Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమాజానికి చారిత్రక గమనం ఉన్నట్టే సాహిత్యనికీ ఉంటుంది. ఒక నిర్ధిష్ట సమయంలో, సందర్భంలో నిలబడి నాగరికతా వికాసంలోని మలుపులను, క్షీణకాలాన్ని, కోల్పోతున్న వాటిని, పొందుతున్న వాటిని చారిత్రక గమనం (Historical trajectory) రికార్డు చేస్తుంది. ఇప్పుడు కవిత్వం అనేక భావజాలాలు సంఘర్షిస్తున్న, అనేక జీవనవిలువలు సంవేదన పడుతున్న సమయంలో నిలబడి ఉంది. సాధారణంగానే చారిత్రకంగా కవిత్వం నడచి వచ్చిన మూలాల ప్రమేయం కవిత్వంపై ఉంటుంది. కాని కవిత్వంలో కనిపించే నిర్దిష్ట సందర్భం, (Specific context) నిర్దిష్ట చారిత్రకత (specific historicity) కవిత్వం నిలబడ్డ కేంద్రాన్ని చెబుతుంది.
తెలుగు వచన కవిత్వాన్ని తీసుకుంటే తొలి కాలంలోని అభ్యుదయ భావన,విప్లవ మార్గం, ఆ తరువాతి స్త్రీవాద, దళితవాద, బి.సి., ముస్లీం మైనారిటీవాద మార్గాలు, ప్రాంతీయతా వాదం. ఈ స్థాయిలో కాకున్న రాశిలో కొంత తక్కువగా కనిపించినా అనుభూతి, భావ కవిత్వం, దేశభక్తి లాంటివీ ఉన్నాయి. ఇటీవలి సందర్భాల్లోనూ ప్రపంచీకరణ, ప్రాంతీయతావాదం లాంటి మార్గాలూ వచ్చాయి. ఇవన్నీ సజన రూపాల్లో వస్తువులోను, శిల్పంలోనూ, పరిణామాన్ని పరిణతులను తీసుకువచ్చాయి. సాధారణంగానే ఉద్యమ తీవ్రతగల మార్గాలు కొన్ని మూసలను నిర్మిస్తాయి. వీటివల్ల సమకాలీనంగా కొన్ని మూస వస్తువులు (Template objects) ప్రచారంలోకి వస్తాయి. రాశీ సమాజంలోని సజనకారులు వస్తు పరిణామాలను (object evolutions), వస్తువులోని పొరలు (layers of object) కేంద్ర భావన (central concept) భావనా మీమాంస (conceptualism) వంటి విషయాలను పూర్వ రచనల్లో గమనించక కేవలం ఔద్వేగిక రచన (emotional writing)గా అర్థం చేసుకోవడం వల్ల ఈ మూసలు ఏర్పడుతాయి.అత్యంత సహజం గానే కవిత్వంలో ఔద్వేగికభావన ఎక్కువ.సమాజిక చలనంలోని సందర్భాలను గమనించడంవల్ల అందులోని సమిష్టి, వ్యష్టి జీవితాల సంక్షోభాన్ని, సమస్యలను గమనించడం వల్ల ఈ మూసల నుంచి తప్పించుకునే అవకాశం ఎక్కువ. ప్రధాన ఔద్వేగిక సందర్భాలను రికార్డు చేయని కవి తాను జీవిస్తున్న కాలపు చారిత్రక భాగస్వామ్యాన్ని కోల్పోతాడు. కేవలం ఊహల్లోనో తనదికాని కాలంలోనో జీవిస్తున్న వాడిగా మిగిలిపోతాడు.
అనిల్ డానీ కవిత్వం ''స్పెలింగ్ మిస్టేక్''లో గతి తప్పుతున్న మానవ సంబంధాల గురించి ఎరుక వాటి మార్పుల పట్ల చైతన్యం కనిపిస్తుంది. సమకాలీన చరిత్రను ఆనుకుని రాసిన ఈ కవితల న్నింటిలో వర్తమానకాలానికి సంబంధించిన ప్రధానవాహికలూ కనిపిస్తాయి. సందర్భం (పే.88) సవరణ (పే.73) మొదలైన కవితల్లో సమకాలీన బహుజన తాత్త్వికదష్టి కనిపిస్తుంది. అడ్దం 18, నిలువు 21, దారి చూడు లాంటి మరికొన్ని కవితల్లో ఆ తాలూకు స్పహ కనిపిస్తుంది. విగ్రహ వాక్యం లాంటి కవితల్లో సమకాలీన వైప్లవిక భావన కనిపిస్తుంది. కాని ఈ సంపుటిలో ఎక్కువగా ప్రపంచీకరణ మానవ సంబంధాలను ఎలా నిశ్శబ్దంగా మార్చేస్తుందో చిత్రించడం కనిపిస్తుంది. యాంత్రికంగా మారి పోయిన మానవ జీవితాలను కవిత్వం చేయడం కనిపిస్తుంది. వీటిలోనూ సమకాలీనత ప్రధానం, డానీ చిత్రిస్తున్న ప్రతిక్రమంలోనూ తప్పనిసరిగా వర్తమానం అనుభవిస్తున్న చారిత్రక దశ ఉంది. కాని ఉపరితలంలో కనిపించే అనేక సమస్యల నుంచి ఇది సమస్యగా కనిపించడం లేదు.
మనుషుల్లో మనుషులు లేరన్న వాస్తవికత ఒకటి తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించి చాలా రోజులైంది.సుమారు 1990 కాలానికి ఇవతలి భాగంలో ప్రపంచీకరణ ప్రతిఫలనాలను తెలుగు సాహిత్యం గమనించింది.ఊరిపై,నగర జీవితంపై ప్రపంచీకరణ ప్రభావాలను,కుల వత్తులపై ,వాటిని ఆశ్రయించిన జీవితాలపై ప్రభావాలను, వ్యవసాయం మొదలైన వాటిపై వచ్చిన ఫలితాలను, విదేశీ ప్రయాణాల మోజు పెరగడం, జీవితంలో సంభాషణలు యాంత్రికమవ్వడం మొదలైన అన్ని పరిస్థితులనూ తెలుగు సాహిత్యం గమనించి కవిత్వం చేసింది.
డానీ కవిత్వంలోనూ ప్రపంచీకరణ పర్యవ సనాలు మానవ జీవితంపై అదీ ఆర్థికరేఖను ఆనుకుని కాకుండా వ్యవసాయాన్ని, కుల వత్తు లను ఆనుకుని జీవించే అణగారిన వర్గాల జీవితా లపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయో చిత్రించడం కనిపిస్తుంది. ఏ జీవితాలను చిత్రిస్తున్నాడనేదాన్ని గమనిస్తే గతంలో వచ్చిన కవిత్వానికి డానీ కవిత్వానికి మధ్య బేధం కనిపిస్తుంది.
1. అక్కడ పట్టు చీరలు నగలతోనూ/ బ్రాండెడ్ బట్టలు పాద రక్షలతోనూ/ పాద రక్షలు లిప్స్టిక్ల తోనూ ప్రేమగా మాట్లాడతాయి/ బట్టల్లో పొరపాటున బయటికివచ్చిన/ దారంపొగుకున్న విలువ మనిషికి ఉండదు'' -(మెరుపులు.పే.59)
2. ఎవడో ఏసీగదుల్లో పడుకుని/ ఈ కనుమల మధ్యన ఒక వ్యాపారాత్మక కలగంటాడు/ చేపల్ని వేటాడి విదేశీ ఎండకు ఎండబెడతాడు/ మకరందాన్ని సీసాలో బంధించి/ తెల్లతోలువాడికి కాఫీలా కలిపిస్తాడు/ ఏళ్ల తరబడి గిరిజనుల కడుపు నింపుతున్న /అడవితల్లి మౌనంగా దుఃఖించిన సందర్భం అది'' - (మనాది.పే.51)
3. పండడం ఒకటే తెలిసిన నేల/ కర్రల చివర్లకు నేలను పూయించింది/ తాతను అడిగితే / నేల రహస్యం చెవిలో చెప్పాడు/ బయటికి చెబితే రాజ్యం వింటుంది కదా''
-(మనకేం తెలుసు.పే.48)
4. ఎప్పుడో బీడు భూమిలో / తాత నాగటి కర్రు మోపిన చోటంతా / కొత్త జీవోల కలుపు మొక్కలు/ నాన్న పండించిన ఎర్ర పిరప పంట లిప్స్టిక్ రంగులోకి మారి/ కార్పోరేట్ కంపనీ బ్రాండ్ లేబుల్ అయిపోతుంది''
- (ఆకుపచ్చని కన్నీరు.పే.34)
5. ''ఇల్లు ఆకలిగా ఎదురు చూస్తుంటుంది/ డబ్బులేవనే ప్రశ్నకు చూపులు నేలను వెదుక్కుంటాయి/ పండుగకదా నాన్నా అని పిల్లలంటే/ నా రూపాయిని మార్కెట్ మింగేసిందని చెప్పడానికి నోరు పెగలదు''
- (ఏ రూపాయీ నీది కాదు.పే.26)
మొదటి యూనిట్ బ్రాండెడ్ సరుకులకు, మనుషులకు మధ్య విలువను గురించి మాట్లాడు తుంది,రెండవది గిరిజనుల జీవితాల్లో ఆరోగ్యాన్ని నింపాల్సిన ఫలాలు ఎక్కడకు వెళుతున్నాయో చెబుతుంది. మూడవ భాగం పంటలు పండాల్సిన పొలాలు ఏ రూపాన్ని పొందుతున్నాయో చిత్రిక కడుతుంది. నాలుగవదీ ఇలాంటిదే. అయిదులో మౌనంగా నిలబడేట్తు చేస్తున్న ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని, ఆ తాలూకు మానసిక ప్రతిఫలనాలను చిత్రిస్తుంది. స్థూలంగా డానీ కవిత్వంలో మానసిక ప్రతిఫాలనాల కథనం ప్రధానంగా కనిపిస్తుంది. ఈ ప్రతిఫలనాల వెనుక మారుతున్న మనుషుల వ్యక్తిత్వం. వాతావరణం, పరిసరాలు వాటి మూలాల్లో దాక్కున్న వ్యాపార సంస్కతి కనిపిస్తుంది. ఏ కవిత్వాన్ని పరిశీలించడానికైనా మూడు మార్గాలు ప్రధానమైనవి. వ్యక్తం చేస్తున్న విషయం ఏమిటీ ? దాని మూలాలెక్కడ ఉన్నాయి? అవి ఏ మార్గంలో వ్యక్తమౌతున్నాయి. దాని వ్యక్తం చేస్తున్న విషయం నాశనమౌతున్న మానవ సంబంధాలు, వాటి మూలాలు ప్రపంచీకరణ, మార్కెట్ల నుండి కనిపిస్తాయి. వ్యక్తమౌతున్న తీరు మానసిక ప్రకంపనల నుండి, ప్రతిఫలనాల నుండి కనిపిస్తుంది.
డాని వాక్యాలలో వస్తుగతంగా చారిత్రకత, శిల్పగతంగా ఉద్వేగం కనిపిస్తాయి. వాక్యాల్లో కనిపించే ఉద్వేగం వెనుక ఉండే అంశాలు జీవితాన్ని వ్యాఖ్యానిస్తున్నట్టుగా కనిపిస్తాయి కాని వాటి వెనుక ఉండే సామ్రాజ్యవాద మూలాలను, ప్రపంచీకరణను, మానవమూలాలు నశించడాన్ని గుర్తించడం కషత్మ్ కాదు. భావోద్వేగాలను ఖచ్చితంగా నిర్వచించడం కష్టం. కాని, అవి మానవ జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయో అనచనా వేయటం కష్టం కాదు. భావోద్వేగాలకు కారణాలను, అవి ప్రతిఫలించే విధానాలను వాటి నుంచి మానవ ప్రవర్తనలను మనోవైజ్ఞానిక శాస్త్రం విశ్లేషించింది. విలియం జేమ్స్, కార్ల్ లాంగే భావోద్వేగ సిద్ధాంతాన్ని (Theory of emotion) ప్రతిపాదించారు. సంఘటనలకు సంబంధం లేకుండా సంఘటనల మూలంగా భావోద్వేగాలు కలుగుతాయని ఈ సిద్ధాంతం చెబుతుంది. ఈ సిద్ధాంతం ''emotions are so central to how we experience and interact with the world''- (భావోద్వేగాల కేంద్రంగానే ప్రపంచాన్ని మనం అనుభవించడం, ప్రపంచంతో వ్యవహరించడం చేస్తాం). ప్రతి సంఘటన అర్థమయింతరువాత ఒక ఉద్దీపన (stimulus) కలుగుతుంది, దాని నుండి సాధారణ మానసిక ప్రతిస్పందన (psychological responce) కలుగుతుంది. దాని నుంచి మానసిక స్పందనా నుభవం ((experiance of psychological responce) కలుగుతుంది దాని నుంచి భావోద్వేగం (emotion) కలుగుతుంది. ఈ భావోద్వేగ దశలోనే డాని వాక్యం ఉంటుంది.కాని ఉద్దీపనల వెనుక సమాజిక పరిణామాలు, వాటి కారణాలు కనిపిస్తాయి.
ప్రపంచం వ్యాపారాత్మకంగా మారిపోయిన తరువాత మానవుల చర్యా,ప్రతి చర్యలను, వాటి ఫలితంగా ఏర్పడ్డ స్థితులను ఈ వాక్యాలు మారుతాయి. వ్యాపార ప్రపంచంలో వస్తువులకున్న విలువ మనుషులకుండదు అనే విషయాన్ని మొదటి భావాంశం చెబుతుంది. రెండవది ప్రపంచీకరణ పరిణామాలను ఇక్కడి సంపద విదేశాలకు వెళ్లడం గురించి వ్యక్తం చేస్తుంది. ఇందులోనూ వ్యాపారాత్మక కలను గురించి మాట్లాడడం కనిపిస్తుంది. ప్రపంచీకరణ విషయంలో రాజ్యానిది అంటే ప్రభుత్వానిది కేవలం యజమాని పాత్ర మాత్రమే. ఈ రాజ్యం ప్రపంచీ కరణ ప్రతినిధిగా మాత్రమే వ్యవహరిస్తుంది. నేలకు మనిషికి ఉన్న సంబంధాన్ని గురించి మాట్లాడుతూ రాజ్యం గురించి వ్యాఖ్యానిస్తారు. నాలుగవ భాగంలో నాన్న పండించిన పంట లిప్స్టిక్గా మారడంలోని వ్యాపార శక్తుల ప్రభావాన్ని చెబుతున్నారు. అయిదవ వాక్యంలో మళ్ళీ భావోద్వేగాన్ని గురించిన మానసిక ప్రతిఫలనాలను చిత్రించడం కనిపిస్తుంది.ఇంత వ్యాపారం జరిగి, విదేశాల దాకా శ్రమ వెళ్ళినా శ్రామికుడు లేదా ఉత్పత్తి దారుని దగ్గర అవసరానికి డబ్బులేక పోవడం. కనీసం పండుగలను కూడా గడపలేని పరిస్థితికి రావడం గురించి, పిల్లలకు సమాధానం చెప్పలేకపోవడం గురించి మాట్లాడుతారు.
''వ్యాపారాత్మక కల, విదేశీ ఎండ, జీవోల కలుపు మొక్కలు, కార్పోరేట్ కంపనీ బ్రాండ్ లేబుల్, మార్కెట్ మింగేసిన రూపాయి లాంటి పద బంధాలన్నీ ప్రపంచీకరణ పరిణామాలను, పర్యవసనాలను ప్రతిఫలించే పదబంధాలు, వాక్యాలు. డానీ వాక్యాలు ఆధునిక జీవిత సంక్షోభాన్ని చిత్రించాయి. ఆధునిక జీవితంలోని బడుగు జీవితాలను చిత్రిక కట్తాయి. ప్రధానంగా ఉత్పత్తి దారుని స్థితిని చూపే ప్రయత్నం చేశాయి. ప్రజాస్వామ్య రాజకీయాల్లో ధనానికున్న బలం గొప్ప వక్రీకరణ. పేదరికం అంతరించినప్పుడే ధనానికున్న బలం తటస్థం అవుతుంది.ప్రభుత్వాలు పేదరికాన్ని రూపుమాపడానికి ప్రయత్నిస్తున్నట్టే ఉంటాయి. కాని ధనం, ధనవంతులు వారు నిర్వహించే కార్పోరేట్ కంపెనీలు బలపడు తుంటాయి. వీటిలో రాజ్యం పాత్ర అందరికీ అర్థమవుతుంటుంది. కానీ రాజ్యాన్ని నిలబెట్టే ఓట్లు, ఎలక్షన్లు, పార్టీలు, జెండాలు కేవలం తంతుగా అర్థమవుతాయి. వాటిలోని కీలకమైన రాజ్యాంగ తాత్త్వికత అర్థం కాదు. ప్రజలు కేవలం ఓటర్లు మారిన సందర్భంలో రాజ్యాన్ని నిర్దేశించే స్థానం నుండి ఆధారజీవులుగా మారిపోయారు. ఈ సందర్భంలోని భావోద్వేగాలు జీవనాన్ని కలవర పరుస్తున్నాయి. సాధారణ మానవుడు ఆర్థిక విలువలకన్నా, రాజ్యాంగ విలువలకన్నా, నైతిక విలువలను, సామాజిక విలువలను ఎక్కువగా అపేక్షిస్తాడు. ఈ మానసిక ప్రతిఫలనాలే అనిల్ డాని కవిత్వం. రాజ్యానికి, ప్రపంచీకరణకు అతి సాధారన జీవితానికి మధ్య భావోద్వేగాల చిత్రణ డానీ కవిత. అంతరిస్తున్న విలువలను ఉపరితల విలువల నుంచి కాకుందా వాటి కారణాలనుంచి కారకాల నుంచి డానీ కవిత్వం అర్థం చేసుకుంటుంది.
- ఎం.నారాయణ శర్మ