Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవిత్వాన్ని ఆస్వాదించడమన్నా, రాయడమన్నా జీవితాన్ని తేనే, సుగంధాలతో నింపుకోవడమే. హమ్మింగ్ బర్డ్ గుండె నిమిషానికి 1200 సార్లు కొట్టుకుంటుంది. పూలలో తేనెను ఆస్వాదించేప్పుడు రెక్కలు అల్లారుస్తూనే ఉంటుంది. అంత అందంగా మకరందాన్ని ఆస్వాదించడం లాంటిదే కవిత్వాన్ని గ్రోలడం. నిజం... కవిత్వానికి ఎప్పుడూ విరమణ లేదు. వాక్యం ఎప్పుడు ఆగిపోదు.
తెలంగాణ వచ్చిన సంబురాన్ని, అంబరాన్ని అంటిన ఆ కలను సాధించడానికి పడిన కష్టాలను వర్ణించిన తీరు, పోరాటం సాగినతీరు 'జననీ జయ కేతనం' అనే కవితలో కనబడుతుంది.
''అణగదొక్కిన చరిత్రకిప్పుడు
పట్టాభిషేకం'' అనే ఎత్తుగడతో మొదలవుతుంది. గోల్కొండ, సమ్మక్క, సారక్క, రుద్రమలను యాదిజేసి
''పెత్తనాన్ని తుత్తునియలు చేసిన రుద్రమ కరవాలం,
కొమరం భీమ్ తలపాగల మెరిసిన చంద్రవంక''...
ఈ కవితలో ప్రతి ఒక్క లైను మనకు తెలంగాణ విశిష్టతను గూర్చి, ఒక వీరగాథను బుర్రకథ రూపంలో చెబుతున్నట్టు ఉంటుంది. కవితని చదివేప్పుడు మనస్సు వీరావేశమవుతుంది.
''మడి కట్టుల మొలిచిన నాగేటి చాళ్ళల్ల
గోదావరమ్మ అలుగు దుంకిన వేళకిదండం...
భూమిల నిక్షిప్తమైన సాంస్కృతిక నిధుల పొద్దుపొడుపు''
తెలంగాణ సంస్కృతి, ఆచార నిర్లక్ష్యం, తెలంగాణా సాధించిన సాంస్కృతిక నిధుల పొద్దుపొడుపు అనంగానే ఒక కారాగారం, బంధింపు వీటి నుండి విముక్తమైన తీరొక్కటి మన కండ్లకు దర్శనమిస్తుంది. ''తరతరాల బూజు, బురుజులను ధ్వంసించిన కొట్లాట ముచ్చట''
ఎన్నో తరాలుగా పట్టిన బూజు బురుజుల ధ్వంసం చేసిన ముచ్చట్లను చెబుతాడు కవి. ''బతుకుల దహించుకుని'' ఇంధనమైన అమరుల స్తూపం గెలుపును ముద్దాడుతున్నది. తెలంగాణ పోరాటంలో తమ ప్రాణాలను బలి చేసుకున్న అమరవీరుల స్తూపం, అది గెలుపుని ముద్దాడుతున్నది. ఇక్కడ మనకు తెలంగాణ సాధించుకున్న అమరుల యాదిచెయ్యడం, వారు లేకుంటే తెలంగాణమే లేదనడం కనబడుతుంది. ఈ వ్యక్తీకరణ తెలంగాణ పట్ల కవికి ఉన్న ప్రేమ, ఎన్నో ఏండ్ల ఎదురుచూపు మనల్ని ఆనందానుభూతులలోకి తీసుకుపోతుంది.
తెలంగాణ సాధించుకోవడానికి ఎంతటి పోరాటం ఎన్ని సంవత్సరాల కల ఇది!
'ఆ రెండు పిట్టలు' అనే కవిత, సొంత ఊరికి పోయినప్పుడు, అది కూడా పాత ఇంటిని చూసినప్పుడు కవికి దర్శనమిచ్చిన రెండు పిట్టల్ని గూర్చి కవిత ఇది. పట్నంలో పిట్టలని చూడాలంటే చాలా తక్కువే. నేటి రేడియేషన్ వల్ల పిట్టల జాతికి ఎనలేని నష్టం జరుగుతున్న సందర్భమిది.
''విశాల ఆకాశపు అంచులను తాకినా/ అవిట్కి మనసున పట్టదేమో''.. స్వేచ్ఛా జీవులైన ఆ పిట్టలు ఆకాశాన్ని తాకి, మనిషితో సహజీవనం చేయడం, మనిషికి రోజువారి పనులలో అది ఒకటి. ఎంత తిరిగినా గూటికి సాయంత్రానికి చేరే మనిషితో పాటు జీవరాసులు కూడా. మనం మన పనుల్లో ఉన్నప్పుడు అవి చేసే 'కిచ్ కిచ్' శబ్దాలు గమనించి, రాసిన కవిత ఇది. వ్యవసాయ కుటుంబాల్లో రైతు బయట ఉట్టిలో ఒడ్లు, జొన్నలు వాటిని ఒలుచుకు తింటున్న ఒడుపును 'కవితాత్మక నేర్పరులు' అనడం, కవి రైతు జీవితం నుండి వచ్చిన వారని చెప్తోంది.
''మళ్ళేదో గుర్తుకొచ్చినట్లు గోడకున్న అద్దంపై వాలి, తన ప్రతిబింబంతో కరచాలనం చేసుకుంటున్నట్లు ముక్కుతో టకటకలాడిస్తూ'' ...
నిజంగా కవి ఈ దృశ్యాలను గమనించే ఉంటారు. కానీ దానిని కవితగా మార్చిన తీరు కవి సునిశిత పరిశీలన మనకు అవగతమవుతుంది.
''కళ్ళు తెరిస్తే/ ముద్రితమౌతున్న అక్షరాలై ఎగురుతున్నయి'' పక్షుల జ్ఞాపకాలు అక్షరాలుగా పోల్చడంతో, 'తిలక్' కవిత్వాన్ని తలపిస్తుంది.
'అమ్మాయి వెళుతోంది' శీర్షికతోనే కవిత దేని గురించి అనేది తెలిసిపోతుంది. కానీ కవితను చెప్పిన తీరు గుండెను పిండకుండా ఉండదు. ఇది కవి స్వానుభవం, మనలను కదిలిస్తుంది. అప్పటిదాకా పెంచుకున్న ప్రియమైన పిల్ల, ఇప్పుడు దూరంగా వెళ్ళడాన్ని వర్షించిన తీరు...
''సృష్టించైనా ఇవ్వడానికి సిద్ధమైనా''
ఈ వాక్యం చదవగానే ఒక తండ్రి హృదయం ఆడపిల్ల పట్ల ప్రేమ, ఎంతటి త్యాగానికైనా సిద్ధం కావడం, తనను తాను ఓడిపోయి అయినా అమ్మాయిని గెలిపించడానికి పడే తపన మనకు కనబడుతుంది. అమ్మాయిగా ఆమె కలల్ని కూడా తానే కనే బాపు కవిత ఇది. బాపు మనసు ఇది.
''పెళ్ళి రోజున/ నా ఇంటి గడప కడిగి, కడుపు తడిచేసి,
కని, పెంచిన రుణం తీర్చుకుని,/ అమ్మాయి వెళుతోంది''
ఈ వాక్యాలు, పదాల అల్లికలా వుండవు. ఆ దృశ్యం మన కండ్లముందు కదలాడి గుండెను తడి చేస్తుంది.
''గుండెల మీద ఆడినప్పుడు/ అఆలు నేర్చుకోవాలన్నానేమో''... గుండెలపై పొదుపుకున్న అమ్మాయి పెంపకాన్ని, అంచెలంచెలుగా ఎదగడాన్ని, బాల్యం నుండి పెండ్లీడు వరకూ దశలు దశలుగా పెంచుకున్న బాపు కండ్ల ముందుంటాడు. ప్రేమలు, లాలింపులు, తండ్రిగా హెచ్చరికలు పెండ్లికి పడే ఇబ్బందులు అన్నింటినీ ఒకే కవితలో నిక్షిప్తం చేసిన దాసరాజు రామారావు కవి... బాపు.
ఈ కవిత చదివిన ప్రతి బాపు, ప్రతి ఆడపిల్ల ఈ కవితను చదువుతూనే గాఢానుభూతికి లోనవుతారు.
''రుణాలు తేర్పుకోవచ్చు,/ ప్రేమలను తేర్పుకోవడముంటదా!'' ఉండదు, ఉండనే ఉండదు.
'కవిజన్మ' కవితలో ''ఆగిన చోటనే/ పదమల్లడం మొదలుపెట్టాలి''
కవిలో ఉన్న ప్రత్యేకత ఏందంటే... కవి గురించి చెబుతూ ఎక్కడైతే ఆగావో అక్కడ నుండే మొదలు పెట్టు అంటాడు. కవిత ఎత్తుకున్న వెంటనే సూటిగా పాఠకుడికి చేరుతుంది. ఆ ఎత్తుగడ మనలను మొత్తం కవిత చదివే వరకు వదిలిపెట్టదు. కవికి ఉండాల్సిన లక్షణాలు కూడా చెబుతాడు. ''ప్రతి చెట్టు ఆకుని పఠించాలె, బోధిసత్యం బోధపడే వరకూ'' అంటూ కవిత్వం యొక్క పరమార్థాన్ని కూడా అందిస్తారు. కవిత్వం వల్ల ఏమి ఉపయోగం? అనే ప్రశ్నకు ఈ కవిత సమాధానం.
'తల్లి గారి ఊరు' తన స్వంత ఊరు గురించి రాసినప్పుడు గుండె గొంతుకలో కొట్టుకోక మానదు. సొంత ఊరు గురించి చాలా మందే రాశారు కానీ, దాసరాజు గారి అనుభూతులను చదువుతుంటే ఒక ఆర్ద్రత మనసును తొలుచుకుంట పోతుంది. కవి ఆత్మ కవిత ఇది. తండ్రిలేని తనను పక్కింటి పాలి అన్నయ్య బడిలో చేర్పించడం, మరిచిపోని ఆత్మీయతా పరిమళమే కాదు, ఇల్లుపెంకలు విప్పిన రాత్రి కురుస్తున్న వానకు తన తల్లి తాను తడుస్తూ, గడిపిన రాత్రి గురించి... చదవడం కాదు, ఆ రాత్రికి ప్రయాణం చేసి ఆ పక్కనే మనం కూర్చుని చూస్తాం. అమ్మను, అక్షరాన్ని, ఆకలిని, ఈ రోజు తనను కవిని చేసిన ఊరును మరవని మట్టి మనిషి...
''నేలపై పోరాడిన, మట్టిలో పోర్లాడిన/ నా ఊరికి నేనేమి ఇవ్వగలను?
ఒక అక్షరం తప్ప'' అని తీరని రుణం గురించి చెబుతారు.
'వాళ్ళు గనక' అనే కవితలో పెళ్ళిదాకా వచ్చి, ఆగిన సంబంధం గురించి కవి దృశ్యంగా చూపుతారు. పెండ్లి చూపులకు తండ్రి పడే వేదనకు కవితా రూపం ఇది.
'కాన్వాస్పై దృశ్యం'
ఈ సమస్త జగతిని ఒక కాన్వాసులా భావించిన దాసరాజు రామారావు, నిజంగా అద్దిన రంగులను గమనిస్తే ప్రకృతిలో మమేకమైన మనస్సు మనకు ఆవిష్కృతమవుతుంది.
''తెలి వెలుగులో మంచులో పూల చట్టూ పద్యాలు చుడుతున్న గండు తుమ్మెదలు./ అగ్గి పెట్టెల్లోంచి ఎగిరిపోయి/ బంతాకులు నెమరేస్తూ,/ కలల్ని వెదజల్లుతున్న బంగారి పురుగులు''
చిన్నప్పుడు అగ్గిపెట్టెలో బంగారు పురుగుల్ని అందరం దాచిపెట్టిన వాళ్ళమే. బంతాకులపై ఎక్కువగా కనిపించే నాటి చక్కటి దృశ్యాన్ని ఇచ్చాడు కవి.
''హరివిల్లు లోంచి రంగులను తెచ్చి,/ పూల తోట కద్దుతున్న సీతాకోకలు'' ఇన్ని భావ చిత్రాలలో పాఠకుడిని విహరింప చేశాడు కవి.
''మట్టిని సుగంధంగా మార్చడానికి/ మల్లగుల్లాలు పడుతున్న నత్తగుల్లలు'' అంటూ సునిశిత, సుందర ప్రకృతి వర్ణన చేసే తన లోకంలో మనలను విహరింపజేసి, ఒక్క కొసమెరుపుతో ఈ లోకంలోకి తీసుకు వస్తాడు కవి.
''నేను కూడా/ ప్రకృతి గీసిన ఛాయాచిత్రంలో
కనబడుతూనే ఉంట,/ చెట్టు కొడుతూనో,
ఎంగిలిచేత్తో కాకిని తోలుతూనో...'' అని, మనిషి చేసే ప్రతి పని స్వార్థం నిండిందనీ, ప్రకృతిని తన స్వార్థానికి నాశనం చేస్తున్నాడు అని నిగూఢ అర్థం మనకు కళ్ళు తెరిపిస్తుంది.
'అమ్మ సంతకం' అమ్మ జ్ఞాపకాలను, రుణాలను తిరిగేసుకుంటూ అనే కవితను అమ్మపై వచ్చిన సంకలనంలో చేర్చాల్సిన అపురూప అమ్మలాంటి కవిత.
'మతం గురించే మాట్లాడుకుందాం' చాలా వ్యంగ్యమైన వ్యక్తీకరణతో ఒక చురక లాంటిది. ఇన్ని అయినా 'మనం మతం గురించే మాట్లాడదాం' అంటూ మత పిచ్చిలో తేలుతున్న వారి మనసులకు, మనుషులకు ఒక హెచ్చరిక. ఘాటైన పదాలను ఉపయోగించిన కవి... ''జెండాలోని త్రివర్ణాలు, రక్తవర్ణంగనే ఎందుకు కనిపిస్తుందో, గోకుల్ ఛాట్ కడాయిల, మాంసం ముద్దలెవరేసిండ్రో'' అని ఆనాటి మతోన్మాద సంఘటనలను చెప్పి మనలను ఆలోచనలో పడేసిన కవిత ఇది.
విభిన్నమైన వస్తువులను తీసుకున్న కవి, ఒక కవితకు ఇంకొక కవిత రిపీట్ కాకుండా చక్కటి కవిత్వాన్ని అందించారు. ప్రతి కవితకు శీర్షికను కూడా చాలా అర్థవంతంగా, ఏమాత్రం కన్ఫ్యూజ్కి గురి చేయకుండా, కవితలు మొత్తం చిక్కటి పదాలు, సులభమైన వర్ణనలతో సాగుతాయి.
''అక్షరం, కాలం, మనిషి/ చెట్టాపట్టాలేసుకుని నడిచే
సహజ జీవన దృశ్యం/ నేను గెలుచుకునే కల....
నిజమవ్వాలని 'విరమించని వాక్యం' భరోసాతో ఆశిద్దాం...!
- సిహెచ్ ఉషారాణి, 9441228142