Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్లో నేను ఎం.ఏ. తెలుగు చదువుతున్నపుడు ఉస్మానియా క్యాంపస్లో ప్రతి ఉదయం అలిశెట్టి 'సిటీ లైఫ్' కోసం కండ్లు నలుచుకుంటూ నిద్ర లేచే వాళ్ళం. ఆంధ్రజ్యోతి దినపత్రిలో అలిశెట్టి ప్రభాకర్ ఐదారు లైన్ల సిటీలైఫ్ కవిత ఎందరినో సమ్మోహన పరిచేది. ఆనందం, ఆవేశం, ఆక్రోశం అన్నీ కలిపి అలిశెట్టి వర్తమాన సమాజాన్ని కడిగి పడేసేవాడు. రక్త రేఖ, సంక్షోభ గీతం, ఎర్ర పావురాలు, లాంటి వచన కవితా సంపుటాలతో తెలుగు సాహిత్యంలో ప్రముఖ కవిగా పేరుగాంచినా, సిటీలైఫ్ మినీ కవితలతో మాస్ పబ్లిక్కు, ముఖ్యంగా యువతకు మరింత దగ్గరైండు.
అనుకోకుండా ఒక రోజు నామిత్రుడు గోపి కిషన్ సింగ్ ఎల్.ఎల్.బి. విద్యార్థి. ఇప్పుడు లాయర్ నన్ను అలిశెట్టి ఇంటికి తీసుకెళ్లిండు. గోపి కిషన్తో అప్పుడప్పుడు అలిశెట్టి ఇంటికి వెళ్లడం వల్ల మా పరిచయం మరింత గట్టి పడింది. అలిశెట్టిని కలిసినప్పుడల్లా ఏదో ఒక కవిత నగిషీలతో తొణికిసలాడేది. కవితకు తగిన భావంతో బొమ్మ గీసేవాడు. వచ్చిపొయ్యె వారు దాని పుట్టుపుర్వోత్తరాలు చర్చించుకునేవారు.
కల్లోల కరీంనగర్లో 1954లో జన్మించిన అలిశెట్టి పేదరికం చివరంచుదాకా చివరి శ్వాస దాకా చవిచూసిండు. ఫొటో గ్రఫీ, కవిత్వం రెండూ అతనికి పిచ్చిప్రేమ. చిత్రమైన జీవితాలను, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, మస్కట్, దుబాయి వలసబతుకుల గోసలను చిత్రాలుగా మలిచిన గొప్ప అక్షర శిల్పి అలిశెట్టి. అస్తిపంజరంలో శ్వాస తప్ప ఏమీలేని శరీరం,ఉంగరాల క్రాఫింగ్, ఐదు నిమిషాలకు ఒకసారి తెమడ దగ్గు, ఆయాసం, ఈ క్షయవ్యాధి అతన్ని రోజూ కొంచెం కొంచెం కొరుక్కు తింటున్నా అతనిలో కవిత్వ జిజ్ఞాస తగ్గలేదు. కవిత్వమే అతని కుటుంబాన్ని బతికించింది. సినిమా డైరెక్టర్లు ఎందరు వారించినా వినలేదు. ఒక్క వ్యాపార పాటా రాయలేదు. అతని కవిత్వ నిబద్ధతని చంపుకోలేదు. అతని కవితలు వేమన పద్యాల్లాగా బాణాల్లాగా గుచ్చుకుంటాయి. బుల్లెట్ లాగా దూసుకెళ్తాయి. అందుకే అతడు దోపిడిలేని సమాజాన్ని కోరుకునే వారికి ఆత్మీయుడైండు.
మామూలుగా ఒక రోజు నల్లకుంటలో ఉన్న ప్రభాకర్ ఇంటికెల్తుంటే అతని ఇంటి దగ్గర కారు మీద చెయ్యి పెట్టి నిల్చున్న తెల్లటి పెద్ద మనిషి నన్ను పిలిచి ''అలిశెట్టి ప్రభాకర్ ఇల్లు ఎక్కడుంది'' అని అడిగిండు. నేనూ అతని దగ్గరకే వెల్లున్నా అదిగో అ కనబడేదే. రండి అంటూ తీసుకెళ్లిన. ఇద్దరం ప్రభాకర్ ముందు కూర్చోని మాట్లాడుతున్నాం. ''నీ సిటీలైఫ్ కవితలు నన్ను చాలా కదిలించినయి. అవి నాకెంతో నచ్చుతున్నయి'' అన్నాడు. చాలా థాంక్స్ సర్ అన్నడు ప్రభాకర్. ''ఏం జెయ్యాలే సార్. ఈ కవిత్వమే నా కుటుంబాన్ని నడిపిస్తున్నది'' అనగానే ఆ డాక్టరు కండ్లు, నా కండ్లు కన్నీళ్లతో నిండిపొయ్యాయి. ''నేను ఉస్మానియా జనరల్ హాస్పిటల్ డాక్టరుని. నీకున్న టీబీని నయం చేసే ప్రయత్నం చేస్తా. వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అయిపోండి'' అనగానే, ఈ కవితలు రోజూ రాసి పంపిస్తే ఆంధ్రజ్యోతి వాళ్లు నెలకు తొమ్మిది వందలిస్తున్నారు. నేను హాస్పిటల్లో ఉంటే ఇక్కడ నా భార్యా ఇద్దరు కొడుకుల పరిస్థితి ఎట్లా?'' అని జవాబిచ్చాడు. డాక్టర్ ఎంత సర్ది చెప్పినా వినలేదు. చాలా సార్లు అతని మిత్రులు ఆత్మీయులు చాలా ప్రయత్నం చేసినా వినలేదు. గంట కాలంలోనే ఒక ప్రజాకవి జీవితాన్ని పరీక్షించిండు డాక్టరు. అతను వట్టి ప్రభాకరుడు కాదు కదా! నిబద్ధత కవి, నికార్సైన విప్లవ కవి. ఈ డాక్టరు తీరే జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్. ఇతని కవిత్వాభిమానియై ప్రభాకర్ ఇద్దరు పిల్లల్ని హైస్కూల్ దాకా ఉచితంగా చదివించాడు.
అప్పుడు నేను ఎం.ఏ., చదువుతూనే ఆకాశవాణి హైదరాబాద్ యువవాణిలో కాజువల్ అనౌన్సర్ కమ్ ప్రొడక్షన్ అసిస్టెంటుగా పని చేస్తున్నాను. ఒక రోజు ప్రభాకర్ వద్దన్నా ఒప్పించి రేడియో స్టేషన్కి తీసుకెళ్లి ఇంటర్వ్యూ చేశాను. అలిశెట్టి ప్రభాకరంటే సినారె, శేషేంద్ర లాగా హుందాగా, ఠీవిగా ఉంటారనుకున్నారు. కాని అతన్ని చూడడానికి గుమిగూడిన ప్రోగ్రామ్ ఆఫీసర్స్, సిబ్బంది ఆశ్చర్యపోయారు. మెట్ల ద్వారా పైకి వెళ్లడానికే అరగంట సమయం పట్టింది. అలిశెట్టి గారిని వారంతా ప్రత్యేకమైన అభిమానంతో మంచి నీళ్లు, టీ తెప్పించి మా ఇంటర్వ్యూ అయ్యేదాక అక్కడే ఉండిపోయారు. అతనికొచ్చే ఏఐఆర్ డబ్బుల సంగతి గురించి నారాయణ నాకోసం ఎందుకింత తండ్లాడుతున్నవ్ అన్నడు. తరువాత అతన్ని సిబ్బంది గేటు దాకా వచ్చి వీడ్కోలు పలికారు. అప్పుడప్పుడు అలిశెట్టి సిటీ లైఫ్ పుస్తకాలను తీసుకొచ్చి ఆదిలాబాద్లో అమ్మి డబ్బు ఇచ్చేవాణ్ణి. ఒక కవికి అభిమానిగా ఇంతకన్నా ఏమి చేయలేకపోయాను.
అలిశెట్టి మరణించడానికి వారం రోజులు ముందు చాలా ఇబ్బంది పడ్డాడు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి పోయింది. అయినా కవిత్వం రాయడం మానుకోలేదు. చివరి దినాల్లో ''గుండె నిండా బాధ కళ్లనిండా / నీళ్లున్నప్పుడు / మాట పెగలదు కొంత సమయం కావాలి దట్టంగా కమ్ముకున్న విషాద మేఘాలు చెల్లాచెదురై / హృదయం నిర్మలాకాశం కావడానికి కొంత వ్యవధి కావాలి / భారమవుతున్న ఉచ్ఛాసనిశ్వాసల మధ్యే / మృత్యువును పరిహసించేందుకు ఒకింత సాహసం కావాలి'' అంటూ మరణానికి ముందు తన శారీరక మానసిక ఇబ్బందుల్ని ధైర్యంగా చెప్పాడు. తన జీవితంలో పూర్ణాకాశమైన భార్య భాగ్యం గురించి చివరి దినాల్లో ''తెర వెనుక మృత్యువు / తేలగా కదలాడుతున్నట్టు / తెరలు తెరలుగా దగ్గు / గుండెల్ని పిండేస్తుంటే / తెగిన తీగను సవరించడానికన్నట్లు / తెల్లవార్లు సపర్యలు చేసే / నా భాగ్యమే / నా కన్నీళ్లను తూచే / సున్నితపు త్రాసు'' అన్నాడు.
1993 జనవరి 12వ తేదీన అలిశెట్టి మరణ వార్తను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం విషాదంగా చెప్పగానే ఎక్కడలేని దు:ఖం సాహితీ లోకాన్ని ఆవరించింది. ''మరణం నా చివరి చరణం కాదు అని నిర్భయంగా నిష్క్రమించాడు. తెలుగు సాహితీ లోకాన్ని ఎంతో ప్రభావితం చేసిన ప్రభాకర్ మన మధ్య లేకపోయినా ''తనువు శవమై ఒకరివశమై / తాను పండై ఒకరికి పండై / ఎప్పుడూ ఎడారై / ఎందరికో ఒయాసిస్సై'' కవిత రోజూ ఏదో ఒక సాహితీ సభలో వినిపిస్తూనే ఉంటుంది. ప్రభాకర్ నిష్క్రమించినా అతని అక్షరాలు రగిలిస్తూనే ఉంటాయి. అందుకే అతడు అక్షర ప్రభాకరుడు.
(12.01.2021 అలిశెట్టి జయంతి, వర్థంతి సందర్భంగా)
- డా|| ఉదారి నారాయణ,
9441413666