Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమస్యలకు మూలాలు మన సమాజ గమనంలో, మనం అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాల్లో, బతుకులో చెలరేగే సంక్షోభాల్లో ఉన్నాయి. అయితే కారణాలతో సరిపుచ్చలేం. తక్షణం కొంత సాంత్వన కావాలి. మానవీయ స్పర్శ అవసరం. మనిషిని మనిషి పట్టించుకోవాలన్న ఎరుక తప్పనిసరి. ఎవరూ ఎవరికీ కాని స్థితి నుంచి బయటపడే ఉపాయం ఆలోచించాలి. ఈవిధమైన ఆలోచనలకు ప్రోది చేసే శక్తి ఎల్.ఆర్.స్వామి కథలకు ఉంది.
అనువాదకునిగా పేరొందిన ఎల్.ఆర్.స్వామి గారిలో మంచి కథకుడు ఉన్నారు. తమిళం మాతృభాష, మలయాళం చదివిన భాష, పట్టుబట్టి నేర్చుకొన్నది తెలుగు భాష. ఇవిగాక ఆంగ్లం, హిందీ భాషలతో, సాహిత్యంతో సంపర్కం వున్న సృజనశీలి స్వామి గారు. కథకునిగా వారి సాహిత్య ప్రయాణం మొదలయింది. మరీ ముఖ్యంగా విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో తెలుగులో కథ రాసి తన ప్రావీణ్యాన్ని చూపారు. అనుకోకుండా తెలుగులో రచనలు మొదలు పెట్టిన వారు సొంత రచనలతోనూ, అనువాదాలతోనూ తమ సృజనాత్మక ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఇదివరలో అయిదు కథా సంపుటాలు వెలువరించిన వారు ఇప్పుడు మరో కథా సంపుటితో పాఠకుల ముందుకు వచ్చారు.
వైవిధ్యమైన వారి జీవితానుభవాలు, విలక్షణమైన అధ్యయనరీతులు రచయితగా వారి ప్రయాణంలో విశిష్టమైన కోణాల ఆవిష్కరణకు దోహదపడ్డాయి. ఈ సంపుటిలోని పదిహేను కథలు అరుదయిన ఇతివృత్తాలతో పాఠకుల్ని దిగ్భ్రమకు లోను చేస్తాయి. మానవ ప్రవర్తనలోని భిన్నపార్శ్వాల్ని చిత్రించాయి. పరిస్థితుల ప్రాబల్యంలో చిక్కుపడిన మనుషుల జీవితాల్లో వచ్చే మలుపుల్ని రూపు కట్టించాయి. అప్పటివరకు తాము నమ్మిన సూత్రాలకీ, నమ్మకాలకీ భిన్నంగా మరోతీరున బతకడం అనివార్యమైన పరిస్థితులు ఎలా ఏర్పడతాయో ఈ కథల ద్వారా తెలియజెప్పారు.
సాధారణంగా మనుషుల్లో సహేతుక దృష్టి, సంయమనశీలత అరుదు. మనుషులంతా ఒక తీవ్రత నుంచి మరో తీవ్రతకు వెళుతుంటారు. మనుషులు ఏదో ఆశించి తమ జీవితాన్ని, తమ కాలాన్ని వెచ్చిస్తారు. చివరకు అందుకు భిన్నమైన పరిణామాల పర్యవసానం చూసి చిత్రపోతారు. ఈ కోవకు చెందినవే 'పంతులు గారి మేడ', 'సూర్యచంద్రులు', 'మనసు చూడతరమా', 'పున్నామ నరకం' వంటి కథల ఇతివృత్తాలు. సనాతనునిగా జీవించి, తన పిల్లల్ని కూడా అలాగే పెంచిన నాగరాజు, కూతురు ఒక దళితుడితో వెళ్ళిపోవడంతో ఆత్మహత్య చేసుకుంటాడు. కానీ నాగరాజు భార్య మాత్రం కూతుర్ని అక్కున చేర్చుకుంటుంది. ఎవరి నమ్మకాలు వారివి, ఎవరి జీవనవిధానం వారిదనే భావనతో తన జీవిత ప్రయాణం సాగిస్తుంది. ఎవరూ ఇతరుల మీద తమ నమ్మకాలు రుద్దలేరనే సంగతి ఈ కథ చదివితే బోధపడుతుంది.
ఒక సగటు మధ్యతరగతి ఉద్యోగి శర్మ. తన భార్యాబిడ్డలు నిలువనీడ లేకుండా ఇబ్బంది పడకూడదని రూపాయి రూపాయి కూడబెట్టి ఇల్లు కడతాడు. అందుకోసం తనకు ఇష్టమైన కాఫీ, టీలు మానుకుంటాడు. విందు వినోదాలకి దూరంగా ఉంటాడు. ఇల్లు కట్టిన కొంతకాలానికి చనిపోతాడు. అతను చనిపోయిన రెండు నెలలకు పెన్షన్ పత్రాల మీద సంతకాలు పెట్టించడానికి వెళ్ళిన శర్మ స్నేహితునితో ఆ ఇల్లు అమ్మేయాలనుకుంటున్నట్టు చెబుతుంది భార్య. ఆశ్చర్యపోతాడు అతడు. కానీ నిజం ఇలానే ఉంటుంది. మనుషులు తాము ఎవరి కోసమో బతుకుతున్నామనుకుంటారు. కానీ వారే అతనంటే పట్టనట్టుగా ఉంటారు. ఈ నిజాన్ని 'సూర్యచంద్రులు' కథలో అందంగా వ్యక్తం చేశారు స్వామి గారు.
కేరళలో ఆడపిల్లల్ని పెంచలేక చిన్నతనంలోనే పెళ్ళి పేరుతో అమ్మేసుకున్న పేద బ్రాహ్మల దైన్యాన్ని వ్యక్తం చేసిన కథ 'మనసు చూడతరమా'. మలయాళీ, తెలుగు ప్రాంతాల వాతావరణాన్ని రూపు కట్టించారు. ఒకనాటి పాలక్కాడ్ బ్రాహ్మల దైన్యాన్ని రికార్డు చేశారు. ఇలాంటి కథల ద్వారానే సాంస్కృతిక, సామాజిక చరిత్ర రికార్డు అవుతుంది. ఆర్థికపరమైన వేదన మనుషుల్ని భాషకీ, ప్రాంతానికీ, సంస్కృతికీ దూరంగా కొత్త ప్రదేశాలకు విసిరికొడుతుందని ఈ కథ చదివితే అవగతమవుతుంది.
ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలు ఛిద్రమవుతున్నాయి. తాము, తమ ప్రయోజనాలే ముఖ్యమని భావించే ధోరణి పెచ్చరిల్లింది. అందుకే కన్నతల్లిని కూడా అనాథ అని చెప్పి అనాథాశ్రమంలో చేర్చిన ఒక కొడుకు కథ 'సిరి'లో చూస్తాం. తల్లి జబ్బుతో ఇబ్బంది పడితే పట్టించుకోని కొడుకు, తాము పెంచుకునే కుక్కకు జబ్బు చేస్తే అల్లాడిపోతాడు. అది తప్పిపోతే విపరీతంగా ఆరాటపడతాడు. చివరకు అది తన తల్లిని చేర్చిన అనాథాశ్రమంలో క్షేమంగా ఉందని ఊరడిల్లుతాడు. మనిషి కన్నా కుక్క బతుకే మేలని తలపోసే స్థితికి లోను చేసే కథ ఇది.
మనుషుల పట్ల వ్యక్తులు, సంస్థలు, కంపెనీలు ఎంత నిర్లక్ష్యంగా ఉంటాయో మరో కథలో చెప్పారు. కార్మికులకు భద్రతా సదుపాయాలు కల్పించాలని ప్రశ్నించిన శర్మ అనే నిపుణుడయిన ఉద్యోగిని చాకచక్యంగా తొలగించిన ఒక కంపెనీ కుటిలనీతిని 'కొత్త జబ్బులకు కొత్తమందులు' కథలో చిత్రీకరించారు. రచయితకు తన ఉద్యోగ జీవితపుటనుభవాలు, కంపెనీల వ్యవహారసరళిపై ఉన్న అవగాహన ఇలాంటి కథలు రాయడానికి ఉపకరించాయి.
ఇది పోటీ ప్రపంచం. పరుగులు పెట్టడమే జీవితమై పోయింది. తాము పరుగులు తీయడమే కాదు, పిల్లల్ని పరుగులు పెట్టిస్తున్నారు. పసిప్రాయం దాటని పిల్లల్ని రేయింబవళ్ళు చదువుల పేరుతో రుబ్బుతున్నారు. ఉజ్వల భవిష్యత్తు పేరిట ఆడిపాడాల్సిన బాల్యాన్ని నియంత్రిస్తున్నారు. క్రమశిక్షణ పేరిట పిల్లల్ని ర్యాంకుల కోసం, మార్కుల కోసం హాస్టళ్ళలో వదిలేసి హింస పెడుతున్నారు. ఇది వారి లేత మనసుల్ని ఎంతటి ఒత్తిడికి లోను చేస్తుందో 'పునర్జన్మ' కథలో చిత్రించారు.
బతుకంతా ఇలా పోటీ పడుతూ పరుగులు పెట్టాల్సి రావడంలోని కనిపించని హింస 'గుర్రాలు' కథలో ప్రతీకాత్మకంగా చెప్పారు. పరుగెత్తే శక్తి వున్నంతవరకే గుర్రాన్ని బాగా చూసుకుంటారు. ముసలిదయి కూలబడే పరిస్థితి వస్తే కాల్చేస్తారు. ఇంట్లో వయసుమళ్ళిన వాళ్ళ పట్ల కూడా ఇదే వ్యవహారధోరణి చూస్తున్నాం. భౌతికంగా చంపేయకపోయినా, వృద్ధుల పట్ల చూపే నిర్లక్ష్యం అంతకన్నా ఘోరంగా వుంది. వయసయి పోయాక వాళ్ళు ఉన్నా పోయినా ఒకటే అన్న ధోరణి పాతుకుపోవడమే ఇవాళ్టి విషాదం.
దేని కోసమో, ఎందుకోసమో తెలియని పరుగులాటలో కాలాన్ని దొర్లించే మనుషులు పలకరించే మనిషి లేక, మనసులోని మాట చెప్పుకోడానికి ఎవరూ లేక ఎంతగా తల్లడిల్లుతారో, హిస్టిరిక్గా మారుతారో 'మాట' కథలో దృశ్యమానం చేశారు. పలకరించే దిక్కు లేకపోవడం, మంచీచెడూ పంచుకునే వారు కొరవడటం ఉద్యోగ జీవితంలోనూ సమస్యలకు దారితీస్తుంది. ఆత్మీయత, ఆప్యాయతలతో కూడిన పలకరింపుల ద్వారానే మనుషుల్లో జీవనోత్సాహం పెంచడం సాధ్యమని తెలియజెప్పడం ఈ కథ సారాంశం.
ఇలాంటి సమస్యలకు మూలాలు మన సమాజ గమనంలో, మనం అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాల్లో, బతుకులో చెలరేగే సంక్షోభాల్లో ఉన్నాయి. అయితే కారణాలతో సరిపుచ్చలేం. తక్షణం కొంత సాంత్వన కావాలి. మానవీయ స్పర్శ అవసరం. మనిషిని మనిషి పట్టించుకోవాలన్న ఎరుక తప్పనిసరి. ఎవరూ ఎవరికీ కాని స్థితి నుంచి బయటపడే ఉపాయం ఆలోచించాలి. ఈవిధమైన ఆలోచనలకు ప్రోది చేసే శక్తి ఎల్.ఆర్.స్వామి కథలకు ఉంది. ఆధునిక జీవితం అనేకానేక సంక్లిష్టతలమయం. బతుకులో వైరుధ్యాలు అనేకం. కొన్నిసార్లు దేనికీ లోటు లేదనిపించినా బతుకు మీద నిరాసక్తత ఏర్పడుతుంది. ఎందుకు బతకాలో తెలియక సతమతమవుతారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ తనకు తానుగా జీవితానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని కల్పించుకోడం మనుషుల బాధ్యత అని 'వాన వెలిసింది' కథ చదివితే తెలుస్తుంది.
ఈవిధంగా ప్రతి కథ మన ఆలోచనల్లో, మానసిక ప్రపంచంలో ఒక కదలికని తీసుకువచ్చే రీతిన చిత్రితమైంది. ఏదో సందేశం ఇవ్వాలన్న ధోరణి లేదు. అసంకల్పితంగానే ఆలోచింపజేసే కథాకథనం సహజంగా చేకూరింది. కొన్ని కథల్లోని మలుపులు దిగ్భ్రమకు లోను చేస్తే, మరికొన్ని కథలు ఆర్ద్రతతో అభివ్యక్తమయ్యాయి. పాత్రల క్రమ పరిణామ వికాసాన్ని సంయమనంతో చిత్రించిన విధానం ఆకర్షణీయంగా వుండి మనసున నిలిచిపోతాయి. ఒకే ఒక్క సంఘటన కథకు ఆధారం. కానీ ఆ సంఘటన ఎన్ని మలుపులకీ, మరెన్ని పార్శ్వాలకీ దారితీస్తుందో తన కథాకౌశలంతో చిత్రించడం రచయితగా ఎల్.ఆర్.స్వామి గారి సాఫల్యానికి నిదర్శనం.
- గుడిపాటి