Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీతిగల్ల బతుకులు బతుకుతూ, రెక్కల్ని నమ్ముకున్న మట్టి మనుషులు రుద్రాక్షపూలు అని సరిగ్గా పలకడానికి రాక పలికేపదం 'ఉద్దరాశిపూలు'. ఆ శ్రమజీవులు ఎలా పలికినా సరే ఆ మాటల్లోనే ఎంతో శ్రమ సౌందర్యముంది, స్వచ్ఛమైన బతుకున్నది, ప్రాంతీయ అస్తిత్వ మూలాలున్నాయి.
ఉద్దరాశిపూలచెట్టు పేరుతో అంతే స్వచ్ఛంగా, అంతే సౌందర్యంతో, అంతే జీవ కవిత్వంతో మనముందు నిలబడ్డ కవి నాగిళ్ళ రమేష్. అడవిపూలను ఏరి మాలకట్టి కవిత్వపు పరిమళాలను వెదజల్లుతున్న నిరాడంబర కవి. ఉద్దరాశిపూలచెట్టు పక్కన మాగిన సీతాఫలాల్లాంటి కమ్మని కవితల్ని రుచి చూపిస్తున్నాడు. ఉద్దరాశిపూలచెట్టు కవితతోనే వారి కవిత్వాన్ని ఆస్వాదిద్దాం.
''ఉద్దరాశిపూలు/ పూసిన కాలం/ దొరకు కైకిలిపోయి
మోకాలుమంటి బురదల...'' అంటూ చినుకులు చినుకులు పడుతున్నట్లు కవిత ప్రారంభమౌతుంది. ఉద్దరాశిపూలు పూసిన కాలమంటే వానాకాలం. దొర దగ్గరకు కైకిలి (కూలి)కి పోయి పొద్దుందాక మోపులు మోసి, వరికోత దగ్గర ఇచ్చిన కుడుక (కొబ్బరి ముక్క) ముక్కని పిల్లలకోసం జాగ్రత్తగా దాచి, సద్ది గిన్నెలో కట్టుకొని వచ్చె అమ్మను దృశ్యమయం చేస్తాడు. కథనాత్మకశైలిలో సాగడం ఈ కవితకు మరింత బలం. సహజంగా అమ్మ మాట్లాడే మాటలే కవిత్వమయ్యాయి. ఆర్ద్రత, ఆత్మీయత కలబోసుకున్న ఆ మాటల్ని విందాం.
''పొడుగు ముక్కు/ ఉంగరాల ఎంటికలు/ అచ్చం మా అన్నేనని
సచ్చిపోయిన అన్నను/ నాలో జూసుకొని/ బహుమురిసిపోదువు''
ఇక్కడ తన కొడుకు ముఖంలో అన్నను చూసుకోవడమనే నాస్టాల్జియా కనిపిస్తున్నా, పుట్టినింటిపై ఒక స్త్రీకి గల మమకారం అర్థమౌతుంది. మేనమామ పోలికలతో తనకొడుకు ఉన్నాడనే శాస్త్రీయత తెలుస్తుంది. నీ రెక్కల కష్టంముందు నా నౌకరి దేనికి కొరగాదని అమ్మ పడ్డ కష్టాలను తల్చుకుంటూ చివరకు భావోద్వేగం పతాకస్థాయికి చేరుతుంది. చినుకుల్లా మొదలైన పదాల ప్రవాహం కాస్త నదిలా మారుతుంది.
''ఏదీ/ నీరాటు దేలిన సేతుల్లో/ దాసుకున్న ఉలులను/
ఒక్కసారి తాకాలని వున్నదే/ ముండ్లిరిగి పూసిన/
నీ పాదాలను ముద్దాడాలని/ నా మనసెంతో/ తండ్లాడుతున్నదే.''
రాటుదేలిన చేతులు, ముండ్లిరిగి పూసిన పాదాలు అనే పదబంధాలు అమ్మ శ్రమను ఆవిష్కరిస్తాయి. కవిత్వనిర్మాణ పరంగ చూసినా అందంగ ఒదిగిపోయాయి. వీరి కవిత్వంలో ఒక ప్రత్యేకశైలి కనబడుతుంది. ఒక్కొక్క పదాన్ని ఒక వాక్యంలా కూర్చిన పద్ధతి కనిపిస్తుంది. దీనివలన ఊనికను సాధించాడు.
కవి ఎంచుకున్న వస్తువులతో పాటు కవితా శీర్షికలు కూడా ఎంతో వైవిధ్యంగా, ఔచిత్యంగా ఉంటాయి. అందుకు 'మంచిపూల దుప్పటి' కవిత మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాశ్మీరులో ఉన్న మిత్రుడిని తల్చుకునే కవిత ఇది. స్నేహం కలకాలం పచ్చగా ఉంటుందని చెప్పడానికి ఎంచుకున్న ప్రతీకలు ఎంతో తాజాగా ఉంటాయి.
''ఎండిన చెట్టుపై/ చిలుకలు వాలి ఆకులైనట్లు
నేను కుంగిపోయిన ప్రతీక్షణం/
నువ్వు మెండుగా ధైర్యాన్నిస్తావు''
అంటూ మిత్రుడిని తల్చుకుంటూ కవిత సాగుతున్నా చివరలో ప్రతీ సైనికులకు వర్తించేలా సార్వజనీనత సాధిస్తాడు. తన బాల్యం గురించి చెప్పేటప్పుడు కూడా మట్టితో తనకున్న అనుబంధం మెటాఫర్గా మారుతుంది.
''ఆరుద్రపురుగులోలే/ భూమి పొత్తిళ్ళలో ఆడుకుంటున్నప్పుడు
ఎంత సుతారంగా హత్తుకున్నది పుడమితల్లి''
సుతిమెత్తని 'ఆరుద్రపురుగు'తో పసిపిల్లలను పోల్చడం కవి పరిశీలనాశక్తికి, కవితాదృష్టికి నిదర్శనం.
నాగిళ్ళ కవిత్వంలో ప్రధానంగా పల్లెటూరి జీవనచిత్రణ, అడవితో తనకున్న అనుబంధం, తాత్వికత, చారిత్రక నేపథ్యం గల నాలుగు పార్శ్వాలు కనిపిస్తాయి.
'దసన్నపూల తొవ్వ' కవిత తెలంగాణ ఆత్మను పట్టిచూపిస్తుంది. దసన్న పువ్వలంటే ఒకే రెక్కఉన్న మందారపూలు. అడవులలో ఉండే ఉద్యమకారులకు సంకేతం.
తెలంగాణ ఉద్యమంలో భాగంగా రాసిన 'కడుపుకోతల పత్తా' కవితలో బాధ దు:ఖంగా, దు:ఖంలోంచి ఆవేశం ఆ ఆవేశంలోంచి ఎన్నో ఆలోచింపజేసే ప్రశ్నలను సంధిస్తడు.
ప్రపంచ చరిత్రలోనే చెప్పుకోదగ్గ ఉద్యమాల పురిటిగడ్డలైన నూకలమర్రి, నాగం పేటలను యాజ్జేసుకుంటాడు. నాగిళ్ళ కవిత్వం గురించి మాట్లాడుకునేటప్పుడు తప్పకుండ వారు ఉపయోగించిన పదాల గురించి మాట్లాడుకోవలసిందే. మరుగున పడిపోతున్న ఎన్నో పలుకుబడులు, పదాలు తన కవిత్వంలో మళ్ళీ పురుడుపోసుకుంటాయి. 'చెప్పుండ్రల్లా, సుట్టిర్కమున్నది, సుట్టబట్ట' లాంటి పదాలు విన్నప్పుడు ఈ విషయం మరింత స్పష్టమౌతుంది.
'వడిసెలరాళ్ళు' అనే నానీల సంపుటితో సాహిత్యంలోకి ప్రవేశించిన ఈ కవి వచన కవిత్వంలో తనదైన ముద్రతో బలమైన కవిత్వం వినిపిస్తున్నాడు. చంద్రుడిని 'ఆకాశగంగలో పూసిన పద్మం' అని కాళిదాసు వర్ణిస్తే, 'ఎడారిలో కాలు తెగిన ఒంటే' గా శ్రీశ్రీ పోల్చాడు. మరి నాగిళ్ళరమేష్ ఏమన్నాడో తెలుసా? 'మొగులుమీద పటువ'గా కవిత్వీకరించాడు. ఇక్కడ కవితావస్తువు చంద్రుడే అయినా కవి ఉపయోగించిన ప్రతీకలు తన జీవిత నేపథ్యాన్ని సూచిస్తాయి. కవిత్వమంటే మరేమి కాదు, మన జీవితానికి పర్యాయపదం అను సత్యం మరోసారి ఋజువుచేస్తాడు.
ఇలా చంద్రుడిని ఆనగపుకాయను కోసినప్పుడు వచ్చె గుండ్రటి వక్కతో, జొన్నసేనుతో ఏసిన సొప్పగూడుతో, బువ్వను గిన్నె అంతట నెరిపిన నిండుదనంతో, అంచులూసిపోయిన పటువ (చిన్న కుండ) తో పోల్చుతాడు. చందమామను గుండ్రటి వస్తువులతో పోల్చడం, వెన్నెలలాంటి తెల్లదనమున్న వస్తువులతో పోల్చడం ఈ కవితకు నిండుదనం.
అడవి దు:ఖాన్ని తన కవితలోకి ఒంపినవాడు, గోగుపూల వాకిలిలో లంబాడి తల్లుల కష్టాల్ని చిన్నచిన్న అద్దాలుగా అక్షరాలను కుట్టిన నాగిళ్ళరమేష్ వర్థమాన కవిత్వంలో ప్రత్యేక పాయగా ప్రవహిస్తుండు. గుండెలో వాగువారిన చప్పుళ్ళు అతని కవితలు. అతని కవిత్వానికి అభిమానిగా వారి నుంచి మరెన్నో బంతిపూవ్వుల్లాంటి, అన్నం మెతుకుల్లాంటి కవితలకోసం ఎదురుచూస్తున్న.
ఉద్దరాశిపూల చెట్టు, కవి :నాగిళ్ళ రమేష్, వెల :40, ప్రతులకు : నాగిళ్ళ రమేష్ (7330957559), మల్లారం, భీమదేవరపల్లి, వరంగల్ రూరల్
- తగుళ్ళ గోపాల్, 9505056316