Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సరైన సమయంలో సరైన వేదిక నుండి వెలువడిన అపూర్వ పుస్తకం 'మన కాళోజీ'. ఈ రోజుకి ఆయన మననుండి దూరమై 15 సంవత్సరాలైంది (13 నవంబర్ 2002న మరణించారు). ఆయన జయంతిని తెలంగాణ భాషాదినోత్సవంగా జరపాలని, ఇంటర్ దాకా తెలుగు మాధ్యమంలోనే విద్య కొనసాగించాలని దాదాపు 43 ఏళ్ళ తర్వాత హైదరాబాద్లో ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుకోబోతున్న వేళ ఈ పుస్తకం సమకాలీనత ఎంతైనా ఉంది.
'తెలంగాణ సాహితి' సంస్థ రాష్ట్రకన్వీనర్గా, ఉమ్మడి రాష్ట్రంలో సాహితి స్రవంతి ప్రధాన కార్యదర్శిగా, కవిగా, విమర్శకుడిగా, రచయితగా, వ్యాసకర్తగా, ఉపాధ్యాయుడిగా, బహుముఖ సాహితీ అక్షర సేద్యం చేస్తున్న కె.ఆనందాచారి ఈ పుస్తకం రాయడం అభినందనీయం.
ప్రజాపోరాట క్షేత్రాన్ని, ఎన్నికల పార్లమెంటరీ పద్ధతిని... చూసిన కాళోజీ గొప్ప దేశభక్తుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, నైజాం వ్యతిరేక పోరాటంలో జైళ్ళకు వెళ్ళినవాడు. రజాకార్ల దౌష్ట్యాన్ని చూసినవాడు, చట్టసభల్లో కూర్చుని పని చేసినవాడు. ఇందిరమ్మ ఎమర్జెన్సీని వ్యతిరేకించడమే కాదు... ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై పోటీ చేసిన ధీరుడు. రాయప్రోలు లాంటి కవి నిజాంకు వ్యతిరేకంగా ఒక్క పదం కూడా రాయని స్థితిపై ''లే మావి చివురులను లెస్సగా మేసేవు / రుతురాజు వచ్చెనని అతిసంభ్రమముతోడ
మావి కొమ్మల మీద మైమరచి పాడేవు/ తిన్న తిండెవ్వారిదే! పాడు పాటెవ్వారిదే కోకిలా?''
అంటూ కవిత రాసి (ఉస్మానియాలో) రాయప్రోలుకే వినిపించిన ప్రజాకవి కాళోజీ. ప్రజల భాషలో లేని గ్రాంథిక సాహిత్యం మాకు వద్దు - పండితుల కోసమే మీరు సాహిత్యం రాయాలని విశ్వనాథ వారికే తెల్పిన జనకవి కాళోజీ.
మాండలిక భాషాభివృద్ధికి... తెలంగాణ రచయిత సంఘం ఆవిర్భావానికి కవిగా జనం వైపు చివరి శ్వాసదాకా నిలిచిన గొప్ప దేశభక్తుడు - స్వేచ్ఛా ప్రియుని జీవితాన్ని క్లుప్తంగా - సమగ్రంగా అందించిన ఆనందాచారి అభినందనీయులు. వీరు గతంలో సుందరయ్యపై దీర్ఘకావ్యం వెలువరించి విమర్శకుల ప్రశంసలొందారు.
ధిక్కార గళం మన కాళోజీ, రచన : కె.ఆనందాచారి, పేజీలు : 48, వెల : 50/-, ప్రతులకు : కె.ఆనందాచారి, ఇం.నెం.11-10-730/11, బుర్హన్పురం, ఖమ్మం. సెల్ : 994878660
- తంగిరాల చక్రవర్తి, 9393804472