Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమసమాజపు ఆకాంక్ష, ప్రజ లందరూ బాగుండాలనే చల్లని తలంపు.. ఈ రెంటిని వ్యావసాయిక పదబంధాలతో కవిత్వం చేసిన తీరు పైపంక్తుల్లో కనిపిస్తుంది. 76 కవితలతో నిండిన కవితా సంపుటి 'ఎద్దు ఎవుసం సురుకుల వైద్యం' నిండా ఈ భావననే గుబాళిస్తుంది. కవి గులాబీల మల్లారెడ్డి.
ఈ సంపుటికి ముగ్గురు పేరొందిన విమర్శకులు ముందు మాట రాశారు. కత్రిమ ఆలోచనల, భావజాలాల, పదబంధాలతో కాకుండా సకలజనుల మానవతా హదయంగమంగా, సారళ్యంగా కవిత్వం రాసే సేంద్రీయకవిని మల్లారెడ్డిలో చూశారు ఒకరు. వర్తమాన స్థితిగతుల చలనశక్తుల పట్ల లోతైన అవగాహనతో సుప్త జ్ఞాపకాలను తలపోసే కవిని దర్శించారు ఇంకొకరు. కవిలోని ధిక్కార సుగుణాన్ని మెచ్చుకున్నారు మరొకరు. న్యాయవ్యవస్థ, క్యాంపస్, బస్సు, కశ్మీర్, తెలంగాణ, ఫుట్ పాత్, కవిత్వం, కరోనా ఇలా విభిన్న కవితావస్తువులున్నా ప్రధానంగా రైతు, పల్లె, చెఱువు, చెట్టు, వ్యవసాయం, వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయిక పదబంధాలతో కూడిన పచ్చటి కవిత్వమే కనిపిస్తుంది సంపుటి నిండా. మొత్తంగా సంప్రదాయిక వ్యవసాయిక జీవనచిత్రణని చూస్తాం. భాషలో, వ్యక్తీకరణలో గ్రామీణ జీవన నేపథ్యాన్ని చూస్తాం.
ఈ సంపుటి ద్వారా కవి తను చిన్ననాడు చూసిన వ్యవసాయాన్ని, ఆనాటి వ్యవసాయ సంస్కతిని గుర్తుకు తెచ్చుకుంటాడు. అందుకే ''ఎవుసమంటే మనం బతికి నలుగురికి బతుకునివ్వటం/ పలువురిని సాకి సవరించటం'' అంటాడు. వ్యవ సాయంలో సాయాన్ని, వ్యవసాయం పట్ల అవ్యాజమైన ఇష్టాన్ని కలిగిఉన్న కవిగా మల్లారెడ్డి కనిపిస్తాడు. మార్కెట్ శక్తులు విజభించి వ్యవసాయాన్ని ఒక సంస్కతిగా కాకుండా ఒక వ్యాపారంగా మార్చేసి మానవ జీవితాన్ని అతలాకుతలం చేసిన తీరుని ఆనాటి వ్యావసాయిక పని ముట్లతోనే అన్యాప దేశంగా చెప్పిస్తాడు.
''నేనిప్పుడు ఎవ్వరికీ అక్కరకు రాని
ఒకానొక మోటబొక్కెనని
ఒకప్పుడు తెలంగాణ పల్లెల్లో
మూలమూలల్లో నాదే హవా''
ఇలా అనేక కవితల్లో ఆనాటి పనిముట్ల సామాజిక, వైయక్తిక ఉపయోగాల్ని కవితగా మలుస్తూనే తెలంగాణ పల్లె జీవితాన్ని చిత్రిస్తాడు. అంతేకాదు తెలంగాణ ఉద్యమ పోరాటగాథల్ని చొప్పిస్తాడు. ''1969లో కరీంనగర్ జైలుగోడల్లో సైతం/ పోరాటయోధులే ఎద్దులా మారి నన్ను సంబురంగా లాగేవారు'' అంటూ చరిత్రను నిక్షిప్తం చేస్తాడు. తుదకు ''నా నామరూపాలే తెలియవు/ ఈ తరం చిన్ని నాన్నలకి చిట్టి తల్లులకి'' అని అవి కనుమరుగైన వైనాన్ని మన కళ్ళముందుంచుతాడు. అంతేకాదు పదిమందిని బతికించేదనే సంగతి పక్కనబెడితే రైతు తనను తానే బతికించుకోలేక వ్యవసాయాన్ని వదిలేసి వలసబాట పట్టిన దుస్థితిని పొలంబావి స్వగతంగా ఆర్ద్రంగా కవిత్వీకరిస్తాడు.
''నాలుగు తరాల ముందు పుట్టి ఎందరెందరికో జీవనాధారమై
తుదకు నాకు అండగా ఉండాల్సిన రైతుబిడ్డలు వలసబాట పట్టారు
నేను ఊపిరి బిగపట్టి ఏడ్చిఏడ్చి ఎండిపోయాను
పాడుబడిపోయాను''
పల్లె వ్యవసాయానికి ఆదెరువైన చెరువుని అమ్మగా, జగన్మాతగా భావిస్తూ అంతమయిపోయిన చెరువులను తలుచుకుంటూ వేదనతో ఇలా అంటాడు.
''ఈ కొడుకు ఆదరించక కనికరించక వదిలేస్తే
అకాల వార్ధక్యపూ ఛాయలతో
నిలువెల్లా గాయాలతో
అల్లాడిపోయింది చెరువు''
బీడువడ్డ భూమిని ''ఒళ్ళంతా నీటి ఎద్దడి గాయాలు'' అంటాడు. వ్యవసాయాధారిత జీవితం కష్టమవటమే కాదు దాని చుట్టూరా ఉన్న సమాజపు వ్యాపారపు పోకడలను రైతు ఆత్మహత్యతో ముడిపెట్టి హదయాన్ని కలిచివేసే కవిత రాస్తాడు మల్లారెడ్డి.
''కల్తీ పురుగుమందు కడతేర్చలేదు
ఉన్న పొలం అమ్మి ఇల్లు అమ్మి
కార్పొరేట్ హాస్పిటల్ ఖర్చులు కట్టి
ఉన్న నల్గురం...వస్తున్నాం
దేవుడా...! నీ దగ్గరికే వస్తున్నాం''
కవి ధ్యాసంతా ఎప్పుడు పల్లెమీదే.
''నా వాళ్ళంతా నాగళ్ళకు శిలువ వేయబడి
తరతరాలుగా నెత్తురుని అంతకంటే అమూల్యమైన చెమటని
సమాజం కోసం ధారవోస్తున్నప్పుడు
నేనొక్కడిని స్వార్థంతో
శవంలాంటి మనిషిలా బతకలేకున్నాను''
అందుకే ఈ యాంత్రిక జీవితాన్ని తప్పించుకొని పల్లె పొలిమేరల్లోకి వెళ్ళి నా వాళ్ళతో కలిసి కోయిలనై కొత్తగానం చేస్తానంటాడు.
''నన్ను ఆడమనిషిగా పుట్టించకు ప్రభూ
రాయినో రప్పనో చేయి చెట్టుచేమనో చేయి
తిర్గెన్నటికి నీ పాదధూళీతో ఆడమనిషిని చేయకు''
నేటి సమాజంలో స్త్రీ దైన్యస్థితిని ఏకరువు పెడుతూనే 'రంగిలోనూ సమ్మక్క రక్తమే' అంటూ తెలంగాణ స్త్రీ శక్తితత్వాన్ని ఒక అందమైన కవితగా మలుస్తాడు మల్లారెడ్డి.
కవి స్వయానా న్యాయవాదయ్యుండి ''ఎకరం భూమి దక్కాలంటే/రెండెకరాలుఅమ్మాలా'' అంటూ న్యాయవ్యవస్థపైనే పదునైన ప్రశ్నాస్త్రాన్ని సంధిస్తాడు. సమాజాన్ని సునిశితంగా గమనిస్తూ కవిగా తనదైన వ్యాఖ్య చేస్తాడు. అందుకే అక్రమాల నయీం కథని ''సరికొత్త హైబ్రిడ్ వంగడం నయీం/అందుకే పుట్లకొద్ది అక్రమాలరాసులు'' అంటాడు. పశుకామంతో పెట్రేగి పోతున్న ధనికవర్గ యువత వ్యవస్థలోని లొసుగులను ముసుగులుగా చేసుకొని చట్టం చేతికి చిక్కకుండా తప్పించు కోవడాన్ని ''చలిచీమల నోటికి చిక్కినా/చావని రాజకీయ కవచం పొందాడు వాడు'' అంటాడు. చైతన్యాన్ని వదిలేసి రోబోగా మారి ఒంటరైపోతున్న మనిషి గురించి ''ఒకప్పుడు ఎవరికి గాయమైనా గేయమై పాడినోడు/వలవల ఏడ్చినోడు/ ఇదేంటి మూగగా చూస్తున్నాడు'' అని వేదన చెందుతాడు.
'పెద్ద బాడిసె నివేదన' కవితలో ''బాడిసె'' పదాన్ని, 'కర్షకుడు' కవితలో ''వాడు'' పదాన్ని పదేపదే
వాడకుండా ఉంటే ఆ కవితలు మరింత బిగువుగా ఉండేవనిపించింది. 'ఎద్దు నెమరు' కవిత 'పనిగల్ల ఎద్దు' కవితకి కొనసాగింపు కవితలా అనిపించింది. కొన్ని వాక్యాలు యదాతథంగా ఉన్నాయి. కవితే నెమరువేత కవిత కాబట్టి పెద్ద లోపంలా అనిపించలేదు. 'న్యాయవ్యవస్థపై నానీలు' శీర్షికన కవితలో ఉన్నవి నానీల రూపులో కాకుండా వచన కవితాలాగే ఉన్నాయి.
''కవిత్వాన్ని రాయడమంటే
మానవత్వానికి సుప్రభాతం పాడటం
మంచితనాన్ని సంకీర్తనం చేయటం
అక్షరాన్ని టార్చ్ లైట్ చేసి దారి చూపటం
అవసరమైతే దారిగా మారడం''
అని నమ్మే మల్లారెడ్డి 'ఎద్దు ఎవుసం సురుకుల వైద్యం' సంపుటినిండా నిజాయితీతో కూడిన అక్షర ఎవుసాన్ని, సురుకుల వైద్యాన్నే చేశాడు.
- రాపోలు సీతారామరాజు,
7032358550