Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డెబ్భై-ఎనభై దశ కంలో ఆంధ్రజ్యోతి దిన పత్రికలో ధారావాహిక సీరియల్గా ప్రచురితమై ఎన్నో లక్షల మంది పాఠకులని అలరించిన 'సృష్టిలో తీయనైనది' అప్పటి కాలపు అనుభూతిని ఇప్పుడు పుస్తక రూపంలో మన ముందుకు తెచ్చారు డాక్టర్ అమృతలత. ఆ కాలపు స్త్రీ జీవితాలు, కాలేజీ వాతావరణం, స్నేహితులు, ఒక్కటేమిటి నిన్నటి తరాన్ని కళ్ళ ముందుంచారు. సృష్టిలో తీయనైనది మరిచిపోలేనిది స్నేహం. అలాంటి స్నేహం చివరివరకు నిలిచేనా..? జయ, అరుణ, చంద్ర, రాజీ, చేగోడీ ఒక్కొక్కొరు ఒక్కో విభిన్నమైన వ్యక్తిత్వం కలవారు. అల్లరి చేస్తూనే తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునే పాత్రలతో ఆకట్టుకున్నాయి. జయ పాత్రపై ఆకర్షణతో అరుణ, రాజి, చంద్రలు చివరివరకు కొనసాగిస్తారు. జయ తన చుట్టూ జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడమే కాకుండా నలుగురికి స్ఫూర్తిగా నిలుస్తుంది. తన స్నేహితుల వైవాహిక జీవితాన్ని చూసి విముఖత పెంచుకున్న అదే జయ తానూ అలా మారడానికి దారి తీసిన పరిస్థితులు ఆలోచించతగినవే. చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురై జీవితంలో ఇక పెళ్లి, సంసారం మగాడు అంటే భయపడి 'ఫోబియా'కి గురైన జయ లాంటివాళ్ళు మన చుట్టే ఎందరో కనిపిస్తారు. మగాళ్ల కంటే ఆడవాళ్లు ఎందులో తీసిపోరని చాలా సరళంగా ఆకట్టుకునే విధంగా రాసారు. జయ జీవితం అనామకంగా ముగిసిపోకుండా వినోద్ జయ జీవితంలోకి రావడం, మనసారా ప్రేమించినా జయ కున్న ఫోబియా తో అతన్ని దూరం పెడుతుంది. తన స్నేహితులు సెట్టిల్ అయ్యాక రాజి అన్న అయినా వినోద్ ని పెళ్లి చేసుకోవడం, జయ అంగీకారం కోసం సంవత్సరాలు ఎదురు చూడటం చివరికి పెళ్లి చేసుకుంటుంది. తన స్నేహితురాలి బిడ్డని ఆడిస్తూ ఆడిస్తూ తనకి మమకారం పెరుగుతుంది కానీ తనకున్న భయం వల్ల వెనకడుగు వస్తుంది. ప్రసవ భయాన్ని జయించి పండింటి బిడ్డకి జన్మ ఇవ్వడంతో నవల ముగుస్తుంది.
డాక్టర్ అమృతలత గారు డెబ్భై దశకంలో పాఠకులని అలరించిన ధారావాహికని నవల రూపంలో ఈ తరానికి పరిచయం చేయడం ముదావహం. స్త్రీ అంటే చులకన చేసే వారికి ఈ నవల గుణపాఠం. జయ, అరుణ, జయ, రాజి, వినోద్ లాంటి వారు మన సమాజంలో ఉంటే స్త్రీ అన్ని రంగాల్లో ముందడుగు వేస్తూ ఆబాల శక్తిని నిరూపించుకుంటుంది. ''సృష్టిలో తీయనిది'' స్నేహం మాత్రమే కాదు 'మాతృప్రేమ' కూడా అది జయ పాత్రలో కనిపిస్తుంది. అనుభూతి ప్రధానంగా సాగిన ఈ నవల ఇప్పటి తరాన్ని కూడా ఆకట్టుకుంటుంది. అమృతలతకు అబినందనలు.
- పుష్యమీ సాగర్,
9010350317