Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొట్లపల్లి రామారావు సాహిత్య జీవితం ఇరవై మూడేళ్ళ నవయౌవనంలో 1940లలో ప్రారంభమైంది. అప్పటికి ఆయన స్థితి ఏమిటి? వెలమ దొరల ఇంట పుట్టినా పన్నెండేండ్లకే తండ్రిని, ఆ తరువాత అనతికాలంలోనే ఆస్తులను కోల్పోయి తాటికాయల గ్రామంలోని వీధి బడి చదువుతో సరిపుచ్చుకొనటం. పదహారేళ్లకు పెళ్లయి గృహస్థు కావటం. బతుకు తెరువుకై వ్యవసాయం చేస్తూ విద్యా దాహాన్ని తీర్చుకొనటానికి విపరీతంగా చదవటం, ప్రకృతితో నిత్య సంభాషణ, నిరంతర చింతన - ఇదీ ఆయన స్థితి. గ్రామీణ రైతు జీవితంలోని నెమ్మది, నిరాడంబరం, సాధారణత్వం, తాత్వికత అన్నీ ఆయన వ్యక్తిత్వంలో భాగమయ్యాయి. మౌనంగా, ఏ ఆర్భాటమూ లేకుండానే పొట్లపల్లి తెలంగాణ సమాజంలో తన చుట్టూ సంభవిస్తున్న ఆర్ధిక రాజకీయ పరిణామాలను గమనిస్తూనే ఉన్నాడు. ఆ క్రమంలోనే సత్యాగ్రహోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లి వచ్చాడు. 1957లో ప్రచురించబడిన 'ఆత్మవేదన' కవితా సంపుటికి రాసిన ముందుమాటలో కాళోజి ''రామారావు వరంగల్లులో సత్యాగ్రహం చేసిన మొదటి జట్టులో ఒకరు'' అని చెప్పటమే కాదు, ఆ వాక్యానికి కొనసాగింపుగా ''జైలు నుండి తిరిగి బయట పడే నాటికి అతడు కవి'' అని మరొక మాట కూడా అన్నాడు. దానిని బట్టి పొట్లపల్లి రామారావు అనే సాహిత్య రత్నం రాజకీయ ఉద్యమ గని నుండి ఉద్భవించిందని చెప్పవచ్చు.
ఇంతకూ ఈ సత్యాగ్రహ కాలం ఏమిటి? 1938 అక్టోబర్ 24 నుండి డిసెంబర్ 24 వరకు ఒక నెల. జాతీయ కాంగ్రెస్తో సంబంధాలు, సానుభూతి కల వర్గం తెలంగాణాలో జాతీయోద్యమానికి మద్దతు కూడగట్టటానికి, 1938 జులై 29 న ఏర్పడిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకత్వంలో జరిగిన సత్యాగ్రహాలవి. నిరంకుశ నిజాం ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజల ఇష్టంతో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలన్న లక్ష్యంతో ఏర్పడిన ఆ సంస్థను మూడునెలలు తిరగకుండానే నిషేధించింది నిజాం ప్రభుత్వం. దానికి నిరసనగా స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహ కార్యక్రమం తీసుకున్నది. అరెస్టులకు, నిర్బంధాలకు వెరువక తెలంగాణ ప్రజలు జట్లుజట్లుగా అందులో పాల్గొన్నారు. ఒక దాని తరువాత ఒకటిగా 17 జట్లు సత్యాగ్రహానికి దిగటం, అరెస్టు కావటం - ఈ రకంగా నెలరోజులపాటు ఆ ఉద్యమాన్ని కొనసాగించాయి. గాంధీ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకత్వం మీద తెచ్చిన ఒత్తిడి ఫలితంగా నెల రోజులకే ఆ సత్యాగ్రహ కార్యక్రమం విరమించబడింది. పొట్లపల్లి రామారావు పాల్గొన్నది, అరెస్ట్ అయి జైలుకు వెళ్ళింది ఈ సత్యాగ్రహ ఉద్యమంలోనే.
అప్పటికాయన 20 ఏళ్ల నవయువకుడు. ఆంధ్ర మహాసభ కార్యకలాపాలను, నానాటికీ అందులో బలపడుతున్న కమ్యూనిస్టు వర్గ చైతన్యాన్ని , రగులు కొంటున్న రైతాంగ పోరాటాలను గమనిస్తూ తనను తాను పుటం పెట్టుకొంటున్న క్రమంలోనే ఆయన జైలు కథలు, నాటకాలు, ఆత్మవేదన కవిత్వమూ వచ్చాయి. జైలుకథలు తొలుతగా ఏ పత్రికలలో ప్రచురితమయ్యాయో తెలియదు కానీ జాతీయోద్యమానికి ఒక రకమైన వ్యక్తీకరణ అయిన గ్రంధాలయోద్యమాన్ని అందిపుచ్చుకొన్న తెలంగాణాలో, చిన పెండ్యాలలో ఏర్పాటైన 'తెలంగాణ గ్రంథమండలి' ప్రచురణగా 1945లో పుస్తక రూపంలో వచ్చాయి.1 945 నుండి 1949 మధ్య కాలంలో అభ్యుదయ, విశాలాంధ్ర పత్రికలలో ఆయన నాటకాలు వచ్చాయి. స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటు నుండే రాస్తూ వస్తున్న కవిత్వం ఇరవై ఏళ్ల తరువాత 1957లో వట్టికోట ఆళ్వారు స్వామి, కాళోజీల పూనిక వల్ల దేశోద్ధారక గ్రంథమండలి ప్రచురణగా వచ్చింది. 1964 తరువాత పొట్లపల్లి రాసిందంతా కవిత్వమే. దాని స్వభావం కూడా అంతకు ముందు వచ్చిన సాహిత్యస్వభావం కన్నా భిన్నమైనది. అందువల్ల పొట్లపల్లి సాహిత్యాన్ని 1957కు పూర్వం, తరువాత అని విభజించుకుని అధ్యయనం చేయటం ప్రయోజనకరం.
1
1957 కు పూర్వం పొట్లపల్లి ప్రధానంగా సమాజంలో సర్వత్రా వ్యాపించి కనిపిస్తున్న అధికారానికి, అన్యాయానికి దోపిడీ పీడనలకు, ఆర్ధిక వ్యత్యాసాలకు, ఆకలి నేరాలకు, అనంత జీవన విషాదాలకు చలించి పోయే సున్నిత మనస్కుడు. బాధితుల పక్షాన నిలబడే మనిషిని కలగన్న కవి, రచయిత. ఆ రాజకీయ పదునే ఆయన ఎత్తి పట్టిన సాహితీ కరవాలపు మెరుపు. ఈ కాలపు ఆయన సాహిత్యాన్ని ప్రధానంగా మూడు కోణాలనుండి చూడాలి. ఒకటి - సామాజిక ఆర్ధిక అసమానతలు. రెండు- వర్గ చైతన్యం. మూడు- రాజ్యం స్వభావం.
గ్రామీణ భూస్వామ్యం సామాజిక ఆర్ధిక అసమానతల పునాదుల మీద నిర్మించబడింది. సామాజిక పునాది మతమూ, కులమూ. అవి పై నుండి రుద్దబడినవని పొట్లపల్లి నమ్మకం. 'జనత' అనే కవితలో ''మాకులేవు కులగోత్రాల్/ మా తలను రుద్దిరెవరో'' అన్న మాటలు కులం అన్న భావన పట్ల అసహనాన్ని వ్యక్తీకరించేవే. మనిషి కన్నా, మనిషి అవసరాల కన్నా కులగోత్రాలకు ప్రాధాన్యమిచ్చే మానవ మనస్తత్వాన్ని ఏవగించుకొన్నాడు పొట్లపల్లి. ఊరు -అడవి (1953) కథ జాతిమత కులాలు ప్రకృతితో పాటు పుట్టినవి కాక సామాజిక వికృతులేనన్న అవగాహనను సంకేతిస్తుంది. ఈ కథకన్నా ముందు రాశాడో తరువాత రాశాడో తెలియదు కానీ ఈ కథార్ధానికి ఉన్నత స్థాయి రూపం 'అద్వైతం' కవిత. 'నరులమే మనమంత' అన్న దృఢమైన నమ్మకం వల్లనే ఆయన ఈ కవితలో 'అన్యులము మేమంచు' కొందరిని దూరం పెట్టె 'అదిరిపాటు' వైఖరులను వ్యతిరేకించాడు. 'కులమేమి? మతమేమి?' అని తిరస్కరించి 'మతవాదముల చిక్కి /మ్రగ్గబోకీవన్న' అని ప్రబోధించాడు.
1930ల నాటి తెలంగాణ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలోని ప్రధాన దోపిడీ రూపాలు వెట్టి, అక్రమ వసూళ్లు. వెట్టి శ్రమ దోపిడి. అక్రమ వసూళ్లు వస్తు దోపిడి. ప్రజల జీవితాన్ని దుర్భరం చేసినవి దొరల సంపదలను పెంచినవి ఇవే. 1938 సత్యాగ్రహ ఉద్యమ విరమణ తరువాత యువత కమ్యూనిస్టు పార్టీలోకి సమీకృతం కావటం, 1941లో తెలంగాణ ప్రాంత కమ్యూనిస్టు కమిటీ ఒకటి ఏర్పడటం, ఆ సంవత్సరమే చిలుకూరులో జరిగిన ఎనిమిదవ ఆంధ్ర మహాసభకు రావి నారాయణరెడ్డి అధ్యక్షుడిగా ఎన్నుకోబడటం - ఇవన్నీ వెట్టి అక్రమ వసూళ్లు వంటి వాటిపై ఆందోళనా కార్యక్రమాలు చేపట్టటానికి దారితీసాయి. 'వెట్టిచాకిరి వ్యతిరేక వారం. వంటివి అందులో భాగమే. అధిక పన్నులకు వ్యతిరేకంగా కొలనుపాక , పులిగిల్ల మొదలైన ప్రాంతాలలో ఆందోళనలు మొదలైన కాలం కూడా ఇది. అందులో భాగంగానే పొట్లపల్లి వెట్టి, అక్రమవసూళ్ల వ్యవస్థలోని అన్యాయాన్ని, పన్నుల వ్యవస్థలోని దోపిడీని బట్టబయలు చేస్తూ కథలు, నాటకాలు, కవిత్వం రాసాడు.
న్యాయం కథ మాదిగ వాళ్ళు వెట్టి చేయటానికే పుట్టినట్లు ప్రవర్తించే నిజాం ప్రభుత్వ అధికార వర్గంపై విసురుతో ప్రారంభం అవుతుంది. తనిఖీకి తహసీల్దారు వస్తాడని చెప్పి కోమటిని వంట సామానుకోసం వేధించటంతో కొనసాగుతుంది. అధికారాన్ని ఆసరాగా చేసుకొని స్వీయ అవసరాలను మంది మీద పడి తీర్చు కొనే వర్గం యొక్క కూట సృష్టి అక్రమ వసూళ్ల వ్యవస్థ అని 'ఏనుగు చొప్ప' కథలో సమర్ధవంతంగా నిరూపించాడు పొట్లపల్లి. ఈ రెండు కథలూ 1945 నాటివి. ఇదే వెట్టి, అక్రమ వసూళ్ల సమస్య మీద రాసిన నాటకాలు రెండు -సర్ బరాహి(1945), న్యాయం(1949) తెలంగాణ గ్రామీణ భూస్వామ్యంలో వెట్టి మాదిగది ఒక విషాద స్థితి. దొరల, పటేల్ పట్వారీల పోలీసు ఆమీనుల అధికారం బరువుకింద ప్రత్యక్షంగా నలిగేవాళ్ళు. వాళ్ళ ఆజ్ఞలను ఆలస్యం లేకుండా అమలు పరచవలసిన వాళ్ళు. తమ వర్గపు ప్రజలతో ప్రత్యక్షంగా అధికారవర్గ ప్రయోజనాల కోసం తలపడవలసిన వాళ్ళు. అదొక పెద్ద హింస. సర్ బారాహి నాటకంలో వెట్టి మాదిగ అటువంటి హింసకు బలి అవుతున్నవాడు. కోడి దొంగతనం కేసు విచారణకు ఊళ్లోకి వచ్చిన అమీన్ భోజనం కోసం ఎరుకల వాడి కోడిని ఎత్తుకొచ్చే అధికార వ్యవస్థలో లభించబోయే న్యాయం గురించి ఆలోచించమని చెప్తుంది న్యాయం నాటకం. తన కోడిని తనకు ఇయ్యమని వెంటపడి జవానుచేత దెబ్బలు తిన్న ఎరుకలవాడు అన్యాయం న్యాయమై పోయిన వ్యవస్థ నగ స్వరూపానికి సాక్షి. నేరజాతులుగా ముద్రపడిన ఎరుకలు అట్టడుగు సామాజిక వర్గం. వాళ్ళు ఎదుర్కొంటున్న వివక్ష, పీడనలపై దృష్టి పెట్టి ఈ నాటిక లోనే కాదు, న్యాయం కథలో కూడా నమోదు చేసాడు పొట్లపల్లి.
భూమి పై అధికారం జాగీర్దారులకు, దేశముఖులకు, దొరలకు దఖలు పడ్డ నిజాం రాజు పాలనలో భూమితో ప్రత్యక్షసంబంధం వున్నరైతులు ఆరుగాలం కష్టపడి ఉత్పత్తులు తీసినా రకరకాల రూపంలో కట్టవలసిన పన్నుల భారం కింద నలిగి పోయారు. గ్రామీణ వ్యవసాయ సంబంధాలలో వున్న ఈ దుర్మార్గానికి పొట్లపల్లి ప్రత్యక్ష సాక్షి. రైతు స్థితి పట్ల కలిగిన వేదన, అధిక పన్నులకు వ్యతిరేకంగా ఊపందుకున్న ప్రజా పోరాటాలలోకి వాళ్ళను సమీకరించే పిలుపుగా కవిత్వ రూపం తీసుకొన్నది. 'చూదాము', 'రాజులుండేమి' అన్న రెండు కవితలు అందులో భాగమే. ''ఎవడు ఇక్కడ రైతు /ఎవడు ఇక్కడ రాజు/ కష్టించువా రొకరు /కాజేయువారొకరు/'' అని మొదటి నాలుగు పంక్తులలోనే రైతు శ్రమను రాజు పన్నుల రూపంలో కాజేయటాన్ని చెప్పాడు. ఉత్పత్తి సాధనాలైన భూమి, నీటి వనరులు, నాగలి, నాగలి పట్టి దుక్కి దున్నే రైతు- అన్నీ అందరూ తమ తమ పనుల నుండి ఉపసంహరించుకొంటే పంటా లేదూ, పన్నూ లేదు అని తరువాతి పంక్తులలో క్రమంగా నిరూపించాడు. ''చూదాము : ఈ ప్రభువులేమౌవుతారో !/ చూదాము : ఏ ప్రజలు పన్నులిస్తారో'' అన్న చివరి రెండు పంక్తులలో రైతును పట్టి పీడిస్తున్న పన్నుల వ్యవస్థపై ధిక్కారాన్ని శిఖర స్థాయిలో నిలబెట్టాడు.
2
సమాజం సంపదలు కలవాళ్ళు, లేనివాళ్లు అని రెండు వర్గాలుగా చీలిపోయి వుందన్న అవగాహన వర్గచైతన్యంలో తొలి దశ. కలవాళ్ళకు, లేనివాళ్లకు మధ్య నిరంతరం జరిగే సంఘర్షణలో లేనివాళ్ల పక్షాన నిలబడటం మలిదశ. వర్గభేదాలను నిర్మూలించి సమసమాజ నిర్మాణానికి రాళ్లెత్తే పనిలో నిమగత అత్యున్నత దశ. ఈ దశలన్నీ పొట్లపల్లి సాహిత్యంలో కనబడతాయి.
1960ల తరువాతి పొట్లపల్లి కవిత్వంలో మరొక విలక్షణత ద్వంద్వాల గురించిన విచికిత్స. ద్వంద్వాల గురించి, వాటిమధ్య సంబంధ వైరుధ్యాల గురించి, సమన్వయం గురించి అయన చేసిన ఆలోచనలు ప్రత్యేకం అధ్యయనం చేయవలసినవి. ఆ అధ్యయనం పొట్లపల్లి జీవిత దృక్పథాన్ని, అంచనా వేయటానికి ఉపయోగపడుతుంది.
''లోతు ఐన దేనినీ మాటలు వ్యక్తీకరించ లేవు /మాటలు కేవలం ఉపరితలానికి చెందినవి'' -అంటాడు పొట్లపల్లి. కానీ పొట్లపల్లి ఆలోచనల, ఆదర్శాల లోతు తెలుసుకొనటానికి మనకు మిగిలిన మూల వనరు అయన వదిలిపోయిన మాటల మహా సముద్రమే. దాని లోతులు తెలుసుకొనటానికి, విస్తృతి తెలుసుకొనటానికి, విలువలు నిర్ధారించుకొనటానికి జరగవలసిన అధ్యయనాల వైపు ప్రేరణ పొందటానికి ఆయన శత జయంతి ఒక సందర్భం.
- కాత్యాయనీ విద్మహే
(నేటి నుంచి పొట్లపల్లి శతజయంతి ఉత్సవాలు ప్రారంభం)