Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కవిత్వమంటే శ్వాసించే ఊహలు, రగిలే పదాలు' అని థామస్ గ్రే అంటాడు. కవిత్వం ఎప్పుడు, ఎలా, ఎందుకు, ఎవరి చేతికందుతుందో చెప్పలేం. అందరూ అనుకుంటారు తాము కవిత్వం సృష్టిస్తున్నామని, ఫలానా వాళ్ళు కవిత్వం సృజిస్తున్నారని. కానీ, ఎప్పుడైనా కవిత్వమే ప్రజల్ని ప్రభావితం చేసి తనకు కావల్సిన కవుల్ని తయారు చేసుకుంటుంది. కవిత్వం కూడా కాలపరిధిలోకే వస్తుంది. సమకాలీనత లేనిదే కవిత్వం కూడా లేదు. అయితే కొందరి కవిత్వానికి కాల పరిమితి ఉండదు. యుగాలు మారినా వారి రచనలు పాఠకులను ఉర్రూతలూగిస్తూనే ఉంటాయి. తరాలు మారినా సహృదయులను ఆలోచింపజేస్తూనే ఉంటాయి. అలాంటి కోవకే చెందినవాడు డా||బి.బాలకృష్ణ.
ఓ మంచి కవిత చదివినప్పుడు, ఆ రోజంతా దాన్ని ఆస్వాదిస్తూ, ఊహల డోలలలో మైమరచి తూగేవాడు, తాను తూగడమే కాదు, దాని రుచిని ఇతరులకు తెలిపి ఆస్వాదించేలా చేసేవాడు, కవిత్వాన్ని కవిత్వంగానే ప్రేమించేవాడు, కవిత్వమే తప్ప కౌటిల్యం తెలియని కవికులభారవి మా పి.జి. క్లాస్ మేట్ బాలకృష్ణ కవి. 2005లోనే 'అగ్నివసంతం', 2006లో 'భావచిత్రాలు', 2009లో 'విరహ సమీరాలు' అనే కవితా సంపుటాలు, 2017లో అక్షర వనం అనే సాహిత్య వ్యాస సంకలనాన్ని వెలువరించాడు. ఇంకా అముద్రిత రచనలెన్నో ఉన్నాయి. బాలు నిరాడంబరుడు, మౌనస్వభావి, మొహమాటం కల్గినవాడు, ప్రచారానికి, ఆర్భాటానికి ఆమడ దూరం. అయితేనేం మాటల చేత మాట్లాడించగలడు, పదాల చేత పదనిసలు పలికించగలడు. దేవులపల్లి, శ్రీశ్రీ, ఆత్రేయ, దాశరథి, సినారె లాంటి కవుల కవితామృతాన్ని చిన్ననాడే గ్రోలినవాడై ఉండటం చేతనో ఏమో, బాలు రాసిన ఏ కవితైనా అమృతమయంగానే ఉంటుంది. కవిత్వాన్ని గురించి ''ఎక్కడో కరిగిన మేఘం చల్లగాలై/ చెంపమీద సుతారంగా కిన్నెర మీటినప్పుడు/ చిన్నప్పుడెప్పుడో కట్టించిన చిత్తరువులోని/ పాపాయి బోసినవ్వు బుగ్గల్లో సొట్టలు పూయించినప్పుడు/ నిద్దుర ముద్దరలో సొలసిన కన్నుల మాటున/ తటిల్లతలా స్వప్నమేదో క్షణకాలం తారాడినప్పుడు/ ఎంతతోడుకున్న/ ఇంకా ఊరుతున్న/ చెలమలోని జలలా/ స్పర్శవేది ఏదో నా వేళ్ళలోకి ప్రవహిస్తుంది'' అంటూ తన చేతిలోని స్పర్శవేది (పసరువేది)తో ముట్టిన భావమేదైనా, పట్టిన పదమేదైనా బంగారం చేయగలడు.
బాలకృష్ణ అసలు సిసలు తెలంగాణ బిడ్డ, పక్కా హైదరాబాదీ. ఎన్నో ఉద్యమాలకు కేంద్రబిందువైన ఉస్మానియా విశ్వవిద్యాలయం జాతికందించిన మేటి రత్నాలెన్నో, అయితే ఆ ఉస్మానియా విశ్వవిద్యాలయ గడ్డపైనే (హిమాయత్ అలీబాగ్: నేటి మాణికేశ్వరీనగర్) శ్రీమతి శ్రీబొల్లి పోచయ్య, మల్లమ్మ దంపతులకు 31 అక్టోబరు, 1979లో జన్మించాడు. తాత తండ్రులనుండి వారసత్వంగా, అక్కడ వీచే గాలి పీల్చినవాడు, ఆ మట్టి పొత్తిళ్ళలో ఎదిగి ఒదిగినవాడు. ఎం.ఎ. చదివే రోజుల్లోనే (2003 -2005) ''ఉస్మానియా క్యాంపస్ గాలి తగిల్తేనే చాలు/ నెత్తురు ఉత్తుంగమై ఎగుస్తుంది/ గుండె డమరుకమై మోగుతుంది/ ఏ శ్రమజీవుల చెమటతో కడిగిన నేలనో ఇది/ ఏ రణవీరుల రక్తంతో తడిసిన భువనమో ఇది'' అంటాడు. తెలంగాణ వైభవాన్ని కీర్తిస్తూ ''యశస్సు లేని/ ఉషస్సు రాని/ తమస్సు కాదు నా తెలంగాణ/ విప్లవాల వయస్సు/ ఉద్యమాల సదస్సు/ విషమెరుగని మనస్సు నా తెలంగాణ'' అని కవిత్వం రాసినవాడు. మరోచోట ''నరనరాన అరుణం/ నయనాలలో ఉదయం/ ప్రతి గళాన గానం అదే తెలంగాణం'' అంటాడు.
మరో కవితలో ''అరుణారుణ భారతాన/ ఉదయించిన క్రాంతివై/ ఉవ్వెత్తున ఎగసిపడే/ ఉగ్రరూప ఉప్పెనవై/ భుజంగాల పనిపట్టే/ చలిచీమల రోషమై/ ధనస్వాముల కింద నలుగు/ శ్రమజీవుల కోసమై/ బడుగుజీవి వెన్నెముక/ వజ్రాయుధమై నిలువగ/ తడి ఆరిన గొంతులన్ని/ దేవదత్తమందించగ/ విప్లవాల వీరుడవై/ విజయశంఖమూదగ రావయ్య శ్రీశ్రీ'' అని శ్రీశ్రీని మళ్ళీ ఈ నేలపై ఉదయించమని అడుగుతాడు.
అభ్యుదయన్నే కాదు మానవత్వాన్ని, మట్టితత్త్వాన్ని తన కవితలో వ్యక్తీకరించగలడు. కులాల కుమ్ములాటలు, మతాల మతలబులు తెలిసి తల్లడిల్లే హృదయంతో ''నువ్వెలా ఉన్నావని అడిగితే/ ఏమని చెప్పను నేస్తం/మానవకోటి కల్యాణానికి/ కోటికాంతుల ఉషోదయాన్ని అంకితమివ్వడానికి/ ఉరకలేసిన నెత్తురు/ గుండె చీకటిలోనే ఘనీభవించినప్పుడు/ నే చవిచూసింది/ క్షణక్షణం నరకమేనని చెప్పనా?/ ప్రజాస్వామ్య, స్వేచ్ఛాయుత దేశంలో/ సమానత్వ, సౌభ్రాతృత్వాలను/ ఎద నింపుకుందామనుకుంటే/ గాలి ఇంకా కులం కంపు వీస్తుందని చెప్పనా?/ మానవత్వం నీడలో/ గతం మరచి నిదురిస్తున్నప్పుడు/ ఊసరవెల్లి మతం/ నీడక్కూడా రంగులు/ పులుముతుంటే/ నిలువ నీడలేని మనిషినై బతుకీడుస్తున్నానని చెప్పనా?'' అని ప్రశ్నిస్తాడు. ''ఆకలి మంటై, కడుపును కాలుస్తున్నప్పుడు/ పాశిందైనా సరే/ పట్టెడన్నం పరమాన్నమైతది/ ఎన్నొద్దులకో ఇంత బువ్వ సూశే ఖాలీ బొచ్చెలో/ నీ కంచంలోని కూడు గుమ్మరిస్తున్నప్పుడు/ అన్నం, వేల్పులకెత్తిన బోనమైతది'' ఈ దేశం అన్నపూర్ణ, అయినా ఆకలి చావులకర్థం ఏమిటో?, మన కీర్తి మంచు కొండ, క్షణక్షణానికి కరిగిపోతున్న ప్రతిష్ట పరమార్థం ఏమిటో? అన్నం పెట్టె రైతుకు పురుగుమందే పెరుగన్నమెందుకవుతుందో?, ఆశ, నిరాశలల్లో ఊగిసలాడే బ్రతుకులు, ఉరికొయ్యలపై ఉయ్యాలలెందుకు ఊగుతున్నాయో? ఆర్ధాంతరంగా ముగిసిపోతున్న నూరేళ్ళ జీవితాల అంతిమ జ్వాలలు నింపిన వెలుగుల్లో ప్రయాణిస్తున్న యువత పయనమెటో, ఏ విలువలకీ ప్రస్థానం, ఏ వెలుగులకో ఈ ప్రస్థానం, అన్నం విలువ తెలియని జనమొక వైపు, కూడు దొరకని డొక్కలొకవైపు ఎన్నొద్దులకో ఇంత బువ్వను కళ్ళజూసే వాళ్ళకు అది దేవతలకర్పించిన నైవేద్యమైతదట. ''ఒక్కసారైనా మట్టినై పుట్టాలనుంది/ నదుల రక్తంలో అడుగంటా కలసిపోయి/ పచ్చగా నవ్వాలనుంది/ ఆకలే తప్ప అన్యమెరుగని చోట/ పిడికెడు మెతుకులై ఒక్క పూటైనా బ్రతకాలనుంది'' మట్టి మహిమ, ఆకలి విలువ తెలిసిన కవి మాత్రమే అనగలిగే మాటలివి.
నేల విడిచి సాము చేయడం ఎంత ప్రమాదమో, కవి అన్నవాడు నేలను మరచి ఊహల్లో కవిత్వం అల్లడం కూడా ప్రమాదమే. రచనల్లో జీవితాలు ప్రతిఫలించాలి, జీవితమంటే బ్రతుకు మాత్రమే కాదు, మరణం కూడా జీవితంలో భాగమే. పుట్టుకను సంతోషంగా స్వీకరించగలిగిన మనిషి చావు వరకు వచ్చే సరికి విలవిలలాడిపోతాడు. ''ఈ దేహానికి ఎన్ని బంధాలో, ఎన్ని వరసలో పోయిన తర్వాత ఒట్టికట్టెను పట్టుకొని ఏడుస్తారు, పేరుపేరునా పిలుస్తారు, జ్ఞాపకాలను తలాకొంత నెమరేసుకుంటారు చితిమంటల చిటచిటల మధ్య/ నీ ఆనవాళ్ళు కొద్దికొద్దిగా అదృశ్యమౌతున్నప్పుడు/ నువ్వు వెళ్ళిపోయావన్న బాధ ఉన్నా/ తాముకూడా పోతామేమొనన్న భయాన్ని బయటకెవరూ విన్పించరంటూ'' కఠోర జీవనసత్యాన్ని ఆవిష్కరిస్తాడు. మృత్యువంటే మరేమిటో కాదని మీరు మీరే, నేనునేనెనంటూ ఇన్నాళ్ళు మీతోనే బంధాన్ని అల్లుకున్న నేను మరో మకాం చూసుకొని వెళ్ళిపోవడాన్నే మరణమంటారని, నిన్నైనా నన్నైనా సమంగా పలకరించే మరణం, ఒక నిరంతర ప్రవాహం అనగలిగెంత దమ్మున్నవాడు మా బాలకృష్ణ కవి అని అనడంలో సందేహమేమీ లేదు.
- గంజి శశిధర్, 9492734183