Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''కర్మ సిద్ధాంతం మీరు చెప్పిన అందమైన అబద్దం...
కుల ధర్మం మీరు కల్పించిన పచ్చి బూటకం...
ఇది దైవ నిర్మితమూ కాదు ఇది వేద చోదితమూ కాదు...
వర్ణాశ్రమ ధర్మం పేరిట యావత్ సామాన్య ప్రజల్ని
శూద్రులుగా, పంచములుగా వర్ణించే మీ ధర్మాన్ని
తెగ నరికిననాడే... నా ప్రజలకు విముక్తి నాకు శాంతి'' అంటారు సి.వి.
ఆయన అక్షరాలు నిత్య జ్వలన స్వరాలు. కొత్త తరాలను కదిలించే నిప్పుల కలం. సత్యాన్ని చాటిన హేతువాదానికి మహోగ్ర రూపం. వైజ్ఞానిక సారస్వతంతో తెలుగునేలను సారవంతం చేసిన మేధోబలం. ఆయనే... చిత్తజల్లు వరహాలరావు.
చిత్తజల్లు వరహాలరావు అంటే ఎవరో తెలియదు. సి.వి అనగానే 'ఔరా' అంటారు. అలా తెలుగు సాంస్కృతికోద్యమ సేనానిగా, ప్రముఖ హేతువాద కవిగా అలుపెరుగని కలం యోధుడుగా... ఆరు దశాబ్దాలపైగా అక్షర జ్వలనాలతో వెలిగిన జ్ఞాన సూర్యుడుగా... సి.వి 88వ యేట చివరి శ్వాస విడిచారు. ఆయన నడిపించిన, నడుస్తున్న హేతువాద ఉద్యమం. భారతీయ తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసిన చార్వాకవాది. ప్రత్యామ్నాయ సాహితీ సృజనను పుంఖానుపుంఖంగా చేసి, వేదాలు, ధర్మశాస్త్రాలు అధ్యయనం చేసి, అందులోని వైరుధ్యాలను బయటపెట్టిన సాహసి. మనుస్మృతి లోతులు చూసి, వర్ణ వ్యవస్థ పునాదులు తవ్విన సమసమాజ భావనకు పతాకలెత్తిన విప్లవమూర్తి. కమ్యూనిస్టు ఉద్యమం నుంచి వచ్చి కమ్యూనిస్టుల ఐక్యత గురించి, కమ్యూనిస్టులు చేయాల్సిన సామాజిక సాంస్కృతిక, సాంఘిక, తాత్విక ఉద్యమాలను ఇంకా బలంగా నడపవల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. కుల వివక్ష అస్పృశ్యతను, కులాన్ని పారదోలకుండా, మూఢాచారాల బూజును దులపనిదే ఆర్థిక పోరాటాలు విజయవంతం కావని అన్న ఆధునిక వైతాళికుడు సివి.
వర్ణం, కుల అభ్యుదయ విప్లవ జీవన విధానాల్లో కూడా దాగుందని గమనించి 'వర్ణ వ్యవస్థ' చార్వాక దర్శనం, సత్యకామ జాబాలి. 'మధ్యయుగాల్లో కులం' వంటి లోతైన విమర్శనా గ్రంథాలు రాశారు. కుల నిర్మూలన వాదిగా, గొప్ప కవిగా ఆయన వర్ణనా సామర్థ్యం 'పారిస్ కమ్యూన్'లో, 'నరబలి'లో మనకు అద్భుతంగా కనిపిస్తుంది. ఆయన అక్షరాలతోనే ఆయుధాలను తయారు చేస్తారు. అక్షరాల్లో సాయుధ సైనిక కవాతులు కళ్ళెదుట చూపిస్తారు. శ్రీశ్రీ కవిత్వంలోని పరుగు సివిగారి కలంలో కనిపిస్తుంది. కమ్యూనిస్టు ఉద్యమాలు మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ భావజాలాన్ని ప్రచారం చేయాలని, మతోన్మాదాన్ని కేవలం రాజకీయాల ద్వారా ఎదిరించేవారు. తప్పకుండా సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమానికి పదును పెట్టాలనేదే ఆయన భావన. తరతరాల ఛాందస భావాల్ని నూరిపోసిన పుక్కిటి పురాణాలకు ప్రత్యామ్నాయంగా శాస్త్రజ్ఞానం కావాలని సి.వి ప్రబోధించారు. మార్క్స్, లెనిన్, మావో అందరూ నాస్తికులే. హేతువాదులే. గతితార్కిక భౌతిక వాదాన్ని జీవితంగా మలుచుకున్నవారే. మరి మన జీవితాల్లో కూడా హేతువాద జీవన విధానం ఎందుకు లేదు అని సి.వి ప్రశ్నించారు.
కుల వ్యవస్థ, ఛాందస మత ధర్మాలు, అమానవీయ రాజకీయ వాతావరణంపై పదునైన కత్తితో దునుమాడిన సి.వి 24 గ్రంథాలు రచించారు. భావితరాలకు అమూల్య భాండాగారాన్ని అందించే అవసరాన్ని గుర్తించిన ప్రజాశక్తి సి.వి సమగ్ర సాహిత్యాన్ని ప్రచురించింది. యువ లోకపు మస్తిష్కాలకు పట్టిన ఛాందస భావాల దుమ్ము దులిపింది. వారిని అభ్యుదయంవైపు నడిపించింది. శాస్త్రీయ విజ్ఞానం ప్రజల్లో పెంపొందించడానికి ఆయన కృషి నిరంతర సాధన చేశారు. సామాజిక విముక్తి జరగనిదే రాజకీయ విముక్తి అసాధ్యం అని చాటిచెప్పిన వైతాళికుడు. అడుగడుగున ఆధిపత్యాన్ని ప్రశ్నించి తెలుగు కవిత్వాన్ని శూద్రీకరించిన సాంఘిక విప్లవ కవి. మార్క్సిజం నన్ను మనిషిని చేసింది. గతితార్కిక భౌతికవాదం ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన ఒక చట్రాన్ని అందించింది. అంబేద్కర్ రచనలు భారత సామాజిక నిర్మాణాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి ఉపకరించాయని చెప్పేవారు. పెరియార్ రచనలు ఆర్యుల అసలు రూపాన్ని ఆవిష్కరించాయని, ద్రవిడ మూలాలను గురించిన చైతన్యాన్ని నాలో పెంచి పోషించాయని అన్నారు. సమాజంలో విశృంఖల స్వైర విహారం చేస్తున్న మూఢ విశ్వాసాలు, దోపిడీ దౌర్జ్యన్యాలు, ఆకలి హాహాకారాలకు వ్యతిరేకంగా నిరంతరం రాయడమే పోరాటమని నమ్మి రచనారంగంలోకి అడుగుపెట్టినవారు. కమ్యూనిస్టులకు రెండు ఆయుధాలని, ఒకటి నోరు, రెండోది కలం అన్నారు. 'నా ఆయుధం కలం' అన్నారు. దాన్ని ఎక్కడా లొంగక, వంగక అవార్డులకు, సన్మానాలకు, పొగడ్తలకు ధన కాంక్షకు, ఆశ్రిత పక్షపాతానికి లోబడకుండా జీవించిన కవి సి.వి. ఈనాటి ఉద్యమకారులందరికి జీవితాచరణలో ఆదర్శప్రాయుడు.
1930 జనవరి 14న గుంటూరులో జన్మించారు. మద్రాసులో ఎం.ఎ చదివి సహకార శాఖలో ఆడిటర్గా పనిచేశారు. దురాచారాలు, దుర్మార్గాలు, మత ఛాందసాలు చూసి చలించి, వాటిపై పోరాడాలని నిర్ణయించుకున్నారు. వెనువెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి విజయవాడలో పాత్రికేయ రంగంలోకి అడుగుపెట్టారు. జనశక్తి పత్రికలో ఆయన తొలి రచనలు అచ్చయ్యాయి. ఆయన తరం రచనలు ఎందరినో కదిలించి, ఊగించి, లాలించి, ఉరవళ్ళు పరవళ్ళు తొక్కించింది. ఈ తరం ప్రజలూ సి.విని ఎప్పుడూ మర్చిపోరు. మనిషి ఆలోచన చేసే అవకాశం లేకుండా దోపిడీ వర్గాలు కుట్రలు చేస్తున్నాయి. మన దేశ జనాభా కోట్లల్లో. పూజించబడే దేవుళ్ళ సంఖ్య కూడా కోట్లల్లోనే ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. బానిస సమాజంలో స్వర్గం, నరకం సిద్ధాంత కర్తలపై మొట్టమొదటిసారిగా తిరుగుబాటు చేసిన భౌతిక చార్వాకులు, లోకాయతుల నుండి ఈనాటికీ అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. కారుచీకటిలో కాంతి రేఖలా ఎంతోమంది సి.వి లాంటి గొప్ప రచయితలు, సామాజిక వేత్తలు వామపక్ష ప్రజాతంత్ర వాదుల వాదానికి ఈనాడు రోజురోజుకు బలం పెరుగుతోంది. సమయం వృథా చేయక సి.వి రచనలు చదవాలి. అధ్యయనం చేయడమంటే ప్రజలను దోపిడీ నుండి విముక్తులను చేయడమేనని మనం గుర్తెరగాలి. అంబేద్కర్ వాదులు, మార్క్స్ వాదులు, హేతువాదులు కలిసి పనిచేయడానికి కావలసిన పునాది కృషిని సి.వి చేశారు. మార్క్స్, అంబేద్కర్, హేతువాద లౌకికవాద శక్తులన్నీ ఐక్యంగా సామాజిక న్యాయ, సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాన్ని ఆచరణాత్మకంగా నిర్మించడమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అవుతుంది. సమాజానికి దారి చేసిన వారికి మరణం లేదు. మన సి.వికి మరణం లేదు. ఆయన రచనలకు మరణం లేదు.
- భూపతి వెంకటేశ్వర్లు
రచయిత సెల్ : 9490098343