Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనంతపురం జిల్లాలో మేరు నగం వంటి రచయిత, ఎంతో మంది కథకులకు మార్గ దర్శి, మార్క్సిస్టు విమర్శ కులు సింగమనేని నారాయణ 25.2. 2020 న కన్నుమూయడం సాహిత్య కారులందరికీ ఆవేదన కలిగించింది.ఆధునిక భావజాలంతో కథలు రాసే కలం ఆగిపోయిందని కన్నీరు పెడుతున్నాయి అక్షరాలు.
రెండు నెలల క్రితం ఆయన బాత్రూంలో జారి కింద పడినప్పుడు తుంటి ఎముక విరిగిపోయి ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరారు. అక్కడే ఆయనకు కరోనా సోకింది. అయినప్పటికీ ఆయన ఆ వ్యాధి నుంచి కోలుకుని తిరిగి మామూలు మనిషిగా ఇంటికి రాగలిగాడు. కానీ ఇలా తమను వీడి పోవడంతో రచయితల కలాలు విలవిల్లాడుతున్నాయి.
సమాజంలోని సమస్యల పట్ల స్పందించడం, క్రియా శీలకంగా పాల్గొనడం రచయిత నైతిక బాధ్యతని, అదే నిబద్ధతని నొక్కి చెపుతారు సింగమనేని నారాయణ. అనంతపురంలోని బండమీది పల్లెలో సంజీవమ్మ, రామప్ప దంపతులకు జూన్ 23, 1943న జన్మించిన సింగమనేని రెండో తరగతి నుంచే సింగమనేని చేతికి దొరికిన ప్రతి అక్షరం ముక్కనూ చదవడం అలవాటు చేసుకున్నారు. మూడవ తరగతి వయసులోనే ప్రతి రోజూ రాత్రి లాంతరు దగ్గర కూర్చుని మూడు నెలలపాటు నాన్న ప్రోత్సాహంతో తులసీ దాసు రామాయణాన్ని సంపూర్ణంగా చదివేశారు.అదే ఆయనకు సాహిత్యంలో అభిరుచి ఏర్పడడానికి కారణమైంది.
1968లో విద్వాన్ కోర్సు పూర్తి చేశాక 1969లో అనంతపురం జిల్లాలోని నార్పల జిల్లా పరిషత్ హైస్కూల్లో తెలుగు పండితునిగా చేరి వివిధ పాఠశాలలో 32 సంవత్సరాలు పనిచేసి 2001లో పదవీవిరమణ చేశారు. 1969లో గోవిందమ్మతో పెళ్లయింది. వారికి ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు, అందరికీ పెళ్లిళ్లయ్యాయి. అందరూ స్థిరపడ్డారు.
20 ఏళ్ల వయసులో విద్వాన్ చదువుతున్న రోజుల్లోనే ఆదర్శాలు అనుబంధాలు నవల రాశారు.ఆదర్శమండలి ఆ నవలకు 100 రూపాయలు పారితోషికం ఇచ్చి ప్రచురించింది. వందలాది కథలు చదివిన ప్రేరణతో ఏ ప్రపంచ జ్ఞానమూ లేని రోజుల్లోనే న్యాయ మెక్కడ అనే కథ రాశారు. అది కృష్ణా పత్రికలో జూలై, 1960లో అచ్చయింది. 'అనురాగానికి హద్దులు', 'ఎడారి గులాబీ' అనే మరో రెండు నవలలు కూడా రాశారు.
శ్రీశ్రీ 'మహాప్రస్థానం' చదవటం ఆయన సాహితీ జీవితాన్ని మలుపు తిప్పింది. అందులోని మొత్తం గీతాలు కంఠస్థం చేశారు. అప్పటి నుండి మార్క్సిజంలోకి ప్రవేశించారు. ప్రపంచం పుట్టినప్పటి నుంచి మార్క్సిజాన్ని మించిన మహోన్నత మానవీయ తత్వ శాస్త్రం ఇంతవరకూ రాలేదు. మానవ శ్రమలేని సమాజం ఉందా? శ్రమ జీవికి మనం రుణపడి ఉన్నామంటారాయన.
అనంతపురం జిల్లాలో కథాసాహిత్యం జి.రామకృష్ణతో ప్రారంభమైంది. ఆయన 'గంజి కోసం' అనే సామాజిక కథ రాసినప్పటికీ ఆయన తర్వాత 20ఏళ్ల వరకూ లభించిన ఆధారాలను పరిశీలించి చూస్తే అనంతపురం జిల్లాలో స్థానిక జీవిత చైతన్యం సింగమనేని కథలతో ప్రారంభమైందని చెప్పవచ్చని ప్రముఖ విమర్శకులు వల్లంపాటి వెంకట సుబ్బయ్య అన్నారు.
మార్క్సిజం ప్రభావంతో ఆధునిక సాహిత్యాన్ని మార్క్సిస్టు దష్టితో పరిశీలించడం మొదలుపెట్టారు సింగమనేని. మార్క్సిస్టు చైతన్యం పెరిగాక తన పేరు చివర నున్న చౌదరి అనే కుల చిహ్నాన్ని రాసుకోవడం మానేశారు. సమాజంలో ఉన్న సామాజికార్థిక సంబంధాలు అర్థమయ్యాక 1974లో రెండో కథ జూదం రాశారు. ఇది జిల్లాలో వచ్చిన స్థానిక జీవిత చైతన్యం ప్రతిబింబించే మొదటి కథ. ఈ కథ ''ప్రజా సాహితి''లో ప్రచురితమైంది. రాయలసీమలో ప్రకతి నిరాదరణతో జూదంగా మారిపోయిన వ్యవసాయాన్ని విధిలేక మోస్తున్న రైతు జీవితాన్ని ఈ కథ నిరాడంబరమైన శిల్పంతో చిత్రించింది. అప్పటి నుంచి సుమారు 60 కథలు రాశారు.ఈయన కథలు జూదం (1988), సింగమనేని నారాయణ కథలు (1999), అనంతం (2007), సింగమనేని కథలు(2012) అనే నాలుగు కథాసంపుటాలుగా వెలువడ్డాయి. సీమ రైతు గుండె చప్పుళ్లను నిజాయితీగా పట్టుకుని తన కథల ద్వారా సింగమనేని తెలియజేశారు. సమాజాన్ని మార్చాలన్న దష్టితోనే అనేక కథానికలు రాశారు.
రాయలసీమ రైతు ఎదుగూ బొదుగూలేని స్థితిని తెలుగు సాహిత్యలోకానికి చెప్పాలనే ఉద్దేశ్యంతో అలాంటి కథలను సేకరించి 'సీమ కథలు' పేరుతో 1982లో 18 కథలతో ప్రచురించారు. అది నిర్దిష్టమైన, ప్రాంతీయమైన ఒక ఒరవడిని తీసుకొచ్చిన ఆ పుస్తకం తెలుగు కథా సంకలనాల చరిత్రలోనే ఒక మలుపు తిప్పింది.
ఆయన భావజాలాన్ని ప్రభావితం చేసింది శ్రీశ్రీ అయితే, సాహిత్య శిల్పాన్ని ప్రభావితం చేసింది కొడవటిగంటి కుటుంబరావు. భాష విషయంలో సింగమనేని నారాయణది మధ్యేమార్గం. మాండలికాన్ని సంభాషణలకు మాత్రమే ఉపయోగించి కథకూ, కథనానికి మధ్య ఉండవలసిన తేడాను జాగ్రత్తగా పాటించారు. అనంతపురం జిల్లా కరవు కథలతో వెలువడిన 'ఇనుప గజ్జెల తల్లి' సంకలనానికి కూడా సంపాదకత్వం వహించారు.'తెలుగు కథకులు-కథనరీతులు' అనే సాహిత్య వ్యాసాల సంకలనాలకు మధురాంతకం రాజారాంగారితో కలిసి సంపాదకత్వం వహించారు.
నాకు తెలిసిన జీవితం పరిమితమైంది కావటం వల్ల, తెలిసిన జీవితాన్ని మాత్రమే రాయాలనుకోవటం వల్ల తక్కువ కథలు రాశానంటారాయన. ''రచయిత జీవితంలో ఒక పార్శ్వాన్ని, ఒక జీవిత శకలాన్ని మాత్రమే చెప్పగలిగి వుండాలి. ఆ కథ ఏక లక్ష్యంకలిగి వుండాలి. కథను కొంచెం కొంచెం రాస్తూ పోతే వారం పదిరోజుల్లో కథా నిర్మాణం పూర్తి చేయొచ్చు. కథ చదవటం పూర్తి కాగానే రచయిత ఎందుకోసమీ కథ రాశాడన్న అనుమానం పాఠకునికి వస్తే అది చక్కని కథ కాదు.'' అని అంటారాయన.
సింగమనేని కథలతో పాటు అనేక సాహిత్య విమర్శా వ్యాసాలు రాశారు. ఆయన సాహిత్య విమర్శనంతటినీ అధ్యయనం చేస్తే మార్క్సిజం అధ్యయనం ద్వారా ఆయన ఏర్పరచుకున్న సాహిత్యాభిప్రాయాలు తెలిసివస్తాయి. 'రాయలసీమ కథా చిత్రం', 'తెలుగు కథ - 1990 తర్వాత', 'తెలుగు కథ 2002 వంటి విమర్శా వ్యాసాలెన్నో రాశారు. కథావరణం పూర్తిగా ఆయన రాసిన విమర్శ వ్యాసాల సంకలనం. అలాగే సమయం సందర్భం, సంభాషణ, కథకులు కథనరీతులు మొదలైన విమర్శా గ్రంథాలను కూడా వెలువరించారు.
ఆయన మార్గం ప్రముఖ విమర్శకులైన రారా, కొ.కు.ల మార్గమని రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అభిప్రాయపడ్డారు. సమాజం పట్ల తనకొక బాధ్యత ఉందని భావించే విమర్శకులు విమర్శకు రచనతో పాటు ఆ రచయిత స్థలకాలాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ప్రేమ విషయంలోనే కాదు, ప్రజల జీవితంలో ఏ పార్శ్వం పట్లనైనా రచయితలు పాఠకులలో భ్రమలు పెంచరాదంటారు సింగమనేని. వస్తువులోనైనా, శిల్పంలోనైనా రచయితలు చేసే కల్పనలోనూ, నిర్మాణ విన్యాసాలలోనూ సామాజిక ప్రయోజనం దెబ్బ తినకుండా ఉండాలని సింగమనేని కోరుకుంటారు. ఎంత విస్తతంగా రచనలు చేసినా పునరుక్తులు చెయ్యడం, మూసధోరణిలో పడిపోవడం నరైంది కాదని సింగమనేని భావిస్తారు. అమెరికా రచయిత ఆప్టన్ సింక్లైయర్ చెప్పినట్లు సాహిత్యం భావప్రచారానికి బలమైన సాధనమన్న అభిప్రా యంతో సింగమనేని పూర్తిగా ఏకీభవిస్తారు. చాలా మంది సాహిత్య కారులు నిబద్ధతకు దూరంగా ఉంటారు. తాము చెప్పిందల్లా ఆచరించడం సాధ్యం కాదంటారు. సింగమనేని అలాకాదు. ఆయన ఆచరణ వాది కూడా.
రైతు జీవితాలను సాహిత్యంలోకి ఒకవైపు తీసుకొస్తూ రాయలసీమ ప్రాంత సమస్యలపై సాగించిన అనేక ఉద్యమాలలో సింగమనేని అగ్రభాగాన నిలిచి పోరాడారు. రైతు సంఘాలతో కలిసి పని చేశారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర, సాగునీరు, ఇన్ పుట్ సబ్సిడీ కోసం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జరిగిన ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొని అరెస్టు కూడా అయ్యారు.
2004కు ముందు 'హంద్రీ నీవా జల సాధన సమితి' కి కన్వీనర్గా వుంటూ సాగునీటి కోసం జరిగిన ఉద్యమాలలో పాల్గొన్నారు. ఎన్నెన్నో గ్రామాలలో సాగునీటికోసం సమావే శాలు నిర్వహించారు. ఒక కోటిమంది నివసించదగ్గ భూభాగం వున్న అనంతపురం జిల్లాలో 35 లక్షల మంది మాత్రమే జీవించే దుస్థితికి కారణం సాగునీరు లేకపోవడమే. జిల్లాలో రైతుల ఆత్మహత్యలు ప్రబలమవుతున్న రోజుల్లో వాటిని ఆపటానికి ప్రజా సంఘాలతో కలసి 'రైతు ఆత్మ విశ్వాస యాత్ర' కూడా నిర్వహించారు. ఆ సందర్భంగా ఎన్నెన్నో గ్రామాల్లో పర్యటించారు.
2014 తరువాత తెలుగురాష్ట్రాల విభజన అనంతరం రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం రాయలసీమ అభివద్ధి వేదిక ఆధ్వర్యంలో సాగిన అనేక కార్యక్రమాల్లోనూ సింగమనేని చురుగ్గా పాల్గొన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు తదితర అంశాలపై సాగిన పోరాటాల్లోనూ పాల్గొన్నారు. ఈ ప్రాంత కరువు పరిస్థితులు, రైతాంగ సమస్యలపై సాగిన పోరాటాల్లో ఇక్కడ పాల్గొనడమే కాకుండా ఇతర ప్రాంతాల్లో జరిగిన సాహితీ కార్యక్రమాల్లోనూ ఇక్కడి ప్రజల దయనీయ స్థితి గురించి మాట్లాడటం ద్వారా కరువు ప్రాంత గొంతుకగా నిలిచారు.
2002లో అనంతపురంలో జరిగిన సిపిఐ(ఎం) రాష్ట్ర మహాసభలకు ఆహ్వానసంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ సాహిత్యసభ జరిగినా విధిగా హాజరై కొత్త రచయితలను ప్రోత్సహిస్తూ ఉండేవారు. రైతును గురించి, గ్రామీణ జీవితం గురించి రాసి ప్రతి కథకుడు సాహిత్యంలోనైనా రైతును బతికించాలని ఆయన నిరంతరం కోరుకునేవారు.
సింగమనేని రచయితగా మాత్రమే కాకుండా సాహితీ కార్యకర్త గా కూడా సేవలందించారు. ఆయన లిటరరీమేట్, అనంత రచయితల సంఘం బాధ్యుడుగా, సంపాదకుడుగా, కొత్త రచయితలను వెలుగులోకి తీసుకు రావడంతో పాటు ఆ ప్రాంత రచయితల వస్తు శిల్పాలను ప్రభావితం చేశారు. ప్రముఖ రచయిత శాంతి నారాయణ తన కథావస్తువు ఎంపికలో సింగమనేని ని అనుసరించానని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు.
సాహితీ స్రవంతి సంస్థతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉండేది. స్రవంతితో సన్నిహితంగా ఉండి అన్ని రకాలుగా సహకారమందిస్తూ వుండేవారు. సాహితీ స్రవంతి నిర్వహించిన అన్ని కార్యక్రమాలకు హాజరై ఆయన సభను జయప్రదం చేసేవారు. శ్రీశ్రీ సాహిత్యం మీద ఆయనకు మంచి పట్టు ఉంది. శ్రీశ్రీ గురించి ప్రసంగిస్తే సభికులంతా ఎంతో ఉత్తేజ పడేవారు. గురజాడపై మాట్లాడితే ఆయన భావాలు సభికులను ఎంతో ఆలోచింపచేసేవి. సాహితీ స్రవంతి రాష్ట్ర స్థాయిలో జరిగిన కార్యక్రమాలకు, జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలు అన్నిటికీ ఆయన ముఖ్యవక్తగా హాజరయ్యేవారు.
సింగమనేని నారాయణకు అనేక సాహిత్య పురస్కారాలు లభించాయి. 1997లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకట శివయ్య సాహితీ సత్కారం పొందారు.అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్ ఆయనకు సాహిత్య సేవామూర్తి జీవితకాల సాధన పురస్కారాన్ని 2013లో అందజేసింది. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న పురస్కారం తో ఆయనను సత్కరించింది.
అభ్యుదయ భావాలతో గురజాడ అపార్ట్మెంట్స్ లాంటి అభ్యుదయ భావాలు గల కథలతో సాహిత్య లోకానికి దిశా నిర్దేశం చేసే సాహితీవేత్త సింగమనేని నారాయణ మరణం సాహిత్యరంగానికి తీరని లోటు కలిగించిందనడంలో సందేహం లేదు.
- పిళ్లా కుమారస్వామి,
9490122229