Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఎన్ని కనక వ్యూహ రాగాలున్నా నీళ్ళు లేకుంటే అని స్మారక చిహ్నాలే' అంటూ 'జలధార'గా కవిత్వాన్ని వర్ణింపజేసి నీటి విలువను నిలబెట్టిన కవి కందాళై రాఘవాచార్య.
వర్ణంకు ఉన్న బహుముఖాలను ఆయన తన 'ఏకధార' కవితా సంపుటిలో తన చూపుకందిన మేరకు అక్షరాల అద్దంలో ప్రదర్శనకు పెట్టారు.
'చుట్టమొస్తే ముందుగా/ కాళ్ళకు కడుక్కోవడానికి, కడుపు నిండా తాగడానికి / మొదటి గౌరవ వాచకం నీరే' అంటూ జలాభిషేకాన్ని పలవరించే ఈ కవి 'ఋతుపవనాల్లారా.. వస్తున్నారా..!' అని వాటికే స్వాగతగీతం ఆలకిస్తారు. 'మీ పిల్లలందరికీ నీ పేర్లే / గంగమ్మ, గంగారం, కావేరి, యమున, గోదావరి, భగీరథ మేం పెట్టుకుంటాం' అని నీటిని ఇంటి మనిషిని చేసుకుంటారు.
'చిలుక జోస్యమెందుకులే / ఊరి సెరువును సూసి - ఊరి జాతకం చెప్పొచ్చు / నిండైన చెరువుంటే - ఊరికే రాజరికం' అనే నీటి నిజాలను 'కవుల కన్నుల్లో చెరువులు' కవితలో చూడొచ్చు.
'రాత్రిపగలు ఆగకుండా కురిసిన చినుకుల్లో పంట భూమి నాని నాని పచ్చని పచ్చి బాలెంత కానీ' అని భూమి గర్భాన్ని నిమురుతారు.
ఇంకా .. కొత్త వాన, వాన దప్పదం, వర్షతాండవం, వానతనం, వాన తగ్గు మొకం పట్టాక.. ఏకధార, పారకం కవితల్లోనూ తడిసిన అక్షరాలే.
వీటితో పాటు జీవన బాంధవ్యాలను, సమాజ నడకను తన ఆలోచనా పరిధిలోనించి అందినంత మనకందించారు రాఘవాచార్య.
కన్నవారి జ్ఞాపకాలు కవిని పెనవేసుకొని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. 'ఇప్పుడు అమ్మలేని ఇంట్లో అమ్మ జ్ఞాపకాలతో సంపుటాన్ని నేను', ఓదార్చే వాళ్ళంతా నాన్న పద్యాల ముందు ఓడిపోయి ఏడ్చారు, ఏడ్చిన నాన్నలే ఏడుస్తున్నా నాన్నలను నిజంగా ఓదార్చగలరేమో..' అనే వాక్యాలే తార్కాణం.
'ఊరు ఎక్కడే చిలుకా!' కవితలో కవి రైతు కష్టాన్ని నిమురుతూ 'పంట పండించిన వాడి కడుపులోకి పోలేదు / పండించిన వాడే భూమి కడుపులోకి పోయాడు' అంటాడు.
'లోకబాధ'లో.. 'ఒక్క ఆనంద భాష్పం కోసం / ఎన్ని దు:ఖ జలపాతాల్లో తడిచానో ఆనందం కొత్తగా ఉంది.'
'ఎండ చదువు'లో.. 'పరుగుల చదువు ఎంతపని చేసింది / పరాయి దేశానికి విసిరి వేసింది' అని ఒకే మాటగా నేటి విద్యావ్యవస్థను నిర్వచించారు. చీర ఉరితాడు కావడంతో.. ఇప్పుడు షోకేసులోని చీరలన్నీ నాకు / తాళ్ళుగానే కనిపిస్తున్నాయి' అంటారు. కన్న వారిపట్ల నిరాదరణను నిరసిన్తో 'తల్లిదండ్రుల ఆదేశాలు వృద్ధాప్య కుటీరాలేనా?' అని ప్రశ్నిస్తారు. స్త్రీ దు:ఖం ఎవరికీ తెలియదు / ఒక్క దిండుకు తప్ప' అని నాని నాని పిడుచ కట్టుక పోయిన దిండును తడుముతాడు.
పరిమిత అంశాలపై పరివ్యాప్తమైన ఈ కవితల్లో చటుక్కున గుండెను తాకే తుది వాక్యాలు తల ఎత్తి చూస్తాయి. సుదీర్ణ జీవనం లోని అనుభవ సారమైన ఈ కవితల్లో జీవం తొంగి చూస్తోంది. సరళ భాష, వ్యక్తీకరణలోని సహజరీతి కవిత్వానికి వన్నెలద్దింది. పట్టిపట్టి రాస్తున్నా నేటి కవిత్వానికి భిన్నంగా జీవన పట్టాలపై నడిచొచ్చినదిది.
జీవనపరిధి, ఆలోచనా సరళి, సామాజిక స్థానం, భావజాల పక్షం కవిత్వాన్ని సానబడతాయి. రాసిన అక్షరాలకు, విలువ, సార్థకతను నిర్థారిస్తాయి. ఈ కోణంలోంచి చూస్తే ఈ కవిత్వం కవి స్వీయ అనుభూతుల పలవరింతను పంచుకోవడంతో.. పాటు సమాజ గతులపై ఓ సానుభూతి పూర్వక నజర్ వేసినట్లుంది.
కవిగా నాలుగు దశకాల ఈడు దాటిన కందాళై రాఘవాచార్య శతక వచన కవితల ఏకధార ఆయన కవి జీవితానికి తొలి మైలురాయిగా నిలుస్తుంది.
- బి.నర్సన్,
94401 28169