Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక స్థలానికి, కాలానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సృజనకారుడు యాకూబ్. సంపూర్ణంగా, ఆ కాలాన్ని స్థలాన్నీ తన కవిత్వంలో ప్రతిబింబిస్తూనే ఎక్కడో మారుమూల కారేపల్లి, రొట్టమాకురేవు మట్టి పొరల్లోని తన వేర్లను పదిలంగా కాపాడుకుంటూ పట్టణం నడిబొడ్డున సాహితీ వృక్షమై పచ్చని నీడని పరిచాడు. తను ఎక్కడుంటే అక్కడ స్నేహపు చివుళ్ళను తొడుగుతూ కవన పులుగులకు ఆహ్వానం పలుకుతూనే వున్నాడు. కవి అంటే సృజనాత్మక చరిత్రకారుడు. కాలాన్ని అక్షరాల్లోకి వొంచి భవిష్యత్తులోకి ఎగిరిపోతాడు. యాకూబ్ ఆరు పదుల ప్రయాణంలో సామాజిక చలనాలు కవితా చరణాలయ్యాయి. జీవితం సాహిత్యమై పోతపోసుకుంది. మరి యాకూబ్ ఏమంటాడో...
కవిగా ఎలా ఫీల్ అవుతున్నారు?
నా కవిత్వాన్ని పాఠకులు ఆదరించారు. అభిమానించారు. ఇది ఎంతో సంతోషం. నా కవిత్వానికి గుర్తింపుగా కొన్ని అవార్డులు వచ్చాయి. అవార్డులు ఒక ప్రోత్సాహాన్నిస్తాయి. ఒక కవిగా నాకు గొప్ప సంతప్తిని సంతోషాన్ని కలిగించింది కవిసంగమం. కవిత్వం చదివేవారు తగ్గిపోయారు, కవిత్వానికి ఆదరణ లేదనే ఒక వాతావరణంలో కవిసంగమాన్ని ప్రారంభించాను. నాతో పాటు అనేకమంది మిత్రులు కలిసి వచ్చారు. అందరం కలిసి ఒక అడుగు ముందుకు వేశాం. ఇప్పుడు పది సంవత్సరాలుగా కవిసంగమం ఫేస్బుక్ గ్రూప్ జయప్రదంగా కొనసాగుతోంది. కవిత్వానికి ఆదరణ ఎన్నడూ తగ్గిపోదని రుజువు చేసింది. బుక్ ఫెయిర్లో ఒక ప్రత్యేక స్టాల్ కవిత్వ పుస్తకాల కోసం ప్రారంభించగలిగాము. అనేక మంది కొత్త కవులు రాస్తున్నారు. యువకవులు ఉత్సాహంగా రాస్తు న్నారు. కవిత్వంలో మెలకువలు నేర్చు కుంటున్నారు. సీని యర్ కవులు నేర్పు తున్నారు. ఇదంతా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.
మీ వ్యక్తిగత జీవితం గురించి...
జీవితాన్ని మలుపుతిప్పింది కె.ఎల్.నర్సింహారావు, దుర్గాదేవి గార్ల ప్రోత్సాహం. చదువుకోగలిగాను. ఎస్.ఎఫ్.ఐ విద్యార్థి ఉద్యమంలో, ప్రజానాట్యమండలిలో పనిచేయడం ఇంకో మలుపు. చేరాతల్లో బహుత్ ఖూబ్ యాకూబ్ అని కవిగా నను కనుగొనడం మరో మలుపు.
వ్యక్తిగత జీవితం విషయంలో నా సహచరి నాకు లభించడం చాలా అదష్టం. నన్ను అర్థం చేసుకుని నాతో నడిచే తోడు దొరికింది. తాను కూడా కవయిత్రి కావడం మరో అదష్టం. పేదరికంలో పుట్టాను. కారేపల్లి దగ్గర రొట్టమాకురేవు నుంచి ఇక్కడి వరకు నా ప్రయాణంలో ఎందరో ఎన్నో విధాలుగా నన్ను ఆదుకున్నారు. చిన్నప్పుడు ఐస్ క్రీములు బండిపై అమ్మేవాడిని. పేపర్లు వేసేవాడిని. కిరాణా దుకాణాల్లో పనిచేసే వాడ్ని. చాలా సరళమైన తెలుగు పల్లె జీవితమే నా వ్యక్తిగత జీవితం. తల్లిదండ్రులు మహమ్మద్ మియా, హూరాంబీలు జన్మనిచ్చారు. నా జీవితానికి దారి చూపించిన వారు కే.యల్.నరసింహారావు గారు, పురిటిపాటి రామిరెడ్డి గారు. అందుకే నా తండ్రిగారు ముహమ్మద్ మియా, గురువుగారు కే.యల్.నరసింహారావు, మామగారు పురిటిపాటి రామిరెడ్డిగార్ల పేర్లపై రొట్టమాకురేవు కవిత్వ అవార్డు ప్రతి సంవత్సరం ఇస్తున్నాము.
మీరు కవిత్వమే ఎందుకు ఎక్కువగా రాస్తారు?
ఈ ప్రశ్న చాలాసార్లు నా ముందుకు వచ్చింది. కవిత్వం నా ఊపిరి వంటిది. కథారచనకు, కవిత్వ రచనకు భేదాలు నేనిక్కడ చెప్పదలచు కోలేదు. కాని కవిత్వం ప్రాథమికంగా ఉద్వేగానికి సంబంధించినది. ఆవేశ ప్రధానమైనది. సామాజికాంశాలపై ప్రతిస్పందన కవిత్వంలో చాలా బలంగా సాధ్యమవుతుందని నమ్ముతాను. మరో ముఖ్యమైన విషయమేమిటంటే, కవిత్వం భాషకు విస్తతి ఇస్తుంది. ఇప్పుడు భాషలో స్థిరపడిన అనేక ప్రతీకలు, ప్రతిమలు ఒకప్పుడు కవిత్వ ప్రయోగాలుగా భాషలో చోటు చేసుకున్నవే. కవిత్వమే ఎందుకంటే చాలా ఇలాంటి కారణాలున్నాయి.
కవిగా మీరు ఎలా ప్రారంభమయ్యారు?
ప్రారంభం అనేది ప్రత్యేకంగా ఉంటుందనుకోను. చిన్నప్పటి నుంచి బతుకు కష్టం ఏమిటో తెలిసినవాడిని. వెనుకబాటు, ఆర్థికలేమి ఎలాంటి పరిస్థితులను సష్టిస్తాయో నాకు ప్రత్యక్షంగా తెలుసు. నిరుపేద పల్లె ముస్లింగా నేను ఎదుర్కున్న సవాళ్ళు, కార్మికుడిగా నా జీవితం విద్యార్థి దశలో వామపక్ష భావజాలం వైపు నడిపించింది. నా జీవితానుభవాలే నాకు కొలబద్దలు. అవి నేర్పిన పాఠాలే నా కవిత్వంలో అక్షరాలు. ఆకలి నా పరోక్ష గురువు.
నాకు తారసపడిన జీవితాన్ని అక్షరాల్లో ఒంపడానికి ప్రయత్నించాను. మార్క్సిజం, లౌకికవాదం, అస్తిత్వవాదాలు, ముస్లింవాదం, పోస్ట్ మాడర్నిజం, ప్రజాస్వామిక విలువలు ఇవన్నీ నాపై ప్రభావం వేశాయి. మొదటి కవితా సంపుటి ప్రవహించే జాపకం మొదలు మొన్నటి తీగల చింత వరకు ఒక అంతర్మథనమే. ఈ అంతర్మథనమే కవిత్వానికి ప్రారంభం. అందుకే నా కవిత్వమే నా ఆత్మకథ అన్నాను. అది ఎప్పుడు అక్షర రూపం తీసుకుందన్నది అంత ముఖ్యం కాదు.
మనిషి ఎన్ని ముఖాలుగా అగుపించాలో/ అన్ని ముఖాలుగా అగుపించనీ/ చివరి రూపమేదో దానంతటది నిలుస్తుంది
సాహిత్య అవార్డుల పై మీ అభిప్రాయం ఏమిటి?
జ. అవార్డులు ఒక ప్రోత్సాహాన్నిస్తాయి. మరింత శక్తితో పని చేసే ఊపునిస్తాయి. అయితే అవార్డులు ఆశించరాదు, అవార్డులను ఆశించినప్పుడు అవార్డు రాకపోతే నిరాశ కలుగు తుంది. ఈ నిరాశ నెగిటివ్ ఆలోచనలకు కారణమవుతుంది. అందువల్ల నా పద్ధతేమిటంటే, అవార్డులను ఆశించరాదు, అవార్డులు వాటికవే రావాలి. ప్రతిభను గుర్తించి ఇచ్చిన అవార్డు చాలా సంతోషాన్నిస్తుంది.
మైనారిటీ సాహిత్యం ఇప్పటికీ స్పర్శించని కోణాలు ఏమైనా ఉన్నాయా?
మైనారిటీ సాహిత్యమనే కాదు, ఏ సాహిత్యమైన మౌలికంగా జీవితాన్ని స్పర్శించాలి. మైనారిటీ సాహిత్యం ఈ పని చాలా గొప్పగా చేసింది. మైనారిటీ సాహిత్యమంటే, మీ ఉద్దేశ్యం బహుశా ముస్లిం సాహిత్యం గురించి కావచ్చు. ముస్లిములు ప్రస్తుతం ఎదుర్కుంటున్న పరిస్థితులను ప్రతిబింబించే కథలు, కవితలు మరింత విస్తారంగా రావలసిన అవసరం ఉంది.
మీ కవిత్వం అనువాదాల గురించి చెప్పండి
మలయాళంలో అనువాదాల య్యాయి. అలాగే కన్నడ, హిందీ భాషల్లోనూ అనువాదాలయ్యాయి. అంతర్జాతీయంగా ఫ్రెంచ్ భాషలో కూడా అనువాదం జరిగింది. ఇటు హిందీలోను, అటు ఫ్రెంచ్లోను అనువాదం కావడం వల్ల జాతీయ, అంతర్జాతీయ పాఠకులు చదివే అవకాశం లభించింది.
జాతీయ అంతర్జాతీయ కవిత్వం గురించి చెప్పండి.
కవిత్వం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త అభివ్యక్తి రూపాలు ముందుకు వస్తున్నాయి. అలాగే తెలుగు కవిత్వం కూడా అంతర్జాతీయ కవిత్వానికి తీసిపోని స్థాయిలో ఉంది. జాతీయ స్థాయిలో హిందీ, ఉర్దూ కవులను వర్థమాన తెలుగు కవులు చదవడం అవసరం. హిందీ, ఉర్దూ భాషల్లో కవిత్వానికి ఇప్పుడు ఇంగ్లీషు అనువాదాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కేదార్నాథ్ సింగ్ వంటి కవులను మనం చదువుకోవాలి. అలాగే అంతర్జాతీయంగా డార్విష్ వంటి కవులను చదవడం అవసరం. అంతర్జాతీయ స్థాయిలో గొప్ప కవిత్వం వస్తుంది. ఇప్పుడు అంతర్జాతీయ కవిత్వం చదవడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. గూగుల్ ద్వారా వెదికి చదువుకోవచ్చు. పొయట్రీ ఇంటర్నేషనల్ వంటి వెబ్ సైటులున్నాయి. పోయట్రీ ఇంటర్నేషనల్ రోట్టర్ డామ్ వంటి వాటిని చూస్తూ, అంతర్జాతీయ కవులను చదవడం వల్ల కవిత్వ అభివ్యక్తిలో కొత్తదనాన్ని అర్థం చేసుకోవచ్చు.
- వాహెద్, 7093788843