Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ నేలమీద 1956కి పూర్వం కథలు రాసిన వారిలో పొట్లపల్లి రామారావు ప్రముఖులు. ఆధునికతను అందిపుచ్చుకున్న సృజనశీలి. ఆయన కథల్లో తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యం ఉంది. ఆ పోరాట నేపధ్యాన సమాజంలోని కదలికలు, ఆలోచనా ధోరణులు ఆయన కథల్లో కనిపిస్తాయి. పొట్లపల్లి రామారావు చాలా సౌమ్యుడిగా కనిపిస్తాడు. కానీ, అతని తత్వంలో ధిక్కారం ఉంది. తిరుగుబాటు లక్షణం ఉంది. ఆధిపత్యాలను, ఆధిపత్యాల కేంద్రంగా ఉన్న ప్రభుత్వాలను, అవి నిర్దేశించిన సూత్రాలను అత్యంత నిర్మొహమాటంగా తన కథల్లో ఆయన దునుమాడాడు. అసమానతలకు కారణమైన సామాజిక అక్షణాలపై ఆయనకు అప్పటికే ఒక స్పష్టమైన అవగాహన ఉంది. 'న్యాయం' కథ అటువంటిదే. ముఖ్యంగా మనిషిలోని అసహాయత, అజ్ఞానమే ఒకని లోకువతనానికి, మరొకని ఆధిపత్యానికి దారి తీస్తుందని చెబుతాడు. అలాగే రామసింగు అనే పాత్ర ద్వారా అవును, ఏ విధంగానైనా బ్రతుకుతెరువుకు తోడ్పడని శాసనాలు, ప్రభుత్వాలు ఉన్నప్పుడు బీదలు శాసనధిక్కారం చేయక ఏమి చేస్తారని ప్రశ్నింపజేశాడు. సత్యాన్ని మరుగుపరిచి అసత్యం ఎలా ఊరేగుతుందో కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. నూటికి కోటికి సత్యం చెప్పేవారెవరైనా ఉంటే వాళ్ళను విప్లవకారుల కిందనో, దేశ ద్రోహుల కిందనో జతకట్టి జైళ్ళలో తోసేస్తారని విముక్తి కథలో ఓ పాత్రతో అనిపిస్తాడు రచయిత. రాజ్య స్వభావం పట్ల పొట్లపల్లి రామారావుకు అప్పుడే స్పష్టమైన అవగాహన ఉందని చెప్పడానికి సోములు చేసిన నేరము ''దొంగతనము చేయించింది ఆకలి, శాసనాలు చేసే ప్రభుత్వం'' అని 'జైలు' కథలో చెప్పిన మాటలు నిదర్శనం. 'మా గ్రామం' కథల రాజ్య యంత్రాంగం ఎంత పకడ్బందీగా ఉంటుందో, దానికి దళారులు ఎవరో చెబుతుంది. ఆ యంత్రాంగం సమాజంలోని కింది స్థాయిలో ఎంత పకడ్బందీగా ఉంటే, పై స్థాయి వరకు అంత పకడ్బందీగా వుంటుందని ఈ కథ నిరూపిస్తుంది. దాని దుష్ట స్వబావం ప్రభుత్వాల తాబేదార్ల నుంచి ఎలా పైకి పాకుతూ పోతుందో ఈ కథనే కాకుండా 'న్యాయం' కథ కూడా అంత ప్రతిభావంతంగా చెబుతుంది. 'హఠం', 'వెన్న' కథలు అత్యంత సరళమైన రీతిలో కళనాత్మకంగా రచయితలు లేదా మేధావుల ఆలోచనా సరళిని వివరిస్తాయి. కీర్తి కోసం పాకులాడే మధ్య తరగతి మేధావుల వలువలు విప్పుతాయి. ఇతరుల గౌరవము కొరకు ఆత్మస్వేచ్ఛను చంపుకునే తన బలహీనతలన్నీ గోపాల్రావుకు జ్ఞాపకం వచ్చాయని హఠం కథలో రచయిత వ్యాఖ్యానిస్తాడు. ఈ రెండు కథల్లోనూ పిల్లల మనస్తత్వాలను తీసుకుని పెద్దలు గుణపాఠం నేర్చుకునే పద్ధతిని రచయిత ఎంపిక చేసుకున్నాడు.
కులం అసమానతలను పెంచి పోషిస్తూ మానవుల మధ్య దడి కడుతున్న వైనాన్ని ఊరు అడవి కథలో పొట్లపల్లి రామారావు నర్మగర్భంగా చెప్పారు. నీరు అడిగితే పేరు అడుగుతారంటూ కులం ప్రాధాన్యాన్ని చెప్పారు. 'ముత్యాల బేరం' కథ బాధితుల పక్షాన ఆలోచించే ఓ వ్యక్తి ఎలా పిచ్చివాడిగా పరిగణనలోకి వస్తాడో చెబుతుంది. సామాజిక పోకడకు, లక్షణాలకు భిన్నంగా వ్యవహరిస్తూ లోక కళ్యాణాన్ని కోరుకునే వ్యక్తి కోరుకునే వ్యక్తి సమాజానికి అర్థం కాకపోవడాన్ని ఈ కథలో చూస్తాం. 'గజేంద్రమోక్షం' కథ చదువుతుంటే పతంజలి పిలక తిరుగడు పూవు కథ గుర్తుకు రావడం యాదృచ్ఛికమే కావచ్చు. జైల్లో సిగరెట్ ముక్క, నా డైరీలో కొన్ని పేజీలు, కల వంటి కథల్లో పొట్లపల్లి రామారావును ఆలోచనాపరుడైన రచయితగా, ఆధునికతను అందిపుచ్చుకున్న రచయితగా చూస్తాము. ఆలోచనలో, వ్యక్తీకరణలో ఆయన కాలం కన్నా ముందున్న రచయిత అని మనకు ఆయన రాసిన కథలు వెల్లడిస్తాయి. అదే సమయంలో పొట్లపల్లి రామారావు రైతుల పక్షాన నిలిచిన రచయిత అని గ్రహిస్తాం. రాజ్య యంత్రాంగానికి గ్రామం ఎలా మూలకేంద్రమో, దేశ ఆర్థిక వ్యవస్థకు మూలం వ్వవసాయమనే విషయాన్ని చాలా నిర్దిష్టంగా ఈ కథలు చెబుతాయి. ఆ రకంగా నిర్థిష్టత నుంచి సార్వజనీనతకు ఈ కథలు విస్తరిస్తాయి. కోస్తాంధ్రకు చెందిన కరుణకుమార, పాలగుమ్మి పద్మరాజు తదితరుల స్థానంలో నిలబెట్టడానికి తగిన వస్తువు, కథనా నైపుణ్యం పొట్లపల్లి రామారావు ప్రదర్శించారు.
తన అమూర్త భావనలకు, ఆలోచనలకు సమర్ధవంతమైన మూర్త రూపం ఇచ్చారు పొట్లపల్లి రామారావు. ఆలోచనలను, భావాలను రాసుకుంటూ పోతే కథ రాదు, కథా నిర్మాణానికి కావల్సిన పనిముట్లు వేరే ఉంటాయి. సమస్య, సంఘటన, పరిష్కారం కథను నిర్మిస్తాయి. ఈ మూడు విషయాల్లో పొట్లపల్లి రామారావు తన సామర్థాన్ని, విచక్షణను తన కథల్లో ప్రదర్శించారు. క్లుప్తత పాటించారు. అక్కడక్కడ ఆ కాలం తెలుగు రచయితల మాదిరిగానే జోక్యం చేసుకుని వ్యాఖ్యానాలు చేసినప్పటికీ అతివ్యాప్తి ఎక్కడా కనిపించదు. ఆమూర్త భావనలకు,ఆలోచనలకు సంఘటనలు, పాత్రల ద్వారా మూర్తరూపాన్ని కల్పించి, అద్భుతమైన శిల్ప నిర్మాణాన్ని ప్రదర్శించారు. మరి, ఎందుకు పొట్లపల్లి రామారావు తెలుగు సాహిత్యానికి ఆనకుండా పోయాడు. అలా అనకుండా పోవడానికి గల కారణాలను ఇప్పటికే చాలా చెప్పుకున్నాం. ఆయన కథలు తెలుగు సాహిత్యంలో ఏ కోవకు, ఏ స్థాయికి చెందుతాయో అర్థం చేసుకోడానికి కథా సాహిత్య ప్రియులు శ్రద్ధగా చదవాలి.
- కాసుల ప్రతాపరెడ్డి, 9848956375