Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నేను కథానికను ప్రేమించేవాడిని. మంచి కథానికలు రావాలని తపిస్తున్న వాడిని... కథానికను సరైన కోణంలో చూపించే ప్రయత్నం చేశాను' అని వినయంగా చెప్పుకున్నాడు డా||వేదగిరి రాంబాబు. విజయనగరం కథానిక వందేళ్ళ పండుగలో వందమంది రచయితల మధ్యన రాంబాబుని నేను 'కథానికా జీవి' అన్నాను. అది అతని బిరుదుగా స్థిరపడింది. కథానికాభ్యుదయానికి ఉద్యమ స్థాయిలో పాటుబడిన రాంబాబు కథాసాహిత్య రంగప్రవేశం చిత్రంగా జరిగింది. 1970ల్లో అతను బందరులో బిఎస్సీ చదువుతున్న సందర్భం. ముమ్మరంగా నాటకాల్లో నటిస్తున్నాడు. మంచి అందగాడు. సినిమాల్లోకి పోవలసినవాడు. యాదృచ్ఛికంగా - నేను జాషువాపై చేసిన ఒక గంట ప్రసంగం విన్నాడు. అది ఎంతో నచ్చింది. వచ్చి బెరుకు బెరుగ్గా తనని పరిచయం చేసుకుని నా గురించి తెలుసుకున్నాడు. మర్నాడు పార్క్లో మా కథకుల సమావేశానికి వచ్చాడు. సింగరాజు రామచంద్రమూర్తి, నేను, శాలివాహన, ఆదివిష్ణు, యర్రంశెట్టి శాయి, చందు సోంబాబు, నందం రామారావు, దొండపాటి దేవదాసు... ఇలా అక్కడందరూ పత్రికల్లో, పోటీల్లో విజయ విహారం చేస్తున్న కథకులు. రోజూ చర్చలే. వచ్చేవాడు, వినేవాడు. అదీ స్ఫూర్తి. కథారచనలో తానూ రాణించాలనుకున్నాడు. అంతే. బుర్రకెక్కిన ఆలోచనని దీక్షగా మార్చుకునే గుణం అతనిది. లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే - ఇక ఒకటే సాధన. గురి తప్పే ప్రసక్తి లేదు. రోజుకొక కథతో - అర్ధరాత్రీ అపరాత్రీ నా ముందు వాలేవాడు. ఆ రాత్రి ఆ కథ పూర్తి కావాలి. తిరిగి రాయాలి! మాలాగా తానూ చాలా కథలు రాశాడు. పత్రికలకెక్కాడు. 1974లో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ప్రథమ బహుమతీ పొందాడు. ఆ విధంగా నేనతనికి కథా గురువుని! డిగ్రీ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చాడు.
ఆకాశవాణిలో క్యాజువల్ ఆర్టిస్ట్గా - శతసహస్రంగా విభిన్న కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అదే అతను తన వ్యక్తిత్వాన్నీ సాహిత్య వ్యక్తిత్వాన్నీ రూపుదిద్దుకోవటానికి సహకారద్రుమం అయింది. తర్వాత ఆంధ్రభూమి వార పత్రికలో చేరి, ఏడేళ్ళు సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేశాడు. దానిలో విరమించుకుని 'పల్లకి' వారపత్రికకు ఎడిటర్గా ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత కేవలం 'ఫ్రీలాన్సర్' అయ్యాడు. ఫ్రీలాన్సర్గా అతను 'పొద్దుచాలని మనిషి'! ఒక చేత్తో కథలూ, వ్యాసాలూ, ఫీచర్స్, ఇతర రచనలూ వేరొక చేత్తో సీరియల్స్, టీవీ డాక్యుమెంటరీలు, ఆకాశవాణి కార్యక్రమాలూ! ఇవి గాక, దేశమంతా తిరిగి వైవిధ్యభరితమైన పరిశోధనలు, వాస్తవ గాథల సేకరణ; జీవిత చరిత్రల అధ్యయనం. 'అనుండిక్ష' వరకూ (కవిత్వం మినహా) అతని సృజనకు నోచుకోని సాహిత్య, దృశ్య, శ్రావ్య రూపక ప్రక్రియ లేదన్నట్టు విశ్వరూప ప్రదర్శన చేశాడు!
1994 - రాంబాబు సాహిత్య జీవన ప్రస్థానంలో ఒక గొప్ప మలుపు. తెలుగు కథ 'చెత్త' కథల పోటీ స్థాయికి కూడా దిగజారిపోవటాన్ని చూసి ఆవేదన చెందాడు. కథానికా సదస్సుల ఆలోచన వచ్చింది. రచనశాయి, నేను, మరికొందరం కలిసి ఒక రూపాన్నిచ్చాం. దేశవ్యాప్తంగా వున్న తెలుగు కథా రచయితల్ని పిలిపించి, 1994 ఫిబ్రవరిలో హైదరాబాద్లో ఒక భారీ కథాసదస్సు నిర్వహణ జరిగింది. వాకాటివారు ప్రభ వీక్లీలో ఎడిటోరియల్ రాశారు. వారే అన్నట్టు దాని నిర్వహణకి నేనే 'పౌరోహిత్యం' వహించాను. సదస్సు నిర్మాత రాంబాబు. చోదకశక్తి రచనశాయి. హేమాహేమీలంతా వచ్చారు. వారివారి అభిప్రాయాలు చెప్పారు. కొన్ని తీర్మానాలు జరిగాయి. ఆ తర్వాత ఎడిటర్లతో మరో సదస్సు నిర్వహించాడు రాంబాబు. కథానిక ప్రక్రియ పట్ల తనకున్న మమకారంతో తనను దానికి అంకితం చేసుకుని, రంగంలోకి దిగాడు. జర్నలిస్ట్ కాలనీలో ఇంటిస్థలం కాస్తా 'ఖర్చ'యింది. కొత్త రచయితల్ని ప్రోత్సహిస్తూ శిబిరాలు పెట్టాడు. వర్క్షాప్లూ జరిపాడు. సాహితీలోకంలో కథానికా ప్రక్రియ పట్ల ఒక నవచైతన్యానికి నాంది పలికాడు. పత్రికలన్నీ ప్రత్యేక కథనాలతో, కవరేజ్తో ప్రోత్సహించాయి.
బుచ్చిబాబు అవార్డ్ని నెలకొల్పి సుప్రసిద్ధ కథకులు అరిగే రామారావు, భమిడిపాటి జగన్నాథరావు, డి. వెంకట్రామయ్య, రావి- ఎన్-అవధాని, శివరాజు సుబ్బలక్ష్మి, వీరాజీ గారలకు ప్రదానం చేశాడు. వారి కథాసంపుటాల్ని వేరువేరుగా ప్రచురించి ఇచ్చాడు. కథాసాహిత్య శాస్త్ర గ్రంథం అనదగిన 'కథనరంగం'ని ప్రచురించాడు. ఒక సంవత్సరంలో వచ్చిన అన్ని పత్రికల్లోని కథల మీద - పాతిక ముప్పై మంది కథకుల, విమర్శకుల విశ్లేషణాత్మక వ్యాసాల్ని తెప్పించి 'కథాసమీక్ష' పేర ఒక పక్కా సమీక్షా గ్రంథాన్ని వెలువరించాడు. ఈ అనితర సాధ్యమైన కృషి ఆరేళ్ళు సాగింది. తెలుగు సాహితీలోకంలో ఇదొక అపూర్వమైన ప్రయత్నం. అలాగే, నూతన ప్రయోగంగా - 'కొత్తకథ', 'సరికొత్త కథ', 'వినూత్నకథ', 'నవతరం కథ', 'పంచసప్తతి' - డైరెక్ట్ కథల సంకలనాల్ని ప్రచురించాడు.
1997లో కేంద్ర సాహిత్య అకాడమీ పక్షాన నిర్వహించిన ఐదు రోజుల కార్యగోష్టికి సమన్వయకర్తగా వ్యవహరించి, ఆ కార్యక్రమాన్ని సంచలనాత్మకంగా జరిపాడు. ఫలితంగా డా||వాకాటి, డా||రాంబాబు సంపాదకత్వంలో 60 మంది రచయితల 'బంగారు కథలు' సంకలనాన్ని ప్రచురించింది సాహిత్య అకాడమీ.
రాంబాబు నిర్వహించిన తెలుగు కథానికా శత జయంతి ఉత్సవాలు - ఒక చారిత్రాత్మక సంఘటన. విజయనగరంలో రెండు రోజుల పండగతో వందమంది కథకుల సమక్షంలో జరిగిన మరపురాని ఉత్సవ సమ్మేళనం అది. ఆ తర్వాత అవిభక్త ఆంధ్రప్రదేశ్లోని 23 జిల్లాల్లోనూ సదస్సులు నిర్వహించి, ప్రాంతీయ సదస్సులు జరిపి, హైదరాబాద్లో సినారె అధ్యక్షతన ముగింపు సమావేశాన్ని జరిపాడు. 23 జిల్లాల కథానికా చరిత్రపై ఆయా జిల్లాల రచయితల చేతనే వ్యాసాలు రాయించి, పారితోషికాలిచ్చి, వాటిని 'వందేళ్ళ తెలుగు కథానిక' పేరున సంకలనంగా తెచ్చాడు. ఔత్సాహిక కథకులకూ పోటీలు పెట్టి, ఆ కథలతో 'అద్దం' సంకలనాన్ని వేశాడు.
విజయనగరంలో గురజాడ వారి ఇంటికి మరమ్మత్తులు చేయించి, ఫ్యాన్లు అమర్చి కొత్త రూపుని కూర్చాడు. లైబ్రరీకి ర్యాక్లని అందజేశాడు. ప్రభుత్వం వారితో మాట్లాడి ఆ గృహాన్ని గురజాడ జ్ఞాపక భవనంగా నిలిపే సఫల ప్రయత్నం చేశాడు. రాంబాబు చేసినవన్నీ నిర్మాణాత్మకమైన కార్యక్రమాలే అనటానికి గురజాడ భవనం, రాజమండ్రిలో అతనేర్పాటు చేసిన శ్రీపాదవారి విగ్రహం ప్రత్యక్ష సాక్షులు!
గురజాడ 150వ జయంతి వచ్చింది. ఆ సందర్భంగా గురజాడ సాహితీ సర్వస్వం, ఆధునిక ధృవతార (జీవన రేఖాచిత్రం) బాలల బొమ్మల గురజాడ (ఇంగ్లీషు, తెలుగు) పుస్తకాలు ప్రభుత్వ పరంగా రావడానికి అతని కృషే కారణం. ఇవి గాక, తానుగా మళ్ళీ గురజాడ 5 కథానికల్నీ ఇంగ్లీషు, హిందీ, కన్నడ భాషల్లోకి అనువదింపజేసి ప్రచురించాడు. గురజాడ దేశభక్తి గేయాన్ని 24 భాషల్లోకి అనువదింపజేసి అచ్చొత్తించాడు.
గిడుగు వెంకటరామమూర్తి 150 వ జయంతి సందర్భం. ఆయన నివసించిన, కార్యకలాపాలు సాగించిన ప్రదేశాల్లో సదస్సులు జరిపాడు. శిథిలావస్థలో వున్న ఆయన రచనల్ని అష్టకష్టాలకోర్చి సేకరించి 'గిడుగు సాహిత్య సర్వస్వం'ని తెలుగు అకాడమీ ద్వారా 'గిడుగు సవరభాష సంబంధి'ని ఆం.ప్ర. ప్రభుత్వ సహకారంతో ప్రచురింపజేశాడు. వెయ్యేసి పేజీల ఉద్గ్రంథాలివి. భవిష్యత్ సాహిత్యావసరాలకు ఆకర గ్రంథాలు. ఇవి గాక కొనకళ్ళ, పాలగుమ్మి, బుచ్చిబాబు వంటి సుప్రసిద్ధ రచయితల శతజయంతులు జరిపి వారి కథానికల్ని ప్రచురించాడు. గురజాడ 100వ వర్థంతికి 'తప్పక చదవాల్సిన వంద కథానికలు', సుధామ సంపాదకత్వంలో 250కి పైగా కవితలతో 'అక్షరం' సంకలనం వెలువరించాడు. ఎందరో ప్రముఖ కథకుల కథాసంపుటాల్ని తన ఖర్చుతో ముద్రించాడు.
రాంబాబు సృజన సాహిత్యం 50 పుస్తకాలకు పైబడి వున్నాయి. 50 కి పైగా పుస్తకాలకు అతను సంపాదకత్వం వహించాడు. 50కి పైగా వీడియోలు, డాక్యుమెంటరీలు, 200 ఆడియోలు (నాటికలు, నాటకాలు, రూపకాలు వంటివి) వున్నాయి.
'రచయితగా నేనొక ప్రయోగశీలిని' అన్నాడు రాంబాబు. ఇది అక్షర సత్యం. అతని సాహిత్య కృషి అంతా ఆయా ప్రయత్నాల్లో తొలి అడుగు, లేదా ఒక శాశ్వతమైన, చారిత్రాత్మకమైన, 'నభూతో న భవిష్యతి' కార్యక్రమం! అతని పరిశోధక వాస్తవ జీవన కథనాలు - 'జైలు గోడల మధ్య', 'వీళ్ళేమంటారు?', 'అగ్నిసాక్షి', 'పాపం పసివాళ్ళు', 'ఇంద్రధనస్సు' (పిల్లల మొట్టమొదటి వీడియో మేగజైన్), 'కథావీధి' దూరదర్శన్ రూపకాలు, 'నాలుగు శతాబ్దాల నగరం' వంటివన్నీ దేనికదే సాటి. తెలుగులో అలాంటి రచనలు రానేరాలేదు! వైద్యవిజ్ఞానిక గ్రంథాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, విమర్శ జర్నలిజం, జీవిత రేఖా గ్రంథాలు, ప్రత్యేక సంచికల సంపాదకత్వం, వందల సంఖ్యలో వ్యాసాలు... 'సముద్రం' అంత విస్తృతమైన కృషీ, సేవా అతనివి!
రాంబాబు పొందిన సత్కారాలూ, అందుకున్న పురస్కారాలూ చాలా వున్నై. 'పాపం పసివాళ్ళు'కు బంగారు నంది, 'అడవి మనిషి' టెలీఫిల్మ్కి రజత నంది, జింగిల్స్కి ప్రసారభారతి అవార్డు, గురజాడ స్మారక అవార్డు, గిడుగు భాషా పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు, నిన్నమొన్నటి ఎ.వి.కె.ఎఫ్ వారి విశిష్ట సాహితీ మూర్తి పురస్కారం వంటివి వాటిలో కొన్ని.
రాంబాబు వ్యక్తిత్వంలోని ప్రధాన గుణాలు - నిక్కచ్చితనం, గుండె నిబ్బరం, లక్ష్యశుద్ధి, తాను ప్లాన్ చేసింది జరిగి తీరాలి. ఆ జరిపే తీరులో, క్రమంలో అతను ఎంత వారినీ, ఏ పొరపాటునీ ఉపేక్షించడు. ఎంత మాటనైనా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కూడా అనగలడు. అదొక ఉద్వేగం. అయితే, అవతలి వ్యక్తిని తానే పొరపాటుగా అర్ధం చేసుకున్నట్లు తెలిస్తే, వెంటనే 'సారీ' చెప్పే స్వచ్ఛమైన మనస్సూ అతనికి వుంది! సాహిత్య వ్యక్తిత్వపరంగా రాంబాబు - అనితర సాధ్యమైన కృషీవలుడు. అచ్చమైన ప్రయోగశీలి. కథానికాభ్యుదయానికి తన మనసునీ, తనువునీ, ధనాన్నీ 'ఖర్చు' చేసేసుకున్న 'భ్రష్టయోగి'! చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ అంతటి నూతనత్వం, వైవిధ్యం, విస్తృతీ సాధించిన మరో తెలుగు భాషా సాహిత్య సేవకుడిని చూడలేదు సాహితీ లోకం! ఆ విధంగా డా||వేదగిరి రాంబాబు ధన్యజీవి!!
- విహారి, 9848025600