Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలసాహిత్య సృజనలో నారంశెట్టి ఉమామహేశ్వరరావు చేస్తున్న కృషి విలక్షణమైంది. ఆయన రాసిన కథలు, నవలలు అనేకం. పిల్లలకు అర్థమయ్యే రీతిన వారి భాషలోనే రచనలు చేయడం నారంశెట్టి ప్రత్యేకత. ఆయన రాసిన 'ఆనందలోకం' నవలకు ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం ప్రకటించారు. విజయనగరం జిల్లాలో 1964లో పుట్టిన ఈ రచయిత పిల్లల కోసం రచనలు చేయడం ద్వారా ప్రసిద్ధి పొందారు. కౌమారం నుంచే రచనలు చేస్తున్న నారంశెట్టి దాదాపు పదకొండు కథల పుస్తకాలు రాశారు. ఆరు నవలలు వచ్చాయి. 1981లోనే 'మేలెరిగిన మనిషి' అనే నవల రచించాడు. అంటే పదిహేడేళ్ళ వయసులోనే నవల రాశాడు. అప్పట్నించి మూడున్నర దశాబ్దాలకు పైగా బాలసాహిత్యం సృజిస్తూనే ఉండటం నారంశెట్టి ప్రత్యేకత. పిల్లల కోసం కథలు, కవితలు, గేయాలు, నాటికలు, నవలలు అనేకం రాశారు. ఈ మధ్యనే ఈతరం కుర్రాడు, రైతు సింహాసనం నవలలు వచ్చాయి. పిల్లల పత్రికలన్నిటిలోనూ వారి కథలు, నవలలు ప్రచురితమయ్యాయి. పిల్లల కోసం రాసిన నవలలు వివిధ పత్రికల్లో సీరియల్గా వచ్చాయి. వ్యవసాయ వాచకం శీర్షికన పప్పుధాన్యాల గురించి రెండు పుస్తకాలు రాశారు.
పిల్లల కోసం వారికి సులువుగా బోధపడే భాషలో కథలు రచించడంలో ఉమామహేశ్వరరావు చూపిన కౌశలం చెప్పుకోదగింది. చిన్న చిన్న వాక్యాల్లో పూసగుచ్చినట్టుగా కథని చెప్పడం వల్ల ఇతని కథలు చదివించే గుణాన్ని సంతరించుకున్నాయి. ఇప్పటివరకు దాదాపు ఇరవై పుస్తకాలకి పైగా ప్రచురితమయ్యాయి. మరో ఇరవై పుస్తకాలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. నిరంతరం సాహిత్యం గురించి తపించడం ఈ రచయిత స్వభావంలోనే వుంది. పిల్లల కోసం పిల్లల భాషలో, పిల్లలకు బోధపడే ఇతివృత్తాల్ని స్వీకరించి రచనలు చేయడంలో శ్రద్ధాసక్తులు చూపిస్తున్న నారంశెట్టి ఉమామహేశ్వరరావుకు ఈ ఏడాది బాలసాహిత్య పురస్కారం లభించడం పట్ల బాలల రచయితలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో బాలసాహిత్యం కోసం అంకితమై పని చేసేవారికి ఇది ప్రోత్సాహకరంగా ఉంటుందని చెబుతున్నారు.