Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్పందించే గుణం గల సృజనశీలి కవితావస్తువుల్లో వైశాల్యం అపారంగా ఉంటుంది. అభివ్యక్తిలో వైవిధ్యం తొంగి చూస్తుంది. తననీ, సమాజాన్నీ, లోకాన్నీ పరికించే దృష్టికోణంలో విస్తృతి కనిపిస్తుంది. తద్వారా తనని కదిలించిన, కలవరపరచిన అంశాలని కవిత్వం చేయడానికి తపిస్తాడు. ఈ తపన తోకల రాజేశంలో ఉంది. అతని కవిత్వంలో విస్మయానికి లోను చేసే విస్తృతి దాగుంది. అనేకానేకాంశాల్ని స్పృశిస్తూ కొనసాగుతున్న అతని కవిత్వ నడకలో ఉద్వేగం, నింపాదితనం, తనలోకి తాను చూసుకునే తత్వమూ కలగలసివున్నాయి. ఇవన్నీ అతని కవిత్వం పట్ల చిత్రమైన ఆకర్షణకు లోను చేస్తాయి.
తెలంగాణకి చెందిన ఈ నవయువ కవి ప్రయాణం దాదాపు పదేళ్ళ కిందటనే మొదలయింది. ఇదివరలో శతకం రాశాడు. నానీలు రాశాడు. కవిత్వమూ, వ్యాసాలూ రాస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేపథ్యం స్థానికతపై అతనిలో ఆసక్తిని ఇనుమడింపజేసింది. చరిత్రక్రమాన్ని అర్థం చేసుకునే చూపునిచ్చింది. ఉద్యమాల క్రమం అతని అవగాహనకి పదును పెట్టింది. అందుకు ఈ కవిత్వమే ప్రమాణం. అతని ఆలోచనా స్రవంతిలో సాహిత్యం ఎంత అవిభాజ్య భాగమైనదో 'అడవిదీపాలు' కవితా సంపుటి చెబుతుంది. అక్షరాల పట్ల అతని ప్రగాఢమైన అనురక్తిని చూసి చిత్రపోతాం.
''ఆకలేసి అలమటించే వానికి
ఆహారమే ప్రాణమైనట్లు
అన్యాయాల వల్ల అరిగి, కరిగిన బతుకులకు
పోరాటమే జీవితమైనట్లు
శిశిర వృక్షానికి
రానున్న వసంతమే ధ్యేయమైనట్లు
నాకు సమస్తమూ అక్షరమే'' (అక్షరం) అన్న కవితాపాదాలు తోకల రాజేశంకు సాహిత్యంపైన, కవిత్వంపైన గల నిబద్ధతకు సాక్ష్యం.
గత ముప్పయేళ్ళ కాలంలో తెలంగాణ అనేక ఉద్యమాల్ని చూసింది. సాహిత్యరంగంలో అనేక వాదాలు వెల్లువెత్తి కవిత్వం బహుముఖీనంగా విస్తరించింది. రాజేశం కవిత్వంలోనూ వీటి ఛాయలున్నాయి. దళిత, బహుజన వాదాల ఛాయలు ఇతని కవిత్వంలో చూస్తాం. అక్కడికే పరిమితం కాకపోవడం ఈ కవిలోని సుగుణం. ఏదో ఒక పార్శ్వానికి చెందిన కవిగా కుదించడానికి వీల్లేని విస్తారమైన ఇతివృత్తం, భావజాలం రాజేశం సృజనలో అంతర్భాగం.
దళిత, బహుజన, ఆదివాసీ, స్రీవాద ఆలోచనల సారాన్ని గ్రహించాడు. ప్రశ్నల్ని సంధించే సమాజాన తన కవిత్వాన్ని ఒక ప్రశ్నగా సారించాడు. ప్రశ్నించడానికి వీల్లేని పరిస్థితుల్ని నిరసిస్తూ 'ప్రశ్నను చంపలేవు' అంటూ ప్రతీపశక్తుల్ని హెచ్చరించడం ఇతని కంఠస్వరం ప్రత్యేకత.
ప్రశ్న ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి
మోసుకుపోయే వంతెన
అన్న అవగాహన ఉన్న కవి రాజేశం. అందుకని ఇవాళ దేశంలోని కాషాయమూకల మతోన్మాద క్రీడని నిరసిస్తున్నాడు. ప్రశ్నించే చైతన్యం మరింతగా పాదుకోవాలని అభిలషిస్తున్నాడు. అందుకోసం కవిత్వాన్ని ఆయుధంగా చేసుకున్నవాడు.
కవిత్వం రాయటమంటే యుద్ధానికి సన్నద్ధం కావటం
యుద్ధం చేయటమంటే
బతుకును నిండు గుండెతో ప్రేమించటం (కవిత్వమూ యుద్ధమే)
అన్న అవగాహన గల కవి రాజేశం. అందుకే ఇతని కవిత్వం వర్తమాన సంఘర్షణల నేపథ్యంతో పదును దేలింది. జనం కోసం మాట్లాడే మనుషుల కంఠస్వరంగా వ్యక్తమైంది. జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలే, అంబేద్కర్, పెరియార్, కాళోజీ, జయశంకర్, సామల సదాశివ, గౌరీ లంకేశ్ వంటి వారి త్యాగాల్నీ, స్ఫూర్తినీ ఆవాహన చేసుకొని అభివ్యక్తం చేయడం రాజేశం కవిత్వ ప్రత్యేకత. రోహిత్కు మరణం లేదని ప్రకటిస్తాడు.
తెలంగాణ భౌగోళిక స్వరూపం, సాంస్కృతిక వైవిధ్యం, పోరాటాల వైశిష్ట్యం, మానవీయ భావనల తండ్లాట సమ్మిశ్రితమై రాజేశం కవిత్వంలో కనిపిస్తాయి. బతుకమ్మని 'పూలజాతర'గా అభివర్ణిస్తాడు. 'మేడారం జాతర'కు చిత్రిక పడతాడు. 'తెలంగాణ తెలుగు నా జీవనస్వరం' అని ప్రకటిస్తూ, ఇక్కడి భాషలోని కవితాత్మను సౌందర్యభరితంగా రూపు కట్టిస్తాడు.
ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలయిన గోండుల జీవనశైలిని 'అడవిదీపాలు' కవితలో ప్రతీకాత్మకంగా వ్యక్తం చేస్తాడు.
ఉపాధ్యాయునికి విద్యాలయమే
దేవాలయమయినట్లు
వీళ్లకు అడవే ప్రపంచం
ప్రపంచమే వొక అడవి
అనడమే కాదు, గోండుల జీవితంలోని నిజాయితీని, మాయలేని తనాన్ని, మనిషితనాన్ని సుందరంగా చెబుతాడు.
ఆదిలాబాద్ గోండుల గురించే గాక ప్రకృతి విలసితాలైన కుంటాల, పొచ్చెర జలపాతాలని తన అక్షరాలతో సత్కరిస్తాడు. వాటిని 'వెండి కణాల ప్రవాహం'గా అభివర్ణిస్తూ 'అద్భుత నీటి సంగీతం'గా దర్శింపజేస్తాడు. ఈవిధంగా రాజేశం ఊహాశాలిత విలక్షణమైంది. తను జీవిస్తున్న ప్రాంత నైసర్గిక స్వరూపాన్ని, ప్రకృతిలోని నిసర్గ సౌందర్యాన్ని సృజించడం రాజేశం కవిత్వంలో కనిపించే మరో ప్రత్యేక ఆకర్షణ.
మనిషిలోని సంవేదనలు, అంతరంగ కల్లోలాలు, మనుషుల పట్ల అవ్యాజమైన నమ్మకం, ప్రేమలు, మానవత్వం మీద మమకారం కూడా రాజేశం కవితల్లో కనిపిస్తాయి. పోస్ట్మాన్ని 'పగటి చంద్రుడు' అంటూ రూపు కట్టించిన తీరు తిలక్ని స్ఫురింపజేసినప్పటికీ ఇతని కవిత్వ నడక భిన్నమైంది. ఇక 'రెండు చందమామలు' అంటూ రాసిన కవిత తన కన్నవాళ్ళకు కవి అందిస్తున్న గొప్ప కవితాత్మక నీరాజనం.
తల్లి - తన రక్తాన్నే పాలు జేసి మురిపాలు రంగరించి
కడుపు నింపుతుంది
తండ్రి - తప్పటడుగులు గొప్పటడుగులుగా విచ్చుకునేందుకు
మొదటి పుస్తకమై దారి చూపుతాడు
..........................................
నీ తల మీద గొడుగులా పట్టిన ఆ చేతుల్లోకి చూడు
నీ మీది అనంతమైన ప్రేమ - రేఖలుగా సాగడం కనబడుతుంది
అలసి సొలసిన ఆ కనుపాపల్లోకి తొంగి చూడు
పాపగా ఆ కళ్ళల్లో నువ్వింకా భద్రంగానే కనిపిస్తావు
ఎన్నటికీ చీకటి నీడలు ప్రసరించని
చల్లని రెండు నిండు చందమామలు వాళ్ళు
ఇంతటి అద్భుత అభివ్యక్తి కలిగిన కవి రాజేశం కవితా ప్రయాణం విశిష్టమైంది. బహుళ అస్తిత్వాల్ని ప్రతిఫలించే ఇతని కవిత్వం వర్తమాన తెలంగాణ కవిత్వ ప్రపంచంలోని వైశాల్యానికి ఒక నమూనా. కల్లోల తెలంగాణ నుంచి ఒక కవి రూపొంది ముందుకు సాగడానికి గల పూర్వరంగం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ కవిత్వం చదవాలి. ఇతని సాహిత్య ప్రయాణాన్ని ఆకళింపు చేసుకోవాలి. సాహిత్యాన్ని సీరియస్గా అధ్యయనం చేసే అభిరుచి ఉన్న కవి రాజేశం. ఈ అధ్యయనశీలతనే అతని కవిత్వ వస్తు ప్రపంచంలోని వైశాల్యానికి మూలం.
రాజేశం కవిత్వశైలి ప్రత్యేకమైంది. ఇతని సాంద్రమైన వ్యక్తీకరణలు చక్కటి అనుభూతిని అందిస్తాయి. పదచిత్రాలు, భావచిత్రాలు సరళరీతిన ఉండి ఆకర్షిస్తాయి. వస్తువుకు తగిన శిల్పాన్ని అనుసరిస్తూ తనదైన అభివ్యక్తిని సంతరించుకుంటున్నాడు రాజేశం. స్థానికంగా తన నేల మీద నిలబడి చుట్టూ ఉన్న సమాజాన్నీ, లోకాన్నీ పరికించే ఈ కవి ప్రయాణంలో మరింత సారవంతంగా ముందుకు సాగాలన్నది ఆకాంక్ష.
- గుడిపాటి