Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏడు పదులు దాటిన వయసులో కలం పట్టి కవిత్వం వెలయించిన కవి చెన్నమనేని ప్రేమసాగరరావు. డెబ్బది ఐదు కవితలతో వెలువడిన వీరి కవితా సంపుటి 'మొలుక బియ్యం'. అపార జీవితానుభవం నుంచి జాలువారిన కవితలు ఇవి. వస్తువైవిధ్యం ఇందలి ప్రత్యేకత. ఎలాంటి సిద్ధాంత రాద్దాంతాలు, జ్ఞాన ప్రదర్శనలు, సూత్రీకరణాలు, శిల్పకుతూహలం, శైలీవాచాలత, భావ, అన్వయ క్లిష్టతలు లేకుండా నిరలంకారంగా, నిర్మమకారంగా కవితల్ని నిర్మించాడు. పట్నాలకు ప్రతీకలన్నట్లుగా కన్పిస్తున్న పల్లెల్ని చూస్తున్న సమయంలో
''ఇరుగూ పొరుగు ఊరుఊరంతా
ఆత్మీయతా జాడలే
కల్మషమెరుగని ఊరు మా పల్లెటూరు''
అని అనడం ఆయన మచ్చలేని ప్రేమకు తార్కాణంగా కనిపిస్తుంది. అలాంటి ఊరులో పుట్టి పెరిగిన, జీవించిన నేపథ్యం వుంది కనుకనే మనుషుల మధ్య ఐక్యతను కోరుకుంటున్నాడు. వర్తమానపు ఐక్యసంఘటనలు అందించే ఏకత కాదు ఆయన కోరుకునేది.
''మూగ జీవులు అరుపులతో
పలకరించుకుని, ఆత్మీయతను
పంచుకుంటవి, కలిసిపోతవి
మాటలు వచ్చిన మనుషులం
ఎందుకు మనకు మౌనం''
అని అనడంలో ప్రాథమికమైన పలకరింపు కోసం తపనపడడం కనిపిస్తుంది. ఇలాంటి ఆర్తిని అతను పశుపక్ష్యాదులపై కూడా చూపెడతాడు. ఆ క్రమంలో మనిషిలోని ద్వంద్వమనస్తత్వాన్ని ఆకురాయిపై పెట్టి పరీక్షిస్తడు 'కోడి' అనే కవితలో... జీవాలనే కాదు, నిర్జీవాలనూ వదలని మానవనైజాన్ని 'గుట్టదిగులు' అనే కవితలో విశదపరుస్తడు. ఆధునిక అభివృద్ధి పేరున జరిగే విధ్వంసాన్ని స్పష్టపరుస్తడు.
''తరతరాల ఊరుమ్మడి గుట్ట
గ్రానైటు క్వారీగా మారి
గత్తరచ్చి సచ్చిపాయె''
గుట్ట చుట్టూ పరచుకు గ్రామీణ వాతావరణ జీవిత చిత్రాన్ని కళ్ళకు కట్టిస్తరు. ఇందులో కలికి గల పర్యావరణ స్పృహ కనపడుతుంది. పనిని ప్రేమించే వ్యక్తి కనుక చెమటను నమ్ముకున్న శ్రమజీవి పరిస్థితి పట్ల వ్యాకులత చెందుతడు.
ఈ సంపుటిలో 'అమ్మ'ను గురించి రాసిన రెండు మూడు కవితలున్నవి. నాన్ననుద్దేశించి రాసిన 'ఇరుసు' కవిత ఒకటుంది. అది అంతర్జాతీయ పురుషుల దినోత్సవానికి ప్రాతినిధ్యం వహించేదిగా ఉంది. వెనుకట తీర్థయాత్రలకు తోడుగా తీసుకెళ్ళే 'మరచెంబు' కవిత ఆయన జ్ఞాపకశక్తికి, ఊహాశక్తికి దర్పణంగా వుంది. 'దాహమేస్తే అది గంగాజలమే' అనడం ఒకానొక సాంస్కృతిక వాస్తవం. 'అతిథి, ఆరుద్ర పురుగు, పాఠకుడు' లాంటి కవితలు వైవిధ్యభరితమైనవి. చక్కటి విరోధాభాసతో సాగిన కవిత 'రీతి'. ప్రేయసి నిరాకరణ వల్ల ప్రియుడి హృదయ వైశాల్యం పెరగడం, క్షమాగుణం సంతరించుకోవడం ఆరోగ్యకరమైన పరిణామం. ఇది కవితలో దాగి వుంది. వర్తమాన వాస్తవం అందుకు భిన్నంగా వుండడం విషాదవాస్తవం. నాటి తరానికి, నేటి తరానికి ఆలోచనల్లో గల తేడా ఈ కవిత ద్వారా తేటతెల్లమవుతుంది.
ఒక పదాన్ని పదేపదే వాడి అర్థస్పురణ చేయిస్తాడు 'డబ్బు' అనే కవితలో. ఇవి ఇతని శైలీ విన్యాసానికి మచ్చుతునకలు. తన మనవడు, మనవరాలిపై అంతులేని ప్రేమానురాగాలను కురిపిస్తూ రాసిన కవితలు సుమారు పదివరకున్నాయి. 'ఆపతి, సంపతి, తండ్లాట, కలదిరగడం, కలిమిడి, బూరుపీకడం, కంచుడు, ఎనుకట, పావురంగ, గత్తర, పరుపుబండ, పిస్కిల్లు, మక్కప్యాలాలు, కీస, పిరము, మంకు మొదలగు తెలంగాణ పదాలు పూసలలో దారం లాగా కవితలకు పుష్టిని చేకూర్చాయి.
- డా||బి.వి.ఎన్. స్వామి