Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జన రంజక కవి ప్రతిభా పురస్కారాలు
రావి రంగారావు సాహిత్య పీఠం ప్రకటించిన 'జనరంజక కవి ప్రతిభా పురస్కారాలు' పోటీ ఫలితాలను ప్రకటించారు. 1. సిరికి స్వామినాయుడు (మట్టి రంగు బొమ్మలు - వచన కవితలు), 2. చిత్తలూరి సత్యనారాయణ (నల్ల చామంతి - వచన కవితలు), 3. భైరి ఇందిర (సవ్వడి), 4. బెలగాం భీమేశ్వరరావు (మా ఇంటి దేవతలు) ఎంపికయ్యారు. ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం గుంటూరులో జరిగే సభలో ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు.
- నర్రా ప్రభావతి, కన్వీనర్ - రావి రంగారావు సాహిత్య పీఠం
క్రీడా కథలకు ఆహ్వానం
సాహితీ ప్రచురణలు తమ రెండవ కథల సంకలనంకోసం క్రీడలు కేంద్ర బిందువుగా వున్నా కథలను ఆహ్వానిస్తున్నారు. గతంలో ప్రచురితమయినవైనా, అముద్రితాలయినా, కొత్తగా రాసినవైనా మార్చి 10వ తేదీలోపు ప్లాట్ నెం.32, హౌ.నెం.8-48, రఘురాం నగర్ కాలనీ, ఆదిత్య హాస్పిటల్ లైన్, దమ్మాయిగూడ, హైదరాబాద్ - 83 చిరునామాకు పంపాలి. వాట్సాప్ నెం : 9849617392, ఇ మెయిల్ : kmkp2025@gmail.com
- కోడీహళ్ళి మురళీమోహన్, కస్తూరి మురళీకృష్ణ
29న జగన్నాథశర్మకు జైని అవార్డు ప్రదానం
ప్రముఖ రచయిత, నవ్య వారపత్రిక సంపాదకులు ఏ.ఎన్. జగన్నాథశర్మ రచించిన 'మొదటిపేజీ' కథల సంపుటికి లక్ష్మీనారాయణ జైని జాతీయ లక్ష రూపాయల నగదు పురస్కారం ప్రకటించింది. ఈ పురస్కార ప్రదానోత్సవ సభ ఈ నెల 29వ తేదీ సాయంత్రం రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుందని జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ డా|| ప్రభాకర్ జైని ఒక ప్రకటనలో తెలిపారు.
3న వరవరరావు కవిత్వంతో ఒకరోజు
విప్లవకవి వరవరరావు కవిత్వంతో ఒకరోజు సభ ఫిబ్రవరి 3వ తేదీ ఆదివారం మహబూబ్నగర్లో జరుగుతుంది. మూడు సెషన్లుగా జరిగే ఈ సభని జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి ప్రారంభిస్తారు. వరవరరావు కవిత్వం లోని విభిన్న కోణాలపై దాదాపు పదిహేను మంది ప్రసంగించే ఈసభని పాలమూరు అధ్యయన వేదిక నిర్వహిస్తుంది.
ఎస్వీ పుస్తకావిష్కరణ సభ
ఆచార్య ఎస్వీ సత్యనారాయణ రచించిన 'జీవితం ఒక ఉద్యమం' కవితా సంపుటి ఆంగ్లానువాదం LIFE IS A MOVEMENT పుస్తకావిష్కరణ సభ 29వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3.00 గంటలకు జరుగుతుందని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ భాషాభివృద్ధి పీఠం ఒక ప్రకటనలో తెలియజేసింది. స్వాతి శ్రీపాద ఆంగ్లానువాదానికి చింతపట్ల సుదర్శన్ సంపాదకత్వం వహించారు. ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించే ఈ సభలో నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, అలేఖ్య పుంజాల, పత్తిపాక మోహన్ వంటి ప్రముఖులు పాల్గొంటారు.
కాలుష్యంపై కవిత్వ సమరం
ఫిబ్రవరి మూడో తేదీన హైదరాబాద్-మెదక్ వయా నర్సాపూర్ రోడ్డున ఉన్న 'బొంతపల్లి' జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో 'కాలుష్యంపై కవిత్వ సమరం' సభ జరుగుతుంది. పర్వావరణ కాలుష్యంపై కవి సమ్మేళనం, ఎల్లన్న పుస్తకం 'నాపల్లె తీరు' పరిచయ సభ, డాక్టర్ చెమన్కు సత్కారం ఉంటుందని, తెలంగాణ సాహిత్య సమాఖ్య కన్వీనర్ బుద్దిరాజు ప్రవీణ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.