Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బోయి భీమన్న గారు ప్రముఖ సాహితీవేత్త. నాటకకర్తగా కవిగా ఆయన రచనలు సమాజాన్ని కొత్తగా దృశ్యమానం చేశాయి. బడుగు వర్గాల యువతను విద్యార్జన వైపు మళ్ళించాయి. నవ్య సాహితీ సమితి అధ్యక్షులుగా వారు రెడ్డి హాస్టలు ప్రాంగణంలో 1960 మే నెల ఆరవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు నిర్వహించిన 'అఖిల భారత తెలుగు రచయితల' మహాసభలు హైదరాబాద్ నగరంలోనే ఒక సంచలనం. బోయి భీమన్న (1911 - 2005) గారు అప్పటి నవ్యసాహితీ సమితి నిర్వాహక కార్యదర్శి పోతుకూచి సాంబశివరావుగారూ (1926 - 2017) ఈ సభలకు నిర్విరామంగా కృషి చేసి తెలుగు వారిలో నూతనోత్సాహం నింపారు. తెలుగు కవులనూ రచయితలనూ ఒక దగ్గర చేర్చి సభలు నిర్వహించాలనే వీరి సంకల్పానికి మొదట్లో కొన్ని అవాంతరాలు ఎదురైనా ఈ సభలను వీరు జయప్రదంగా నిర్వహించగలిగారు.
హైదరాబాద్లో అప్పడు ఉర్దూ భాషాప్రాబల్యం ఉండేది. ముషాయిరాలు, కవి సమ్మేళనాలు జోరుగా సాగుతుండేవి. 1960 నాటికి భీమన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వోద్యోగిగా 'సీనియర్ టాన్స్లేటర్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ బుక్స్'గా వుండేవారు. రాష్ట్ర ప్రభుత్వపు అధికారిక ఉత్తరువులు - పత్రాలు తెలుగులోకి అనువదించటంతో పాటు ప్రభుత్వం తలపెట్టే సాహిత్య కార్యక్రమాలు వీరి కార్యాలయ పరిధిలోకే వచ్చేవి. భాషపై పట్టు సాధించిన రచయితగా భీమన్న గారికి ప్రత్యేక గుర్తింపు వుండేది.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సందర్భంగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంత కార్యాలయాల విలీనం జరిగింది. అప్పటికి భీమన్న తన రచనల ద్వారా తెలంగాణ ప్రాంతపు కవి పండితులకు సుపరిచితులు. పాలేరు, కూలిరాజు నాటకాల రచయితగా దీపసభ కార్యకర్తగా హైదరాబాద్ రచయితలు ఆయనను మైత్రీభావంతో అక్కున చేర్చుకున్నారు. ఆంధ్ర నుంచి వచ్చిన రచయితలకు ఆహ్వానం పలుకుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖ ఆచార్యులు ఖండవల్లి లక్ష్మీరంజనం గారు ఒక సభ ఏర్పాటు చేశారట. ఆ విధంగా భీమన్నకు కాళోజీ, కురుగంటి సీతారామయ్య ప్రభృతులు పరిచయమయ్యారు. హైదరాబాద్లో అప్పటికి వేమనాంధ్ర భాషానిలయం ప్రసిద్ధంగా ఉండేది. నవ్యసాహితీ సమితి సమావేశాలు అక్కడే జరుగుతుండేవి. కురుగంటి వారు నవ్యసాహితీ సమితి అధ్యక్షులు. వారు భీమన్నను తమ సంస్థకు ఉపాధ్యక్షులుగా చేసుకున్నారు. అనంతర కాలంలో భీమన్న ఆ సంస్థ అధ్యక్షులయ్యారు. 1960లో భీమన్నకూ, పోతుకూచివారికీ తెలుగు రచయితలనందర్నీ ఒకేచోట సమావేశపరచాలనే సంకల్పం కలిగింది. చాలామంది పండితులు ఈ ప్రయత్నాన్ని మన:పూర్వకంగా సమర్థించలేదట. సభలు ఎక్కడ పెట్టాలి, ఆర్థిక వనరులు ఎలా సేకరించాలి అనే సమస్యలన్నీ అధిగమించి భీమన్న గారూ సాంబశివరావుగారూ ఈ సభలు జయప్రదంగా నిర్వహించారు. అప్పటికి అడ్వకేట్గా వున్న చిన్నపరెడ్డిగారూ, మిఠాయి షాపు నడుపుతున్న పుల్లారెడ్డిగారు తొలి విరాళాలు అందించగా రెడ్డి హాస్టల్ ప్రాంగణాన్ని సభలకు వేదికగా నిర్థారించారు.
ఆ నాలుగు రోజులూ దానిని సరస్వతీ నగర్గా పిలిచారు. సభల ప్రారంభానికి ముందు 'సరస్వతీ పతాక' ఎగురవేశారు. దానిరూపకర్త భీమన్నగారే. పి.ఆర్.రాజు పతాకను తయారు చేసి ఇచ్చారట.
సభల కోసం ఒక ఆహ్వాన సంఘం ఏర్పడింది. అప్పటి విద్యాశాఖమంత్రి ఒప్పుకోకపోతే దామోదరం సంజీవయ్యగారిని ఆహ్వాన సంఘాధ్యక్షునిగా పెట్టుకున్నారు. అప్పటికి ఆయన మంత్రి వర్గంలో ఉన్నారు. రెడ్డి హాస్టల్లో పండగ వాతావరణం నెలకొన్నది. దేవులపల్లి రామానుజరావుగారు పూర్తి సహకారం అందించగా ఆ సభలను సర్వేపల్లి రాధాకృష్ణన్ (అప్పటి ఉపరాష్ట్రపతి) ప్రారంభించారు. బూర్గుల రామకృష్ణారావుగారు సభాధ్యక్షులు. పండితుల ప్రసంగాలు - కవి సమ్మేళనాలు - నృత్య సంగీత రూపకాల ప్రదర్శనలు... వీటితో రెడ్డి హాస్టలు సరస్వతీ నిలయమే అయింది. సంపత్కుమార్ 'జాలరి నృత్యం', జానకీరాణిగారు నిర్వహించిన 'వేలవేల చంద్రుడు' నృత్యరూపకం, భీమన్న గారి 'ఒక్కొక్క దీపం' గేయ నృత్య ప్రదర్శన లాంటివెన్నో అహూతులకు అప్పటి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.
ఈ సభలలో పన్నెండు మంది కవి పండితులను సత్కరించారు. దానికీ తెరవెనుక కొంత కథ నడిచింది. ఎవరిని ఎంపిక చేయాలనే సమస్యరాగా భీమన్నగారూ సాంబశివరావుగారూ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారిని సలహా అడిగారు. ఆయన దాదాపు నలభైమంది పేర్లను జాబితా ఇచ్చారు. ఆ జాబితా పరిశీలిస్తే అందులో చాలాపేర్లు వీరిద్దరికి కొత్తవి. తెలిసిన పేర్లలో ఒక వర్గం వారే ఎక్కువగా వున్నారు. ఇలా కాదని వారిద్దరూ మరో జాబితా తయారు చేశారట. ఆ రోజు బెజవాడ గోపాల్రెడ్డి గారి చేతుల మీదుగా సత్కారం పొందిన వారిలో శ్రీశ్రీ, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, తాపీ ధర్మారావు, పూతల పట్టు శ్రీరాములు రెడ్డి, తుమ్మల సీతారామమూర్తి చౌదరి, ఆదిరాజు వీరభద్రరావు, నాయని సుబ్బారావు, గుర్రం జాషువా, గడియారం వెంకటశేషశాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, శివశంకరస్వామి, విశ్వనాథ సత్యనారాయణ గారలు వున్నారు. కుల వర్గాలను సమన్వయం చేసుకుంటూ ఈ జాబితా రూపొందించారు. దానితో దేవులపల్లి వారికి ఆగ్రహం వచ్చిందని వినికిడి. ఈ సభలు తెలుగు భాషాభిమానుల ఆదరాభిమానాలు చూరగొన్నాయి. పెద్దలూ, పిన్నలూ అందరూ భాషాపరంగా నూతనోత్తేజాన్ని పొందారు.
ఈ సభల తర్వాత తెలుగు భాషా సారస్వతాల పరంగా ఎన్నెన్నో మహాసభలు జరిగాయి. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి గారూ, ఇతర పెద్దలూ తెలుగును విస్తృత పరిధిలో వాడకంలోకి తేవాలనీ తెలుగు భాష ఔన్నత్యాన్ని పెంచాలనీ తపన పడుతున్నారు. రెడ్డిహాస్టల్ ప్రాంగణాన్ని విస్తరించే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. ఈ సమయంలో భీమన్నగారిని గుర్తు తెచ్చుకోవటం అసందర్భం కాబోదు. హైదరాబాద్లోని సాహిత్య కార్యక్రమాలను ఎన్నింటినో విద్యార్థుల హాస్టల్లలో జరిపించిన చరిత్ర భీమన్నగారిది.
1961లో గౌడ హాస్టల్లో జరిగిన సారస్వతోత్సవాలకు భీమన్నగారు అధ్యక్షుడు. 1962 సెప్టెంబర్ నుండి 1963 సెప్టెంబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గురజాడ శతజయంతి ఉత్సవాల నిర్వహణలో భీమన్నగారిది కీలక పాత్ర. ఆ ఉత్సవ కమిటీకి అప్పటి విద్యాశాఖమంత్రి పి.వి.జి.రాజు అధ్యక్షుడు. భీమన్న గారు కార్యదర్శిగా ట్రెజరర్గా బాధ్యతలు నిర్వహించారు. నవ్యసాహితీ సమితి అధ్యక్ష కార్యదర్శులుగా భీమన్న పోతుకూచి గార్ల మైత్రి అవిచ్ఛిన్నంగా సాగింది. వారిద్దరూ కృష్ణార్జునుల లాగా వుండేవారు. ''నేను భీమన్నగారి పబ్లిక్ వైఫ్ని. సాహిత్యరంగంలో మా జంట అటువంటిది'' అని పోతుకూచి వారు చెప్పుకున్న సందర్భాలున్నాయి.
భీమన్నగారు అప్పటికే భాషా సాహిత్యాల పరంగా ఎన్నో అవార్డులు పొంది వున్నారు. అనంతర కాలంలో పద్మశ్రీ, కళాప్రపూర్ణ, పద్మభూషణ్ అవార్డులు వారిని వరించాయి. వారు గొప్ప క్రాంత దర్శి. రావు బహుద్దూర్ వెంకట్రామారెడ్డి గారి 148 వ జయంతి సందర్భంగా రెడ్డి హాస్టల్ క్యాంపస్ను విస్తరించి దానిని సరస్వతీ నిలయంగా అభివృద్ధి చేసే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతున్న ప్రస్తుత సమయంలో 57 సంవత్సరాల క్రితమే అక్కడి విద్యా సౌరభాన్ని గుర్తించి సభలు నిర్వహించిన భీమన్నగారికి నివాళులు అర్పించే చిరుయత్నం ఈ వ్యాసం.
(సెప్టెంబర్ 19 భీమన్నగారి జయంతి)
- డా||బి.విజయభారతి
- డా||బి.నాగవర్మన