Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవిత్వంలో వస్తువు, శిల్పం రెండూ ప్రధానమైనవే. వస్తువును కాలం ఇస్తుంది. శిల్పాన్ని అధ్యయనం, అది ప్రతిఫలించిన సందర్భం ఇస్తుంది. నిజానికి ఈ ప్రతిఫలనాన్ని కూడ గట్టుకుని గొంతుక ద్వారా అంశం, ఇతివృత్తం కవిత్వంగా బయటికి వస్తుంది. ఒక కవిని ఇతరులకు భిన్నంగా నిలబెట్టేది ఈ గొంతుకే. వస్తువు శిల్పంలో వైచిత్రి ఉన్న కవిత్వంలో కూడా గొంతుక ఒక మార్గంలో వినిపిస్తుంది.ఆ కవి శైలిని నడిపించేది నిర్ణయించేది కూడా గొంతుకే. ఒక ప్రధాన స్రవంతి కవిత్వంలో వినిపించే గొంతుకకు అదే మార్గంలో కవిత్వంరాసే ఒక గొంతుకకు మధ్య భేదాలు చాల తక్కువ వర్తమానంలో. అలాంటి ఒక గొంతుక విల్సన్ రావు కొమ్మవరపు కవిత్వానిది. సాధారణంగా వస్తునిర్వహణలో వినిపించే గొంతుకకు రసము లేదా భావనకు విల్సన్ రావు గొంతుకకు వైరుధ్యముంది.
విల్సన్ రావు కవిత్వ వస్తువు సమకాలీన కవిత్వావస్తువులను అతిక్రమించి రాసిందేమీ కాదు. ఈ కాలంలో కనిపించే వైవిధ్యమైన బహుళ వస్తువే ఆయన కవిత్వంలోనూ ఉంది. వాటిని స్వీకరించే దిశ దృష్టిలోనూ ఇతర కవులతో భేదం లేదు. ఉన్నదల్ల ఆ వాక్యంలోని రస స్థితి (ఈస్తటిక్ టేస్ట్)లో ఉంది.
ఏళ్ళుగా నడచివచ్చిన కవిత్వంలో అభ్యుదయం దృష్టిసంబంధమైన భావనను, పీడనను తిరస్కరించడాన్ని చెప్పింది. విప్లవ కవిత సైద్ధాంతికతను, ధిక్కారాన్ని ఇచ్చింది. వర్తమానంలోని దళిత బహుజన కవిత్వం సామాజికాణచివేతకు సంబంధించిన లోచూపును ఇచ్చింది. స్త్రీవాద కవిత జెండర్ దృష్టితో, తెలంగాణా ప్రాంతీయోద్యమ కవిత ప్రాంతీయ నైసర్గిక దృష్టితో కనిపిస్తాయి. ఏ కాలంలోనైనా ఒక ప్రధాన రాజకీయ సామాజిక సాంస్కృతికోద్యమ ప్రభావం తరువాతి కాలాలనుంచి తప్పుకోదు. కాలానుసారంగా ఆవశ్యకతను అనుసరించి మళ్ళీ మళ్ళీ ముందుకొస్తాయి. కొన్ని వాక్యాలను గమనిస్తే విల్సన్ రావులో సమకాలీన వస్తువు అర్థం అవుతుంది.
1. పొగిలి పొగిలి/ రోదించిన రాత్రులెన్నో/ దళితుడి కన్నీటిని రుచి చూడలేక పోతున్నయి - (కన్నీటి రుచి.92.పే)
2. ''విశ్వ విద్యాలయాలు/ ఓంకారనాదాలైన చోట/ నిరంతరం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే/ కొత్త విద్యనొకటి నేర్చుకోవాలి/ అప్పుడెప్పుడో/ రాముడికీ రావణుడికీ/ యుద్ధం జరిగిందని తెలుసుకున్నాం కాని/ ఇప్పుడు సహనానికి అసహనానికి మధ్య/ యుద్ధం జరుగుతోందని మాత్రం అందరం తెలుసుకోవాల్సిన సమయం'' - (అసహనం-పే.77)
3. ''గోరుముద్దల మురిపెమింకా తీరక ముందే/ పారాణి ఇంకా ఆరని పత్తిపూల లాంటి పాదం/ నగరం నడి బొడ్డున పోరాడి ఓడి/ పశు కామ వాంచకు బలైంది'' - (ప్రశ్నల్తో ఉరి తీయండి.పే166)
దృష్టి స్వభావం గొంతుక ఇవి వరుసగా కవిలోని లేదా కవితలోని సామాజిక మానసిక స్థితి, అనుభవం అనుభూతిని చెబుతాయి. అనుభావానుభూతులు సారాంశభూతంగా భావనగా కనిపిస్తాయి. దృష్టి వస్తువును ఇస్తే, స్వభావం దాన్ని గమనించే మార్గాన్నిస్తుంది. దృష్టినుంచి సృష్టికి మధ్యలో స్వభావం గొంతుక కవిని మూసనుంచి తప్పించి నిలబెడతాయి. ''1. దళితుడి కన్నీటిని రుచి చూడలేక పోతున్నాయి, 2. ఇప్పుడు సహనానికి అసహనానికి మధ్య యుద్ధం జరుగుతుంది, 3. నడి బొడ్డున పోరాడి ఓడి పశు కామవాంఛకు బలైంది'' లాంటి వాక్యాలు దృష్టి సారంగా సమకాలీన సామాజికతను పెనవేసుకున్నవి. కవిత్వం నిండా కొన్ని ఎలిజీలు, ఆత్మీయులపై రాసిన కవితలను మినహాయిస్తే మిగతావన్నీ ఇలాంటి సామాజికమైనవే. అందులోనూ రాజకీయార్థికాంశాలే ఎక్కువ. కాని వీటి నుంచి వ్యక్తమయ్యే చిత్తవృత్తి (మూడ్), గొంతుక (టోన్), సృజన వేరు.
దృష్టినుంచి వచ్చిన సామాజికాంశం స్వభావంతో కలిసి ఒక మూడ్ ఏర్పరుస్తుంది. దాన్నుంచే గొంతుక ఏర్పడుతుంది. విమర్శలో మూడ్ను విశ్లేషించడానికి పన్నెండు అంశాలు, గొంతుకను విశ్లేషించడానికి ఇరవైఒక్క అంశాలను చెబుతారు. మూడ్ అంటే కవితలోని పూర్తి మానసిక స్థితి, దాని ప్రవర్తన. గొంతుక ఆ స్థితిని వ్యక్తం చేసిన మార్గం.
విల్సన్ రావు కవిత్వంలో సంఘటన నుండి ధిక్కారం కంటే సంవేదన ఎక్కువ. విమర్శ మూడ్ను విశ్లేషించడానికి చెప్పే దిగులు (ఫ్రెట్నింగ్), వ్యాకులత (గ్లూమీ), కరుణ (సారోఫుల్ నేచర్) ఎక్కువగా కనిపిస్తాయి. సాధారణంగా మూడులో నాలుగు అంశాలను చూడవచ్చు. 1.ఆగ్రహం, 2. ధిక్కారం, తిరస్కారం, 3. దుఃఖం, వ్యాకకులత, 4. మోహం, పరవశం. నవరసాలను స్థూలంగా ఇలా మూడ్లో వ్యక్తమయ్యే కవిత్వాన్ని బట్టి విభజించుకోవచ్చు. విల్సన్ రావు తీసుకున్న పై వాక్యాల తాలూకు వస్తువుల నుంచి ధిక్కారం, వేగవంతమైన భాష కనిపించాలి. సాధారణంగా కనిపిస్తున్నది ఇదే. ఈ సందర్భంలో సమకాలీనంగా కొంత సెటైర్ (వ్యంగ్యం) కూడా వినిపిస్తుంది. విల్సన్ రావు గొంతుక సంజాయిషీ అడుగుతున్నట్టుగా ఉంటుంది. ఒక దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నట్టు, దు:ఖాన్ని పంటి బిగువున ఆపుకుని నిలదీస్తున్నట్టుంటుంది. పై వాక్యాల్లో 1. దళితుడి కన్నీటిని రుచి చూడలేక పోతున్నాయి, 2. అందరం తెలుసుకోవాల్సిన సమయం. లాంటి వాక్యాలన్నీ ఈ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తాయి. బహుశః ఎదుటివారి మద్దతును కూడగట్టే భావన ఇందులో ఉంది. భాషలో మార్దవానికి ఈ భావావేశంలోని కారుణ్యస్థితి ఒక కారణం. అనేక వాక్యాల్లో ఎన్నుకునే ప్రతీకల్లోనూ ఇలాంటి మార్దవం కనిపిస్తుంది. ''పత్తిపూల లాంటి పాదం'', ''చైతన్యం మొలకెత్తాల్సిన తరుణం'' లాంటి వాక్యాలు అందుకు ఉదాహరణ.
ఐ.ఏ.రిచర్డ్స్ ''భావార్థక భాష'' గురించి చెప్పాడు. అందులో కొన్ని భావనలను, అందులో చేసే పనులను చెప్పాడు. ''ధ్వనిశాస్త్రకారులు పదాలు సంకేతించే అభిద- లక్షణాల గురించి శాఖోపశాఖలుగా చిత్రించారు. వాటిని తనలోకి తెచ్చుకోలేదు గాని రిచర్డ్స్ భావార్థక భాషను ఆలోచన, అస్పష్టత, మాయాగతమై అన్న వ్యాఖ్య (సూడో స్టేట్ మెంట్) గొంతుక, ఉద్దేశ్యం (ఇన్టెన్షన్), ప్రవర్తన, సందర్భం, అంతర్గతంగా చిత్రించే బొమ్మలు'' మొదలైన వాటిని అనుశీలించడం ద్వారా విశ్లెషించవచ్చు నన్నాడు - (గుప్తేశ్వర ప్రసాద్.ఐ.రిచర్డ్స్- భావార్థక భాష. భారతీయ రససిద్ధాంతం. పే.195) విల్సన్ రావు గొంతులో ఇలాంటివన్నీ పలుకుతాయి. భావానికి విలువనివ్వటం వల్ల ఈగొంతును, స్థితిని ఆయన కవిత ధరిస్తుంది. ''దేవుడు తప్పి పోయాడు'' - (పే.63) అలాంటి కవితల్లో ఒకటి. ఉన్నాడో లేడో తెలియని దేవుని గురించి ఉన్నాడనుకునే భ్రమలో అలాంటి ఒక నమ్మకం లాంటి మోహం మాట్లాడడం ఈ కవిత. ''దేవుడు తప్పిపోయాడనే''దే ఒక 'సూడో స్టేట్మెంట్'.
1. ''నీతో నేనెప్పుడూ/ ముఖాముఖి మాట్లాడకపోయినా/ నువ్వెవరో నాకిప్పుడు తెలిసిపోయింది''
2. ''శాంతివచనాలు పలుకుతూ/ దొంగ కొంగ జపం చేస్తున్న/ పనికి మాలిన వంకర ముఖపు శిలవి''
3. ''నీదేహంలో నువ్వెప్పుడో తప్పిపోయావు/ కాకపోతే మరేంటి?''
4. ''పత్తిపండించే రైతు/ బట్ట నేసే నేతగాడు/ కూటిగింజల కోసం అలమటిస్తున్నారు/ నేసిన బట్టను అమ్ముకునే దళారీ మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నాడు/ భూమి భాష తెలిసి/ ధాన్యం పండించే అన్నదాత/ దారిద్య్రాన్ని నెత్తికెత్తుకొని/ బతుక్కి చరమ గీతం పాడుతుంటే/ మధ్యవర్తులు తమ వ్యాపార పురోగమనానికి/ అనుకరణ విద్యను మా పుర్రెల్లో నాటి/ కిందిమెట్టునుండి పైమెట్టుకు ఎగబాకి/ ఆకాశయానం చేస్తున్నాడు''
5. ''నిన్ను నిలదీయటం పెద్ద పనేం కాదుగాని/ కాలమెంత విలువైందో తెలుసు నాకు''
6. ''దేవుడా/ నువ్వెప్పుడూ/ నీలోంచి నువ్వు/ తప్పిపోతూనే ఉండు/ నన్ను నేనే/ ఈ నేలలో విత్తుకుని కొత్త జలానికి దోసిలి పడతాను'' - (పే.63/64)
ఈ మొత్తం కవితలో గొంతుక బాధతోనే ఉంది. ఆ సందర్భంలో దేవుణ్ణి నిలదీయటం కనిపిస్తుంది. మొదటి మూడు సంభాషణాత్మక వాక్యాలు (కన్వర్సివ్ సెంటెన్స్) మొదటి మూడు సూడో స్టేట్ మెంట్స్ కూడా. నిజానికి నాలుగులో చెప్పే సందర్భానికి కారకులెవరో తనకు తెలుసు. అయినా ఈ వాక్యాలను రాయడంలోనే కవిస్వభావం, దాన్ని ఆనుకున్న గొంతుక కనిపిస్తాయి. మూడవ వాక్యంలో రెండవభాగం ''కాకపోతే మరేంటి?'' లో ఒక అమాయకత్వం, పసిచేష్టలతో కూడిన దుఃఖం కనిపిస్తాయి. ఈ దుఃఖంలోంచే ''వంకర ముఖపు శిల'' అనే ఆక్రోశంతో కూడిన నింద. నిజానికి నాలుగో భాగంలోని వాక్యాలే ఆయన వస్తువు. కవిత్వ సందర్భం. ఇందులోనూ మళ్లీ రెండు రెండు చొప్పున భాగాలున్నాయి. మొదటి భాగాల్లో వ్యక్తుల ప్రతిపాదనలు. రెండవ దాంట్లో వాస్తవ స్థితి. అయిదవ వాక్యం మళ్లీ అమాయకత్వాన్ని పలికించే వాక్యం. ఆరులో తన నిర్ణయం. రిచర్డ్స్ వాస్తవాన్ని చెప్పే నిర్ధారిత శాస్త్రీయ మార్గం సూడో స్టేట్మెంట్- అన్నాడు. ఈభాగంలోని వాస్తవం కోసం విల్సన్ రావు గొంతుక ముందు వాక్యాలను చెప్పింది. నిజానికి ఇలాంటి దుఃఖంలో ఉన్నప్పుడు అస్పష్టమైన మాటలు వస్తుంటాయి. చివరివాక్యంలోని రెండవ భాగం అలాంటిదే. తాను సత్యం కోసం నిలబడతానని చెబుతున్నట్టుగా ఉండే ఈ వాక్యం కవితలోని మూడ్ను గొంతుకను పదిలంగా పలికిస్తుంది. అనేకసార్లు చిత్రించే పదబంధాలు కూడా అలాంటివే. ''చరిత్ర నెగడు/ పచ్చి పాదాలు/ ఆకుపచ్చలోయ(65) ఊపిరితాళ్ళు/ ప్రాణ సూత్రం/ చెమట విత్తనం/ వెలుతురు కిరణం'' లాంటివి కొన్ని అలాంటివి. ఊపిరి/ ప్రాణం లాంటి పదాల మీద విల్సన్ రావు కవిత్వంలో ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తుంది. ''ఊపిరితీగ (69)/ ఊపిరితాళ్ళు (65) ఊపిరిసంతకం (78)'' అలాంటివి. ''తెల్లని మల్లె పువ్వంటి మనసున్న నలుగురు మనుషులు తోడుండాలి'' (పే.90) అని తపిస్తారు విల్సన్ రావు. బహుశః తననలా నిర్మించుకుంటున్నారు. అందుకే ఈ సత్యవంతమైన దుఃఖం ఆయన కవిత్వమంతా పారుతుంది. అందుకు సాక్ష్యం ఆయన గొంతుక. ఆయన గొంతుకే ఆ కవిత్వపు ప్రతినిధి.
- ఎం.నారాయణ శర్మ, 9848348502