Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''పద్యాన్ని, గద్యాన్ని వచనాన్ని ఏకకాలంలో పదునుగా నడిపిన సవ్యసాచి
మతులు పోగొట్టే ఎత్తులు, అలంకార మదగజ కుంభస్థలాలను బద్దలు కొట్టిన లాక్షణికుడు
సంగీతం, సాహిత్యం, సంస్కృతి అనే మూడు విబూది రేఖలను నిత్యం నుదిటిపై ధరించే కవికుల వైతాళికుడు.
నడిచొచ్చే విజ్ఞాన సర్వస్వం. ఇంటిలోనే తీర్చిదిద్దిన ఓ గ్రంథాలయం.
కవి కేసరి కపిలవాయి లింగమూర్తి. శతాధిక అనుభవాల పాలమూరి కవి బీష్మాదితుడు''
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పాలమూరు మండలం జినుకుంట్ల గ్రామంలో 1928 మార్చి 31న మాణిక్యమ్మ, వెంకటాచలం దంపతులకు జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్లాయంలో ఎం.ఎ తెలుగు పట్టా స్వీకరించారు. 1954 జాతీయోద్యమ కళాశాలలో తెలుగు లెక్చరర్గా దశాబ్దకాలం పనిచేశారు. విఠల శతకం సాలగ్రామ శాస్త్రం, మాంగల్య శాస్త్రం, పాలమూరు దేవాలయాల చరిత్ర, కవిత, కథ, పరిశోధన గ్రంథాలు, శాసనాలు మరుగునపడ్డ తాళపత్ర గ్రంథాలను సులభ శైలిలో ప్రజలకు అందించడంలో తెలుగు పండితుడు, చరిత్రకారుడు, శాసన పరిష్కార, సాహితీ మార్గదర్శిగా నిలిచారు. 1983లో రిటైర్మెంట్ అయినా, నిత్య సాహితీసంచారిగా తెలంగాణ సాహిత్యానికి మైలురాయి కపిలవాయి లింగమూర్తి. నేటి తరానికి ఆయన పరిశోధన, తపన తప్పకుండా స్ఫూర్తిగా నిలుస్తాయి.
నిండు నూరేళ్ళ సంపూర్ణ జీవితం గడిపారు. వారు చేసిన సాహితీ సేవలను, వారు చెప్పిన సామాజిక అంశాలను గుర్తుచేసుకోవడం మన గురుతర బాధ్యత. నిరంతర సాహిత్య చర్చ జరిపేవాడు. చర్చ ఆగిపోకూడదు అని నిరంతరం నూతన కవులకు చెప్పేవాడు. చర్చ ఆగిపోతే సమాజ అభివృద్ధి కూడా ఆగిపోతుంది అని నిరంతర చర్చలు కొనసాగించేవాడు. ప్రతిసారీ ఓ కొత్త విషయం చెప్పేవారు. భాష, సంస్కృతి, చరిత్ర, దేవాలయాలు తెలంగాణ కున్న ప్రత్యేకతలు, ఆధునిక సాహిత్య తీరుతెన్నుల గురించి విడమరిచి వివరించేవారు.
జనపదులు మాట్లాడుకునేది జీవద్భాషని, దాన్ని విడవకూడదని, ప్రజలు మాట్లాడుకునే మాటల్లోని అర్థాన్ని, పరమార్ధాన్ని పట్టుకోవాలంటారు. చరిత్ర గ్రంథాల్లో దొరకనివి, ఎక్కడా నిక్షిప్తం కాని విషయాలు పల్లెకథల రూపంలో చెప్పుకుంటారు. అదే నిజమైన చరిత్ర. దాన్ని పట్టుకోవాలి. చరిత్ర లోతుల్లోకి వెళ్ళాలి. ఇలా ఒక్కో విషయం గురించి నూతన రచయితలకు జాగ్రత్తలు, మెళకువలు నేర్పేవారు. రచనలో జీవం జవం ఉండాలంటే పర్యటన, యాత్ర, సందర్శన అనేది అత్యంత కీలకమైనదిగా చెప్పేవారు. తాను పాలమూరు జిల్లాలో పర్యటించని గ్రామం, గుడి, గూడెం, తండాలు లేవని; ప్రయాణ సౌకర్యాలు లేని కాలంలో కూడా కాలికి బలపం కట్టుకుని ఎన్ని మార్లు చుట్టివచ్చానో తనకే తెలియదని, తాను చూసింది, తాను తెలుసుకుంది మాత్రమే రాసేవాడినని, అప్పుడు మాత్రమే తన రచనకు సంతృప్తి అని తొణికిసలాడే ఆత్మవిశ్వాసంతో చెప్పేవారు.
ఇప్పటి తెలంగాణ భాష స్వచ్ఛంగా వుంది. ఎక్కడా సంకరం కాలేదంటే జీవనంలో మార్పులేదు. కట్టు, బొట్టులో మార్పులేదు. ఎవ్వరి ప్రభావం మనమీద లేదు. అందుకే ప్రాచీన భాష స్వరూపం ఒక నిధిలా భద్రపరుచుకున్నారు. వరుసలు పెట్టి పిలుచుకునే తత్వం, మత, కులసామరస్య లక్షణం తెలంగాణలో ఎక్కువగా వుంటుంది. మగడు అంటే సరైన మాట. కాని మొగుడు అంటున్నారు. ఇది తప్పు. మొగుడు అంటే ముడుచుకునేవాడు అని అర్థం. మన భాషలో జాతీయాలు, భాషీయాలు ఎక్కువగా వున్నాయి. నుడి, నానుడులు జంట పదాలు. ద్వంద్వ పదాలు తెలంగాణ తెలుగులోనే ఉంటాయి. మన భాష బతకాలంటే... దీనికోసం వ్యాకరణం వుండాలి. నిఘంటువులు తయారు కావాలి. అధికార భాషగా, పాలనలో, బోధనలో ఉండాలి. ఇంత పెద్ద ప్రపంచ మహాసభలు జరిపినా పై కార్యక్రమాలేవీ చేపట్టకపోవడం విచారకరమన్నారు.
తెలంగాణలో శ్రమ సంస్కృతి, శ్రమలోంచి పాట, ఆట, చావు, పుట్టుక, పండుగ, సంతోషం ఏదైనా ఇక్కడ పాటల సంస్కృతి ఆటల సంస్కృతి ఆదివాసి సంస్కృతిని ప్రజలు ఆదరిస్తారు, ప్రేమిస్తారు. ఇప్పటి తరానికి ఒక పద్యం రాదు, పాట రాదు, ఆట రాదు. అంతా మీడియా మాయాజాలంలో మరుగుజ్జుగా మారుతున్నారంటూ నిరంతరం బోధించేవారు.
మహబూబ్నగర్ జిల్లాలో ఏ గ్రామం పేరు చెప్పినా ఆ పేరు ఆ గ్రామానికి ఎలా వచ్చిందో అలవోకగా చెప్పేవారు. తినే తిండికి సంబంధించినవాటి పేర్లు కూడా సరిగ్గా ఉచ్చరించడం లేదని, 'రైస్' అంటే ఉడకనిది అని అర్థమని, బువ్వ అంటే మెత్తగా ఉండేదని చెప్పేవారు. బువ్వ ఎంత చక్కటి పదం. బువ్వ అవ్వ వాడటం నామోషీ అనుకుంటున్నారు. ఇది తప్పు. శాకం అంటే కూర. శాకాహారం అని ఒత్తిపలుకుతున్నారు. ఇలా పలికితే కూర లేకుండా కారం మాత్రమే వుంటుంది అని. ఇలా మనకు తెలియకుండా వాడుతున్నారు. విద్య గురించి ఆసక్తికర విషయాలు, రావాల్సిన మార్పులు గురించి కూడా వివరించారు. విద్య అంటే నీతిని బోధించేది. నీతి లేని విద్య దండగని, విద్య అంటే నీతి అని అర్థం. కొందరు దొంగతనాలు, హత్యలు చేస్తున్నారు. మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారు. అక్రమ రవాణా చేస్తున్నారు. వీళ్ళంతా చదువుకున్నవాళ్ళే. చదివారు కానీ నీతి లేని విద్య అది. నిజంగా చదువురాని వారికి, ఆదివాసీలకి, చెంచులకి పాపభీతి వుంటుంది. తప్పులు చేయడానికి భయపడుతారు. సమాజంలో నీతి విలువలు కొరవడుతున్నవి. విద్య నీతిని బోధించేలా, విలువలు కాపాడేలా ఉండాలి. సొంతకాళ్ళపై నిలబడే చదువులుండాలి. ప్రభుత్వాలు కూడా అటువైపు దృష్టి పెట్టాలి అని చెప్పేవారు.
ఇరు రాష్ట్రాలకు ఓ స్పష్టమైన భాషా విధానమంటూ లేదు. తమిళనాడు, కర్ణాటక, బెంగాల్, హిందీ రాష్ట్రాలకున్నట్లు భాషా పరిశోధనలు, భాషా సంపదను కాపాడుకునే ప్రాధికారిక సంఘాలు తెలుగు రాష్ట్రాలకు లేవు. మాట్లాడితే ఓట్ల కొరకు తప్ప భాషపై అభిమానమెక్కడిది అని తెలుగు మహాసభలప్పుడే ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల్లో బోళాతనం వుంటుంది. చైనా యాత్రికుడు వాహ్యుయన్త్సాంగ్ తెలంగాణలో తిరిగిప్పుడు ''ఇది ఎంతో న్యాయమైన దేశం'' అని చెప్పారు. ఎందుకలా అన్నారంటే... ఏదైనా వస్తువు పడిపోతే అది అక్కడే వుండేదట. ఈ ప్రాంతాన్ని వారు 'సూర్యదేశం' అన్నారని గుర్తుచేశారు. తెలంగాణ జిల్లాల్లో అనేక సంస్థానాలుండేవి. ఇక్కడున్న మక్తదార్లు, జమిందార్లు జనాలను పీడించేవారు. అందువల్లనే ఈ ప్రాంతంలో ఓ సర్దార్ సర్వాయి పాపన్న, పండుగ సాయన్న, మియా సాహెబ్, నక్కపల్లి రాములు వంటివారు ఉన్నవాళ్ళను దోచి పేదలకు పెట్టేవారు. వీళ్ళను చరిత్రకారులు దొంగలు, దోపిడీదార్లుగా వక్రీకరించారు. కాని జనపదులు పాటల రూపంలో వాళ్ళను గుండెల్లో నేటికీ దాచుకున్నారు.
తెలంగాణలో పోతన, బద్దెన, రామదాస్, కాళోజీ... ఇలా ఎవర్ని చూసినా అప్పటి రాజ్యాధికారాన్ని ధిక్కరించినవారే. ఇక్కడ కలం పట్టిన ప్రతి కవికీ ధిక్కార స్వభావమే వుంటుందని వివరించారు. అన్యాయాన్ని సహించలేని తత్వం ప్రజల్లో ఉంటుందని, కవిత్వం ఎప్పుడూ పీడితుల పట్ల నిలబడి ఒక నూతన సమాజం కొరకు, నూతన మానవుడి కొరకు ప్రసవ వేదన పడుతూనే వుంటుందని కవిత్వపు లోతుల్ని చవి చూసిన కవి కపిలవాయి.
వీరి సమగ్ర సాహిత్యంపై ఆరుగురు రీసర్చ్ స్కాలర్స్ పత్రాలు సమర్పించి పిహెచ్డి పట్టాలు పొందారు. వీరికి అనేక మంది సాహిత్య శిష్యులున్నారు. ఆస్తికులైనా నాస్తికులైనా అన్ని మతాలవారు ఆదరించారు. చిన్ననాటి నుండి సేకరించిన అతి పెద్ద గృహ గ్రంథాలయం తాళపత్ర గ్రంథాలు నేటికీ వున్నాయి. రేపటి పరిశోధకుల కోసం గ్రంథాలయం ఉపయోగపడుతుంది. ఎన్నో బిరుదులు, మరెన్నో సత్కారాలు వరించాయి. తెలుగు విశ్వవిద్యాలయం తొలి గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్న తొలి కవి కపిలవాయి. మూడు వందల కవులకు ముందుమాటలు, శతాధిక పుస్తకాలు రాశారు. 94 ఏళ్ళు సంపూర్ణ జీవిత రహస్యం... ఇంటికి ఎవరు పోయినా చక్కగా బోసినోటితో ప్రశాంతంగా నవ్వుతూ పలకరిస్తారు. అడిగిన ప్రతి ప్రశ్నకు చక్కగా సమాధానమిస్తారు. తెలుగు సాహిత్య సవ్యసాచి తెలుగు భాషకు చేసిన సాహిత్య సేవ అసమానమైనట్టిది. కనుక తెలంగాణ రాష్ట్రం కపిలవాయి లింగమూర్తి సాహిత్య స్ఫూర్తిని భావి తరాలకు అందజేసేలా కృషి చేయాలని తెలంగాణ సాహితి డిమాండ్ చేస్తూ... కపిలవాయికి జోహార్లు అర్పిస్తూ...
- భూపతి వెంకటేశ్వర్లు, 9490098343