Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు. అనంతర కాలంలో వెల్లివిరిసిన రాడికల్ విద్యార్థి విప్లవోద్యమంలో ఎగిసిపడిన పోరు కెరటం. రైతుకూలీ సంఘాలతో జంగ్ నడిపిన ధీరుడు. ప్రజాహక్కుల ఉద్యమకారుడు. అసలైన పీడితుల పక్షాన పాలకులపై పోరు సల్పిన యోధుడు. ఇది నాణేనికి ఒక పార్వ్శం మాత్రమే. మరోవైపు పటార్లపై (ఆదిలాబాద్ అడవుల్లోని ఎత్తయిన కొండల గుట్టల మీద గోండులు నివాస ప్రాంతం) గోండులు పడుతున్న వెతలను చూసి చలించిన మానవతావాది. వారి ఆరాటాలను, పోరాటాలను, ఆశలను అక్షరీకరించిన సాహితీమూర్తి. గోండుల వెతలనే కథలుగా, గాయాలనే గేయాలుగా, వారి జీవితాల్లోని ఆటుపోటులనే పాటలుగా అశువుగా అల్లిన సృజనశీలుడు. ఆదివాసీ జీవన సౌందర్యాన్ని, వారి సంస్కృతిని, వారి తండ్లాటని వారి భాషలో, యాసలో తెలుగు సాహిత్యానికి పరిచయం చేసిన సాహిత్యకారుడు. మౌఖిక సాహిత్యంలో మరుగుపడి ఉన్న ఆదివాసీల ఆరాధ్యదైవం కుమ్రంభీం జీవితచరిత్రను అల్లం రాజయ్యతో కలిసి ప్రపంచానికి అందించిన పరిశోధకుడు. విలక్షణ బెంగాలీ రచయిత్రి మహశ్వేతాదేవి సరసన నిలవగలిగిన భావుకుడు. ఆదర్శప్రాయుడు. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనే శనిగరం వెంకటేశ్వర్లు. అలియాస్ సాహు.
హుస్నాబాద్ తాలుకా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్లో శనిగరం స్వామి, అయోధ్య దంపతులకు 1955 అక్టోబర్ 2న శనిగరం వెంకటేశ్వర్లు జన్మించారు. ఉన్నత విద్యను హుజూరాబాద్లో పూర్తిచేశాడు. డిగ్రీ విద్యనభ్యసించేందుకు జమ్మికుంట ఆదర్శ కళాశాలకు వెళ్లాడు. అక్కడ చదువుకుంటున్న రోజుల్లోనే ఉవ్వెత్తున ఎగిసిన 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలకు విడమరిచి చెప్పారు. వారిని చైతన్యవంతులను చేసేందుకు నిర్వహించిన అనేక సమావేశాలను, సభల్లో పాల్గొని ప్రసంగించారు. అనుకోని పరిణామాల అనంతరం తెలంగాణ ఉద్యమం నీరుగారిపోవడంతో తీవ్ర నిరాశకులోనైన సాహు వేలాది యువకుల్లాగానే విప్లవోద్యమ బాటపట్టారు. ఆ ఉద్యమంలోనూ గజ్జెల గంగారం, నల్లా ఆదిరెడ్డితో కలిసి కేంద్ర కమిటీ స్థాయి కమిటీ వరకు ఎదిగారు.
విప్లవోద్యమం విస్తరణలో భాగంగా సాహు ఆదిలాబాద్ ప్రాంతానికి వెళ్లాడు. ఈ క్రమంలోనే అక్కడి గోండుల జీవన విధానాన్ని చాలా దగ్గరి నుంచి నిశితంగా అధ్యయనం చేశారు. గోండులలో ఒకడు అన్నంతగా మమేకమయ్యాడు. వారి భాషను నేర్చుకోవడమేగాక ఆ భాషకు లిపిని సైతం రూపొందించడం విశేషం. గోండులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయుధంతో పోరాడుతూనే అందులో వారిని భాగస్వాములను చేసేందుకు సాహు తన కలానికి పని చెప్పాడు. సాహితీ సృజనకు పూనుకున్నాడు. గోండుల జీవన సౌందర్యాన్ని, వారి జీవితాల్లోని వెతలను, వారి దీనత్వాన్నే ఇతివృత్తంగా చేసుకుని ఆర్తిగా అనేక కవితలు, కథలు రాశాడు. వారి ఆక్రందనలకు, వ్యథాభరిత గాథలకు అక్షరరూపమిచ్చాడు. ఆదివాసీల జీవనసౌందర్యాన్ని తెలుగు సాహిత్యానికి పరిచయం చేశారు. అప్పటి వరకు ఆదివాసీలను పట్టించుకున్న వారుకానీ, వారి యాసలో, భాషలో వారి జీవితాలపై సాహిత్య రచన చేసిన తెలుగు సాహితీవేత్తలు లేరంటే అతిశయోక్తి కాదేమో.
ఒకానొక గోండు గూడెంలో కూర్చుని జొన్నరొట్టె తింటున్న సమయంలో తననే దీనంగా, తీక్షణంగా చూస్తున్న బాలికను గమనించిన సాహు ఆమెను దగ్గరకు పిలుచుకుంటాడు. ఒక రొట్టె ఇచ్చి పేరు అడగగా ఆ బాలిక 'సాహు' అని సమాధానమిస్తుంది. అనంతరం కాలంలో ఆ బాలిక పేరునే కలం పేరుగా మార్చుకుని తుదిశ్వాస వరకు వెంకటేశ్వర్లు తన రచన ప్రక్రియను కొనసాగించారు. అవన్నీ కూడా ఆదివాసీల ఇతివృత్తాంతంగా సాగడమే ఇక్కడ విశేషం. అందులో కన్నీటి కథ - నీటి కథ, పెళ్లికావాలి, కాయిదా(సంప్రదాయం) ఐదురూపాయాల కథ, భూమికొరకు, జెండాకథ, ఆకలి, నిర్ణయం, కిసింగార్ వెంతా(అడవంటుకుంది), అమరుల రక్తం వృథాకాదు, నాడె, రక్తపింజెర, మరట్ తుడుం పాయానా (మనం తుడుంగొట్టాలె), మనుషుల్ని తినేవాళ్లకోసం, ఒక తల్లి, పిల్లరక్కసులు, ఓ సత్యం, హరిచే జనించిన వారని చెప్పబడిన గాంధీగారి బిడ్డలు, అమరవీరులు, ఊరేగింపు, రగల్జెండా వంటివున్నాయి. ఈ కథల్లో ఆదివాసీలపై నాటి చౌకిదారులు, ఇతర జంగ్లాత్ అధికారులు చేసిన దౌర్జన్యాలు, షావుకార్ల మోసాలను సాహు సమాజం కళ్లకు కట్టాడు.
అందులో 'ఐదు రూపాయాల కథ' ప్రముఖ రచయిత ప్రేమ్చంద్ రాసిన 'సవాశేర్ గోధుమలు' కథతో సరిసమానమైనదని ఎందరో తెలుగు రచయితలు కితాబివ్వడం విశేషం. కొన్ని కథలు 'అడవిలో వెన్నెల' కథా సంకలనంలో ప్రచురితమయ్యాయి.
విహంగ వీక్షణం, ఇక్కడే, ఉదయమేది, వ్యాఘ్రాలు, ఎవరుకారకులు, విన్నపం, జాగీరిగాళ్లు, విప్లవాల పాట, రన్నింగ్ కామెంటూరీస్, రాజకీయాల్లో తిట్లు, ఫిలిం సెన్సార్ బోర్డు, పోస్టర్ చట్టం వాళ్ళు, వీళ్లు, ఉత్తరాలు పంచబడవు, కోపమా, జ్ఞానీ జానిష్టములో, కొంపలు కూల్చే పథకం, సందేశం కాదు సత్యం కూడా, అక్షర లక్ష్యాలు, సూర్యుని ఆకాంక్ష, కాలం చెల్లిన గీతం, జాగ్రత్త, దీక్ష, ఇది సత్యం, నరకం స్వర్గం, ఓనా చెల్లి, ఓ స్త్రీ, జ్వలిత జ్వాల, నూతనాధ్యయనం కోసం వంటి అనేకమున్నాయి. ఇందులో 'ఎవరుకారకులు' అనే కవితలో నాటి భోపాల్ గ్యాస్ ఉదంతాన్ని వర్ణించిన తీరు గుండెలను పిండేస్తుంది. పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టిన తీరు అమోఘం.
''నాదేశపు దేహంపై
భోపాల్ ఒక మృత్యుమడుగు
ఎన్ని అందమైన జీవితాలు
బహుళజాతి కళింగుని వాతపడ్డాయో''
అని సాహు ఆవేదన చెందుతాడు. ఎవరు కారకులని ప్రశ్నిస్తాడు. బహుళజాతి సంస్థలను, వాళ్ల అడుగులకు మడుగులొత్తుతున్న నేతలను దునుమాడుతాడు. 'ఇక్కడే' కవితలో ''ఇక్కడే ఆకలి ఉంది/శోకం ఉంది/ శిథిలమైన లోకం ఉంది/వెలుగును మింగే చీకటి ఉంది'' అని ఆదివాసీల జీవితాలను వర్ణిస్తాడు. అంతలోనే ''చేయి చేయి కలుపుదాం/ ఆకలి అంతుచూద్దాం'' అంటూ వారికి దిశానిర్దేశం చేస్తారు. విన్నపం కవితలో ఆదివాసీ స్త్రీలపై ఉన్న పురుషాధిక్యాన్ని నిలదీస్తారు. ఇలా గోండులకు సంబంధించిన అనేక అంశాలపై సాహు కవితలు రాశారు.
సాహు అశువుగా అల్లిన పాటలు నేటికీ ప్రజానాల్కలపై దొర్లుతుండడం విశేషం. పొదల పొదల గట్ల నడుమ పొడిచెనొక్క సందమామ, శ్రామికధ్వజం, ప్రతిమలు, వెంకటరమణ వీరు దండాలు, లోకానికి రారాజు, గోగుల తండా వీరుడు, ఎర్రగోగులెవ్వరో, ఖుర్బానీ, సందేశం, కరువుపాట వంటివి ఎంతో ప్రజాదరణ పొందాయి. అన్నింటికీ మించి బాలకార్మికుల వ్యథాభరిత గాథను ఇతివృత్తంగా చేసుకుని అల్లిన
''నీ కన్నీరు నా కన్నీరు కలిగినోడికి పన్నీరాయె
ఒంటిగా శోకం బెట్టే చిన్ని తమ్మయ్యా
నీ జంటగా నేనుంటరారా చిన్నితమ్మయ్యా
నీళ్ల పంపే తల్లయి సాకేనా చిన్నితమ్మయ్యా'' అనే పాట సాహుకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. ఆ పాట ఆ నాటి కాలంలో చిన్నా పెద్ద నాల్కలపై ఉందంటే ఎంతగా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు.
ఆదివాసీల మౌఖిక సాహిత్యంలో నిక్షిప్తమై ఉన్న కుమ్రంభీం జీవిత చరిత్రను సహ రచయిత అల్లం రాజయ్యతో కలిసి సాహు వెలికితీశారు. వారిద్దరూ కలిసి నిజాం కాలంనాటి దస్తావేజులను శోధించారు. భీం సమకాలీనులను, నాటి పోరాట యోధులను ఎంతో శ్రమకోర్చి వెతికి పట్టుకుని వివరాలను సేకరించారు. గోండుల మౌఖిక సాహిత్యాన్ని అధ్యయనం చేసి అన్ని అంశాలను బేరిజు వేసుకుని ఒక రూపానికి తీసుకొచ్చి నవలను రాసి ప్రపంచానికి అందించడంలో కీలక భూమికను పోషించారు. ఇది తెలుగు నాట వెలువడిన మొట్టమొదటి చారిత్రక నవలని పలువురు లబ్ధప్రతిష్టులైన సాహితీవేత్తలు కీర్తించడం విశేషం. అదీగాక 1983లో ఇంద్రవెల్లి స్తూపంతో పాటే అదే వేదికమీద నుంచే కుమ్రంభీం నవల ఆవిష్కృతమవడం మరో విశేషం. ఈ మాత్రం సాహిత్యమైనా వెలుగులోకి వచ్చిందంటే సాహు మిత్రుల కృషియే కారణం. ఇంకా వెలుగుచూడని, సాహు డైరీకే పరిమితమైన ఒగ్గుకథ, కవితలు ఇతర రచనలు అనేకమున్నాయి.
విప్లవోద్యమం చీలిన సందర్భంలో మహారాష్ట్రలో పోలీసులు సాహును అరెస్టు చేశారు. ఆయన విడుదలకు ఆ సమయంలో ఏ ఒక్క పార్టీ ముందుకురాకపోవడం ఆయనను తీవ్రంగా కలిచివేసింది. దీంతో జైలు నుంచి విడుదలై వచ్చిన అనంతరం తిరిగి పార్టీలోకి వెళ్లకుండా ఆయన ఇంటికే పరిమితమయ్యారు. అనంతర కాలంలో బీఎస్ రాములు ఆధ్వర్యంలో నాడు ఏర్పడిన దళిత రచయిత కళాకారుల మేధావులు ఐక్య వేదిక (దరకమే)లో ఆయన చేరి జిల్లా కన్వీనర్గా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొనసాగారు. ఈ క్రమంలో తిరిగి తన సాహిత్యానికి పదును పెట్టాలనుకున్నాడు. మన్యం అడవుల్లో కిడ్నాపయిన బాలరాజును ఇతివృత్తంగా చేసుకుని నవల రాయాలని తలిచాడు. అంతలోనే మార్చి 16, 1993లో అకాల మరణం పొందడం తెలుగు సాహితీ లోకానికి తీరని లోటు.
పశ్చిమబెంగాల్కు చెందిన విలక్షణ రచయిత్రి మహాశ్వేతాదేవి కోవలోనే సాహు సైతం ఆదివాసీల జీవితాలను ఆధారంగా చేసుకునే తన రచనలను కొనసాగించారు. గిరిజన పోరాట యోధుడు బిర్సాముండా చరిత్రను ఆమె వెలికి తీసిసనట్లుగానే కుమ్రంభీం చరిత్రను మౌఖిక సాహిత్యం నుంచి సాహు వెలికితీయడం గమనార్హం. తెలుగు సాహిత్య రంగానికి ఇంతటి విశేష కృషి చేసినా ఆయనకు తగిన గుర్తింపు లభించకపోవడం శోచనీయం. ప్రపంచ తెలుగు మహాసభల్లో మాటమాత్రంగానైనా ఆయన పేరును ఉల్లేఖించకపోవడం విచారకరం. ప్రభుత్వాలు నాటి నుంచి నేటి వరకూ సాహుపై విప్లవకారుడనే ముద్రవేసి వివక్ష చూపుతూ సాహిత్య రంగానికి ఆయన చేసిన సేవలను విస్మరిస్తున్నాయి. వెలుగుచూడకుండా కావాలనే తొక్కిపెడుతున్నాయి. ఇప్పటికీ ఆయన స్వగ్రామమైన మాణిక్యాపూర్లో ఆవిష్కృతమవకుండా మూలపడి, దుమ్ము కొట్టుకుపోతున్న సాహు విగ్రహామే అందుకు నిదర్శనం. ఇకనైనా ప్రభుత్వం ఈ వివక్షను వీడాలి. అముద్రితాలుగా ఉన్న సాహు సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ప్రచురించాలి. సముచిత స్థానం కల్పించాలి. విగ్రహాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. దర్జీ వృత్తితోనే కాలం వెళ్లదీస్తున్న ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలి. అదే సాహుకు ఇచ్చే నివాళి.
(ఈ నెల 16న సాహు వర్ధంతిని పురస్కరించుకుని..)
- ఆర్కే ప్రావ్ద, 79815 74841