Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్నిశ్వాస నిఖిలేశ్వర్
ప్రముఖ విప్లవ కవి నిఖిలేశ్వర్కి 2020వ సంవత్సారానికి గానూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన రచించిన అగ్నిశ్వాస కవితా సంపుటికి ఈ అవార్డు దక్కింది. నిఖిలేశ్వర్ అసలు పేరు కుంభం యాదవరెడ్డి. కవిగానే కాకుండా అనువాదకుడిగా, కథకునిగా, విమర్శకునిగా ప్రజా దక్పథంతో రచనలు చేశారు. 1956 నుంచి 1964 వరకు తన అసలు పేరు మీదే వివిధ రచనలు చేశారు. 1965 నుంచి తన కలం పేరుని నిఖిలేశ్వర్గా మార్చుకొని, దిగంబర విప్లవ కవిగా సాహితీ ప్రపంచంలో తనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు. దిగంబర కవులలో ఒకరిగా, 1965 నుంచి 1970 వరకు దిగంబర కవిత్వాన్ని డు సంపుటాలుగా ప్రచురించారు. ఇతర భాషా సాహిత్యాన్ని తెలుగు ప్రజానీకానికి పరిచయం చేసిన బహుభాషా సాహితీవేత్త నిఖిలేశ్వర్.
విప్లవ రచయితల సంఘం (విరసం) కి వ్యవస్థాపక కార్యదర్శిగా (1973) వ్యవహరించారు. విప్లవ కవిత్వం రాయడమే కాకుండా పౌర హక్కుల ఉద్యమంలో పాల్గొన్నందుకు 1971లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పీడీ యాక్ట్ కింద అరెస్టు చేసింది. జన సాహితి సాంస్కత సమాఖ్యకి వ్యవస్థాపక కార్యకర్త (1979-1982)గానూ, ఓపీడీఆర్, గ్రామీణ పేదల సంఘం, ఇండియా-చైనా ఫ్రెండ్షిప్ సంఘం, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడిరేషన్ మొదలగు వాటిలో భాగస్వాములు అయ్యారు. 1969లో 'పోయెట్' (ఇంగ్లీష్ పోయెట్రీ మంత్లీ - మద్రాస్) అనే ప్రత్యేక సంచికకు గెస్ట్ ఎడిటర్గా వ్యవహరించి దిగంబర కవి త్వాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. 1980 నుంచి 1982 వరకు తెలుగు సాహిత్య మాస పత్రిక ప్రజా సాహితికి సంపాదకులుగా వ్యవహరించారు. 1991లో రంజని, ఏజీ ఆఫీసు తరఫున ప్రచురించిన సంపుటికి సంపాదకులుగా వ్యవహరించారు. విశ్వకవిత భాగంలో తెలుగు భారతీయ కవిత పేరున వివిధ భారతీయ భాషలలో ఉన్న కవితలను తెలుగు లోకి తర్జుమా చేశారు. హిందీ, ఆంగ్లంలో రాసిన వివిధ కవితలు టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్తాన్ టైమ్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్, డెక్కన్ క్రానికల్, ది ఇల్లస్ట్రేటడ్ వీక్లీ ఆఫ్ ఇండియా, ధర్మయుగ్ సారిక, స్వతంత్ర వార్త, లోక్మఠ్ సమాచార్ మొదలగు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఒక సామాజికవేత్తగా కూడా 50 ఏండ్లుగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కషి చేస్తూ రాసిన 'అగ్నిశ్వాస' కవితా సంపుటికి వచ్చింది. ఈ వ్యవస్థలో ఉండే అసమానతలు, దోపిడీ, కుల, వివక్ష ఇలాంటి అంశాలపై వ్యక్తీకరించిన కవితలు ఇందులో ఉన్నాయి. అలాగే పాలకులు 'బడి కంటే గుడికి' ప్రాధాన్యాన్నిస్తూ ప్రజలను మూఢాచారాల వైపు మళ్లిస్తున్నారనే ఉద్దేశంతో రాసిన కవితలే ఇందులో ఉన్నాయి.
మిళింద మానస
అట్టడుగు వర్గాల మహిళలు చదువుకునేటప్పుడు విద్యాలయాల్లో, ఉద్యోగంలో చేరాక అక్కడ ఎదుర్కొంటున్న సమస్యలపై ఏండ్లూరి మానస రాసిన 22 కథల సంపుటి 'మిళింద'కు కేంద్ర సాహిత్య యువ పురస్కారం దక్కింది. మానస తల్లిదండ్రులు ఆచార్య ఎండ్లూరి సుధాకర్, పుట్ల హేమలతలిద్దరూ సాహితీవేత్తలు కావడంతో చిన్నప్పటి నుండే సాహిత్య వాతావరణంలో పెరిగారు. మానస కథలకు జీవితానుభవాలు, సమాజంలో జరుగుతున్న సంఘటనలే ప్రేరణ. ఆడవారిపై జరిగే అఘాయిత్యాలు, మగవారు వేదనకు, అన్యాయానికి గురయ్యే ఉదంతాలు, ఈ ఆధునిక యుగంలో దళిత క్రైస్తవ స్త్రీలు, పురుషులు ఎదుర్కొనే సమస్యలు, స్వలింగ సంపర్కులు, ట్రాన్స్ జెండర్స్ ఇలా సమాజంలో అసమానతలు ఎదుర్కొనే వారి జీవితాలను చూసి చలించిన మానసను.. ఆ అంశాలే కథలుగా రాసేలా పురికొలిపాయి.
బాలల 'స్నేహితురాలు' కన్నెగంటి అనసూయ
బాల సాహిత్యంలో కన్నెగంటి అనసూయను కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహితీ పురస్కారం వరించింది. ఆమె రచించిన 'స్నేహితులు' బాల కథల సంపుటికి ఈ పురస్కారం దక్కింది. ఆమె ఇప్పటివరకు 550 బాల కథలు, రెండు నవలలు, పలు కథా సంపుటాలు వెలువరించారు. ఈ రచనలకు గాను ఆమెకు 'రంజనీ - నందివాడ భీమరావు పురస్కారం',' అడవి బాపిరాజు పురస్కారం', 'గిడుగు రామూర్తి పురస్కారం', 'ఆకెళ్ల అవార్డ్', డా.నోముల సత్యనారాయణ వంటి పలు పురస్కారాలు పొందారు. ఆమె కథలు ఆదిలాబాద్ రేడియో స్టేషన్ ద్వారా ప్రసారమయ్యాయి. సాహిత్య వ్యాసంగంతోపాటు 2009లో మానస అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు.
- అనంతోజు మోహన్కృష్ణ