Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ మధ్య తెలుగులో వచ్చిన విలక్షణ కవితా సంపుటి. 'పచ్చబొట్టు'. నేటి తరం ప్రకృతి కవిగా దాసరి నాగభూషణం గుర్తింపును అందుకునే రచనల సమాహారమిది. ప్రకృతి పట్ల రచయితకు ఎంత ప్రేమ ఉందో ప్రకతి సేవకుడిగా మారాలని అటవీ శాఖలో ఉద్యోగం సాధించి ప్రకృతితో మమేకమై ఉద్యోగ పర్వాన్ని గడిపిన తీరు ఈ కవితలు వ్యక్తపరుస్తాయి.
ప్రకృతిపరమైన ప్రతి అంశాన్ని, సభ్య సమాజంలో జరుగుతున్న పలు అవినీతి అకృత్యపు సంఘటనల గురించి కవి బాధను, వేదనను వ్యక్తపరుస్తూ భవిష్యత్తులో తద్వారా ఎదుర్కొనబోయే విపత్కర పరిస్థితుల నేపథ్యంలో దూరదష్టితో పలు నివారణాంశాలను సూచించడం కొనియాడదగినది. పల్లె అందాలు, అక్కడి బ్రతుకు చిత్రం మూగజీవాలకు ప్రకృతితో ఉన్న సంబంధాలు ''ఎంత ఎలుగు ఎన్నీలోలె'', ''చిన్నారి పిచ్చుకేది?'' అన్న కవితల్లో చాలా అద్భుతంగా అక్షర రూపమిచ్చారు.
రచయిత ప్రకృతి, పంచభూతాల గురించే కాక సామాజిక అంశాలపై ఇంకా ఎన్నో సంఘటనలపై కవిత్వం రాయడం వాటికి పరిష్కారాన్ని కూడా చూపడం అన్నది అభినందించదగిన విషయం.
గతంలో జరిగిన అక్రమాలపై, అత్యాచారాలపై స్పందిస్తూ ''శాంతి కపోతం తిరగబడితే'', ''అమీషా! అమీషా!!'' లాంటి కవితల్లో కళ్ళకు కట్టినట్లు రాసిన వైనం, భవిష్యత్తులో అవి పునరావతం కాకుండా కాపాడే పరిష్కారం చూపెట్టడం చాలా బాగుంది.
వత్తుల పరంగా రాసిన కవితల్లో ''కుమ్మరన్నా! వందనమన్నా!!'' ఆన్న కవితలో కుమ్మరివాళ్ళ కులవృత్తి విశిష్టతతో పాటు నవీన నాగరిక పోకడతో కనుమరుగైన వారి జీవన చిత్రాన్ని మరియు ''చేనేతకు పట్టం'' అనే కవితలో చేనేత కార్మికుల బ్రతుకును వారి బాధలను గుండెలోతుల్లోంచి అక్షర రూపంలో కవి వెల్లడించిన తీరు బాగుంది.
ప్రభుత్వ పనులు కావాలంటే ఫైలు కదలాలి అంటే బరువు పెట్టాల్సిందే అని జరుగుతున్న అవినీతిని కళ్ళకు కట్టినట్టు ''మల్టీ డైమెన్షనల్ కల్తీ'' మరియు ''ఒక్కటై కదలుదాం'' అన్న కవితల్లో చెప్పారు. అంతేకాకుండా న్యాయం, ధర్మం చట్టం బందీలుగా మారుతున్న వైనం చెప్పే విధానం బాగుంది.
ప్రతిప్రాంతం గురించి వారి జీవిన విధానం గురించి తక్కువలో చెప్పడం అందరినీ ఆకర్షిస్తుంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ మట్టి మనుషుల గురించి.. ''కర్మజీవులు'' అనే కవితలో వారి చితికిపోయిన బతుకు చిత్రాన్ని కళ్ళ ముందుంచారు.
''బంధీఖానా'' అన్న కవితలో ఆన్లైన్ షాపింగ్ ముసుగులో సోమరిలా తయారవుతున్నారు మనుషులు. ప్రతిదీ అరచేతిలో మొబైల్ ఉంది కదా అని అమ్మ నాన్నలను కూడా మరిచిపోతుంది ఈ లోకం. ప్రైవసీ అనే ముసుగులో ఉమ్మడి కుటుంబాలు కాస్త దిక్కులేని కుటుంబాలుగా మారిపోయాయి. కన్న తల్లిదండ్రులని అనాథలుగా మార్చేస్తున్నారు అని చెప్పడం మనసును కదిలించే అంశాలు. రైతులకు జరుగుతున్న నష్టం గురించి వారి ఆత్మహత్య ల గురించి వారి జీవితాన్ని ''రైతు పుట్టువడి'' అన్న కవితలో చెప్పడం కవి హదయ స్పందనను తెలియ జేస్తుంది.
బాల్యం ఎంత అద్భుతం, కల్మషం లేకుండా మధురత్వంతో కూడి స్వేచ్ఛగా హాయిగా ఆకాశంలో విహరించే పక్షిలాంటి బాల్యాన్ని ప్రస్తుత పరిస్థితులు ఎలా బంధీగా మార్చాయి, ఎందుకు బాల్యాన్ని నాలుగు గోడల మధ్య ఖైదీని చేశాయి అనే విషయాలను విపులంగా ''బాల్య సంగీతం'' అనే కవితలో రాసారు.
పల్లెల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా గౌరవ మర్యాదలు, సంస్కారాలు ఎలా వుండేవో, పెద్దల మాట సద్ది మూట అని ఆనాటి జీవనగతులు, బంధాలు అనుబంధాలు, ప్రేమానురాగాలు మరియు ఆప్యాయతల ఆచారాల గురించి ''మధుర క్షణాలు'' అన్న కవితలో చక్కగా ఆవిష్కరించారు. ప్రస్తుతం బంధాలకు నేటి మనుషులు అడ్డుగోడలు నిర్మించుకున్న వైనాన్ని ''తప్పిపోయిన దారిలో'' అన్న కవితలో ఉంది.
జీవం ఉట్టిపడేట్టు, ఆగిన గుండెకు ఊపిరి పోసినట్టు, బ్రతుకు భారం అనేవారికి భాద్యత నేర్పినట్టు, జీవితంపై ఆశలు వదులుకొనే వాళ్లకు శ్వాస నింపినట్టు, గమ్యం లేని వాడికి మార్గం చూపినట్టు, అంతేకాక అన్నిపరిస్థితుల్లో స్ఫూర్తిని నింపే మంచి కవితా సంపుటి ''పచ్చబొట్టు''. అద్భుతమైన భావ సంపదతో అక్షర భండాగారాన్ని సాహిత్య ప్రపంచానికి ఇచ్చిన రచయిత అభినందనీయులు.
కరోన మహమ్మారి సమయంలో ప్రాణాలకు తెగించి సేవలను అందించిన వైద్య, పోలీస్, సానిటరీ సిబ్బందికి అంకితం ఇవ్వడం అనేది రచయితకు దేశం అన్నా సమాజం అన్నా ఎంత ప్రేమో స్పష్టమౌతున్నది.
''ఆకుపచ్చని అక్షరవనంలోకి...'' అంటూ ముందుమాటలో రచయిత బాల్యమిత్రుడైన బి.నర్సన్ రచయిత బాల్య నేపధ్యం, విద్యాభ్యాసం, వారి స్నేహబంధం, ఆయన వ్యక్తిగత స్వభావం, వారికి రచన పట్ల ఆసక్తి కలిగిన సందర్భం, రచయితగా ఆయన ప్రస్థానం, అక్షరాలపై ప్రకతిపై కవికి ఉన్న ప్రేమను తెలియజేశారు.
రచయితకు అక్షరాలతో ఉన్న సాన్నిహిత్యమే కాకుండా ఆయనలో ఉన్న ఇంకో అద్భుత నైపుణ్యం చిత్రలేఖనం. ''పచ్చబొట్టు'' కవితా సంపుటికి ఆయనే వేసుకున్న ముఖచిత్రం ఆలోచింపజేసే విధంగా ఉంది. ప్రకతిలో మానవ మనుగడ సక్రమంగా కొనసాగడానికి పచ్చదనం ప్రాముఖ్యత మరియు దాని సంరక్షణ ప్పనిసరి అంటూ పంచభూతాలను కనుపాపలో అయిదు వలయాల్లో ప్రతీకాత్మకంగా వ్యక్తపరచిన తీరు పచ్చదనంపై వారికున్న సునిషితమైన, సున్నితమైన ప్రేమ తత్వాన్ని తెలియ జేస్తుంది.
మొదటి పుటలో రచయిత వేసిన నలుపు తెలుపు రేఖాచిత్రం తనచేతిని ఒక వక్షంతో పోల్చుకుని దానిపై రెక్కలువిప్పుకొని స్వేచ్చగా ఎగురుతున్న పక్షి బొమ్మను పచ్చబొట్టుగా, చేతివేళ్ళలో కలంతో కవిత్వానికి అక్షర రూపమిస్తున్న తీరు ఆలోచింపజేసే విధంగా అద్భుతంగా ఉంది.పర్యావరణ హితమైన కవితలపై అభిమానం ఆసక్తి ఉన్నవాళ్లు మరియు సమాజహితం కోరేవారు తప్పకుండా చదవాల్సిన కవితా సంపుటి ఇది.
- కిషన్ పవార్,
90328 60912