Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''కవి గానివాడు విమర్శకుడౌతాడు'' - ఇదొక నానుడి. అయితే కవులే విమర్శకులు కావల్సిన పరిస్థితి తెలుగునేలకే ప్రత్యేకం. కవిత్వం, విమర్శ పరస్పర విరుద్ధాంశాలు కానప్పటికీ వొకటి వుద్వేగ ప్రధానం, మరొకటి బౌద్ధిక వ్యాపారం. రెండిటి మధ్య సమతౌల్యాన్ని పాటించి సామరస్య పూర్వక సమన్వయం సాధించడం, దానికి ప్రణాళికాబద్ధమైన పరిశోధనని జోడించడం తెలిసి తెలిసీ రోట్లో తలదూర్చడమే. అయినా సాహసించడం నిరంకుశ కవులకు ఒక క్రీడ. ఆ క్రీడలో గెలుపుని సొంతం చేసుకొన్నవాళ్ళలో కవి యాకూబ్ ఒకడు.
నిన్నటి చేరా ఇవాల్టి అఫ్సర్, ప్రసేన్, సీతారాం వంశీ కృష్ణ... ఖమ్మం నేలకే రెండంచుల కత్తుల్ని సృజించే ప్రత్యేకమైన గుణముందేమో! ఆ నేలనుంచే మరో బలమైన చేర్పు యాకూబ్. ప్రవహించే జ్ఞాపకాన్నీ, రారా సాహిత్య పరిశోధననీ ఏకకాలంలో సవ్యసాచిగా తవ్విపోసి అందించిన యాకూబ్, కవిగా పరిశోధకుడిగా జోడు గుర్రాల - స్వారీని కాదు - సవారీని అలవోకగా - అతి జాగరూకతతో నిర్వహిస్తున్నాడనడానికి ఆధునిక సాహిత్య విమర్శలోని వాదాలనూ, ధోరణులనూ సమగ్రంగా గుదిగుచ్చి అందించిన యీ గ్రంథమే సాక్ష్యం.
తెలుగులో ఆధునిక సాహిత్య విమర్శ సాగిన తీరుతెన్నుల్నీ దాని లోతుపాతుల్నీ ఎప్పటికప్పుడు ప్రచలితమైన కొత్త కొత్త వాదాల్నీ ధోరణుల్నీ మొత్తం దాని ప్రస్థానాన్ని విమర్శకుల లోటుపాట్లతో సహా తెలుసుకోడానికి యాకూబ్ పరిశోధన ఒక గైడ్ బుక్ లాగా రెడీ రికనీర్ లాగా తోడ్పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
నా వరకు నాకు యీ పరిశోధన ఆత్మ శోధనకి వుపయోగపడింది. సంస్కృత అలంకార శాస్త్రం చదువుకోవడం దగ్గర సాహిత్య విద్యార్థిగా ప్రారంభమైన నాకు, మార్క్సిజం, మనస్తత్వ శాస్త్రం మొదలైన సామాజిక - వైజ్ఞానిక శాస్త్రాల వెలుగులో ఆధునిక సాహిత్య విమర్శలోని భిన్న ధోరణులు పరిచయమయ్యాకే సాంప్రదాయిక ఆలంకారిక శాస్త్రంలోని పరిమితులు తెలిశాయి. భరతుడి దగ్గర్నుంచి జగన్నాథుడి వరకూ సంస్కృతాలంకారికులు అలంకారాలు, రీతి, వృత్తి గుణ-దోష విచారాలు, వక్రోక్తి వైచిత్య్రాలు గురించి చేసిన చర్చంతా రూపానికీ శైలీ శాస్త్రానికి సంబంధించినదే. నిర్వచించిన లక్షణాలకు శ్లోకాల్ని, శ్లోకాల్లో భాగాల్ని, పదాల్ని, పదాంశాల్ని లక్ష్యాలుగా ఎత్తిపట్టడం మీదే వాళ్ళు ఎక్కువగా దృష్టి సారించారు తప్పితే, కావ్యాన్ని వొక యూనిట్ గా చూసింది లేదు. ఒక కవి గురించో రచయిత గురించో సమగ్రంగా విచారించిందీ లేదు.
''ఉపమా కాళిదాసస్య, భారవేరర్థగౌరవం
దండినః పదలాలిత్యం, మాఘే సన్తి త్రయో గుణాః''
- వంటి నిర్ధారణలు విమర్శ సూక్తులుగానే మిగిలిపోయాయి.
ఆనందవర్ధనుడు మాత్రం కావ్యాత్మ గురించిన ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేసి 'భారతంలో అంగిరసం శాంతం' వంటి ప్రస్తావనలు తెచ్చాడు. మొత్తం కావ్యం అందజేసే యెరుక గురించి మాట్లాడటానికి తలుపులు తెరిచాడు. ప్రాచీన ఆలంకారిక శాస్త్ర వివేచనలో ఆనందవర్ధనుడొక మలుపు. కానీ అభినవ గుప్తుడు 'రసో వై సః' అని రసాన్నీ రసస్ఫూర్తినీ రసాస్వాదననీ సాహిత్యేతర ఆలోచనాధార అయిన ఆత్మవాదంతో ముడిపెట్టడంతో ధ్వనికారుడి నూత్న ఆవిష్కరణకి ఆ తర్వాత కొనసాగింపు లేకుండాపోయింది. పాశ్చాత్య విమర్శ ధోరణులు తెలుగు వారికి పరిచయమయ్యాకే ఈ లోటు తీరింది.
కట్టమంచి కవిత్వ తత్త్వ విచారం కావ్యాన్ని అంచనా కట్టడానికి కొత్త సాహిత్య ప్రమాణాల్ని ప్రతిపాదించిన తర్వాత ఆధునిక విమర్శ కొత్త పుంతలు తొక్కినా, శ్రీశ్రీ తదితర అభ్యుదయ వాదులు ప్రస్తావించిన కన్యాశుల్కంలో రస చర్చ, నాయక వివాదం దగ్గర్నుంచి ముదిగంటి సుజాతారెడ్డి యిటీవల కాలంలో నవలల్లో రసం గురించి చేసిన ప్రతిపాదనల వరకూ సంప్రదాయ విమర్శ పోకడలు మనల్ని వొదిలి పెట్టలేదు. మరో వైపు మార్కిస్టు తత్త్వశాస్త్రం వెలుగులో త్రిపురనేని మధుసూదనరావు, కె.కె. రంగనాథాచార్యులు, స్త్రీవాద దృక్పథంతో జయప్రభ, కాత్యాయినీ విద్మహే, శిలాలోలిత వంటివారు ప్రాచీన సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేయడం కూడా గమనిస్తాం. నిరంతర చలనశీలమైన సమాజంలో ఆధునికత ఎప్పటికప్పుడు సాపేక్షమే. అందువల్ల ఆధునికతని నిర్వచించడం, ఆధునిక విమర్శకు ప్రారంభ దినాల్ని నిర్ధారించడం చాలా కష్టమైన పని. ఆధునికత కేవలం కాలవాచి కాదు. అదొక జీవన విధానం, ఆలోచనా విధానం. మరింత లోతుగా ఆలోచిస్తే అదొక సామాజిక తాత్త్వికత. దాన్ని సాహిత్యానికీ సాహిత్య విమర్శకూ అన్వయించడంలో సాంకేతిక సామాజిక రాజకీయ ఆర్ధిక శాస్త్రాల ప్రమేయం చాలా వుంటుంది. భారతీయ సమాజం మొత్తం పూర్తిగా ఆధునికతలోకి ప్రయాణం చేసిందా లేదా అన్న విషయమే ప్రశ్నార్థకం కాగా, సాహిత్య విమర్శలో యీ లోపు ఆధునికానంతర వాదం కూడా తయారయింది. అఫ్సర్, తిరుపతిరావు లాంటి వాళ్ళు అత్యాధునికత గురించి సైద్ధాంతిక చర్చలు చేసారు. మార్క్సిస్టు సాహిత్య విమర్శలోని పరిమితుల్ని గుర్తిస్తూ అస్తిత్వంలోకి వచ్చిన స్త్రీ దళిత ప్రాంతీయ మైనార్టీ మొదలైన నిర్దిష్టతావాదాలన్నిటినీ ఆధునికానంతర వాదం తనలో యిముడ్చుకొంది. నిజానికి అదొక వాదం కాదు. గత శతాబ్ది కాలంగా సాహిత్యంలో సంప్రదాయికంగా స్థిరపడ్డ అన్ని వాదాలనూ - మార్క్సిజంతో సహా తిరస్కరించడమే ఆధునికానంతరవాదం లోని మౌలిక సూత్రం. సాహిత్యంలో నిర్దిష్టతను బహుళత్వాన్నీ విభిన్నతను వినిర్మాణాన్నీ వైయక్తిక స్వేచ్ఛనీ అది వున్నతీకరించింది. చాలా సందర్భాల్లో మార్కిస్టు విమర్శ పరిమితుల్ని యెత్తిచూపడమే లక్ష్యంగా పనిచేసింది. అందువల్ల పీడితుల్ని వొక తాటిమీదకి రానివ్వకుండా సామ్రాజ్యవాదులు పన్నిన కుట్రగా దాన్ని పరిగణించడం కూడా వుంది. నిర్దిష్టతలోంచీ మరింత నిర్దిష్టతలోకీ శకలీకరణ వైపు అత్యాధునికతా వాదం ప్రయాణం చేసినప్పటికీ సాహిత్యంలో సబాల్ట్రన్ స్టడీకి దారులు వేసి, ఆధిపత్యాల కింద అణగారిన జాతుల ప్రాంతాల ఆత్మగౌరవ ప్రకటనలకీ, నూతన వ్యక్తీకరణరీతులకీ అంతకు ముందు ఎక్కడా ఎన్నడూ వినిపించని స్వరాలకీ ప్రాతినిధ్యం కలగడానికి దోహదం చేసింది.
1
మార్కిస్టు సాహిత్య విమర్శ వస్తునిష్టమైంది. రూపానికి ప్రాధాన్యం యివ్వక పోవడమే కాదు, రూపవాదాన్ని నిరసించింది. సామాజిక దృక్పథాలతో ప్రమేయంలేని కేవల అనుభూతి వాదాన్నీ వ్యక్తివాదాన్నీ అది ఎండగట్టింది. వెల్చేరు నారాయణరావు కవితా విప్లవాల స్వరూపం గానీ, వాడ్రేవు చినవీరభద్రుడి నూరేళ్ళ తెలుగు కథ సంకలనం గానీ రూపాన్ని భూమికగా చేసుకొని రూపొందినవే. సాహిత్యం ప్రజలకు దగ్గర కావడానికి దారులు వెతికే మార్గంలోనే మోహన్ ప్రసాద్ దళిత కవులు పాటను ఆశ్రయించాలని చేసిన ప్రతిపాదన కూడా రూపాన్ని దృష్టిలో పెట్టుకొని చేసిందే. ఆధునిక సాహిత్య విమర్శ మొత్తం వస్తు రూప వాదాల మధ్యే వూగులాడింది. అయితే ఆ వూగులాటకి ఆయా కాలాల్లో చోటుచేసుకొన్న సామాజిక చలనాలు కారణమయ్యాయి. వాటి ప్రభావం సృజనాత్మక సాహిత్యం మీద ఏ మేరకు పడింది అన్నది ప్రత్యేకంగా పరిశీలనార్హం.
తెలుగులో ఆధునిక సాహిత్య విమర్శకుల్లో నూటికి తొంభై తొమ్మిది మంది మార్క్సిస్టు విమర్శ లోనే పుట్టినప్పటికీ అస్తిత్వోద్యమాల నేపథ్యంలో చాలామంది దానికి దూరమయ్యారు. అయితే మార్క్సిస్టు సాహిత్య విమర్శ తప్ప, తక్కిన వాదాల్ని ఆశ్రయించుకొన్న విమర్శ ధోరణులు కొన్ని విశ్లేషణలూ వివరణలూ చర్చలూ వాద వివాదాల వరకే పరిమితమయ్యాయి తప్పితే, లోతైన తాత్త్వికతను ప్రతిపాదించలేకపోయాయి. వివాదాలు కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా కూడా పరిణమించాయి. దళితవాదంలో శివసాగర్ వంటివారు నిర్దేశించిన దళిత సౌందర్య శాస్త్రానికీ, స్త్రీవాద విమర్శలో ఓల్గా వంటివారు ''వ్యక్తిగతమంతా రాజకీయమే'' అని ప్రస్తావించిన జెండర్ చైతన్యానికీ కొనసాగింపు లేకుండా పోయింది. ఆ మేరకు ఆయా ధోరణుల్లో విమర్శకులు కొత్త విమర్శ పరికరాలను కూడా సమకూర్చుకోలేక పోయారన్నది చేదు వాస్తవం. అరాకొరా సమకూడినా విమర్శకు రొట్ట కొట్టుడు పరిభాష ఏర్పడిందే తప్ప, పదాలు భావనలుగా, భావనలు సిద్ధాంతాలుగా పరిణమించిన దాఖలాలు తక్కువ. అందుకే కొత్త వాదాల్తో ధోరణుల్తో సృజనాత్మక సాహిత్యం వచ్చినంత విరివిగానూ బలంగానూ దానికి సైద్ధాంతిక తాత్త్విక భూమికనేర్పరచగల విమర్శ రాలేదని ఆవేదన తరచుగా వ్యక్తమౌతోంది.
2
ఆధునిక సాహిత్య విమర్శలో కనిపించే ఈ ఖాళీలను తన పరిశోధన గ్రంధంలో యాకూబ్ చాలా స్పష్టంగా గుర్తించాడు. అంతే కాదు, అందుకు కారణాలను సైతం విశ్లేషించాడు. తెలుగు విమర్శకులు వాచకాల్ని పరిశీలించేటప్పుడు రచయితను విపరీతంగా పొగడటానికో తిట్టడానికో, పరిమితం కావడం వల్ల వాచకం లోతుల్లోకి పోలేకపోతున్న వైనాన్ని యాకూబ్ పరిశోధకుడిగానే కాదు, సృజనాత్మక రచయితగా సైతం బలంగా ప్రశ్నించాడు. ఒక విధంగా 'మోత' బరువు విమర్శని తిరస్కరించాడు. విమర్శ రచయిత కేంద్రకంగా గాక వాచక కేంద్రకంగా జరగవలసిన అవసరాన్ని గురించి హెచ్చరించాడు. చాలావరకు ఆధునిక విమర్శలోని వాదాలు ధోరణులూ రూప పరామర్శకే పరిమితమయ్యాయనీ, మార్క్సిస్టు - ఆధునికానంతర వాద విమర్శలు మాత్రమే వాటిలోని సైద్ధాంతిక బలం కారణంగా అప్పటి వరకూ వున్న అన్ని విలువల్నీ బోనులో నిలబెట్టి ప్రశ్నించగలిగాయనీ వాచక సారాంశాన్ని ప్రాధమ్యంగా పరిగణించిన దృక్పథాలు మాత్రమే సాహిత్య విమర్శలో ఇవాల్టికీ ప్రాసంగికంగా వున్నాయనీ నిర్ధారించాడు.
''విమర్శ అనేది నిర్దిష్టత (జశీఅషతీవ్వ) నుండి అమూర్తత (Abర్తీaష్) వైపు తీసుకువెళ్ళే సాధనం. ఈ అమూర్తత వివిధ దశల్లో ఉంటుంది. ఈ పధ్ధతి ద్వారా నిర్దిష్ట విషయాన్ని మరింతగా అర్థం చేసుకొనే ప్రయత్నం జరుగుతుంది. విమర్శనా పద్ధతుల్లో ఒకటి రెండు ఆ అమూర్తతా దశకు చేరుకున్నా మిగతావి అసంపూర్ణంగానే విరమించినట్లు అనిపిస్తుంది. తెలుగు సాహిత్యంలో ఇది మరీ స్పష్టంగా కనిపిస్తుంది. విమర్శ ధోరణులు రూపం వరకే పరిమితమవుతున్నాయి. సమాజంలో ఇతర రంగాలతో సాహిత్యానికున్న సంబంధాన్ని గుర్తించడానికి నిరాకరిస్తున్నాయి. దీనికి కారణం 'స్వయం ప్రతిపత్తి' భావన అని సిద్ధాంత కర్తలు గుర్తించారు. ఒక్క మార్క్సిస్టు ధోరణి ఈ పరిస్థితిని అధిగమించింది. అందువల్లనే ఏదో ఒక స్థాయిలో సమాజ కేంద్రితమైన ఈ విమర్శకు సాహిత్యంలోనూ, విమర్శలోనూ కొనసాగింపు ఉంటూనే ఉంది.''
ఇటువంటి నిర్ధారణలకు రావడానికి యాకూబ్ ఎన్నో ఉపపత్తుల్ని చూపాడు. విశ్వవిద్యాలయాల లోపలా బయటా జరిగిన పరిశోధనల్నీ, ఎప్పటికప్పుడు పత్రికల్లో వచ్చిన వ్యాసాల్నీ సమీక్షల్నీ చర్చల్నీ వాద వివాదాల్నీ స్పందన ప్రతిస్పందనల్నీ, రచనలకు ముందు, వెనక మాటల్నీ, విమర్శ సంకలనాల్లో పరిశోధన పత్రాల్లో ప్రస్తావించిన అంశాల్నీ సిద్ధాంత గ్రంథం పొడవునా క్రోడీకరించాడు. తనకు దొరికిన ఏ ఆకరాన్నీ అతను వదులుకోలేదు. సేకరించిన సమాచారాన్ని తన ప్రతిపాదనలకి అన్వయించుకోవడంలో తడబాటు పడలేదు. అందువల్ల అతని పరిశీలన పదునెక్కింది. నిర్ధారణలు నిజాలుగా మిగిలాయి. పరిశోధన ప్రామాణికమైంది. ఈ క్రమంలో ఆధునిక విమర్శ ముందు ముందు నడవ వలసిన దారుల్ని సైతం అతను సూచించాడు. సమీక్షలే విమర్శగా చెలామణి అవుతున్న దుస్థితి పట్ల ఆగ్రహం ప్రకటించాడు. అయితే ఆ పని యెంతో సంయమనంతోనూ తెలివిడితోనూ చేశాడు. తన ఎరుకకు నిర్దిష్టమైన మెథడాలజీని జోడించడంలో ఎక్కడా ఏమరుపాటుకి గురికాలేదు.
అందుకే యీ పరిశోధన ప్రణాళికాబద్ధంగా రూపొందింది. పాశ్చాత్య దేశాల్లో, భారతీయ భాషల్లో ఆధునిక విమర్శ ధోరణుల్ని పరిచయం చేస్తూ అవి తెలుగులో ప్రవేశించిన సామాజిక సందర్భాల్ని ప్రస్తావించి, వాటి పుట్టుపూర్వోత్తరాల్నీ పోయిన పోకడల్నీ పొందిన వికాసాన్నీ చెబుతూనే ఆయా సందర్భాల్లో విమర్శకులు - వీరేశలింగం, కట్టమంచి దగ్గర్నుంచీ జీవీ కృష్ణారావు, శ్రీశ్రీ, కొకు, ఆరుద్ర, రాంభట్ల, కేవీఆర్, రారా, టియమ్మెస్, ఆర్వీయార్, జేసీ, వెల్చేరు, సి వి సుబ్బారావు, కేకేఆర్, బాలగోపాల్, సంజీవమ్మ, వల్లంపాటి, కాత్యాయినీ విద్మహే, పాపినేని, రాచపాళెం, ఎన్ వేణుగోపాల్, సూర్యసాగర్, ఆర్.యస్. సుదర్శనం, మందేశ్వరరావు, జీవీ సుబ్రహ్మణ్యం, ఓల్గా, జయప్రభ, వసంత, లలిత, మృణాళిని, శిలాలోలిత, బి.యస్. రాములు, ఉ.సా. కత్తి పద్మారావు, కలేకూరి, లక్ష్మీ నరసయ్య, ఖాదర్, షమీ ఉల్లా, ఖాజా, స్కైబాబా, కరీముల్లా, సురేంద్ర రాజు, అఫ్సర్, తిరుపతి రావు, సుజాతా రెడ్డి సిధారెడ్డి, కె శ్రీనివాస్, కాసుల ప్రతాపరెడ్డి, సంగిశెట్టి, గుడిపాటి వరకూ ఆధునిక విమర్శ మలుపుల్లో యేదో ఒక మేరకు తమదైన ముద్రని వేయగల్గిన ప్రతి ఒక్కరి వరివస్యనీ రాగద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా అంచనా కడతాడు.
పరిశోధన గ్రంథంలో యిటువంటి పరిశీలనలు అనేకంగా వున్నాయి. కొన్ని పరిశీలనలు నిర్ధారణలుగా కూడా కనిపిస్తాయి. ఆయా సందర్భాల్లో యాకూబ్ చేసిన నిర్ధారణలతో, వ్యాఖ్యానాలతో, అభిప్రాయాలతో యెవరైనా విభేదించవచ్చు, అతని సిద్ధాంతాన్ని పూర్వపక్షం కూడా చెయ్యొచ్చు. కానీ పరిశోధకుడిగా యాకూబ్లోని ఆబ్జెక్టీవిటీని మాత్రం మెచ్చుకోకుండా వుండలేం.
నిర్మమత్వ బుద్ధితో యాకూబ్ చేసిన ముక్కుసూటి ఆవిష్కరణల్లో - వొకటి రెండు సందర్భాల్లో తప్ప - కాఠిన్యాన్నో ఉద్వేగాన్నో గమనించం. యాకూబ్ వ్యక్తిత్వంలోని మార్ధవతే కవిత్వంలోకీ అక్కణ్నుంచి పరిశోధనలోకీ ప్రవహించింది. తనకెంతో యిష్టుడైన చేరా భాషాశాస్త్రాన్ని కవిత్వ పరామర్శకి అన్వయిస్తూ చేసిన విమర్శనా పద్ధతుల్ని బేరీజు వేసిన సందర్భం యాకూబ్ పరిశోధక వ్యక్తిత్వానికి నికషోపలం. అలాగే జి. లక్ష్మీ నరసయ్య దళిత సాహిత్య తాత్త్విక దృక్పథ వివేచన చేస్తూ అంబేడ్కరిజం వెలుగులో బుద్ధిజం జోడింపుతో దేశీయ మార్క్సిజం రూపొందాలని ప్రతిపాదించినపుడు యెటువంటి మొహమాటం లేకుండా మతాతీతమైన లౌకిక ప్రజాస్వామ్య భావన అవసరాన్ని యాకూబ్ నొక్కి చెప్పాడు. బుద్ధిజంలోని అష్టాంగమార్గాల విశిష్టత అతనికి తెలీని విషయం కాదు. కేవల విశ్వాసంగా అమలయ్యే మతంతోనే అతని పేచీ. పరిశోధకుడికి తనదైన దృక్పథం వొకటి వుంటుంది. అది పరిశోధన పొడవునా అంతస్సూత్రంగా కనిపిస్తుంది అనుకొన్నప్పుడు -కవిగా యాకూబ్ సూఫీవాది. అదే సమదృష్టి అతని పరిశోధనలో కూడా ప్రతిఫలించింది.
- ఎ.కె.ప్రభాకర్