Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవులు ఏం చేస్తారు? ఆక్టేవియో పాజ్ భాషలో చెప్పాలంటే... కవులు గోడలకు చెవులు ఇస్తారు, మూగకి మాటిస్తారు. మూగవోయిన ఆదివాసీ గొంతుకి అరుణ్సాగర్ ఇచ్చిన మాట 'మ్యూజిక్ డైస్'. మూలవాసుల అంతరంగిక వేదనకి అక్షర రూపం ఇది.
చెట్టు మరణిస్తుంది. పిట్ట మరణిస్తుంది. మనుషులు మరణిస్తారు. చివరకు దేవుడు కూడా మరణిస్తాడు. కానీ సంగీతం మరణించదు. ఆకుల గలగలలోనో, నీటి తరగల తళతళలలోనో, మేఘాల సవ్వడిలోనో, మెరుపుల పల్లవిలోనో సంగీతం ఎక్కడో ఒక చోట తనను తాను ఆవిష్కరించుకుంటుంది. ఎందుకంటే సంగీతం శాశ్వతం కనుక. అది విశ్వజనీన భాష కనుక. అలాంటి సంగీతం కూడా మరణిస్తుంది. 'ది మ్యూజిక్ డైస్' అంటున్నాడు అరుణ్సాగర్ అనే తెలుగు కవి.
సంగీతం ఒక జాతి జీవనంలో అంతర్లీనంగా ఉంటుంది. మాటలో, మనసులో, ఆహార వ్యవహారాలలో, వేష భాషలలో, ప్రతి కదలికలో సంగీతం తనను తాను దాచుకుంటుంది. భావుకుడయిన మనిషి దానిని వెతికి వెతికి అనుభవంలోకి తెచ్చుకుంటాడు. దానితో మమేకం అవుతాడు. మనిషి మరణించాడు అంటే సంగీతంలో ఒక స్వరం మూగవోయినట్టే. ఒక జాతి మరణించిందంటే... ఒక సంగీతం మరణించినట్టే.
తను పుట్టిన మట్టి నుండి, తను కౌగలించుకున్న చెట్టు నుండి... తన పాదాలను మెల్లమెల్లగా ముద్దాడిన నీటి నుండి... తన సంగీతం నుండి, తన సాంస్కృతిక నేపథ్యం నుండి ఒక మనిషి దూరంగా జరిగి, చివరకు కనుమరుగయిపోయి, ఒడ్డున పడిన చేప పిల్లలా దు:ఖపడటం కంటే విషాదం ఎక్కడ ఉంటుంది?
అరుణ్ సాగర్ 'మ్యూజిక్ డైస్' లో రూపు కట్టిన విషాదం ఇదే! అభివృద్ధి జగన్నాథ రథచక్రాల కింద పడి నలిగి పోతున్న మూలవాసుల అంతరంగిక వేదనకి అక్షర రూపం మ్యూజిక్ డైస్.
'ఆనకట్టలు ఆధునిక దేవాలయాలు' అని ఒకప్పుడు ఈ దేశ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అన్నాడు. కానీ అవి 'సామూహిక సమాధులు' అని అరుంధతీరారు చెపుతున్నది. ఏ గొప్ప మానవ నిర్మాత మహా కట్టడాలను తీసుకున్నా అదే వ్యథ, అదే కథ. అన్నింటికీ మించి అదే గాథ. నిర్వాసితుల నిరంతర వేదన. తెలుగు రాష్ట్రాలలోని నాగార్జున సాగర్ నుండి పులిచింతల మీదుగా పోలవరం వరకు ఈ గాథనే అక్షరాలా అక్షరాలలోకి కుదించి మ్యూజిక్ డైస్ అంటున్నాడు అరుణ్సాగర్.
పోలవరం నిర్మాణంలో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలలో మొత్తం 224 గ్రామాలు ముంపునకు గురయి అస్తిత్వాన్ని కోల్పోతాయి. ఆదివాసీ సంఘాలు ఎన్ని ఉద్యమాలు చేసినా అవన్నీ రాజ్యం బలం ముందు మూగపోయాయి.
అవిభక్త ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక, తెలంగాణ నుండి ఏడు మండలాలను ఆంధ్రాకి బదలాయించి పోలవరంను అంతర్ రాష్ట్ర వివాదాల నుండి బయటకు రప్పించి, కేంద్ర ప్రాజెక్టుగా చేపట్టి తన బలంతో బలగంతో దానిని నిర్మించాలని పూనిక వహించింది.
రాజ్యం తలుచుకుంటే ఆదివాసీలు ఎంత? వారి అస్తిత్వమెంత? అస్తిత్వ రాజకీయాల యుగంలో, అస్తిత్వం కోల్పోతున్న ఆదివాసీల గోస ఎవరు పట్టించుకుంటారు. ఒక్క కవులు తప్ప.
కవులు ఏం చేస్తారు?
ఆక్టేవియో పాజ్ భాషలో చెప్పాలంటే... కవులు గోడలకు చెవులు ఇస్తారు, మూగకి మాటిస్తారు.
మూగవోయిన ఆదివాసీ గొంతుకి అరుణ్సాగర్ ఇచ్చిన మాట 'మ్యూజిక్ డైస్'.
''పుష్ప విలాపమో! బతుకు విషాదమో. నీ జనమే పోరాడుతున్న చోట కనీసం గొంతయినా కలపకపోవడం నేరం. కవితకు ఆచరణకు సాటిరాదు. అయితే గియితే ఒక సహానుభూతి. ఒక మద్దతు ప్రకటన. ఒక విధాన అనుసరం. ఒక ధైర్య వచనం. ఒక నినాద రచన. ఇది మరణిస్తున్న పాటను చూస్తూ వ్యథలోతుల్లోకి కూరుకుపోతున్న హృదయం'' ఇది అరుణ్సాగర్ చెప్పుకున్న 'కన్ఫెస్'.
ఈ కన్ఫెషన్ ఇప్పుడు కేవలం ఆదివాసీలకు మాత్రమే కాదు, సమస్త భారత ప్రజానీకానికి కావాలి. లేకపోతే, ఈ అభివృద్ధి నమూనా మొత్తం సమాజానికే ఒక డెత్ సెంటెన్స్గా మారక తప్పదు.
***
భద్రాచలం నుండి పాపికొండలు వెళ్ళాలంటే కూనవరం దాకా బస్సులో వెళ్ళాలి. కూనవరం శబరీ సంగమ స్థలం. ఎర్రటి ముత్యాల్లా ఆరబోసిన మిరప కళ్ళాలు, రహదారి వెంట బారులు బారులుగా నడిచి వెళ్తుంటే గిరిజన స్త్రీలు, విల్లంబులు ధరించిన గిరిజన యువకులు, వెదురు పొదల గుసగుసలు, విప్పసారా ఘుమఘుమలు... బొంగు చికెన్ కోసం పరుగులు తీసే నాగరికులు... ఇలా ఎన్నెన్నో జీవన దృశ్యాలు కనిపిస్తాయి.
ఆ దృశ్యాలు అనుక్షణం వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి జీవన దృశ్యంలోంచి ఎదిగి బయటికి వచ్చిన ఒక యువకుడు... ట్రేసీచాప్మన్ను, చీట్నిస్నూ, జాకీచాన్ను తన కవిత్వ ముడిసరుకుగా చేసుకున్నవాడు, 'విలయర్ మేల్' అంటూ వాపోయేవాడూ అయిన అరుణ్సాగర్ ఎంత వేదనని ఇన్నిన్ని అక్షరాలు, ఇన్నిన్ని పదబంధాల ద్వారా, ఇంతింత వినూత్న పరచిత్రాల ద్వారా... నిరలంకార, నిరాపేక్ష ప్రతీకల ద్వారా కవిత్వంలో గుప్పించాడో చదువుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది.
మూలన పొగాకు బేళ్ళు
ఎండిపోయిన తునికాకు విస్తళ్ళు
బట్టీలు కట్టి కట్టుకున్న ఇళ్ళు
నిను పెంచి పెద్ద చేసిన ఇళ్ళు
ఇప్పుడు మెట్ల మీద జ్ఞాపకంలా కూలబడిపోతే గుండెను ఎవరో సన్నగా కోస్తున్నట్టు ఉంటుంది. దు:ఖం తీవెలాగా సాగి ఇళ్ళనిండా, నల్లకళ్ళనిండా నీళ్లు నిండిన దృశ్యాన్ని హృదయ ఫలకం మీద ముద్రిస్తుంది.
ఇప్పుడే ఇళ్ళు కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న గాథలు. కవి ఉద్దేశ్యపూర్వకంగానే వీటిని కథలు అనకుండా గాథలు అంటున్నాడు. కథ కల్పితం. గాథ వాస్తవం. ఒక లెజెండరీ లక్షణం గాథకి ఉంటుంది. కథకి కాల్పనిక లక్షణం ఉంటుంది. గాథ వాస్తవాల నుండి కథ వైపు ప్రయాణిస్తుంది.
సీదర సెంద్రయ్య పేరుతో తన స్నేహితుడి గురించి రాసిన స్మృతిగీతం చదివాక హృదయం గోదారిలా క్షణంలో దు:ఖంతో పొంగిపోతుంది. క్షణంలో అనుభూతి ఎండిపోయి గ్రీష్మగోదారిలా మిగిలిపోతుంది.
వాడి కాళ్లకింద మట్టి
నీటి పాలయితే
నది కన్నీటి పాలు కాకుండదా...?
కడుపుల పెట్టుకున్న ప్రేమకతలు
కడలిలోన కలువకుండా
ఆనకట్టకు అడ్డం పడకుండుంటదా?
అమ్మ గదరా... మరి
గోదారమ్మ గదరా మరి
అంటూ ఒక పాజిటివ్ నోట్తో ముగిస్తాడు. సంగీతంలో పాజిటివ్ నోట్ సరే... పోలవరం ఆనకట్టకు గోదారి అడ్డు పడటం మాత్రం కలేమరి. ఈ వాస్తవాన్ని ఘంటా చక్రపాణి గారు సరిగానే గుర్తించారు.
''అరుణ్సాగర్ అర్థవంతమయిన నిరసనే ఉన్న రాముడిని ముంచేసిన భక్త జనపాలనలో భద్రాచలం రాముడు కాదు గదా అసలు సిసలు దేవుడు దిగివచ్చినా అది ఆగదు'' అని ఘంటాపథంగా చెపుతున్నారు.
ఎందుకంటే రాజ్యం బలమయింది. ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలు ప్రజలకంటే బలమయినవి. అదే ఆధునిక ప్రజాస్వామ్య విషాదం.
మరి ఈ కవిత్వం ద్వారా ఏం సాధించేట్టు? కవిత్వంలాగే, దు:ఖం కూడా చిరంజీవి. కవిత్వం లాగే దు:ఖం కూడా శాశ్వతం. ఎప్పటికీ మిగిలే ఉంటుంది. ఈ దు:ఖం ఎవరినో ఒకరిని కదలించక పోతుందా అన్న చిగురంత ఆశ.
పోలవరంలోనూ, కవిత్వంలోనూ, ఆదివాసీలతోనూ ఏ సంబంధం లేని ఒక మైదాన ప్రాంత నాగరికుడిని ఈ పుస్తకం చదవమని ఇస్తే అంతా చదివి ''అన్యాయం కదా సార్'' అన్నాడు.
ఆ మాట అందరూ అనాలని చిన్న కోరిక. నెరవేరుతుందా... ఏమో...
అరుణ్సాగర్కి అభినందనలు.
- వంశీకృష్ణ, 9573427422