Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏనుగు నరసింహారెడ్డి వెలువరించిన కవిత్వ సంపుటాలపై వివిధ సందర్భాలలో వివిధ వ్యక్తులు స్పందించిన అక్షరాక్షతల మాలికనే 'అర తీసిన రంగస్థలం'. 'సమాంతర స్వప్నం, కొత్త పలక, నేనే, మట్టిపాట, హైదరాబాద్ విషాదం' అను ఏనుగు నరసింహారెడ్డి రచనలపై పత్రికలలో వచ్చిన 51 దృక్కోణాలను ఒక చోట చేర్చి నరసింహారెడ్డి సృజనపై పాఠకులకు అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా అందించారు సంపాదకులు. ఇలా తేవడం వలన పాఠకునికి, అభిమానులకు సౌలభ్యం ఒనగూరుతుంది. ఆయా సంపుటాలను ఒకే చోట విహంగవీక్షణం చేయడానికి మార్గమేర్పడుతుంది. ఇలా సంకలించడం అనేది ఒక కొత్త ఆలోచన. గతంలో ఒకే సంపుటిపై వచ్చిన సమీక్ష, వ్యాస గ్రంథాలున్నవి. కాని అయిదు సంపుటాలను ఒకే దగ్గర చేర్చడం ఒక నూతన ఒరవడి.
ఈ పుస్తకంలో అనుబంధంగా 'కొత్త పలక, నేనే, సమాంతర స్వప్నం, మట్టి పాట' సంపుటులలో నుండి కొన్ని కవితలను ఇందులో కూర్చి నరసింహారెడ్డి కవిత్వాన్ని రుచి చూపించారు. వెంకటేశ్వరరావు చేసిన ముఖాముఖిని ఇందులో జమ చేశారు.
నరసింహారెడ్డి కవిత్వాన్ని అంచనా వేయడానికి ఈ 'అర తెర తీసిన రంగస్థలం' పుస్తకం ఉపయోగపడుతుంది. సంపాదకుల కృషి ఫలవంతం అయినదనే చెప్పాలి. ఈ సమ్యక్ సమీక్షా సంపుటి కవితను రాసిన కవిత్వాన్ని మననం చేసుకోవటానికి తాను లోలోపలికి చూసుకోవడానికి మార్గాన్ని తనలో తను మననం చేసుకోవడం అలవరుస్తుంది. ఏనుగు నరసింహారెడ్డిని ఇది ఏకపంచరశిగా చూపిస్తుంది.
అర తెర తీసిన రంగస్థలం, సంపాదకులు : జి.రామశేషయ్య
పేజీలు : 224, వెల : 150/-,
ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు.
- టి. శ్రీరంగస్వామి