఇప్పుడు అక్షరయాన్ బాలికా విభాగం కూడా మొదలుపెట్టారు. షీటీం, భరోసా ద్వారా కూడా మహిళా రచయిత్రులను ప్రోత్సహిస్తూ.. అందరి ఉన్నతిని కాంక్షించే అందాల మనసున్న మా లచ్చిమి ఈ శ్రీలక్ష్మి.
నిస్వార్ధం, నిరంతర తపన సమాజ హితం మహిళా బాలికా భద్రత ఈమె చిరునామా..!!
చివరగా... అది ఏ సమస్య అయినా నిస్పహతో ముగింపు నివ్వరు, చక్కని సమాధానం, పరిష్కారం చూపిస్తారు. ఈ సొసైటీ కి ఇదే కావాలి. Sucidal tendency ఉన్న యువత వీరి కవిత్వం చదవాలి. వాళ్లకి కర్తవ్యబోధ అవుతుంది.
అందుకే... ''సమస్యలపైన సమాధాన ఖడ్గం ఐనంపూడి కవితా కలం'' అక్షరానికి అవసరనైవేద్యం ఐనంపూడి కవితాలయం. సమ'కాలిన' సమస్య లకు సరైన అయింట్మెంట్ అయినపూడి కవిత్వం.
- రమాదేవి కులకర్ణి
8985613123