Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిత్తలూరిగారి కవిత్వం నేను మొట్టమొదట వాట్సాప్లో చదవడం మొదలుపెట్టాక ఆ శైలి, తాజాదనం నన్ను బాగా ఆకట్టుకున్నాయి. తన చుట్టూ పరచుకున్న ప్రపంచంలోని దృశ్యాలన్నిటినీ వాక్యాలలో కళ్ళకు కట్టినట్టు చూపించడం ఆయనకు కొట్టిన పిండి. అవలీలగా మనలను ఆ ప్రదేశాలలోని సన్నివేశాలకు తీసుకుపోగల సత్తా ఆయనకు ఉంది. ఈ కవిగారు 'అక్కడకు వెడితే చాలు' వాళ్ళంతా పావురాలై వాలిపోతారు అంటూ తన విద్యార్ధుల కోసం పదాలను పేర్చినా, అందమైన గులాబీల పైన వర్షం కురుస్తోందంటూ సౌకుమార్యంగా చెబుతూ ఆసిడ్ దాడులను గట్టిగా ఖండించినా ఈయనకే చెల్లింది. పనులు చేసి అరిగిన తన 'అమ్మ చేతులపై' సున్నితంగా కవిత్వపు పావురమై వాలిన ఈయన వాటిని వర్ణించిన తీరు ప్రశంసనీయం.
సుమారుగా ప్రతీరోజూ ఒక సరికొత్త కవితై జన్మించే చిత్తలూరిగారు నిత్యం కవిత్వాన్ని శ్వాసిస్తారని ఆయనను అనుసరించే వారికెవరికైనా అర్ధమవుతుంది. 'బచాపోష్'లంటూ ఆఫ్గన్ ఆడపిల్లలను ఈడేరే వరకూ మగవారిలా పెంచి, ఆనక వారిని ఇంట్లో ఎవరి కళ్ళబడకుండా బంధించినపుడు వారిలోని మానసిక సంఘర్షణను కవిత ద్వారా చెప్పడం చాలా బావుంది. తెలంగాణలో జన్మించిన ఈయన తన పుట్టుక మూలాలను, అక్కడున్న శ్రమజీవన సౌందర్యాన్ని ప్రతీ అక్షరంలో పొదిగి ఆవిష్కరించారు. చెమట చుక్కలను, వాటి వెనుక దాగిన కన్నీటి సముద్రాలనూ తన ప్రతీమాటలో చెబుతూనే ఉన్నారు. నిజమే 'ఒక మొక్కను పెంచుకున్నా బాగుండేది' ఇంత కష్టపడి చదువు 'కొన్నపుడు' చివరికి అసహాయ దశలో అక్కరకు రాని కన్నబిడ్డలెందుకు అంటూ ఈయన చెప్పినది అక్షరసత్యం. మృదువైన వాక్యాలతోనే తన గొంతెత్తి బిగ్గరగా నిలదీసే ఈయన, మనలను ఎక్కడికెళ్ళినా వెంటాడుతూనే ఉంటారు. 'ఫ్లెక్సీ నవ్వుల వెనుక' గల బతుకు తెరువును కోల్పోయిన దు:ఖం ''వారి బతుకుబొమ్మను గీయడానికి పనికిరాక రంగులు ఒలికిపోతున్నాయి, ఒకసారి వెళ్ళి అతడిని చూసి రావాలని'' అన్నారు ఈ కవి. అతికొద్దిమంది కవులలో ఉన్న తడి చిత్తలూరిగారి కవిత్వంలో అణువణువులో గోచరిస్తుంది. అవలీలగా ప్రతీ సందర్భాన్నీ చిక్కని కవిత్వంగా మలచి మన చేత తృప్తిగా తాగించడం ఈయనకు చాలా ఇష్టం.
తరగతి గది 'అలా ఉండకూడదు' అంటూ ''పక్షుల కలకలంతో జాతికి జవజీవాలిచ్చే ఆరోగ్యమైన పచ్చని చెట్టులాంటి గది కావాలి'' అంటూ తరగతిగది ఎలా ఉండాలో కూడా ఆయన సెలవిచ్చారు. ''సుద్దముక్కలా అరిగిపోయే అతడు బోధించడాన్నే ప్రేమిస్తాడు'' అంటూ అతడి గురించి లోతుగా చెప్పిన చిత్తలూరి గారు తనే పాఠాలు బోధించే మాష్టారు కావడం విశేషం. అందుకే అంత బాగా చెప్పగలిగారేమో అని పాఠకులకు అనిపించక మానదు. తనను కన్న శ్రమజీవనమ్మ కోసం ''అమ్మ ప్రేమ ముందు ఆకాశం చిన్నది'' అంటూ, నాన్న వెడుతూ వెడుతూ తనను అమ్మకే అప్పగించి వెళ్ళారని తండ్రిలేని బాధను మనకు ఒక కవితలో పంచారు. దేవుడు కూడా మరణిస్తాడని, చదువు దీపమై వెలిగితే మూఢనమ్మకాలు తొలగి వెలుగు వైపు అడుగులేస్తామని అందంగా వివరించారు. మట్టిపూల మరణంలో ''మా తాత కూడా అదే చేసాడు, తన కోసం ఒక తాడును తయారు చేసి మెడకు అలంకారం చేసుకున్నాడు'' అంటూ దేశానికి అన్నం పెట్టే రైతులు అప్పుల బాధ తాళలేక ఎలా ఉరికొయ్య వైపు అడుగులు వేస్తున్నారో వివరించారు. నాకోసారి జ్వరమొస్తే బాగుండునంటూ తనను వదిలేసి స్వర్గనికేగిన అమ్మానాన్నల అనంతమైన ప్రేమను కవితలో స్మరిస్తుంటే చదువరుల కనులలో తడూరక మానదు.
టెక్నాలజీ ఎలా మనలోకి చొచ్చుకుని వచ్చి మనసుల నడుమ పూలవంతెన వంటి ఉత్తరాన్ని కనుమరుగు చేసిందో చెబుతూ ఆవేదనను వెళ్ళగక్కారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నిటి గురించో ప్రస్తావిస్తూనే ఉండాలి. ప్రతీ కవిత మన జీవితాల చుట్టూ అల్లుకున్న దు:ఖపోతలను, సమస్యలూ చర్చిస్తూ మనలోకి మనం తొంగి చూసుకునే అవకాశం కల్పిస్తూ.. మొదటి నుండి చివర వరకూ ఆసాంతం నిలబెట్టి చదివిస్తుందనడంలో సందేహమే లేదు. మట్టిని, మట్టిమనుషులనే కాక ఈ సమాజాన్ని, తన చుట్టూ ఉన్న వారిని అమితంగా ప్రేమిస్తూనే తప్పు చేస్తే ఘాటుగా నిలదీసే ఈ కవి ''అమ్మలా ఎదురొచ్చే ఆమె కోసం'' కవిత్వ పరిమళాన్ని వెదజల్లే నల్లచామంతిగా పూసారు. ఈ కవితా సంకలనాన్ని తాకినపుడల్లా ఆ సువాసన హృదయపు లోతుల్లోకి ప్రవహిస్తూ మంచి అనుభూతిని శాశ్వతంగా మనలో మిగులుస్తుందనడంలో సందేహమే లేదు.
- పద్మావతి రాంభక్త, 9966307777