Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1988లో మొట్టమొదటి కథ రాసారు రాజుగారు. మొదటి కథా సంపుటి 2002లో ప్రచురించే లోపే మూడు కవితా సంపుటాలు ప్రచురించారు. ఆ తర్వాత 2012లో యానాం కథలు, 2015లో కళ్యాణపురం యనాం కథలు-2, ఇపుడు 2018లో 'కథల గోదారి'. ఇది రాజుగారి నాలుగో కథా సంపుటం. ఇప్పటి వరకు మొత్తం ఏడు కవితా సంపుటాలు రెండు దీర్ఘకవితలు ఒక చరిత్రగ్రంథం, ఒక రాజకీయ వ్యంగ్య కథ మొత్తం 15 పుస్తకాలు, ముప్పై ఏళ్ళ సాహిత్య వ్యాసంగంలో ఎన్నో పురస్కారాలు, యానాంలో సాహిత్యకారులకి గొప్ప ఆతిధ్యమిచ్చే మిత్రుడిగా, యానాంలో జరిగే అనేక సాహిత్య కార్యక్రమాలకు మూల స్తంభంగా దాట్ల దేవదానం రాజుగారు తెలీనివారు తెలుగు సాహిత్య రంగంలో ఎవరూ లేరు.
ఒక ప్రాంతం నేపథ్యంగా కథలు రాయడం తెలుగులో కొత్త ఏమీ కాదు. అమరావతి కథలు, బి.వి.ఎస్ రామారావు గోదావరి కథలు, ఇలా చాలా వున్నాయి. 'యానాం' ప్రాంత చరిత్ర, సమాజం, సంస్కృతి, నేపథ్యాలుగా రాజుగారి కథలు చాలా ప్రాచుర్యం పొందాయి.
యానాం ఫ్రెంచ్వారిచే పాలించబడినపుడు ఆ ప్రాంతం ఎలా ఉండేది, బ్రిటిష్ వారి పాలనకు వారి పాలనకు వున్న తేడా ఏమిటి ఇలాటి ఆసక్తి కరమైన విషయాలు ఆంధ్రదేశంలో ఎక్కువగా ఎవరికీ తెలీదు. సాహిత్యకారులు కూడా యీ విషయం మీద శ్రద్ధ పెట్టలేదు. అయితే ఒక చిన్న ప్రాంతంలో వున్న ఫ్రెంచి పాలన ఆ చుట్టు పక్కల వున్న బ్రిటిషు పాలనా ప్రాంతాల మీద ఎంత ప్రభావం చూపిందో రాజుగారి కథల్లో మనకు తెలుస్తుంది. ఆ రకంగా దేవదానం రాజుగారు ఒక చారిత్రక భూమిక నిర్వహిస్తున్నారు. పాండిచ్చేరిలో ఫ్రెంచివారి పాలనా విషయాన్ని తెలుసుకోడానికి 'ఆనందరంగపిళ్ళె' డైరీలని చదివి తెలుసుకుంటారు. ఆనందరంగపిళ్ళె ఫ్రెంచి పాలనలోని ఒక దుబాసీ. తన డైరీలలో అన్నీ రాసుకున్నాడు. యానాంకు సంబంధించినంత వరకు దాట్ల దేవదానం రాజు పుస్తకాలను చదివి యానాంలో ఫ్రెంచి పాలనా వివరాలు అన్నీ తెలుసుకోవచ్చు.
ఒకప్పుడు బాల్యవివాహాలకీ, ఇంకొకప్పుడు ఆంధ్రదేశంలో మద్యనిషేధం పెట్టినపుడు మద్యంకోసం బారులు తీరిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందిన యానాం కాలక్రమేణ సాహితీ పరంగా సాంస్కృతిక పరంగా ప్రసిద్ధి చెందడం ఆనందకరం. ఈ మార్పుకి అక్కడి రాజకీయ పరిస్థితులు దోహదం చేయగా శిఖమణి, దేవదానం రాజుల చొరవతో సాహిత్య ప్రదేశంగా మారింది. రాజుగారి ఇంట్లో భోజనం చేయని కవులూ, కథకులూ ఆంధ్రప్రదేశంలో లేరంటే అది అతిశయోక్తికాదు. కవిత్వం, కథా రచన మాత్రమే కాక కవులూ, కథకులు వారి జీవితంగా మార్చుకున్నారు. కొంతమంది సాహిత్యకారులు తమకున్న విశ్రాంత సమయంలో సాహితీ సృజన చేస్తారు. రాజుగారు తనకు ఉన్న మొత్తం సమయాన్ని సాహితీ సృజనకు సాహిత్యకారుల సేవలకూ వెచ్చిస్తున్నారు. ఇలాంటి సాహితీ సేవకుల వలన యానాంలో ఎంతమంది యువకవులు ఇపుడు తయారయ్యారో చూడండి. ఇంకొన్నాళ్ళకి యానాంలో ఇంటింటికీ ఒక కవి పుట్టుకొచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ విషయంలో శిఖామణిని, రాజుగారినీ అభినందించక తప్పదు.
భాషా పరంగా రాజుగారి కథలు తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో వ్యవసాయ సమాజం మాట్లాడుకునే భాష సహజమైన తెలుగు పదాలతో, కొన్నిచోట్ల ప్రాంతీయంగా వుంటే కొన్ని మాండలిక శబ్దాల సౌందర్యంతో నిండి వుంటుంది. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రాజుగారు ఇదే భాషలో కథారచన చేయడంలో ఆశ్చర్యం లేదు. ఉపాధ్యాయ వృత్తిలో వున్న రాజుగారు స్వయంగా వ్యవసాయం చేస్తున్న వ్యక్తి. మట్టి వాసన తెలిసిన మనిషి కావడం వలన ఆయన వాడే భాషలో కూడా మట్టి వాసన తగలడం అతి సహజం. కథల గోదారి పుస్తకంలో యానాం తీర ప్రాంతాల్లో మత్స్యకార కుటుంబాల్లో వుపయోగించిన వృత్తి సహజమైన పదాలు చాలా కనిపిస్తాయి. కులపరమైన వృత్తిపరమైన ఎన్నో పదాలు ఇంకా విరివిగా ప్రయోగంలోకి రావాల్సిన అవసరం వుంది. రాజుగారు వాడుతున్న పదాల పట్టిక చూస్తే ఇదోరకమైన భాషాసేవ అనక తప్పదు. తెలుగు ఇలా కన్నా ఎలా సంపన్నమవుతుంది?
'యానాం కథలు' అని పేరు పెట్టినా ఇవి కేవలం యానాం ప్రాంతానికి పరిమితమైన కథలు కావు. సత్యం శంకర మంచి అమరావతి కథలు, ఒక ప్రాంతం ఆధారంగా ఎలాగ విశ్వజనీన జీవితాన్ని ఆవిష్కరించాయో, యానాం కథలు కూడా తెలుగునాట వున్న వ్యవసాయిక, మత్స్యకార సమాజాల చిత్రణగానే మనం స్వీకరించాలి. సరిహద్దులకి అటయినా ఇటయినా రైతు దు:ఖం ఒకటే. మత్స్య కారుడు పట్టే చేపలు ఒకటే.
రాజుగారి రచనల్లో సైద్ధాంతిక నిబద్ధత ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా అంతర్గతంగా దాగి వుంటుంది. సమకాలీన జీవన చిత్రణలో మంచినీ, చెడునీ రెంటినీ సమానమైన దృక్పథంతో దర్శింపజేసి పాఠకుడికే తీర్పు వదిలేయడం కూడా కనిపిస్తుంది.
రాజుగారి కవిత్వం గానీ, కథలు గానీ ఇంతకీ వైయుక్తికమా, సామాజికమా? తన జీవితంలో తన చుట్టూ జరుగుతున్న కథల్ని చిత్రీకరిస్తూ, సమకాలీన సమాజ చిత్రణ ద్వారా వ్యక్తినీ, సమాజాన్ని రెంటినీ మనందరి ముందు నిలబెట్టడం ఈ కథల్లో వున్న ముఖ్య లక్షణం. సహజమైన కథా కథనంతో ప్రాంతీయత నిండిన భాషతో ఇవి అందర్ని మెప్పిస్తాయి.
వృత్తిరీత్యా రాజుగారు ఉపాధ్యాయడే అయినా ఆయన ఎపుడూ ఒక విద్యార్థిగానే వున్నట్టు అనిపిస్తుంది. తన కథల ద్వారా సమాజాన్ని చదువుకుంటూ నేర్చుకుంటూ తననీ సమాజాన్నీ సంపన్నం చేస్తున్నారు.
ఇంతకీ రాజుగారు తన 34వ సంవత్సరం వరకు సాహిత్యం జోలికి రాకుండా ఆ తర్వాత ఎందుకు రాస్తున్నారు? ఇంత విస్తృతంగా కవితా, కథా రచన ఎలా చేస్తున్నారు? నేననుకోవడం ఉపాధ్యాయ వృత్తిద్వారా సాహిత్యం, చరిత్రల పరిచయం ఏర్పడ్డాకా విస్తృతంగా చదివి తనదైన భాష, ప్రాపంచిక దృక్పథం ఏర్పరచుకోడానికి కొంచెం ఆలస్యమైనా, ఒకసారి మొదలుపెట్టాకా ఇక అన్ని అనుభవాల్ని రంగరించి సృజన చేస్తున్నారు. జీవితానుభవం ఆయనలోని సాహితీ తృష్ణని పట్టి లేపింది. శివారెడ్డి, శిఖామణి తదితర ప్రముఖ కవుల సాహిత్యం దొరకడంతో తన సాహితీ వ్యాసంగం నిరాటంకంగా కొనసాగుతోంది. తన ఆతిథ్యంతోను, విశిష్ట వ్యక్తిత్వంతోను, సహజ రచనలతోను తెలుగు సాహిత్యాన్ని రంజింప చేస్తున్న యానాం కథల రారాజుకి అభినందనలు.
- ఆకెళ్ళ రవి ప్రకాష్, 94905 17777