Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శిరంశెట్టి కాంతారావు ప్రగతిశీల రచయిత. నవలలు, కథలు రాయడంలో దిట్ట. ఇప్పటికి నాలుగు నవలలు, నాలుగు కథా సంపుటాలు, ఒక హిందీ కథా సంపుటి రాసి సాహితీ క్షేత్రంలో స్థిరపడినవారు. వారు ఏది రాసినా కొంత సామాజిక ప్రయోజనం వుంటుంది. అందుకే సాహితీ పిపాసకులు వారి రచనల్ని ఆ దృష్టితోనే చదువుతారు. అట్లా సాహిత్య పోటీల నిర్వాహకులు వారికి బహుమతులు అందించారు కూడా.
కాంతారావు కథనాల్లో అతీత శక్తులు, ఊహలు, మూఢనమ్మకాలు, వాస్తవ విరుద్ధాలు లాంటివి కానరావు. ఇటీవల వారు ఉద్యోగ విరమణ చేశారు. ఆ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలు ఉన్నవి వున్నట్లుగా కథలుగా సంపుటీకరించారు. తాను పుట్టిన ఊరు నల్లగొండ జిల్లాలోని ఫణిగిరి. ఆ ఊరు క్రీస్తుకు పూర్వమే బౌద్ధారామంగా ప్రసిద్ధి చెందింది. అక్కడే శిరంశెట్టి వారి బాల్యం గడిచింది. అనంతర కాలంలో ఊరు మారిన విషయం వేరే ఉంది.
ఎవరికైనా బాల్యంలో స్మృతులు ఎన్నో వుంటాయి. అందులో కొన్ని మరిచిపోలేని సంఘటనలుంటాయి. వాటిని స్మరించుకోవటం, ఇతరులతో చెప్పి మురిసిపోవడం గొప్ప అనుభూతి. ఐతే వాటిని వాస్తవరీతిలో చెప్పగలిగితేనే ఆ కథలు సజీవం అవుతాయి. అప్పటి సంఘటనలు, పోకడలు, ఆ కాలపు నాటి భాష, ఆనాటి సంస్కృతీ సంప్రదాయాలు, వృత్తులు, ప్రవృత్తులు ఈ కాలం నాటికి ఫొటో తీసిపెట్టినట్లుగా అనిపిస్తుంది. ఆనాటి సాంఘికాచారాలను కూడా కళ్ళకు కట్టించి చూపడంలో కాంతారావు సఫలమయ్యాడు. ఇందులోని 21 కథల్లోనూ పాఠకుడ్ని 50 ఏళ్ళ క్రితం దాకా తీసుకెళ్ళి చూపించాడు రచయిత. అప్పటి వాడుక భాషలో చెప్పగా, కథకు జిగిని, బిగిని కలిగించినట్లయింది. రచయిత తన ఊరిలో పూర్తి జీవనం గడపకున్నా, ఫణిగిరి బాకీ కొంత తీర్చుకున్నట్లయింది. రచయిత ఆనాటి బాల్య స్నేహితులకు, గతంలోని మధురానుభూతుల్ని పంచినట్లయింది. జ్ఞాపకం ఉన్నంతమేరకు అసలు పేర్లనే కథనంలో చెప్పడం వల్ల మేకప్ లేకుండా, సహజంగా నటించి చూపినట్లయింది. సహజత్వం కనపడింది. కుటుంబంలోని, ఊరిలోని, పరిసరాల పరిస్థితుల్ని అద్దం పట్టినట్లు చూపించడంతో పాటు దీపావళి నోములు, బతుకమ్మ నాటి జ్ఞాపకాలు వంటివి సంస్కృతిని పట్టి చూపినట్లయ్యాయి.
మా ఫణిగిరి గుట్ట కథలు, రచన : శిరంశెట్టి కాంతారావు, పేజీలు : 143, వెల : 100/-, ప్రతులకు : రచయిత, ఇం.నెం.1-1-177, మమతల కోవెల, శ్రీనివాసపురంకాలనీ, పాత పాల్వంచ, భద్రాద్రి, కొత్తగూడెం - 507115.
- కె.హరనాథ్,
9703542598