Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవీన్ ఎంచుకున్న కథలు చాలా సాధారణాంశాన్ని కథగా మలిచినవి. అయన మరెన్నో (ఆయన ఉదాహరించిన వాటి కంటే మంచి కథలు) రాశారు. ఆయనలో కొన్ని చూడడం వల్ల కథగా ఒదిగిన కథల విషయం చెప్పారు. కానీ తనలోకి తాను చూసుకున్నప్పుడు కథగా మారిన ఒక కథనం గురించి 'నేపథ్యం'లో చెప్పి వుంటే బాగుండేదనిపిస్తుంది.
సమకాలీన సాహిత్యంలో కథానిక తన ఉనికిని బలంగా చాటుకున్నదన్నది సాహిత్యవేత్తలందరూ అంగీకరించే విషయమే. ఇటీవలి కాలంలో సాహితీ విమర్శకు గురవుతున్నది కూడా కథానిక సాహిత్యమే. కథానిక సాహిత్యం గురించి, కథకుల గురించి, కథా ధోరణుల గురించి, కథల్లో ప్రతిఫలిస్తున్న సామాజిక చింతనలను గురించి, వస్తు, శిల్ప పరిణామాల గురించి కథల్లో కనిపిస్తున్న సామాజిక ప్రతి స్పందనలను గురించి కథానిక సాహిత్య విమర్శ వెలువడుతూనే ఉంది. ఈ క్రమంలో 'తెలుగు కథ వెలుగులు' పేరుతో సహృదయ సంస్థ వరంగల్లు వారు ప్రసంగ వ్యాసాల సంపుటిని ప్రచురించారు. కేంద్ర సాహిత్య అకాడమి కథాసంధి, సాహిత్య వేదిక తెలుగు కథ అన్న కార్యక్రమంలోని ప్రసంగ పాఠాల వ్యాస సంపుటి తెలుగు కథ వెలుగులు.
కథాసంధిలో భాగంగా అంపశయ్య నవీన్ 'నేను రాసిన కథలకు నేపథ్యం' అన్న తొలి ప్రసంగం ఉంది. ఇది కాత్యాయనీ విద్మహే ఈ పుస్తకం పీఠికలో చెప్పినట్లు ఒక ముఖాముఖి వంటిదే. 1955 నుంచీ కథానికలు రాస్తున్న ఒక రచయిత తను అన్ని కథలకూ నేపథ్యం చెప్పడం కష్టమే బహుశా అసాధ్యం కూడా. రచయిత రాసిన ప్రతి కథకూ నేపథ్యం ఉండాలన్న నియమమూ లేదు. అయితే తన కథలకు నేపథ్యం గురించి చెప్పిన వ్యాసాల్లో తాను రచయితగా తొలి అడుగు వేయడానికి కారణమైన కథా నేపథ్యాన్ని చెప్పడం ద్వారా రచయితకు కథా వస్తువులు చుట్టూ ఉన్న వాతావరణంలో దొరుకుతాయని చెప్పినట్లైంది. ప్రసంగంలో తాను తొలినాళ్ళలో రాసిన కథలను ఉదహరించడం వల్ల ఇటీవలి వారికి వాటి సంగతి మరింత స్పష్టంగా తెలిసే వీలు కలిగింది. అయితే నవీన్ ఎంచుకున్న కథలు చాలా సాధారణాంశాన్ని కథగా మలిచినవి. అయన మరెన్నో (ఆయన ఉదాహరించిన వాటి కంటే మంచి కథలు) రాశారు. ఆయనలో కొన్ని చూడడం వల్ల కథగా ఒదిగిన కథల విషయం చెప్పారు. కానీ తనలోకి తాను చూసుకున్నప్పుడు కథగా మారిన ఒక కథనం గురించి 'నేపథ్యం'లో చెప్పి వుంటే బాగుండేదనిపిస్తుంది. నవీన్ కథా రచనలో మనోవైజ్ఞానిక పార్శ్వం ఉంటుంది. అందువల్ల అటువంటి ఒక కథను కథానేపథ్యంలో వివరించి వుంటే బాగుండేది.
జీవన విధ్వంసంలో గ్లోబలైజేషన్ కథ అన్న కె.పి.అశోక్కుమార్ వ్యాసం ప్రపంచీకరణ నేపథ్యంతో వచ్చిన కథానికలను విశ్లేషించింది. ప్రపంచీకరణ దృక్పథాన్ని చెప్పి అది ఎన్ని రకాలుగా జీవన విధ్వంసం చేసిందో చెప్పారు. సరళీకృత ఆర్థిక విధానాలు కార్మికులను, వ్యవసాయ రంగాన్ని, చిన్న వృత్తుల వారిని ఎలా నిర్వీర్యం చేస్తున్నాయో వాటిని తెలుగు కథకులు ఎలా చిత్రించారో సోదాహరణంగా చెప్పారు. విద్యా, వైద్యం మానవ సంబంధాలలో ప్రపంచీకరణ చొచ్చుకుని వచ్చి చేసిన నష్టాన్ని, సెజ్లపై వచ్చిన కథలను విశ్లేషిస్తూ ప్రసంగ వ్యాసం సాగింది. ప్రపంచీకరణ ఫలితాలను చూస్తే మన రచయితలు, ప్రజా సమూహాలు నేల విడిచి సాము చేయలేదని స్పష్టమవుతుందంటారు కె.పి. వ్యాసాన్ని కొన్న ఉపశీర్షికలతో వివరించి వుంటే బాగుండేదనిపించినా ఇది ప్రసంగ వ్యాసం అని గుర్తుకు తెస్తున్నదీ వ్యాసం.
తెలంగాణ కథా వికాసం అన్న బన్న అయిలయ్య వ్యాసం కథానిక - కథ చర్చ మొదలుకొని, తొలికథ గురించిన ఆలోచనలను చర్చిస్తూ వివిధ పరిశోధకుల అభిప్రాయాలను క్రోడీకరించారు. వివిధ కాలాల్లో తెలంగాణ ప్రాంతపు పరిస్థితులు, సామాజిక స్థితిగతులు చెప్పడం ఆ దశలో వచ్చిన కథలను గురించి చెప్పడం అన్న పద్ధతిలో ఈ ప్రసంగ వ్యాసం కొనసాగింది. విస్తృతమైన అంశం కావడంతో దాన్ని ప్రసంగ పరిధిలో చెప్పడానికి బన్న అయిలయ్య గట్టి ప్రయత్నమే చేశారు. ఈ రెండు వ్యాసాలు వస్తుపరమైన అంశాలనే ప్రధానంగా ప్రతిపాదించాయి. గ్లోబలైజేషన్ దుష్ఫలితాలను చెప్పడంలో పాటించిన శిల్ప రీతులను కె.పి. వ్యాసం ప్రస్తావించలేదు. తెలంగాణ కథ శిల్ప పరంగా కథన పరంగా అనుసరించిన రీతులను, తెలంగాణ కథ రకాలను బన్న అయిలయ్య వ్యాసం ప్రస్తావించలేదు. బన్న అయిలయ్య ఉదహరించిన వారిలో ఎందరో కథకులుగా ప్రసిద్ధిపొందనివారూ ఉన్నారు. కథకుడిగా కోవెల సుప్రసన్నాచార్యులు ఒక కథను చెప్పిన బన్న అయిలయ్యగారు గొప్ప ఎలెగొరికల్ కథ రాసిన చెట్లు - మొక్కలు కోవెల సంపత్కుమారాచార్యను మరిచి పోయారు. 1957లోనే వెలువడ్డ కథానిక ఇది. చైతన్య స్రవంతి వంటి కథన రీతులను ఆడెపు లక్ష్మీపతి, నవీన్ వంటి వారు అనుసరించారని కె.పి. ప్రస్తావించినా కథనం, శిల్పం, శైలి విషయాలలో తెలంగాణ కథ ప్రత్యేకతను స్థూలంగానైనా చెప్పవలసి వుండింది.
కథ, కథనం, శిల్పం అన్న రామాచంద్రమౌళి ప్రసంగ వ్యాసం వాటిని వివరించే ప్రయత్నం చేసింది. తన స్వీయానుభవాలను ఈ వ్యాసంలో ప్రస్తావించారు. సోమదేవుని కథా లక్షణాలను ప్రస్తావించి పాఠకుడి ఊహకు అందని ముగింపు ఉండాలన్నారు. లక్షణాలుగా ఎన్ని చెప్పుకున్నా రచయిత పనితనం నుండీ, స్వీయానుభవం నుండీ గొప్ప కథలు వెలువడ్డాయన్నది సర్వకాలీన సత్యం.
ఒక అనుభవం, మూడు విశ్లేషణలతో వెలువడ్డ తెలుగు కథ వెలుగులు కథా సాహిత్యాన్ని అధ్యయనం చేసేవారికి ఒక కరదీపికగా చెప్పవచ్చు. ఈ పునాది మీద మరింత వివేచననూ చేయవచ్చు.
తెలుగు కథ వెలుగులు, సంపాదకత్వం : గన్నమరాజు గిరిజామనోహరబాబు, పేజీలు : 96, వెల : 100/-, ప్రతులకు : గిరిజామనోహరబాబు, ఇం.నెం.2-11-501/5, విజయనగర కాలనీ, హన్మకొండ, వరంగల్ - 506009
- సిహెచ్.లక్ష్మణ చక్రవర్తి