Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రాచీన కాలం నుంచి నేటి దాకా కవిని ఎన్ని రకాలుగా సంబోధించినా, కవికి ఎన్ని నిర్వచనాలు ఇచ్చినా, కవి స్థానాన్ని ఏ విధంగా నిర్ణయించినా అన్నిటికీ సరిపోయే, సరితూగే కవులు కొందరే వుంటారు. కవి ప్రజాపతి అన్నా, ప్రభుత్వానికి ప్రతిపక్షం అన్నా, అనధికార శాసనకర్త అన్నా, నిబద్ధజీవి అన్నా, స్వేచ్ఛాకాముకుడన్నా, ఈ నిర్వచనాలన్నీ అక్షరాలా వర్తించే కవి కాళోజీ. కాళోజీ సమకాలికులు, అతన్ని దగ్గరగా చూసినవారు, కాళోజీ అంటే చెవిలో జోరీగలా సతాయించే వారందరికీ కాళోజీ నారాయణరావు కచ్చితంగా అటువంటి కవే అని తెలుసు.
సాహిత్యం, కళలు, రాజకీయం, సమాజం ఎప్పుడూ ప్రజాస్వామ్యబద్ధంగా వుండవు. వాటిని ఎప్పుడూ ఏవో కొన్ని ఆధిపత్య శక్తులు నడిపిస్తుంటాయి.
కాళోజీ సిరఫ్ తెలంగాణ కవి అని, ప్రజాహక్కుల కోసం పరితపించే కవి అని, చిన్న ఇరుకు భావనలో బంధించడం సరికాదేమో! నిజంగా కాళోజీ ఒక్క తెలంగాణ, ఆంధ్ర కవిగా గాకుండా విశ్వనరుని వేదనల్ని విన్న కవి. విగత జీవుల బాధల్ని కళ్ళారా చూసిన కవి. కన్నీళ్ళు కారుస్తూ అక్షరాలను రాల్చిన కవి. దీనికంతటికి ఒకే ఒక్క కారణం... అతడు నిరంతరం మనిషి కోసం పరితపించే కవి. అందుకే 'ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు, ప్రజల కష్టముల జూచి పగిలి పోవును గుండె'.
కాళోజీ జీవితం, కవిత్వం ఒకటే. ఏదైతే తాను నమ్మిండో దాన్నే ఆచరించాడు. ఆచరణలో ఎన్ని ప్రతిఘటన లెదురైనా బెదరలేదు. సమాజంలో అసమానతలు దోపిడీ పీడిత జనుల కష్టాలు, కన్నీళ్ళు వీటన్నిటి గురించి మాట్లాడితే రాజ్యం సహించదు. అందులో రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఇక అంతే సంగతులు. ఈ రాజ్యహింసను కాళోజీ నిజాం కాలం నుంచే ఎదుర్కొన్నాడు. కఠినమైన జైలు శిక్ష అనుభవించాడు. అయినా ఎంతో నిర్భయంగా 'అన్యాయాన్నెదిరిస్తే/ నా గొడవకు సంతృప్తి / అన్యాయం అంతరిస్తె / నాకు ఆరాధ్యుడని' చెప్పుకున్నాడు.
సాధారణంగా కవి జీవితాంతం ఒకే రకమైన దృక్పథంతో ఉండాలనుకుంటాం. కానీ చాలామంది కవిత్వంలో సాంద్రత అని, పరిపక్వత అని ఏవేవో సాకులు చెప్పుకుంటూ కొందరు అందమైన పద చిత్రాల్లో దాక్కుంటారు. కాళోజీ మాత్రం మొదటి నుంచి చివరిదాకా తన కవిత్వాన్ని ప్రజల పక్షమే నడిపించాడు. అన్యాయాన్నెదిరించినా, తెలంగాణ గురించి రాసినా అదే తీరు. అదే హోరు.
కవిత్వం ఒక శాసనం. కవి నిరంతరం నిజవాక్కుల ప్రవక్తని అనుకుంటే కాళోజీ కవిత్వంలో వాక్యాలు పదాలన్నీ ఏదో ఒక సత్యాన్ని ప్రబోధించే వాడిగల వాక్యాలే కనబడతాయి. ఇట్లా ఒక్కో కవితా పంక్తిలో ఇంత ధ్వనిగల వాక్యాలు గుర్తుండిపోయేలా ఉన్నాయంటే అతని దృక్పథం అంత దృఢమైనదనే చెప్పాలి. కవితలల్లినా, సభలో మాట్లాడినా తనకు పొసగని వాటిని ఖండఖండాలుగా విడమరచి పదునైన మాటల్తో విసిరే ప్రతిభగల కవి కాళోజీ.
మనిషి సమూహంలోనే ఉంటూ, సమాజంలోనే జీవిస్తూ సాటి మనిషిని హింసించటం, వంచించటం ఎంత వరకు సబబు! ఈ మూర్ఖ లక్షణాలన్నీ కొన్ని తరాల నుంచి పాతుకుని పోయిన భూస్వామ్య దోపిడీ వర్గం వర్గకుల స్వభావం గల అధికార వర్గం, రాజ్యం తదితరాలే సమాజాన్ని పీడిస్తున్నాయని కాళొజీ గట్టిగా నమ్మాడు. నమ్మిన దానిపైనే జీవితాంతం కవిగా, కార్యకర్తగా పోరాడాడు.
బానిసత్వానికి కాళోజీ శత్రువు. ఆధిపత్య భావానికి ఆగర్భ శత్రువు. అన్యాయాన్ని ఎదరించడమంటే కవికి కలేజా కావాలి. ఆ కలేజా నిండా సమాజ స్వప్నం నెరవేరే దీక్ష కావాలి. ఇదే పలవరించాడు కాళోజీ. అందుకే ప్రజాకవి అయ్యాడు. ఎదిరింపులోనే విముక్తి పురిపిప్పుతుందని అతని చిరకాల నమ్మకం. అదే కాలన్న గొడవగా, ప్రజల గొడవగా మారింది.
ఉద్యమకారుడు కాలేని వాడు ఉద్యమ కవి కాలేడు. మాక్సిమ్ గోర్కి లాంటి ప్రసిద్ధ రచయితలు సైతం రష్యా ఉద్యమకాలంలో కమ్యూనిస్టు భావవ్యాప్తి కోసం విశేషమైన కృషి చేశారు. కాళోజీ అంతే! తన కలాన్ని, కాయాన్ని ప్రజా ఉద్యమాలకే అంకితం చేశాడు. మరణం తరువాత కూడా తన పార్థిక దేహాన్ని ప్రజలకే ఇచ్చి వెళ్ళిపోయాడు.
నైజాం కాలం నుంచి కాళోజీ తెలంగాణ కోసం పోరాడాడు. నిజాం దాష్టికాన్ని నిర్భయంగా ఎదిరించాడు. అయినా ఇక్కడి సామాన్య జనంలో ఒకరుగా బతుకుతున్న ముస్లింల భాషా సంస్కృతులను ఎంతో గౌరవించాడు. వాటిని తనవిగా స్వీకరించాడు. అందుకే ఆంధ్రులు రోడ్డు అంటే తప్పులేదు కానీ తెలంగాణలో సడక్ అంటే తప్పా! అని నిలదీశాడు.
రాజకీయ పరంగానే కాదు, భాషా సంస్కృతుల నుంచి తెలంగాణ విముక్తి కోసం పరితపించాడు. తాను ఏది రాసినా తన జీవర్భాషలోనే రాశాడు. మాట్లాడాడు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాళోజీ కవిత్వం, జీవితం తెలంగాణ ఉద్యమానికి బలాన్నిచ్చింది. అతని కవితా పాదాలు చెప్పని తెలంగాణ సభలు, సమావేశాలు జరుగవన్నంత ప్రభావాన్ని చూపాయి.
కాళోజీలో జీవితం, కవిత్వం, రాజకీయం వేరువేరుగా చూడలేం. అన్నీ ఒకటే. అన్నింటిలో అతడే. బూటకపు ఎన్కౌంటర్ల గురించి ప్రశ్నించినా అన్యాయాన్ని ఎదిరించినా, రాజ్యహింసకు స్పందించి కన్నీళ్ళు కార్చినా అతను ప్రజల మనిషిగానే కనబడే వాడు. ఒకరికి భయపడడం, అణిగిమణికి అనుకూలంగా ఉంటూ అవార్డులు పొందటం కాళోజీకి గిట్టవు. అతడే ఒక పెద్ద అవార్డు. అతనికిచ్చే అవార్డు ఎంతటిది. ఏపాటిది. అతనికి వచ్చిన అవార్డులన్నీ వచ్చినవే. తెచ్చుకున్నవి కావు. నిజంగా తెలంగాణ సాహిత్య లోకం నిక్కచ్చిగా నిర్భయంగా రాస్తే తెలంగాణ సాహిత్యం ఇంకా ఎంత ఉదాత్తంగా ఉండేదో!
కవిగా, మనిషిగా ప్రజల పక్షాన నిలబడే కవులు చాలా తక్కువ. కాళోజీ పేరు వినగానే కాళోజీ తాత అని, కవితలు రాసే పెద్దమనిషని, సర్కారును ఎరించే పెద్దాయనని, అన్యాయాన్ని ఓర్చుకోని మన మనిషని అందరికీ తెలుసు. కవి ఇంటిపక్కవారికే పరిచయం లేని కవులున్న కాలంలో కాళోజీ చనిపోయిన రోజున ఒక వడ్రంగిని పనికి రమ్మంటే 'కాళోజీ తాత చచ్చిపోయిండు. తాతను సాగదోలి రావాలె. నేను ఇయ్యాల పనికి రాను'' అని చెప్పాడట. దీన్ని బట్టి చూస్తే కాళోజీ అంటే ఎవరో, ఎవరి మనిషో అర్థమైపోతుంది.
కాళోజీ అతిథి వోలె వచ్చాడు. అతిథివోలె అనుబంధాలు పెంచి వెళ్ళిపోయాడు. గుండె నొప్పి కంటె తెలంగాణ రాష్ట్రసాధన గురించే దిగులు పడ్డాడు. రాష్ట్రం రాకముందే వెళ్ళిపోయాడు. అయితేనేం అందరిలో తనున్నాడు. అయితే అన్యాయాన్ని ఎదిరించేవాడు నాకు ఆరాధ్యుడన్నాడు. ఈ మాటల్ని ఆచరించి అక్షరాల్లో కవులు చూయించిన రోజే కాళొజీకి అసలైన నివాళి.
- డా||ఉదారి నారాయణ, 9441413666