Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ కథాకాశంలో పేరుపొందిన రచయిత్రి ముదిగంటి సుజాతారెడ్డి. వారి కలం నుండి వెలువడిన కథాసంపుటి 'నిత్యకల్లోలం'. వస్తువైవిథ్యంతో కూడిన ఈ సంపుటిలో 22 కథలు వున్నాయి. పైకి అంతా మంచిగానే కనపడుతున్నా యుద్ధం జరుగుతూనే వుండడం నిత్యం గమనంలోకి వస్తూనే వుంది. 'మార్కెట్ యుద్ధం'లో దేశీకంపెనీకి, విదేశీ కంపెనీకి మధ్య జరిగిన యుద్ధం కనపడుతుంది. ఒక కంపెనీలోని 'క్వాలిటీసెక్షన్'లో పనిచేస్తున్న ఉద్యోగికి లంచం ఇచ్చి ప్రొడక్షన్లో ఆసిడ్ లాంటి పదార్థం కలపడం వల్ల సేల్స్ తగ్గడం, విదేశీ కంపెనీది పై చేయి కావడం కనపడుతుంది. 'ఈ పెండ్లి నిలుస్తుందా' కథలో భార్యాభర్తల మధ్య గొడవ మానవసంబంధాలకు సంబంధించినది. సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేసే ఆలుమగలకు తీరికలేకపోవడం అనేది విడాకులకు దారి తీయడం ఈ కథలో కనిపిస్తుంది. ఇలా అన్ని కథల్లో కల్లోలం చూస్తాం. అలా పుస్తకం 'నిత్య కల్లోలం' సార్ధకనామధేయంగా కనపడుతుంది. నిత్య కల్లోలం కథలోని సమస్యలు అన్నీ ఒక్క దగ్గర కుప్పపోసినట్లు కనపడతాయి. అయితే వాటిని పాఠకుడికి అందించిన తీరు ఆకట్టుకుంది. టీవీ షోరూంలో అనేక రకాల టీవీలు వుంటాయి. వాటిని చూడటానికి, కొనటానికి వెళ్ళినవాడికి సేల్స్మ్యాన్ వాటి విశేషాలను, ధరలను, మంచి చెడ్డలను చెబుతూ వుంటాడు. ఇదొక పార్శ్వం. అదే సమయంలో ఒక్కో రకమైన టీవీలో ఒక్కో సమస్యకు సంబంధించిన విశ్లేషణ జరగడం మరో పార్శ్వం. ఈ తీరు వల్ల పాఠకుడు కథను ఆగకుండా చదివే వీలు కలిగింది. లేటెస్ట్ లెక్కాలజీ వల్ల ఎక్కడో జరిగిన విషయం కళ్ళముందే జరిగినట్లు కనపడడం, దాన్ని అనుభూతి చెందినట్లు చెప్పడంలోనే శిల్పరహస్యం దాగుంది. ఇది టెలివిజన్ కథనం. చేయి తిరిగిన సుజాతారెడ్డి కలం గుండా జాలువారిన పద్ధతి.
కథలన్నీ సామాజిక రాజకీయ ఆర్థిక మార్పులు పరిణామాల వల్ల సమాజంలో ప్రజల జీవితాల్లో జరుగుతున్న సంఘటనలను, వృత్తాంతాలను చిత్రించాయి. నేటి అభివృద్ధి నమూనా, సాంకేతిక ప్రగతి కళ్ళు జిగేలుమనిపిస్తున్నాయి. అదే సమయంలో కంటనీళ్ళు పెట్టిస్తున్నాయి. ఆర్థిక అసమానతల వైరుధ్యం ఒకవైపు, చేతికందిన ఫలాలు, ప్రశాంతతను చెదరగొట్టడం మరోవైపు కనిపిస్తుంది. ఈ సంక్షిష్టతకు అద్దం పట్టేవే 'నిత్య కల్లోలం' కథలు. విడివిడిగా ఈ కథలన్నీ చదివినవే. ఒక్కచోట చేర్చి, ఒకదాని వెనుక మరొకటి చదివేసరికి సామాజిక పరిణామం కనపడుతుంది. భవిష్యత్తుకు ఇదొక చారిత్రక వనరు.
తెలంగాణ చరిత్రలోని ఒక ప్రధాన, గుణాత్మక మార్పును ప్రతీకాత్మకంగా చెప్పిన కథ 'నాటువడ్డ వరిమొక్కలు'. పల్లెల్లోంచి దొరలను పంపించిన వైనం, వారు పట్నంలో కష్టించి ఎదిగిన క్రమం అంతా పూసగుచ్చినపట్లు చెప్పింది. ఆ సందర్భంలోనే ఆనాటి సంఘటల్ని, జీవితాల్ని చిత్రించారు. తెలంగాణ భాష కథలో సజీవంగా తొణికిసలాడింది. కథ ఎత్తుగడనే పాఠకుణ్ణి ఆకర్షించే విధంగా వుంది. జ్ఞాపకాలు, వర్తమానం కలగలిసి కథ సాగటం వల్ల చరిత్ర దృశ్యమానమయింది. ముచ్చట పెడుతున్నట్లుగా సాగిన కథలోని పాత్రల సుఖదుఃఖాలలో పాఠకుడు మమేకం అవుతాడు.
సుజాతారెడ్డి గారు తమ పాత్రల్లోని ఏదో ఒక పాత్ర వైపు నిలబడరు. సంయమనంతో ఇరువైపులా విషయాన్ని విశదపరుస్తారు. పాత్రల వికసన జరుగుతది. వస్తువైవిధ్యానికి పెద్ద పీట వేసినట్లుగానే, కథా సంవిధానానికి హారతి పడుతరు. ఆమే చెప్పినట్లుగా వివిధ పరిణామాలను, సమస్యలను చిత్రిస్తున్న కథలివి.
- డా||బి.వి.ఎన్.స్వామి,
9247817732