Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కనబడకుండా పోయిన తెలంగాణ సాహిత్యాన్ని నేటి తరానికి పరిచయం చేసే సంకల్పంతో 2009లో ప్రారంభమైన తెలంగాణ ప్రచురణలు 2017లో ఏకంగా 30కి పైగా పుస్తకాల్ని తేవడం ప్రశంసనీయ సందర్భమే. దశాబ్దాల క్రితం ముద్రింపబడి ప్రస్తుతం అందుబాటులో లేని పుస్తకాలను తిరిగి ముద్రించడం నేటి అత్యవసర గొప్ప కార్యంగా భావించాలి.
పునర్ముద్రణ వరుసలో వచ్చిన కవితా సంకలనం '1971- 80 ఈ తరం యుద్ధ కవిత'. 1982లో తొలిసారిగా వచ్చిన ఈ సంకలనం ఆ రోజుల్లో ఓ సంచలనమే. 1970 దశకం తెలుగు నేలపై విప్లవాలు మొలిచిన సమయం. ఆనాటి కవులు, రచయితలు సమకాలీన ఉద్యమాల నుండి, పోరాటాల నుండి ప్రేరణ పొందారు. అందుకే విప్లవోద్యమాలను కీర్తిస్తూ, పాలక వర్గపు అణచివేతను నిరసిస్తూ ఉద్యమాలకు బాసటగా తమ అక్షరాల సాలు పోస్తున్నట్లు కవుల కలం యోధులైనారు. కవుల భావజాల నిదర్శనమే కాకుండా ఆనాటి యువత, విద్యావంతులు ఏమి కోరుకుంటున్నారో ఈ కవితల్లో చూడవచ్చు.
1980 ప్రాంతంలో ఓ.యూ. విద్యార్థులు ఏర్పాటు చేసుకొన్న ఉస్మానియా యూనివర్సిటీ రైటర్స్ సర్కిల్ ఆ రోజుల్లో ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఈ కవితా సంకలనం తేవడంతో తన అస్తిత్వాన్ని నిలుపుకుంది. ఆనాటి సంగతులను తొలి, మలి ముద్రణ సంపాదకీయాల్లో వివరంగా చూడవచ్చు.
ఉన్న 31 యుద్ధ కవితలే. కవులంతా నిర్భీతితో విప్లవాల్ని సమర్థించినవారే. అయిదారుగురు ఆనాటి ఓయూ ప్రాంగణ విద్యార్థులు తప్ప మిగతా కవులంతా బయటివారే. ఒకరిద్దరు 'లోపలి' వారు కూడా వున్నారు. విప్లవ భావాలు వచన కవిత్వాన్ని యెంత శక్తివంతమైన రూపాలుగా మలచగలవో ఈ సంపుటి రుజువు చేస్తోంది. 'పదేళ్ళ కాలంలో వచ్చిన జాతీయ, అంతర్జాతీయ సంఘటనలకు తెలుగు కవితా స్పందనలవి' అని రెండు మాటల్లో ఈ కవిత్వాన్ని విశ్లేషించారు చేరా తన ముందు మాటలో.
1975లో నారా రాసిన 'అపస్వరాలు' వచన కవిత వ్యక్తీకరణలోని తీవ్రతకు మచ్చుతునక. శ్రీశ్రీ భూమ్యాకాశాలు ఓ చారిత్రక సంఘటనను రికార్డు చేసిన కవిత! వాళ్ళిద్దరిలో ఒకడు భూమి రెండోవాడు ఆకాశం' అంటూ ఎమర్జెన్సీలో ఉరికంబం ఎక్కిన భూమయ్య కిష్ణాగౌడులో శ్రీశ్రీ ఇలా లక్షర నివాళి సమర్పించాడు.
'అడవీ... నా అడవీ.. నీ పేరు వింటేనే నాకు పూనకం వస్తుంది' అని ఆ రోజుల్లో రాసిన దేవీప్రియ మతోన్మాదపు ప్రభుత్వ ఏలుబడిలో పురస్కారాన్ని గ్రహించడం జీర్ణంకాని విషయమే.
చెర 'పునర్జన్మ' సాహిసికతలో రాటుతేలిన కవిత. 'ఇదంతా వాళ్ళ పాటకు నేను/ పల్లవిని కాకపోవడమే/ వాళ్ల పల్లకీకి బోయీగా మారకపోవడమే' అని తెలిసినా బొట్టుబొట్టుగా నా నెత్తుటిని ఈ నేల విముక్తికోసం విత్తనంగా చల్లుతాను' అని సడలని విశ్వాసాన్ని ప్రకటించాడు. కవులు బోయీలుగా మారిపోతున్న నేటి కాలానికి ఈ కవిత నేర్వదగ్గ పాఠంగా పనికొస్తుంది.
1978లో నగముని రాసిన 'కొయ్య గుర్రం' ఓ వ్యంగ్యాత్మక నిరసన గళ కవిత్వం. 'కళ్ళు'ను 'వర్గ కసి ఈ యుగ కర్తవ్యమని చాటుతున్న జ్వలితాగ్ని గోళాలు' అని నిజం 1980లో రాసిన దీర్ఘ కవిత ఆ రోజుల్లో బహుచర్చితమైంది.
ఇలా కవితలన్నీ ఆ దశాబ్దానికి ప్రతినిధినిలా నిలిచేవే. అయితే కవితలకన్నా ముందు కవులను ఎంపిక చేసుకున్నట్లు అనిపిస్తుంది. దశాబ్దానికి ప్రతీకగా నిలపాలన్న ఆకాంక్షతో ఎంపికలో సీనియర్ కవులకే ఎక్కువ స్థానం లభించింది. ఆనాడు యువకులైన, సామ్యవాద దృక్పథంతో నవనవలాడుతున్న వారైన తొలిముద్రణ సంపాదకులతో సాయుధ విప్లవ కార్యాచరణను పూర్తి సమర్థన కనపడుతుంది.
యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కవిత్వం ఎలా వుంటుందో తెలుసుకోవడానికి వర్తమాన కవులు, పఠితులు ఓ సారి తిరగేయాల్సిన పుస్తకమిది.
ఈ తరం యుద్ధ కవిత 1971-80, సంపాదకులు : డా||సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, పేజీలు : 108, వెల : 60/-, ప్రతులకు : తెలంగాణ ప్రచురణలు, 9849220321
- బి.నర్సన్, 9440128169