Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాహిత్యం అంతిమ లక్ష్యం మనిషే. ఒక కథను, నవలను చదివినపుడు సమాజ మార్పును గమనించాలి. మనిషి తన గమ్యాన్ని మార్చుకునేలా ఆ సాహిత్యం ప్రభావితం చేయాలి. అట్లా సగటు మనిషిని అతలాకుతలం చేసి సమూలంగా సంస్కరించే కథా సంకలనం ఇటీవల సింగిడి తెలంగాణ రచయితల సంఘం సంగిశెట్టి శ్రీనివాస్, డా|| వెల్దండి శ్రీధర్ సంపాదకత్వంలో వెలువరించిన 'రూబిడి' తెలంగాణ కథ - 2019. తెలంగాణ నుంచి ప్రతియేట వచ్చిన కథల నుంచి కొన్ని మెరుగైన కథల్ని సేకరించి గత ఏడు సంవత్సరాలుగా ఈ సంపాదకులు ఈ పని చేస్తున్నారు. ఇదొక వర్తమాన చరిత్రను రికార్డు చేయడంగా భావించాలి. రూబిడి అంటే నిర్ధారణ, నిరూపణ, సాక్ష్యం అనే అర్థాలు జన వ్యవహారంలో ఉన్నాయి. తెలంగాణ నుంచి వస్తున్న కథల్లో సహజంగా ఆవేదన, ఆర్థిక దోపిడి, కులమతాల అసమానతలు, పేదరికం, వారసత్వ ఎత్తుగడలు, భూమి సమస్యలు, మానవ సంబంధాల విధ్వంసం కనిపిస్తాయి. వీటన్నింటికి 'రూబిడి'గా నిలిచే కథా సంకలనం ఇది. అయితే అనుభూతి, ఆశ, ఎదుగుదల, సంతోషం తదితరాల అవసరం మనకు లేదా? ఎప్పటికీ, ఎన్నటికీ ఉనికి, అస్తిత్వ ఆరాటాలేనా? అని నేటి తెలంగాణ కథను చదివినపుడు అనిపిస్తుంది.
ఏదేమైనప్పటికీ 'రూబిడి' కథా సంకలనం నేటి తెలంగాణ సమాజ ప్రజల ఆలోచనలకు ప్రతీక. కథకులు నిలదొక్కుకుంటున్నా రనడానికి సూచిక. తెలంగాణ ప్రజల చిక్కుముడి విప్పుటకు వేదిక. తెలంగాణ సమాజాకాశం మీదికి విసిరిన ఒక పన్నెండు రంగుల మిశ్రమ సింగిడి. ఒక్కో కథ ఒక సమకాలీన సమాజ వర్ణచిత్రం. సమాజంలోని ప్రజల ఆలోచనల పక్క నిలిచి వినిపించిన ఒక ధర్మాగ్రహం. సుదీర్ఘ సంభాషణలకు తావివ్వకుండా, కథకు అనుగుణంగా పాత్రలను మలిచి నిలిచే కథలు ఈ రూబిడిలో ఉన్నాయి. కథా నిర్మాణంలో గత యాభై సంవత్సరాల చరిత్రను చదివి, నిన్న మొన్నటి వరకు ఉద్యమ కథలను చదివి నెమరు వేసుకుంటున్న తత్త్వం ఈ కథల్లో కొంత కనిపించింది. ఇది అన్ని కథలకూ వర్తించే సూత్రీకరణ కాదు. తెలంగాణ భాష వాడుక భాష. మన భాష. మనం నివసించే ప్రాంత భాష. అని బలంగా నాటుకుపోయిందీ కథల్లో. పాలమూరు జిల్లా నుంచి మొదలు పెట్టి ఆదిలాబాద్ జిల్లా దాకా ఏ జిల్లా రచయిత ఆ జిల్లా భాషను చాలా సమర్థవంతంగా ప్రయోగించి ఈ కథలను మలిచారు. కాకపోతే నూతన ఆవిష్కరణల కలబోత, సామాజిక వర్గ సమతుల్యతా ప్రయత్నం, భిన్నమైన కథా నిర్మాణాలు ఈ కథల్లో ఉన్నాయి. సంపాదకుల కథల ఎంపికను కూడా అభినందించాలి.
'అలివి వల' కథకుడు ఉదయమిత్ర. అసలు పేరు యాదగిరి. ఈ కథ 'యాడికివోతున్నవవ్వా?' అనే సంధియుక్త పాలమూరు పదాంశంతో మొదలవుతుంది. సోక్రటీస్ తత్త్వాన్ని పన్నెండు సంవత్సరాల బాలునికి ఆపాదించడం, చిన్న వయసు నుండే బతకనేర్చే తత్త్వాన్ని తెలంగాణ ప్రజలు అలవర్చుకునే విధానం ఈ కథా నిర్మాణంలో ప్రధానమైనది. చెంచుల జీవన దీనస్థితిని అక్కడికి వెళ్లి చూడకున్నా మన చుట్టూ ఉన్నట్టే అర్థం చేసుకుంటాం. చెంచుల జీవనం నదితో, ప్రకృతితో యుద్ధం. బతుకు దినదిన గండంగా సాగుతుంది. చెప్పుకోవడానికి పరవళ్ళు తొక్కుతున్న నదిని పరవశంతో వర్ణిస్తాం. కాని ఆ నదే జీవనాధారంగా బతికే ప్రజల జీవన పరిస్థితులు ప్రశ్నార్థకం. వాళ్లమానాన వాళ్లను బతకనీయక అలివివల అనే పెద్ద రాక్షస వలను విసరడంతో చెంచుల బతుకులు ఛిద్రమవుతాయి. పెత్తందారితనానికి ప్రతీకగా నిలిచిన రక్షణ కథ ఇది. భయాన్ని జయించిన కథలోని పిల్లల ధైర్యం, అమానవీయ కోణం నుంచి మానవీయ కోణం వైపు పోరాటం, ఆరాటం, ఆత్మార్పణ, తరతరాల సంపదను కాపాడుకున్న విధానం ఈ కథలో ముగింపుగా నిలిచింది.
మనిషికి మనిషికి మధ్య బంధముండాలె. లేదా మనిషిలో స్వతహాగా కనికరం ఉన్నవాడయినా అయి ఉండాలని బలంగా నమ్మిన షరీఫ్ పాత్రను 'ఎక్కాలు రానోడు' కథలో హనీఫ్ సృష్టించాడు. ఒకరినొకరు మోసం చేసుకునే తత్త్వం పోవాలని కోరుకుంటాడీ కథలో కథకుడు. నమ్మక ద్రోహం పనికిరాదని, ఎకసక్యాలు ఆడరాదని, మనిషితో మనిషి వెలుగై వెలుగాలని చెప్పిన కథ ఇది. నేడు తల్లిదండ్రుల భూమి కతలు, నౌకరీ రాని బిడ్డల తల రాతలు ఒకే విధంగా ఉన్నాయని రెండింటినీ కలుపుతూ రాసిన కథ 'భూమాట'. వడ్డెబోయిన శ్రీనివాస్ పుట్టిన ఊరు వరంగల్ జిల్లా నెక్కొండ సంగతుల్లో సమకాలీన మోసాన్ని గమనించి నిర్మించిన కథ భూమాట. తరతరాలుగా సాగిన కథనాలను, విన్న, చూసిన సంఘటనల సమీకరణం ఇది. పట్వారీ వ్యవస్థ నేడు లేకున్నా మెదడులో బలంగా నాటుకుపోయిన నాటి సంగతులను దృశ్యమాలికగా కూర్చాడు కథకుడు. లోలోపలి అలజడుల ప్రతిరూపం భూమాట. ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన 'ఎక్కాలు రానోడు' కథతో పాటు మేడి చైతన్య రాసిన కథ 'ఇత్తరాకుల తట్ట'. మనిషి మానవత్వంతో బతకాలె. మనిషి మనస్తత్వ పరిశీలనకు అనుబంధం ఈ కథ. ఆత్మన్యూనతా భావం నుంచి ఆత్మరక్షణ వైపు పయనం. కుటుంబ సభ్యుల నుంచి వెలి వేయబడ్డా, కొడుకుపై తల్లి ప్రేమ, అనుబంధాల సమాహారం ఇత్తరాకుల తట్ట. మెరిసే మెరుపు నుంచి వచ్చే వెలుగైనా జీవితాలను మార్చాలనే ఒక ఆశావాదంతో ముగిసే కథ.
బలమున్న వానిదే రాజ్యం. ఆరు నూరైనా కుర్చి వాళ్లకే చెందుతుందని చెప్పిన కథ ఏకగ్రీవం. కులాలకు అతీతంగా చేకూరిన బలం, పదవీ వ్యామోహం నేటి చరిత్రకు తార్కాణాలు. ''అందుకే న్యాయం, అన్యాయం అని కాకుండా ఎవలు బలవంతులనే చూడాలె. ఎందుకంటే బలవంతునిదే న్యాయమైతది కనుక'' ఇదే ఈ కథ ముగింపు. ఆడవాళ్లు రాజకీయంగా ముందుకెళ్తుంటే వెనక్కి లాగే ప్రయత్నం చేయడమే నేటి సామాజిక దుస్థితికి నిర్ధారణ అని 'ఆరుతప్పులు' కథలో కావేటి సరిత ఆవేదన చెందుతుంది. తరతరాల కులాధిపత్యం, దళిత కోణం నుంచి రాసిన కథ ఇది. ''ఊరి లెవలి రాజకీయాలలోనే మా బతుకిట్లా ఉంటే, రాష్ట్ర, కేంద్ర రాజకీయాలలో మా బతుకులు తామరాకు మీద నీటి బొట్లే'' అంటుంది ఇందులోని రేణుక పాత్ర. నిజానికివి ఆరు తప్పులు కావు. ఒప్పులే. కథ రేకెత్తించిన ప్రశ్నలకు సమాధానాలు పాఠకులు వెతుక్కోవలసిందే.
రాజకీయ చర్చతోనే సాగిన మరో కథ స్నేహ రాసిన 'బానిసకొక బానిస'. మనిషికి నేను కూలిని కాదు యజమానినని అనుకునే మనస్తత్వం రావాలని ఆశించిన కథ. జనానికి మనం సాయం జేయాలె. ఆ సాయం మనకు సాయపడాలె అనేది నేడు నడుస్తున్న చరిత్ర. స్వార్థపూరిత జీవితాల నుంచి బయటికి రావాలని కోరుకునే కథ. రైతులు అనేక విధాలుగా వాడుకునే జీలుబండను పొతంబట్టిన కథ గుడిపల్లి నిరంజన్ రాసిన 'గుండెనిండా జీలుబండనే'. వర్గాధిపత్యంతో కంప్రెషర్లతో, ట్రాక్టర్లతో ఈక్విడార్ లోని కోటాఫాక్షి అగ్నిపర్వతం, జపాన్లోని ఫ్యూజియామా అగ్ని పర్వతం పేలితే ఎగిసిపడే బ్లో అవుట్వోలె బండపై దుమ్ముతో పాటు రాళ్ళు ఎగిరిపడ్డాయి. అక్కడి ప్రజలు, ఆ బండను ఆధారంగా చేసుకొని వేసుకున్న పంటలు అన్నీ నాశనమైనాయి. రూపుమాసిన మనుషుల జీవన స్థితులు ఈ కథలోని సంఘర్షణలు. ఆర్ద్రమైన కథ ఇది.
సిరిసిల్లా ప్రాంతం నుంచి పూడూరి రాజిరెడ్డి రాసిన కథ 'కొండ'. సమర్థత, అసమర్థతల మధ్య సంఘర్షణలు, ఆత్మన్యూనతా భావం, మనిషి ఎన్ని పనులు చేసినా, సాధించాలని ప్రయత్నించినా మొదటి ప్రయత్నంలోనే కుటుంబాన్ని భాగం చేసుకోకుంటే కలిగే నష్టం ఈ కథలో తొంగిచూస్తుంది. ఆదిలాబాద్ జిల్లా కరంజి నుంచి వచ్చిన కథ మంగారపు రమేష్ యాదవ్ రాసిన 'జొండ్ల పాతర'. వ్యాపార పంటలకు బదులుగా ఆహార పంటలు వేసి మనిషిని బతికించుకోవాలె. ఆహార పంటలతో కలిగే మానవ సంబంధాలు ఈ కథ ద్వారా చెప్పబడ్డాయి. ఈ కథలోని నిప్కల ఆన, జొన్నసొప్ప, కస్లాలు, వోగం, దీపరాజ్యం లాంటి తెలంగాణ పదపరిమళాలు ఆసక్తిదాయకమేగాక భవిష్యత్ పరిశోధక సూచికలు.
పెసిరెంట్ పోశెట్టి కథను ఖమ్మం జిల్లా పల్లిపాడు గ్రామం నుంచి నాగవర్థన్ రాయల రాశాడు. ఆత్మగౌరవంతో బతకాలని చెప్పిన కథ ఇది. న్యాయమైన కోర్కెలను డిమాండ్ చేస్తే ఉన్న హక్కులను, బతుకుదెరువును గుంజుకుంటె ఎవరి దగ్గరికి పోయి చెప్పుకునేది? అని ప్రశ్నించిన కథ. తెలంగాణలో ఒకప్పటి గడీలు నేడు కూలిపోతున్న చారిత్రక అవశేషాలుగా మాత్రమే మిగిలిపోయాయి. ఆ గడీల్లో ఇప్పుడు దొరలు లేరు. వారి స్థానంలో సంఘర్షణల మధ్య జీవితాలు గడిపిన వారు ప్రతినిధులుగా ఆ గడీలను కాపాడుతున్నారు. అందుకే కథకుడు ఒక పాత్రలో ''దొరల పీడపోయి ఎవని బతుకు వాడే బతికే రోజు వస్తుందంటే నువ్వు నమ్మలేదు. ఇప్పుడు చెప్పు. ఈ గడీల దొర లేడు. ఆ జనాల్లో భయంలేదు. ఇప్పుడు ఈ గడీకి నువ్వే దొరసానివి'' అంటూ నవ్వుతూ ముత్యాలు పూలమ్మతో చెబుతాడు. బలమున్న వాడే దొర అని నేటి సామాజిక పరిస్థితులు చెబుతున్నాయని 'గడి' కథలో చందు తులసి నిర్ధారణ చేశాడు. సూర్యాపేట జిల్లా చందుపట్ల గ్రామమే ఈ కథకు మూలం.
ఈ కథలు అనేక విషయాల్ని మనలో తట్టిలేపి ముగుస్తాయి. ముఖ్యంగా ఇవి తెలంగాణ సమాజంలో నడుస్తున్న సామాజిక పోరాటానికి నిదర్శనంగా నిలిచే కథలు. వర్తమాన, భవిష్యత్ కథకులకు పునాదిగా అక్కరకొచ్చే కథలుగా తెలుగు సాహిత్యంలో నిలుస్తాయి. ప్రపంచీకరణ నేపథ్యం అసలే కనిపించడం లేదు. అచ్చ తెనుగు పదాలు, తెలంగాణ వాడుక భాషలో కథలు రాయడాన్ని గమనిస్తాం. కథ శైలీ, శిల్పాలు కథను చదివించేలా చేస్తున్నాయి. ఇందులోని కథకులందరూ భవిష్యత్లో మరిన్ని మంచి కథలకు హామీ ఇస్తున్నారు.
- డా|| కరిమిండ్ల లావణ్య,
అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు అధ్యయనశాఖ,
తెలంగాణ విశ్వవిద్యాలయం
9848410244