Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఒక రచయితగా నిజాయితీని నిబద్దత నీ మీరెలా నిర్ణయిస్తారు? అతడు సత్యానికి ఎంత దగ్గరగా వున్నాడు, ఎంత జాగరూకతతో సత్యాన్ని దర్శిస్తున్నాడు అనే దానిని ప్రామాణికంగా తీసుకుంటారా? లేక సామాజికంగా అమలులో ఉన్న నైతికతను, సాంప్రదాయాలను ఎలా పరిరక్షిస్తున్నాడు అనే అంశాల ఆధారంగానా? నేనైతే సత్యాన్ని ఎంత జాగరూకతతో దర్శిస్తున్నాడు అనే అంశం ఆధారంగానే నిర్ణయించాలి అంటాను'' అంటారు 2017 సంవత్సరానికి గాను జ్ఞానపీఠ పురస్కారం పొందిన కృష్ణ సోబతి.
కొత్తతరం పాఠకులకు సోబతి గురించి బహుశా అసలేమీ తెలియక పోవచ్చు. నేను ముందుగా కమలాదాస్ను చదివిన తరువాత సోబతిని చదివాను కనుక, ఆమెను ఉత్తర దేశపు కమలాదాస్ అనాలి అనిపిస్తుంది. కానీ కమలాదాస్ మీదే సోబతి ప్రభావం ఎక్కువ అనిపిస్తుంది. ఇద్దరినీ తులనాత్మకంగా పరిశీలిస్తే. అలాగే మహాశ్వేతాదేవిలో ఉన్నంత వైవిధ్యం వస్తువుల ఎంపిక కృష్ణ సోబతిలో ఉంది. ఇలా పోలికలు చెప్పడం సరి కాదు కానీ సాహిత్యాన్ని సీరియస్గా చదివే పాఠకుడు ఒకే కొత్త రచయితను చదువుతున్నప్పుడు అప్పటికే తన అనుభవంలో ఉన్న రచయతలతో కొత్త రచయతను తనకు తెలియకుండానే పోల్చి చూసుకుంటాడు. ఇది పఠనంలో అనివార్యంగా జరిగే ప్రాసెస్. తను చదువుతున్న కొత్త రచయత అప్పటికే తనకు తెలిసిఉన్న రచయితలను పూర్వపక్షం చేసినా, వాళ్ళతో సరితూగినా పాఠకుడు ఆ రచయితను అక్కున చేర్చుకుంటాడు. ఇలా పోలిక పెట్టుకోవడం సుగుణమే కానీ ఏ విధంగానూ రచయితను అవమాన పర్చడం కాదు. ఒక కొత్త పాఠకుడుగా కృష్ణ సోబతిని చదువుతున్నప్పుడు ఆమె నాలో ఉన్న ఇతర రచయితలతో సమానంగాను ఒక్కొక్కసారి వాళ్ళను పూర్వపక్షం చేస్తూనూ నన్ను ఆక్రమించుకుంది.
జిందగీ నామా తో ఇంటింటా పేరుగా మారిన కృష్ణ సోబతి అవిభక్త పంజాబ్లోని గుజరాత్ ప్రాంతంలో జన్మించారు. ఆ ప్రాంతం ఇప్పడు పాకిస్థాన్లో ఉంది. ఆమె ఢిల్లీలో నివసిస్తున్నారు. 2010లో ఆమెకు పద్మ భూషణ్ పురస్కారం ప్రకటిస్తే ఎస్టాబ్లిషమెంట్ లేదా అధికార వ్యవస్థకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనే ఉద్దేశ్యంతో ఆమె దానిని తిరస్కరించారు.
రచయతగా ఆమెది పురుష స్వరం. స్త్రీల ఆత్మ కలగలసిన అర్ధనారీశ్వర తత్వం. ఒక విమర్శకుడు ఆమెది పురుష శైలి అని విమర్శిస్తే అర్ధనారీశ్వర తత్వం సత్యానికి మరింత దగ్గరగా ఉంటుంది అని ఆమె జవాబు ఇచ్చింది. ఆమె శైలి అనుకరణకి లొంగనిది. గుజరాత్, రాజస్థాన్ మారుమూల ప్రాంతాలలోని సజీవ మాండలికము, ఉర్దూ కలగలసిన ఒక భాషను ఆమె ప్రత్యేకంగా రూపొందించుకుంది. పదాలు మనిషిలో ఒక భావాన్ని నమోదు చేసే కేవలం శబ్దాలు మాత్రమే కాదు. పదాలలో సమస్త ప్రపంచమూ వొదిగి వుంది అంటుంది సోబతి. ఆమె వాక్యం అనువాదానికి అంత తేలికగా లొంగదు. తెలుగులో అలాంటి వాక్యాన్ని చూడాలంటే మనం ఒక పతంజలి వాక్యాన్ని, ఒక రావిశాస్త్రి వాక్యాన్ని చదవాలి. ఆమె ప్రసిద్ధ నవల జిందగీనామా వెలువడిన చాలా కాలానికి ఆంగ్ల అనువాదం రాలేదు.
జిందగీ నామా హిందీ భాషలో చెప్పిన పంజాబీ కథ. అందుకే నవలలో చాలా ఎక్కువగా పంజాబీ పదాలు, పలుకుబడులు కనపడతాయి. ఉర్దూ కవిత్వ పంక్తులు, కృష్ణ సోబతి స్వంతంగా రాసిన చిన్నచిన్న హిందీ కవితలు నవల అంతా పరుచుకుని ఒక పొయెటిక్ ప్రోజ్ చదువుతున్న అనుభూతిని కలిగిస్తుంది. నవల ఎక్కువగా సంభాషణా రూపంలో ఉండటంతో రకరకాల పాత్రలు పలికే మాటలలో రకరకాల మాండలికాలు విన్పించి పాఠకుడిని ఆశ్చర్య పరుస్తాయి.
ఉత్తర పంజాబ్లోని షాపూర్ (ఇప్పుడు ఈ నగరం పాకిస్థాన్లో వున్నది) గ్రామంలోని ఒక పంజాబీ కుటుంబ కథ జిందగీ నామా. కచ్చితంగా కాలం గురించి వివరించనప్పటికీ మొదటి ప్రపంచ యుద్ధ కాలం, భారతదేశంలో గదర్ మూవ్మెంట్ జరుగుతున్న కాలం అని మనం గ్రహించవచ్చు. కుటుంబ పెద్ద షాజీ వడ్డీ వ్యాపారస్తుడు. అప్పులు ఇచ్చి వసూలు చేయడంలో పరమ కనికరంలేని వాడు. గ్రామ పెద్ద అనే హోదా కూడా ఒకటి అతనికి వున్నది. అతడి చిన్న తమ్ముడు కాశీ అన్నకు పూర్తిగా వ్యతిరేకం. మార్మిక సూఫీ సిద్ధాంతాలతో ప్రభావితం అయినవాడు. అన్నదమ్ములు ఇద్దరికీ హస్తిమశకాంతరం ఉంటుంది. అన్న చేసే పనులులేవీ తమ్ముడికి నచ్చవు.
షాజీ మతచాందసానికీ, పురుషాధిక్య భావనకీ అచ్చమైన ప్రతీక. దేవుడు కుటుంబ, గ్రామ పెద్ద రూపంలో ఉంటాడని భావిస్తాడు. తమ్ముడు వీటి ఉనికే అర్ధం లేనిది అంటాడు. షాజీ సోదరులు ఇద్దరే షాపూర్కి మిగతా ప్రపంచానికీ మధ్య వారధులు.
ఈ నవలలో చాచీ మెహ్రా అసలు ప్రధానమైన పాత్ర. షా కోసం తన సంపన్నమైన సిఖ్ కుటుంబాన్ని వదులుకుని షాజీ కుటుంబంలో భాగస్వామి అవుతుంది. పిల్లలు లేని స్త్రీలకు మర్యాద కానీ, స్త్రీగా గుర్తింపు కానీ లేని కాలం అది. కానీ మెహ్రాకి పిల్లలు పుట్టకముందే భర్త చివరి శ్వాస వదులుతాడు. వితంతువుగా మెహ్రా ఆ కుటుంబంలోనే ఉంటుంది. మరో స్త్రీ పాత్ర షాహినీ, షాజీ భార్యకి పిల్లలు పుడతారు. చంటి పిల్లాడిని చూసుకోవడానికి అని ఇంటికి తీసుకుని వచ్చిన రబియాతో భర్త సంబంధం నడుపుతున్నా ఆమె ఏమీ మాట్లాడలేదు. జిందగీ నామా స్త్రీల పాతివ్రత్యాన్ని బలంగా ప్రశ్నించిన నవల. అంతర్గతంగా చెలరేగే లైంగిక కోరికలు అణచివేసుకొవడం పాతివ్రత్యానికి శిఖర స్థాయి అన్న పురుషాధిక్య మిత్ ను బలంగా ప్రశ్నించిన నవల.
ఈ నవల కేవలం నవల మాత్రమే కాదు. ఇదొక అబ్రిడ్జెడ్ మహాభారత అన్నాడు అశోక్ వాజపేయి. మహాభారతంలో లేనిదీ ఏదీ లోకంలో లేదు అని మనం నమ్ముతాం. జిందగీనామాలో లేనిది ఏదీ ఇరవైయవ శతాబ్దపు మొదటి రెండు దశాబ్దాల కాలంలో లేదు అని నవల చదివిన వాళ్ళు ఎవరైనా అశోక్ వాజపేయి లాగే నమ్ముతారు. వందల కొద్దీ పాత్రలు, సంఘటనలు మనల్ని మరో లోకంలోకి తీసుకుని వెళతాయి. తెలుగులో మన విశ్వనాథ వేయిపడగలు అలాంటి నవల.
ఒక కాలపు సామాజిక, ధార్మిక, రాజకీయ జీవితాలకి అది అద్దం పట్టిన నవల. జిందగీనామాలో పాత్రలు ఏవీ సమాజం మీద తిరగబడమని చెప్పవు. సంప్రదాయాన్నీ, ఆధునికతనీ కలగలిపే ఒక పాయింట్ అఫ్ నో రిటర్న్ ను కనుక్కోమని చెపుతాయి. తమ తమ జీవితాలకు అవసరమైన, ఆనంద దాయకమైన దారులలోకి సంప్రదాయాన్నీ, ఆధునికతను మళ్ళించమని చెపుతాయి. చాచీమెహ్రా తను ఇష్టపడిన షా గణపత్తో వెళ్లిపోవడం ఆ కాలానికి ఒక గొప్ప విప్లవమే. అయితే అది మెహ్రా జీవితానికి అత్యవసరం. జీవితం కంటే మరేదీ ఈ ప్రపంచంలో గొప్పది కాదు అని సోబతి చెప్పకనే చెపుతుంది జిందగీనామా లో. జిందగీనామా పేరుతో ట్రియాలజీ రాయాలి అనుకున్న సోబతి జిందగీ రుఖ్ అనే మరో నవల మాత్రమే రాసింది. మూడోది రాయనే లేదు.
కృష్ణ సోబతి మరో నవల మిత్రో మర్జాని ుశీ నవశ్రీశ్రీ ఔఱ్ష్ట్ర ్శీబ వీఱ్తీశీ గా గీతారాజన్, రాజీ నరసింహన్లు సంయుక్తంగా అనువదించారు. నిజానికి ఈ నవల తోనే కృష్ణసోబతి రాత్రికి రాత్రి హిందీ సాహిత్య ప్రపంచంలో సూపర్ స్టార్ అయింది. హిందీలో సాంప్రదాయకంగా బలంగా ఉన్న నవలా చట్రాన్ని మిత్రో బద్దలు కొట్టింది. ఈ ఒక్క నవలతో అప్పటి దాకా అల్కా సరోగీ, గీతాంజలీ శ్రీ, ప్రభాకేతన్ లాంటి రచయితలను దాటుకుని ముందుకు వెళ్లి పోయింది. ఒక రకంగా మిత్రో హిందీ సాహిత్యానికి ఒక కొత్త చూపును అందించింది అనే చెప్పవచ్చు. మిత్రో మార్జిన్లో మిత్రో మధ్యతరగతి మొరాలిటీని బలమైన దెబ్బే కొడుతుంది. అలా అని సంప్రదాయాన్ని వదులుతుంది అని కాదు. ఇంట్లో పెద్ద కోడలిగా తన బాధ్యత నిర్వహిస్తుంది. కుటుంబానికి అవసరమైనప్పుడు తన నగలు అమ్మి సంక్షోభంలో నుండి గట్టెక్కిస్తుంది. అన్నీ చేస్తుంది. ఇక్కడ కూడా ఆమె సంప్రదాయాన్నీ, ఆధునికతని కలగలుపుతుంది. వ్యక్తి స్వేచ్ఛకి ప్రథమ తాంబూలం అందిస్తుంది.
సోబతి మరో నవల ఆయే లడకి లో కూడా వృద్ధురాలైన తల్లి, ఒంటరి కూతురు మధ్య వైయక్తిక, సామాజిక చట్రాలను ఎలా బద్దలు కొట్టాలి అనే అంశం మీద ఒక సంభాషణని సృష్టిస్తుంది. వైయక్తికమైన విముక్తికీ (అన్ని రకాల అంశాలనుండి) సామాజిక రాజకీయ వ్యవస్థల నుండి జెండర్ డిస్క్రిమినేషన్ ఎలా ఉంటుందో దానిని ఎలా ఎదుర్కోవాలో కృష్ణ సోబతి నవలలు చెపుతాయి.
చాలామంది రచయితలలాగా రచనలలో ఒకటి చెప్పి, జీవితంలో మరొకటి ఆమె ఆచరించలేదు. ఆమెకు జీవితమూ, రచన రెండూ ఒకటే. ఆమె రజస్వల అయిన వెంటనే అందరి తల్లుల లాగే సోబతి వాళ్ళ అమ్మ కూడా ఫ్రాకులు వదిలి వేసి శరీరాన్ని పూర్తిగా కప్పివేసే సల్వార్లలోకి మారమని చెప్పింది. కానీ కృష్ణ సోబతి వినలేదు. మరో పొడవైన స్కర్ట్ వేసుకుంది. అది ఆమె వ్యక్తిత్వ ప్రకటన. అది మొదలు ఆమె జీవితంలోనూ రచనలోనూ ఆమె ఏది నమ్మిందో అదే చేసి, రచించి చూపించింది. ఇరవై రెండు సంవత్సరాల క్రితం డెబ్బై ఏళ్ళ వయసులో డోగ్రీ రచయత శివనాధ్తో ప్రేమలో పడి అతడితో సహజీవనం సాగించింది, ఒక భారత స్త్రీకి ఇరవైఏళ్ళ క్రితం ఇది ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఆమె ఏ విప్లవగీతాలనూ పాడలేదు. తను ఎలా ఉండాలి అనుకుందో అలా వుంది అంతే.
కృష్ణ సోబతి రచనలు ఏవీ తెలుగులో వచ్చినట్టు లేదు.
- వంశీకృష్ణ, 9573427422