Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాషువాను విభిన్న ప్రయోగ వాదిగా చెప్పక తప్పదు. ఆయన వస్తు స్వీకరణలో విప్లవాత్మకమైన ప్రయోగాలు చేసి ఎందరికో ఆదర్శప్రాయుడైనాడు. అనుదాత్త వస్తువులు కూడా కావ్యార్హాలే అని నిరూపించాడు. గబ్బిలం, సాలీడు, స్మశానాలపై విజయవంతమైన కావ్యాలు నిర్మించిన జాషువా పద్యాన్ని మాత్రం దాటలేదు.
డా||సి.నా.రె. ''ఒక సంప్రదాయము కొంత కాలము రంగమున సుప్రతిష్టమైన తర్వాత దాని యందు రక్త ప్రసారము మందగించును. అప్పుడు దానిలో సంచలనము కలిగించుట ఆవశ్యకమగును. అందుకు సంప్రదాయదాసులు ఆమోదించరు. అప్పుడు దానిని బొత్తిగా కాదని ప్రయోగము బయలు దేరును'' అంటారు.
మునుమార్గ కవిత లోకంబున వెలయగ దేశికవితను పుట్టించినట్లు నన్నెచోడుడు చెప్పాడు. అప్పటికి 'దేశి' ఒక ప్రయోగం. గేయం ఒకనాడు ప్రయోగం. వచన కవిత కూడా ఒకనాటి ప్రయోగం. ప్రస్తుతం తెలుగులో వచన కవిత మహోన్నతంగా విరాజిల్లుతున్నది. అయితే రూపపరమైన స్థిరత్వంలో కాని వస్తుపరమైన స్థిరత్వంలో కాని వచన కవిత్వం వయసు చాలా తక్కువ. కాబట్టి ఇది జటిలమైన జడత్వానికి ఇంకా రాలేదు. కాబట్టి ప్రయోగాల ఆవశ్యకత కూడా తక్కువేనని చెప్పవచ్చు. సరళమైన వచనాన్ని కుందుర్తి ప్రారంభించి అర్ధశతాబ్ది దాటిపోయింది కాబట్టి దానిమీద సంప్రదాయపు ఛాయలు కనపడుతున్నాయి. ఎప్పుడయితే సంప్రదాయపు ఛాయలు స్థిరపడతాయో అందులో ఇమడలేని వాళ్ళు కొత్త గాలికోసం ప్రయోగం మొదలు పెడతారు. దీన్నే డా||సి.నా.రె. ''ఒక సంప్రదాయము కొంతకాలము రంగమున సుప్రతిష్టమైన తర్వాత దాని యందు రక్త ప్రసారము మందగించును. అప్పుడు దానిలో సంచలనము కలిగించుట ఆవశ్యకమగును. అందుకు సంప్రదాయదాసులు ఆమోదించరు. అప్పుడు దానిని బొత్తిగా కాదని ప్రయోగము బయలు దేరును'' అంటారు.
అలా తెలుగులో పూర్ణమ ముత్యాల సర రూపంలో వచ్చింది. అక్కడ వస్తువులోనూ, రూపంలోనూ ప్రయోగాన్ని గమనించవచ్చు. తర్వాత ముత్యాల సర బంధనం కూడా ఒక అడ్డంకేనని భావించబడ్డది. మరింతగా స్వేచ్ఛగా ఉండేందుకు గేయాన్ని ఆశ్రయించారు కవులు. గేయంలో మాత్రానియమం ఐచ్ఛికమైపోయింది. నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు ఈ దిశగా జరిగిన ప్రయోగాలే. కర్పూర వసంతరాయలు కావ్యవస్తువులో సంప్రదాయకత ఉన్నప్పటికీ, నాగార్జునసాగరం వస్తురూపాలు రెండింటిలోనూ ప్రయోగమే. ఇక్కడ జాషువాను విభిన్న ప్రయోగ వాదిగా చెప్పక తప్పదు. ఆయన వస్తు స్వీకరణలో విప్లవాత్మకమైన ప్రయోగాలు చేసి ఎందరికో ఆదర్శప్రాయుడైనాడు. అనుదాత్త వస్తువులు కూడా కావ్యార్హాలే అని నిరూపించాడు. గబ్బిలం, సాలీడు, స్మశానాలపై విజయవంతమైన కావ్యాలు నిర్మించిన జాషువా పద్యాన్ని మాత్రం దాటలేదు. కాని పద్యాన్ని సామాన్యుల హృదయాల దగ్గరికి తెచ్చాడు. వచనాన్ని, గేయాన్ని గౌరవ ప్రదమైన ప్రక్రియలుగా కూడా చూడలేదు. ఆయన వచనాన్ని 'గాసట బీసట' కవిత్వంగా నిరసించాడు కూడా.
ఫ్రీవర్స్ ఫ్రంట్ ఏర్పాటు, 'తెలంగాణ' కావ్యరచన ద్వారా కుందుర్తి వచన కవిత్వానికి తిరుగులేని దారులు పరిచాడు. ఈ ప్రయోగం విజయవంతమై విస్తరించి, వేళ్ళూనుకొని శాఖోపశాఖలైంది. అలా నడుస్తున్న వచన కవిత్వంలో వస్తువులో వైవిధ్యమే తప్ప రూపంలో మార్పులేకుండా కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నది. కొనసాగుతున్న వచన కవిత్వాన్ని నిర్వచించడం చాలా కష్టం కాని గుర్తించడం చాలా సులభం. పాద నిడివి, పాద సంఖ్యా నియతి, యతి, ప్రాస, మాత్ర లాంటి నియమాలేవీ లేని లయాత్మక భావ వ్యక్తీకరణ ప్రక్రియ వచన కవిత్వం. లయాత్మక భావ వ్యక్తీకరణపై కూడా అనేక అభిప్రాయ భేదాలున్నాయి. 'నువ్వు లేవు నీ నవ్వు ఉంది' అనే ఖండికలో తిలక్
'పైపైనా చూస్తే నేను
పది మంది లాంటి వాణ్నే
నా లోతుల్లోపల మాత్రం
నక్కి వుంటాడో కవి' అంటాడు. మరొకచోట పారాగ్రాపు రాస్తాడు. అది కూడా కర్త, కర్మ, క్రియలున్న వాక్యం లాంటి కవిత్వం. 'స్వరరాగతాళ కరచాలనం' శీర్షికలో ఏ హాసధ్వనితో ప్రారంభమై నా సంగీతావగాహన పర్వపు పడవ ప్రయాణం అలభ్య సంతృప్త జీవన యానానికి ప్రత్యామ్నాయ ఫల చిహ్నమై సంక్రమించిన వరాళి' అంటాడు.
మొదలే అనుకున్నట్లు ఆధునిక వచన కవిత్వాన్ని అసలే నిర్వచించిలేం. కాని ఎలా ఉంటుందో చెప్పవచ్చు. ఎలా ఉండాలో కూడా ఆశించవచ్చు. లయాత్మకతా, అంతర్లయాత్మకతా జరిగి పోయాక కవిత ఒక వ్యక్తి మరొక వ్యక్తితో చేసే ఆత్మీయ సంభాషణలా ఉండాలనిపిస్తుంది.
'ఆకలేస్తే వీధుల్లో అడుక్కో, అదీకుదరకపోతే కొట్టి లాక్కో ఏం తప్పు కాదు, నేరం అంగీకరించడం జైలు కెళ్ళడం ఏదీ తప్పు కాదు
ఉత్తినే చనిపోతావేమిట్రా, యుద్ధం చేయకుండానే?
యుద్ధం చేయకపోవడం తప్ప మరేదీ తప్పుకాదు'
అని ఉత్త వాక్యాల్లా చెప్పి అపారమైన దైన్యాన్ని ఆవిష్కరిస్తాడు హెచ్చార్కే.
Painting is silent poetry and poetry is painting that speaks
అంటాడు పుటార్చ్.
కోడూరి విజయకుమార్ 'పూలు మరణిస్తున్న వేళ'లో ఒక యువకుడి మరణాన్ని ఇలా చిత్రిస్తాడు.
'తనదే అయిన నేల కోసం స్వప్నించిన
మరొక పూవు వికసించకనే నేల రాలింది
తన మరణంతో అయినా
దశాబ్దాల స్వప్నం సాకారమవుతుందని'
ఆధునికానంతర కవిత్వం తన రూపానికి అదనపు పొబగులను సమకూర్చుకున్న విషయం చేరా పసిగట్టాడు. పదచిత్రాలు, భావచిత్రాలు సంకేతాలుగా కవిత్వాన్ని ఉద్దీపింపచేసాయి. తెలుగు రాష్ట్రాలలో విభజన ఉద్యమాలకు ముందు కవిత్వమంతా ఇమేజరీతోనే నడిచిందని చెప్పవచ్చు.
'ముఖానికి నల్లని మబ్బులని
కప్పుకున్న ఓ చంద్రబింబం
ఓ మూల మునిపళ్ళను
ఆలోచనలను చేసి
కొరుకుతున్న పెదాలతో
రెండు కాళ్ళ పెట్రోలు గుర్రం
మోసుకొచ్చే కలల రాకుమారునికై
ఎదురు చూస్తూంటుంది.
(సాయంత్రం పార్కులు, డా|| కాంచనపల్లి)
తెలంగాణ విభజన ఉద్యమం తీవ్రమయ్యాక భాషపట్ల జాగరూకులైన తెలంగాణ కవులు అపారమైన స్థానిక పదాలను, పదబంధాలను కవిత్వంలోకి తీసుకొని వచ్చారు. ఎన, వర్జి, లంద లాంటి నామ వాచకాలనే కాకుండా తెలంగాణ క్రియారూపాలను కవిత్వంలోకి తెచ్చిన వాళ్ళు మునాస వెంకట్, అన్నవరం దేవేందర్, వేముగంటి మురళీకృష్ణ, పొన్నాల బాలయ్య, వనపట్ల సుబ్బయ్య. ఉద్యమానికి చాలా ముందు నుండి రాస్తూ, ఉద్యమంలో, ఉద్యమానంతరం రాస్తున్న డా|| నందిని సిధారెడ్డి, వఝల శివకుమార్, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, దాసరాజు రామారావు, ఒద్దిరాజు ప్రవీణ్కుమార్లలో పరిణామాన్ని గమించవచ్చు. వస్తువు ఏదైనా తమదైన స్థిరీకరించబడ్డ శైలిలో రాసిన డా|| అమ్మంగి, ఆశారాజు, పరమాత్మ, కంశ్రీ, దాసోజు కృష్ణమాచార్య, ఎస్. హరగోపాల్, డా||రూప్ కుమార్ డబ్బీకార్, నాళేశ్వరం శంకరం వర్తమాన కవిత్వ ప్రయోగాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
విభిన్నంగా రాయగలిగిన సిద్ధార్థ, దెంచనాల శ్రీనివాస్, మోహన్ రుషి, ఎం.ఎస్.నాయుడుల నుండి ప్రయోగానికి స్థిరీకరణ హామీ లభించవలసిఉంది. మో, నరేష్ నున్నాలకు వీరి కొనసాగింపు బలపడవలసి ఉంది. గాదె వెంకటేష్, జి.రామకృష్ణ, పగడాల నాగేందర్ల నుండి బలమైన వ్యక్తీకరణలున్న కవిత్వం వస్తుంది. మండల స్వామి, దాసోజు లలిత వస్తుస్పృహ ప్రతీకలుగా కనిపిస్తున్నారు.
వచన కవిత్వంలో ప్రయోగాల గురించి మాట్లాడినప్పుడు ఇటీవల ప్రచారంలోకి వచ్చిన ఉప ప్రక్రియల గురించి కూడా స్పృశించవలసి ఉంది. ఆచార్య ఎన్. గోపి ఆరంభించిన నానీలు, ఎం.కె. సుగంబాబు సృష్టించిన రెక్కలు వాటి సౌలభ్యం దృష్ట్యా చాలా మంది యువకవుల్ని ఆకర్షిస్తున్నాయి. నానోలు, మినీలు వస్తున్నాయి. ఏ ఉపప్రక్రియానియమాన్ని కూడా ఆ పేరువాడుకుంటున్న వాళ్ళు పాటించడం లేదు. వాటి సౌలభ్యంలోనే వాటి వైఫల్యం కూడా దాగి ఉన్నట్లు వాటి నడక చూస్తే అర్థమవుతుంది. తెలుగులో సాహిత్య విమర్శ విస్తారంగా ఉన్నట్లు అనిపిస్తున్నా సాధికారిక విమర్శ కొరత కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది.
- ఏనుగు నరసింహారెడ్డి,
89788 69183